Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నతనంలో విన్న అమ్మనాన్నల మాటలు పిల్లల భవిష్యత్కు బాటలు వేస్తాయని అనడం ఎంతో సమంజసం అనిపిస్తుంది కొందరిని చూస్తుంటే.. సామాజిక సేవాపథంలో వ్యక్తులు శక్తులుగా మారడానికి తల్లిదండ్రుల ప్రవర్తన, పెంపకం ఎంతో దోహదం చేస్తుంది అన్నది స్పష్టమవుతుంది మరికొందరిని గమనిస్తే.. మన చుట్టూ ఉన్నవారిలో ఈ కొందరు.. మరికొందరు అక్కడక్కడ కనిపిస్తారు. వారిలో ఒకరు సన్నిహిత వ్యవస్థాపకురాలు ఉషారాణి. పోరాటాల గడ్డ నల్లగొండలో పుట్టిపెరిగిన ఆమె ఊహతెలిసిన దగ్గరి నుంచి తోటివారికి సహాయపడే తల్లిదండ్రులను చూస్తూ పెరిగారు. అందుకే దశాబ్ధాలుగా సేవారంగంలో సన్నిహితంగా కొనసాగుతూ.. అక్షరాల వెలుగును ఎన్నో జీవితాలకు ప్రసరింపచేస్తున్నారు. మానవితో ఆమె పరిచయం..
నేను పుట్టిపెరిగింది నల్లగొండ జిల్లాలోని సంస్థాన నారాయణపురం. నాన్న రమాశంకర్ పట్వారి. ఆ రోజుల్లోనే ఆయన అలీఘడ్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి పియుసీ చదివారు. అమ్మ జయప్రదాదేవి. నాలుగురు ఆడపిల్లలం, ఒక అబ్బాయి. అందరినీ బాగా చదివించారు. ఏడో తరగతి వరకు అక్కడే చదివి.. ఎనిమిదో తరగతిలో హైదరాబాద్కు వచ్చాను. ఊహతెలిసిన నాటి నుంచి నాన్న కోసం ఊరివారంతా రావడం.. ఆయన సూచనలు, సలహాలు తీసుకోవడం బాగా గుర్తు. ప్రజాసమస్యలపై తక్షణం స్పందించే నాన్న.. ఎవరి ఏ అవసరం వచ్చినా అండగా నిలిచేవారు. ఇక అమ్మ ఆయనకు సరిజోడి. చుట్టూపక్కల గ్రామాల్లోని మహిళలను ఒక చోటకు చేర్చి వారికి టైలరింగ్, పచ్చళ్లు పెట్టడం వంటివి నేర్చించి స్వయం ఉపాధి దిశగా వారిని ప్రోత్సహించేవారు. అమ్మనాన్న పనులను బాగా గమనించేదాన్ని. దాంతో నాకు తెలియకుండానే.. మన చుట్టూ ఉన్నవారిలో సహాయం అవసరమైన వారే ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు 'సన్నిహిత 'ను నిర్వహించడంలోనూ నా చిన్నతనంలో చూసిన అంశాల ప్రభావమే ఎక్కువగా ఉందనిపిస్తుంది.
విద్యార్థి సంఘాలతో..
ఎనిమిదోతరగతిలో హైదరాబాద్ వచ్చాం. మా చదువుల కోసమే నాన్న హైదరాబాద్ తీసుకువచ్చారు. చాదర్ఘాట్ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత రెడ్డి కాలేజీలో డిగ్రీ వరకు, వనితా కాలేజీలో ఎం.ఏ(పొలిటికల్ సైన్స్) పూర్తి చేశాను. కాలేజీ లైఫ్లో విద్యార్థుల సమస్యలపై తక్షణ స్పందించి.. విద్యార్థి సంఘాలతో కలిసి పనిచేశాను. రెడ్డి కాలేజీ విద్యార్థుల సంఘం జనరల్ సెక్రటరీగా పనిచేశాను. చలం, కొమ్మురి, కొడవగంటి, రంగనాయకమ్మ తదితర రచయితల పుస్తకాలు బాగా చదివేదాన్ని. వారి సాహిత్యం జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. మా అక్క ఆశాలత వర్గదోపిడి, మహిళల అణిచివేత, ఒంటరి మహిళల సమస్యపై బాగా పోరాటం చేశారు. ఆమె ప్రభావం నాపై చాలా ఉండేది. ఆమెతో పాటే నేను సమస్యల సాధన కోసం కృషి చేసేదాన్ని. స్త్రీ శక్తి సంఘటన ఇతర మహిళా సంఘాలతో కలిసి పనిచేశాం. సామాజిక, సాంఘీక, రాజకీయ రంగాలు మహిళల జీవితాలను ఎలా విధంగా శాసిస్తున్నాయి అన్న చర్చలే నాకు ..మా అక్కకు మధ్య జరిగేవి. ఆమె ప్రోత్సాహంతో ఎన్నో పనులు చేసిన నాకు ఆమె అకాల మరణం పెద్దలోటు.
పౌరహక్కుల సంఘంలో ...
చదువు పూర్తి అయిన తర్వాత టీచర్గా కొన్నిరోజులు పనిచేశాను. ఏ పనిచేసినా.. ప్రజలతో ప్రత్యేక్షంగా మమేకం అవ్వాలన్న ఆలోచన ఉండేది. 'అస్మిత' స్వచ్ఛంద సంస్థలో చేరాను. పౌరహక్కుల సంఘం 'స్వేచ్చ'Ûలో పనిచేసేదాన్ని. మహిళలకు అవగాహన కల్పించే ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాం. పౌరహక్కుల సంఘంలో పనిచేస్తున్న సమయంలోనే రిజర్వ్బ్యాంక్లో పనిచేసే వెంకట సూర్యప్రకాశ్తో పరిచయం జరిగింది. ఇద్దరి ఆలోచనలు కలవడంతో మేం కలిసి జీవించాలను కున్నాం. మాకు ఒక బాబు.
గృహహింసపై..
అస్మితలో పనిచేస్తున్నప్పుడు మురికివాడల్లో పిల్లల కోసం, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు డిజైన్ చేశాం. ఏ మురికివాడకు వెళ్లిన అక్కడ మహిళల కుటుంబ హింస గురించి చెప్పేవారు. 'అస్మిత' నుంచి 'ఛత్రీ' సంస్థలో చేరాను. హైదరాబాద్ నగరంలో ఉన్న స్లమ్స్లో నివసించేవారికి పునరావాసం, వసతిసదుపాయల కోసం పనిచేసే వాళ్లం. ప్రతి మురికివాడలోని పరిస్థితులు స్వయంగా చూసి తెలుసుకుని.. వాటిపై రిపోర్టు తయారు చేసేదాన్ని. అప్పుడు 'ఛత్రీ ఉషాగా నా పేరు అందరికీ సుపరిచిత మైంది. యాక్షన్ ఎడ్ సంస్థతో కలిసి హోమ్లెస్ సర్వే నిర్వహించాం. ఇదే సమయం లో మా దృష్టికి వచ్చిన లైంగికదాడులు, గృహహింస సమస్య పరిష్కారానికి లీగల్ఎడ్ నిర్వహించేవాళ్లం. 2003లో డిఎవిపై పనిచేసే సమయంలో అమన్ నెట్వర్క్ (కల్కత్తా)తో కలిసి పనిచేశాం. అన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి స్త్రీపై హింస వ్యతిరేక వేదిక ఏర్పాటు చేశాం. ' ఆల్ మెన్ ఆర్ నాట్ వయిలెట్ బట్ సైలెంట్ ' అన్న స్లోగన్ తీసుకువచ్చి.. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అందరూ కలిసి పనిచేసేలా కార్యక్రమాలు నిర్వహించాం. ప్రతిఏటా నవంబర్ 22 నుంచి డిసెంబర్ 6 వరకు మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవాలు జరపాలని ప్రతిపాదించాం. 2003 నుంచి 2007వరకు ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించాం. గృహహింస చట్టం గురించిన అవగాహన కల్పించేలా 'ఆలంబన' పుస్తకాన్ని ప్రజలకు అందుబాటు లోకి తీసుకువచ్చాం.
వీధిపిల్లలను బడికి చేర్చుతూ..
2007లో హైదరాబాద్లో అంతర్జాతీయ వర్క్షాపు జరిగింది. అక్కడ జర్మనీ సంస్థ ప్రతినిధులు మన దేశంలో బీదరికం పై ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. వేరే దేశం వారు మన దేశప్రజల స్థితిగతులు అంచనా వేయడంపై చాలా బాధ అనిపించింది. అప్పటివరకు ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ.. రిపోర్టు తయారుచేస్తూ.. మార్పుకోసం ప్రయత్నిస్తున్న నాకు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందనిపించింది. దేశం ప్రగతి పథంలో నడవాలంటే అక్షరాస్యత పెరగాలి. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారతదేశం లో అక్షరాస్యత శాతం 74మాత్రమే. సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే బాలకార్మికులు, వీధి బాలల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. 2020 నాటికి బాలకార్మికులు లేని సమాజం చూడాలనుకున్నాం. అప్పుడు సన్నిహిత రెయిన్ బో స్కూల్స్ ప్రారంభించాం. పట్టణాల్లో వలస కార్మికుల పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. వీరందరికీ విద్యను అందించి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. ఇప్పటివరకు మా హోమ్స్లో దాదాపు వెయ్యిమంది చిన్నారులు విద్యను అభ్యసించారు. ఈ ఏడాది మరో నాలుగు హోమ్స్లో సుమారు నాలుగు వందల మంది పిల్లలు చదువుకుంటున్నారు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమ పథకాల పేర్లు మార్చుతున్నారు. దీని వలన ప్రజల్లో అయోమయపరిస్థితి నెలకొంటుంది. ఆయా ప్రభుత్వాలు కొత్త పథకాలు.. ప్రజలకు పనికివచ్చే పనులు చేయకుండా.. అనవసరమైన విషయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 'బేటీ బచావో.. బేటీ పడావో' అన్న నినాదం ఇస్తూ. .. ఆడపిల్లల కోసం గతంలో ఉన్న పథకాలన్నింటినీ ఎత్తివేసింది. ప్రభుత్వ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు లేవు. ఇది ఏ విధంగా బేటీ బచావో ప్రభుత్వమే గమనించాలి.
- వి.యశోద