Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మంపై పేరుకున్న దుమ్మూ, మృతకణాలు తొలగించడంలో పీల్ ఆఫ్ మాస్క్లు బాగా పని చేస్తాయి. అయితే బజార్లో దొరికేవి కాకుండా అందుబాటులో ఉండే టిష్యూ పేపర్ సహాయంతో ఆ మాస్కుల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
- ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మంపై ఉన్న రంధ్రాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఈ పీల్ ఆఫ్ మాస్క్ చక్కగా ఉపయోగపడుతుంది. గుడ్డులోని తెల్లసొనలో కాస్త నిమ్మరసం కలిపి బాగా గిలకొట్టాలి. అందులో తేనె కూడా కలుపుకోవచ్చు. ఆ మిశ్రమం నురగలాగా అయ్యాక కాసేపు పక్కన పెట్టి ముఖానికి సన్నని పూతలా రాసుకోవాలి. ఇది తడిగా ఉన్నప్పుడే దానిమీద టిష్యూ పేపర్ను పెట్టుకోవాలి. ఆరిపోయాక టిష్యూను మెల్లగా తీసేస్తే చాలు. పొడి చర్మం ఉన్న వాళ్లు దీంట్లో నిమ్మరసానికి బదులుగా కొబ్బరినూనెను కలుపుకోవచ్చు.
- చర్మం బిగుతుగా ఉండటానికి, తాజాగా ఉంచడానికి ఈ మాస్క్ చక్కగా ఉపయోగ పడుతుంది. గులాబీరేకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి పెరుగులో కలపాలి. దీంట్లో కూడా కొద్దిగా తేనె కలిపి ముఖానికి పూతలా రాసుకోవాలి. తరువాత ముఖంపై ఓ టిష్యూపేపర్ని ఉంచాలి. 15 నిమిషాల తరువాత టిష్యూ తీసేసి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడిగితే సరిపోతుంది.
- చర్మం పాలిపోయినట్టు అనిపిస్తే ఈ పీల్ ఆఫ్ మాస్క్ ప్రయత్నించి చూడొచ్చు. రెండు చెంచాల కీరదోస రసంలో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. కీరా చర్మానికి తేమ అందేలా చూస్తే... గ్లిజరిన్ మొటిమలూ, బ్లాక్హెడ్స్ సమస్యను తగ్గిస్తుంది. ఈ పూతను రాత్రి పడుకునే ముందు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- మూడు చెంచాల దాల్చిన చెక్క పొడిలో, రెండు చెంచాల తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. మందంగా రాసిన ఈ పూత కాసేపు ఆరనివ్వాలి. పూర్తిగా తడారకముందే టిష్యూ పేపర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మాస్క్ను 15 నిమిషాల తర్వాత టిష్యూ తీసేసి నీళ్లతో కడిగితే ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.