Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీజన్ను బట్టి తినే తిండిని ఎంచుకోవాలి. వానాకాలంలో తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవేంటో, ఎందుకు తినకూడదో ఇవాళ తెలుసుకుందాం.
పకోడీ-బజ్జీ : చాలా మంది చేసే పెద్ద తప్పు.. వాతావరణం చల్లబడ్డప్పుడు, ముఖ్యంగా వర్షాకాలం చినుకులు పడుతున్నప్పుడు.. వేడి వేడి పకోడీలు, బజ్జీలు తినకుండా ఉండలేరు. ఎప్పుడో ఒకటి తినొచ్చు కానీ.. తరచూ తినకూడదు. వర్షాకాలంలో జీర్ణశక్తి తక్కువ. అసలే అజీర్తి మూలంగా మలబద్ధకం పట్టిపీడిస్తుంటుంది. ఎసిడిటీ ఉత్పన్నం అవుతుంది. దీనివల్ల ఇంకెన్నో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
పెరుగు: అలర్జీ, జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, మైగ్రేన్ తలనొప్పి, సైనసైటిస్.. వంటివి ఉన్న వాళ్లు ఈ సీజన్లో పెరుగు తింటే సమస్య మరింత పెరుగుతుంది. చల్లటి పదార్థాల జోలికే వెళ్లకూడదు. పాల ఉత్పత్తులు, ఐస్క్రీమ్స్కు దూరంగా ఉండటం ఉత్తమం. ఒక్కోసారి పెరుగు తినడం వల్ల చలువ పెరిగి జలుబుచేస్తే తలనొప్పిగా మారి వేధిస్తుంది.
పచ్చివి: సలాడ్స్ తినడం ఇష్టముండొచ్చు. కాని వర్షాకాలంలో గాలిలో తేమ ఉండటం వల్ల సూక్ష్మజీవులు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీనివల్ల కొన్ని గంటల పాటు కోసి ఉంచిన పండ్లు, కూరగాయల ముక్కలకు తేమ వల్ల క్రిములు పాకొచ్చు. ఒక వేళ మీకు పచ్చికూరగాయలు, పండ్లు తినాలనిపిస్తే.. వాటిని ఉప్పునీటిలో శుభ్రం చేసి.. అప్పటికప్పుడు కోసుకుని తినడం మంచిది.
పాలు: పాలు ఆరోగ్యానికి మంచివే. అయితే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువ పాలు తీసుకోకూడదు. వర్షాకాలంలో గాలిలో ఆర్ద్రత ఎక్కువ. జీర్ణశక్తి మందగించి ఉంటుంది. రోజుకొక గ్లాసు పాలు తీసుకోదలిస్తే అందులో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి.
పానీపూరి: ఈ కాలంలో నీటి కలుషితం ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగడం శ్రేయస్కరం కాదు. రోడ్డు పక్కనున్న పానీపూరి బండి మీద కూడా తినడం అంత మంచిది కాదు. పానీ కలిపేటప్పుడు ఒక్కోసారి శుభ్రత లోపించవచ్చు. అందువల్ల కడుపులో గడబిడ మొదలవ్వొచ్చు.