Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1961.. కళలకు హారతి ఇచ్చేలా రవీంద్రభారతి నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా 'చిత్రాంగద' నృత్యరూపకం ప్రదర్శన.. కథానాయక పాత్రలో ప్రముఖ నర్తకి రాధిక రెడ్డి.. సరిగ్గా పదిహేనుఏండ్ల తర్వాత 1976.. కళాకారుల ప్రదర్శనలకు కేరాఫ్గా మారిన రవీంద్రభారతిలో దీపికారెడ్డి అరంగేట్రం.. ప్రేక్షకుల కరతాళధ్వనులతో ఆడిటోరియం మారుమ్రోగిపోయింది. ఆమె చిత్రాంగద పాత్రలో జీవించిన రాధికరెడ్డి కుమార్తె. అమ్మ కడుపులో ఉండగానే.. నాట్యసాధన చేసిన అభినవ నర్తకీమణి. దేశవిదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చి, వేలాది మంది శిష్యులతో నాట్యాన్ని దశదిశగా వ్యాపింపచేస్తున్న నాట్యగురువు. 'కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు- 2017'కు ఎంపికైన కూచిపూడి నాట్యకళాకారిణి, ప్రముఖ నాట్య గురువు దీపికా రెడ్డి నాట్య ప్రస్థానం..
అమ్మకు నాట్యమంటే ప్రాణం. నాన్న ఎంతో ప్రోత్సహించేవారు. అమ్మకు పురుడుపోసిన డాక్టర్గారు నా కండ్లను చూసి 'మీ అమ్మాయికి తప్పక నాట్యం నేర్పించండి' అని చెప్పారట. ఇప్పటికీ ఆ డాక్టర్గారు కనిపించినప్పుడల్లా నా ప్రదర్శనల గురించి వివరాలు అడుగుతుంటారు. బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడే నాట్యం నేర్పించారు. ప్రముఖ నాట్యగురువు సుశీలాకౌశిల్ గారు నా మొదటి గురువు. ఆమె శిష్యరికంలోనే అరంగేట్రం చేశాను. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావుగారు ముఖ్యఅతిథిగా వచ్చారు. 'ఈ అమ్మాయి కండ్లలో ఏదో శక్తి ఉంది. నాట్యసాధన మాత్రం ఆపకండి. పెండ్లితో చాలామంది నాట్యం ఆపేస్తుంటారు. అలా కాకుండా చూడండి. కళలను ఇష్టపడేవారితోనే పెండ్లి చేయండి' అని చెప్పారు. అమ్మనాన్న ఆయన మాటలను గౌరవించారు. మరింతగా ఈ కళను అభ్యసించడానికి చెన్నై పంపించారు. ప్రముఖ కూచిపూడి నాట్యగురువు వెంపటి చినసత్యం గారి వద్ద ఎంతో నేర్చుకున్నాను. ఆయన శిష్యరికంలో నాట్యసాధన.. ఎన్నో విషయాలను తెలుసుకునేలా చేసింది. కళలను గౌరవించే వ్యక్తితోనే పెండ్లి జరగడంతో నాట్యసాధన నా జీవితంలో ఒక భాగమైంది. ఇప్పుడు నాట్యమే నా జీవితం.
డాన్సర్ దీపిక..
ఆబిడ్స్లోని గ్రామర్ స్కూల్, రోజరీ కాన్వెంట్లో చదివాను. ఎక్కడ డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నా.. నా ప్రదర్శన ఉండాల్సిందే. ఆ తర్వాత కస్తూరిబా గాంధీ కాలేజీలో ఇంటర్, సెయింట్ ఫ్రాన్సెన్స్లో డిగ్రీ చదివే రోజుల్లోనూ నా పేరు డాన్సర్ దీపికగానే స్థిరపడిపోయింది. చాలా మంది తల్లిదండ్రులు చదువు ఒక్కటే ముఖ్య మనుకుంటారు.
చదువుతో పాటు పిల్లలకు ఇష్టమైన కళలు కూడా నేర్పిస్తే.. వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. భారతీయ కళలు కేవలం ప్రజలకు వినోదాన్ని మాత్రమే కాకుండా కళాకారులకు క్రమశిక్షణ, ఏకాగ్రత, వినయవిధేయతలను నేర్పిస్తూ.. మనోవికాసానికి ఉప యోగపడుతాయి.
'ఏ' గ్రేడ్ కళాకారిణిగా..
చిన్నతనం నుంచి ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు టెలివిజన్ బ్లాక్ అండ్ వైట్లో వస్తున్నప్పటి నుండి దూరదర్శన్లో కార్యక్రమాలు చేశాను. దాంతో ఏ గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు వచ్చింది. దేశవిదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చాను.
ప్రతినాయక పాత్రలను సైతం..
కూచిపూడిలో సత్యభామ, సీత వంటి పాత్రలే చాలా మంది ఇష్టపడతారు. కథానాయిక పాత్రలతోనే గుర్తింపు వస్తుందని అనుకుంటారు. అయితే ప్రతినాయిక పాత్రలు చేసినప్పుడు హావభావాలతో ప్రేక్షకులను మెప్పించడం ఎలాగో తెలుస్తుంది. మండోదరి, కైకేయి వంటి పాత్రలు పోషించేటప్పుడు ఎంతో రిసెర్చ్ చేసేదాన్ని. ఏ పాత్ర చేసినా.. ఆ తర్వాత కొద్ది రోజుల వరకు ప్రేక్షకులు నన్ను ఆ పాత్రపేరుతోనే గుర్తుపెట్టుకోవడం ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం రాజీవ్గాంధీ ఓపెన్ యూనివర్సిటీలో ప్రాక్టికల్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్టీ)లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను. 'ఆర్టిజెన్స్ ఆఫ్ ఆర్ట్, సైన్స్ అండ్ స్పోర్ట్' అనే అంశం మీద ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు నివేదిక తయారు చేసి ఇచ్చాను. ప్రతిష్ఠాత్మక 'టెడ్ ఎక్స్' వేదికలపై ఇచ్చిన ప్రదర్శనలకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి.
ప్రకృతి రక్షితో రక్షిత..
కేవలం పౌరాణిక పాత్రలే కాకుండా సామాజిక అంశాలపై ఎన్నో నృత్యరూపకాలు కంపోజ్ చేశాను. వీటిలో నాకు బాగా నచ్చినవి.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చినవి చాలానే ఉన్నాయి. బయోడైవర్సిటీ ఇంటర్నెషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా జీవివైవిధ్య ఆవశ్యకతను తెలియచేస్తూ..'ప్రకృతి రక్షితో రక్షిత' నృత్యరూపకం ప్రదర్శించాం. ఇది ఎంతో పాపులర్ కావడం తో పాటు మా బృందానికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అలాగే వైద్యం వ్యాపారమైన ఈ రోజుల్లో డాక్టర్ ఎలా ఉండాలి అన్న అంశంపై రూపొందించిన 'వైద్యోనారాయణహరీ' నృత్యరూపకం మంచి సందేశాన్ని అందించింది. సొంత ఇంటి కోసం మధ్యతరగతివారు, పేదవారు పడే ఆరాటాన్ని ప్రతిబింబిస్తూ.. రూపొందించిన 'సొంత ఇల్లు' నృత్యరూపకం వైవిధ్య ప్రదర్శనగా ప్రశంసలు అందుకుంది. సాంస్క తిక రాయబారిగా శ్రీలంక పార్లమెంట్లో, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, టర్కీ, కొరియా, యుఎస్, యూరప్, సింగపూర్, ఇండోనేషియా, బ్యాంకాక్ వంటి దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. అక్కడున్న కళాభిమానుల నుంచి విశేషగుర్తింపు , తెలుగు వారి ఆదరాభిమానాలు నాట్యకళను నాకు మరింత చేరువ చేశాయి. 2000లో 'దీపాంజలి నృత్య అకాడమీ' ని స్థాపించి కూచిపూడి నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నాను. మా సంస్థ నుంచి శిక్షణ పొందిన వందలాది మంది తమతమ ప్రాంతాల్లో నాట్యాశిక్షణాలయాలు ఏర్పాటు చేసి వేల మందికి శాస్త్రీయ నత్యాల్లో తర్ఫీదు నిస్తున్నారు. భారతీయ కళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఇస్తున్నారు.
తెలంగాణ వైభవం..
ప్రపంచ మహాసభల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శించిన 'తెలంగాణ వైభవం' నృత్యరూపకం.. కొత్తగా ఏర్పడిన మన రాష్ట్ర ఔనత్యాన్ని ప్రపంచ యవనికపై నాట్యప్రదర్శన ద్వారా చెరగని ముద్ర వేసింది. తెలంగాణ వైభవం న త్యానికి కష్టపడినట్లు.. నా న త్య జీవితంలో ఎప్పుడూ కష్టపడలేదు. గీతంలోని అంశాలకు తగ్గట్లు కొరియోగ్రఫీ చేసుకుంటూ...ప్రతి భంగిమలకు చాలా జాగ్రత్తగా కొరియోగ్రఫీ చేశాను. ఫోక్ డ్యాన్స్, క్లాసికల్, బతుకమ్మ నత్యాలు కలగలిపిన ఈ నృత్యరూపకంలో 200 మంది ఉంటారు. వారిలో 40మాత్రమే మగవారు.
ఒక రాష్ట్రం గొప్పదనాన్ని, చరిత్ర, కవులు, కళల గురించి నాట్యం ద్వారా చెప్పడం చాలా కష్టమైన పనే. అంకిత భావంతో పనిచేసే నా శిష్యబృందంతో ఇది సాధ్యమైంది. 'గోల్కొండ తానీషా పాలన' పై రూపొందించిన నృత్యరూపకం ఎంతో ఆదరణ పొందింది. కూచిపూడి కళను గుర్తించి.. కళాకారులకు ఒక గ్రామాన్ని ఇచ్చి.. నాట్యకళను ప్రోత్సహించిన తానీషాపై ప్రదర్శన ఇవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు 'దర్శనీయ హైదరాబాద్' నృత్యనాటికను రూపొందించాం. సాంకేతిక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ.. ప్రదర్శించే ఈ నృత్యరూపకం మన వారసత్వ, చారిత్రక, కళా సంపదను విశ్వవ్యాప్తి చేస్తుందని ఆశిస్తున్నాను.
అవార్డులు..
నాట్యప్రదర్శనలు ప్రారంభించిన నాటి నుంచి ఎన్నో బహుమతులు అందుకున్నాను. 2007 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'దీక్షా' కళా రత్న అవార్డును ప్రదానం చేసింది. 'అక్కినేని నాగేశ్వరరావు స్వర్ణ కంకణం' 2011, 'నాట్య విశారదా' , 'రాష్ట్రీయ వికాస్ శిరోమణి' ఇలా చాలా అవార్డులే అందుకున్నాను. ప్రాంతీయ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్లో సభ్యురాలిగా, నంది ఫిల్మ్ అవార్డుల జ్యూరీ సభ్యురాలిగా ఉన్నాను. ఇప్పుడు 'కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు' రావడం సంతోషంగా ఉంది.
మరిచిపోలేని అనుభవం..
పద్మవిభూషణ్ పండిట్ బిర్జూమోహన్నాథ్ మిశ్రా( బిర్జూ మహరాజ్) గారితో కలిసి ప్రదర్శన ఇవ్వడం నా జీవితంలో మరిచిపోలేని అనుభవం. ఆయన తో కలిసి వేదికపై నేను నాట్యప్రదర్శన ఇవ్వడం నా జీవితంలో ఊహించని అవకాశం. న త్యకళాకారిణిగా అంతకు మించిన అవార్డులు, రివార్డులు ఉండవని నేను భావిస్తాను.
కుటుంబ ప్రోత్సహంతోనే..
అమ్మ నుంచి నాట్యాన్ని వారసత్వంగా తీసుకున్నాను. మా ఆయన ఎంతో ప్రోత్సహి స్తారు. మాకు ఇద్దరు పిల్లలు. శ్లోకా, అభినవ్. ఇద్దరికీ సంగీత నాట్యంలో శిక్షణ ఇప్పించాం. శ్లోకా కూచిపూడి నత్యకారిణిగా ప్రదర్శనలు ఇస్తున్నారు. అభినవ్కు సంగీతంతో పాటు టెన్నిస్ నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో ఆడుతున్నాడు. కుటుంబ ప్రోత్సహం ఉంటేనే మహిళలు తాము ఎంచుకున్న కెరీర్లో ఉన్నతస్థాయిని అందుకుంటారు. మహిళల అభ్యున్నతితో ఆ కుటుంబ గౌరవం మరింత పెరుగుతుంది.