Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2004, హిందూ మహాసముద్రంలో సునామీ, జనజీవనం కకావికలమైపోయింది. ఆ బీభత్సాన్ని షూట్ చేసిందామె. వీటికి మధ్యలో అబ్దుల్ కలామ్, ప్రతిభాపాటిల్, ప్రధానుల విషయానికి వస్తే... అటల్ బిహారీ వాజ్పేయి నుంచి నేటి నరేంద్రమోడీ ఆమె కెమెరాలో బంధీ అయిన వాళ్లే. ఆమే కెమరా ఉమెన్ జయశ్రీ. ఇప్పుడైతే యంగ్ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా దూసుకుపోతున్నారు. కానీ రిటైర్మెంట్కి దగ్గరవుతున్న ఓ మహిళ వీడియో జర్నలిస్టుగా ఉండటంకొత్త వారికి ఆశ్చర్యమే. కానీ ఆమెకు ఇది 32 ఏండ్లుగా రోజువారీ దినచర్య. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఈ మలయాళీ అమ్మాయి జీవితాన్ని 1984 నాటి ఓ పత్రికా ప్రకటన పూర్తిగా మలుపు తిప్పేసింది.
దూరదర్శన్ జాతీయ స్థాయిలోనూ, అన్ని రాష్ట్రాల్లో ప్రసారాలు మొదలు పెట్టడానికి సన్నాహాలు మొదలవుతున్నరోజులవి. కెమెరామెన్ కోసం ఒక ప్రకటన వెలువడింది. ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగంలో చేర్చుకుంటారనేది విషయం. ఆ ప్రకటన చూసిన జయశ్రీలో ఒక చిలిపి ఆలోచన వచ్చింది. కెమెరామెన్ అట. కెమెరా ఉమెన్ ఎందుకు కాకూడదు. ఆలోచన వచ్చిందే తడవుగా ఇంటర్వ్యూకి వెళ్లింది. అమ్మాయి వచ్చిందేమిటి అనుకుంటూనే ప్రశ్నలు మొదలు పెట్టారు. ఇంతకు ముందు కెమెరా అనుభవం ఉందా అని అడిగారు. ఏ మాత్రం లేదనే ఆన్సర్తో మళ్లీ ఆశ్చర్యపోయారు. మరెందుకొచ్చావు అని మరో ప్రశ్న. నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉంది, మీరు నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటాను, అంతకంటే సిన్సియర్గా ఉద్యోగం చేస్తాను. ఇదీ ఆమె సమాధానం. ఉద్యోగం వచ్చింది.
జయశ్రీ తొలి వీడియో జర్నలిస్టు అవునా కాదా అనే సందేహం పక్కన పెడితే తొలితరం వీడియో జర్నలిస్టు అని చెప్పవచ్చు. ఇప్పటిలాగా లెక్కకు మించిన చానెళ్లు ఉన్న రోజులు కావవి. ఉన్న ఒక్క దూరదర్శన్తోనే ఆమె మగవాళ్ల గ్లాస్ సీలింగ్ను బ్రేక్ చేసింది. అయితే మగవాళ్లతో విభేదాల్లేవు, విరోధాల్లేవు. స్నేహపూర్వక వాతావరణంలోనే ఉద్యోగం చేశానంటోంది జయశ్రీ. మనవంతుగా ఉద్యోగానికి హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఇస్తూ పోతే మహిళ అయిన కారణంగా ఎదురయ్యే వివక్షలను ఈజీగా ఎదుర్కోవచ్చు అంటారామె. సమర్థత, సిన్సియారిటీలే విజయశిఖరాల మీద నిలబెడతాయని చెప్తుంది జయశ్రీ. ు