Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోషకాహారలోపం వల్ల శిశుమరణాల రేటు ఎక్కువగా ఉందని, బుద్ధిమంద్యంతో జన్మించే చిన్నారుల సంఖ్య కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. గర్భిణిగా ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోవడం తల్లిఆరోగ్యానికే కాదు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు. కడుపులోని శిశువు ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకుని ఆహారపదార్థాలు తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొన్ని రకాల ఆహారపదార్థాల ప్రభావం తల్లిమీదకంటే గర్భస్థ శిశువు మీదనే అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలో తెలుసుకుంటే తల్లిబిడ్డల ఆరోగ్యం బాగుంటుంది.
సరిగా ఉడకని, సగం ఉడికిన మాంసాహారం మంచిదికాదు. ఇలాంటి ఆహారపదార్థంలో ఉండే క్రిములు తల్లిమీద కంటే కడుపులోని బిడ్డపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి.
పండ్లు బాగా కడిగిన తర్వాతే తినాలి. పండ్లరసాలను కూడా వీలయినంత వరకు ఎప్పటికప్పుడు తాజాగా ఇంట్లో చేసుకుని తాగాలి.
పండ్లు రసం తీసుకుని తాగడం కంటే పండుగానే తినడం వల్ల దాంట్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ ఇతర జీవక్రియలు సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది.
పచ్చికూరగాయలు తీసుకోకపోవడమే మంచిది. వీటిమీద ఉండే పురుగుల మందుల అవశేషాలు కడుపులోని చిన్నారి ప్రాణం మీద విపరీత ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉంది.
సరిగా ఉడికించని ఆహార పదార్థాలమీద ఉండే పురుగుగుడ్లు ఇన్ఫెక్షన్లకు, రక్తలేమికి దారితీస్తాయి.
సరిగా మూతపెట్టని, నిలువ ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే ఉత్తమం.
పాలుకానీ, జున్నుకానీ ఎక్కువసేపు మరి గించిన తరువాతే తీసుకోవాలి. సరిగా మరిగించని పాలు, జున్నుల్లో ఉండే బ్యాక్టీరియా వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
తాగేనీటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వచ్చ మైన నీటిని తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.