Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్యాణా అనగానే అందరికీ గుర్తొచ్చేది... దేశంలోనే అతి తక్కువ లింగనిష్పత్తి. అతి తక్కువ అమ్మాయిలున్న ధనిక రాష్ట్రంగా పేరొందింది. అలాంటి రాష్ట్రంలో అన్నింటిల్లో ముందడుగు వేసింది అలక్పురా గ్రామం. రెండువేల జనాభా ఉన్న గ్రామంలో అన్నీ రైతు కుటుంబాలే. ప్రతి కుటుంబంలోంచి ఓ మహిళా ఫుట్బాలర్ ఉన్నారు. ప్రస్తుతం 300 మంది ఫుట్బాల్ క్రీడాకారులున్నారు. అందులోంచి 11 మంది రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ కుటుంబాల జీవితాలను మార్చేస్తున్నారు. సంప్రదాయ రాష్ట్రంలో జెండర్ రోల్స్ను సవాలు చేస్తున్నారు. అబ్బాయి కంటే అమ్మాయి ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. కుటుంబ బాధ్యతలను మోస్తున్నారు.
గ్రామంలో ఫుట్ బాల్ ప్రవేశం 2002లో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో అబ్బాయిలు కబడ్డీ ఆడుతున్నారు. తాము కూడా ఆడతామని చెప్పి అమ్మాయిలు వెళ్లి పీఈటీని అడిగారు. అప్పుడాయన అక్కడ నిరుపయోగంగా పడిఉన్న ఫుట్బాల్ను వాళ్ల చేతిలో పెట్టాడు. కానీ ఫుట్బాల్ గ్రౌండ్ లేదు. తమకు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. కానీ ఆ విన్నపాలు, విజ్ఞాపన పత్రాలన్నీ పక్కకు వెళ్లాయి. అయితే తమ గ్రామ సమస్యను తామే పరిష్కరించుకోవాలనుకున్నారు. ఊరికి సమీపంలో నీళ్లులేక ఎండిపోయి.. పిచ్చి మొక్కలు మొలిచిపోయిన చిన్న ప్రాంతాన్ని గ్రౌండ్గా మార్చాలనుకున్నారు. మొక్కలన్నీ తీసేశారు. ఇసుకతో నింపేశారు.
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నిర్వహించిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్స్లీగ్లో ఆడటానికి వాళ్లకు స్పాన్సర్స్ లేరు. దాంతో 2016లో అలఖ్పురా ఫుట్బాల్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. దానికోసం గ్రామస్తులంతా కలిసి లక్షన్నర రూపాయలు విరాళంగా ఇచ్చారు. దాంతో ఇండియన్ ఉమెన్స్లీగ్లో ఆడారు ఆ గ్రామానికి చెందిన అమ్మాయిలు. అందులో సాధించిన విజయాలు వారిని స్పాట్లైట్లోకి తెచ్చాయి.
ఎన్నో సమస్యలు. ప్రాక్టీస్కోసం సరైన వసతులు లేవు. కానీ ఈ అమ్మాయిల నైపుణ్యానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడవడ వల్లే వాళ్లు ఫుట్బాల్లో ప్రాతినిధ్య వహిస్తున్నారు. ఏదో ఒక టోర్నమెంట్ వచ్చినప్పుడల్లా... తమకు తోచినదల్లా ఇస్తారు. కొందరు వంద ఇస్తే... మరికొందరు ఐదు వేలు ఇస్తారు. ఎందుకంటే అమ్మాయిలు ఫుట్ బాల్ ఆడటం ఆపొద్దని వాళ్ల లక్ష్యం. ఇలా గ్రామస్తుల విరాళాలే ఆ గ్రామ ఫుట్బాల్ కప్ను, అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని నడిపిస్తున్నాయి. కొన్నేండ్ల కిందటివరకు అమ్మాయిలు గోల్ పోస్టుల్లాగా ఇటుకలను పేర్చేవారు. అయితే గ్రామం నుంచి అమ్మాయిలు టోర్నమెంట్లు గెలవడం ప్రారంభమయ్యాక సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రస్తుతానికి గ్రామంలో క్రీడా సౌకర్యాలు కల్పించేందుకు రెండు కోట్ల నిధులను ఇవ్వడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి తోడుగా గ్రామంలోని అమ్మాయిలు 50 నుంచి 60 లక్షల వరకు స్కాలర్షిప్పులను గెలుచుకున్నారు.
ఫుట్బాల్ విప్లవం గ్రామస్తుల మనస్తత్వాలను, భావజాలాలను మార్చేసింది. తమ పిల్లల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఆరాట పడటం లేదు. ఫుట్బాల్ కెరీర్ను కొనసాగించాలంటూ ప్రోత్సహిస్తున్నారు. 'ఫుట్బాల్ వల్లే మా గ్రామం దేశానికి తెలిసింది. ఫుట్బాలే మా జీవితం' అంటున్నారు అమ్మాయిలు. అమ్మాయిలను చూసి అబ్బాయిలు కూడా ఫుట్బాల్ ఆడేందుకు ముందుకొస్తున్నారు.