Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దారంతో మీరేం చేస్తారు? అని ఎవరైనా అడిగితే ముందు గుర్తుకొచ్చేది బట్టలు కుట్టడం. ఆ తర్వాత పూలు మాల కట్టడం అని చెబుతారు. మరి పిల్లల్ని అడిగితే 'గాలిపటం ఎగరేస్తాం' అంటూ సమాధానం చెబుతారు. ఇంకా ఏమైనా చెప్పండీ అంటూ అడిగితే... ఇంతకంటే దారంతో మనకు పనేముంటుంది అని ఎదురు ప్రశ్న వేస్తాం. అయితే దారంతో అద్భుతమైన కళాకృతులను చేయవచ్చంటే నమ్ముతారా? కిరణ్మయి గురించి చదివిన తర్వాత నమ్మక తప్పదు. మరి చదవండీ...
ఉన్నత చదువు చదువుకుని, వివాహనంతరం ఒక గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, చిన్నప్పటి నుండి తనకెంతో ఇష్టమైన కళాకృతులను తయారు చేస్తూ, భర్త ప్రోత్సాహంతో పెయింటింగ్, మగ్గం వర్క్, సోలార్ వుడ్ క్రాఫ్ట్, ఎంబసింగ్, స్క్రీన్ పెయింటింగ్ మొదలైనవి నేర్చుకున్నారు.
అరుదైన కళలో...
ఇలా ఎన్ని కళలు అభ్యసించినా మనసు మాత్రం రంగుల దారాల వెంటనే పరుగెడు తుండేది. చాలా అరుదుగా కనిపించే ఈ కళ దాదాపు 30 సంవత్సరాల కిందట గోల్డెన్ త్రెడ్, సిల్వర్ త్రెడ్ అనే దారాలతో కళాకృతులను తయారు చేసేవారు. దీనిని నేర్చుకునేందుకు ఎక్కువగా ఎవ్వరూ ఆసక్తి చూపరు. కిరణ్మయి మాత్రం తండ్రి ప్రోత్సాహంతో ఈ అరుదైన కళలో నైపుణ్యం సాధించారు. రంగు రంగుల దారాలతో అనేక కళాకృతులను తయారు చేస్తూ పేరుకు తగ్గట్టుగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తూ, ప్రగతి పధంలోకి దూసుకెళ్తున్నారు.
నెమలితో మొదలు...
కిరణ్మయి పుట్టింది ఆదిలాబాద్ సిర్పూర్ కాగజ్నగర్. నాన్న శేషాద్రి, అమ్మ కృష్ణవేణి. వీరి ముగ్గురు సంతానంలో తొలి సంతానం కిరణ్మయి. చిన్నప్పటి నుండి రంగులతో ఆడుకోవడం ఇష్టం. డ్రాయింగ్ వేసేవారు. పదవ తరగతి పరీక్షల తర్వాత ఎక్కువ రోజులు శలవులు వచ్చాయి. ఆ సమయంలో ఒక పత్రికలో దారాలతో నెమలి తయారు చేయటం ఇచ్చారు. అందులో చెప్పిన వస్తువులను తండ్రి తెచ్చి ఇచ్చి ఆ నెమలిని చూపి తయారు చేయాల్సిందిగా చెప్పారు. సహజంగానే కళల పట్ల శ్రద్ధ ఉండటంతో 'గోల్డెన్ పీకాక్' తయారు చేసి చూపించారు. కూతురి ఆసక్తి, శ్రద్ధ గమనించిన తండ్రి ఆ కళలో ఆమెను ప్రోత్సహించారు. నెమళ్లంటే ఎంతో ఇష్టపడే కిరణ్మయి రకరకాల నెమళ్లను, వినాయకుళ్లను తయారు చేయసాగారు. వారు తయారు చేసిన వాటిని బంధువులకు, స్నేహితులకు బహుమతులుగా ఇచ్చేవారు. వారందరూ ఈ కళ పట్ల ఆసక్తి చూపటమే కాక చాలా బావున్నాయంటూ ప్రశంసించి వివిధ రకాల బొమ్మలను తయారు చేయవల్సిందిగా సలహా ఇచ్చేవారు. ఒకవైపు చదువు మరొకవైపు త్రెడ్ ఆర్ట్తో కళాకృతులు చేయసాగారు.
ఇతరులకు నేర్పించాలని
1994లో ఈమెకు మధుకుమార్తో పెండ్లి జరిగింది. పెండ్లి తర్వాత కూడా భర్త ప్రోత్సాహించడంతో త్రెడ్ ఆర్ట్తో పాటు ఫ్యాబ్రిక్ పెయింటింగ్, సొలార్ వుడ్ క్రాఫ్ట్, గ్లాస్ పెయింటింగ్, పోట్ పెయింటింగ్, క్వాలిటీ క్రాఫ్ట్, స్క్రీన్ పెయింటింగ్ వంటివి నేర్చుకున్నారు. తనకు తెలిసిన ఈ కళను పలుగురికి నేర్పించాలనే ఉద్దేశంతో 2007లో 'శ్రీఆర్ట్' ను 15 మందితో ప్రారంభించారు. ఇపుడు 50 మంది వరకు వస్తున్నారు. తన దగ్గరకు వచ్చే వారి పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుని నేర్పిస్తారు. సాయంత్రం మాత్రం కేవలం డ్రాయింగ్ క్లాసులు నిర్వహిస్తారు. ఒక సంవత్సరం కోర్సు చేసిన వారికి సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
ఆదరణ తక్కువైనా
సాధారణంగా ఒక పెయింటింగ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడితే, స్ట్రీరింగ్ ఆర్ట్కి మాత్రం రెండు రోజులు పడుతుంది. మామూలుగా స్ట్రీయింగ్ ఆర్ట్ ఆదరణ తక్కువ. కానీ నైపుణ్యం కలిగిన కళ ఇది. ప్రస్తుతం ఈ కళని మగపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. కిరణ్మయి పెయింటింగ్ వేయాలన్నా, స్ట్రీయింగ్లో కళాకృతులు చేయాలన్న అర్ధరాత్రి 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు చేయటానికి ఇష్టపడతారు. ఆ సమయంలో చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. దాంతో ఎలాంటి ఆటంకం లేకుండా ఏకాగ్రతగా బొమ్మ తయారు చేయవచ్చని ఆమె అంటున్నారు.
ప్రభుత్వం సహకరిస్తే...
మగ్గం వర్క్కి ఉపయోగించే దారాలతోనే కళాకృతులను తయారు చేస్తారు. ఈ దారాలకు మన్నిక ఎక్కువ. ఈ కళను నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాలేజీ అంటూ లేదు. ప్రభుత్వం సహకరిస్తే ఓ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ కళను వెలుగులోకి తీసుకురావాలని ఆమె కోరిక. ఎందరికో ఈ కళను పరిచయం చేయాలని ఆమె ఆకాంక్ష.వీరి ఆకాంక్ష నెరవేరాలని ఎందరికో ఈ కళ పట్ల అవగాహన కల్పించి, తను కోరుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆశిద్దాం...
- పాలపర్తి సంధ్యారాణి