Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సైన్సు.. మన దైనందిన జీవితంలో ప్రతిఅంశంలోనూ అవసరమైన శాస్త్రం. జీవితంలోని అన్ని దశల్లో, రంగాల్లో సైన్సును మిళితం చేసి శాస్త్రీయ దృక్పథం అలవరచుకుంటే మూఢనమ్మకాలు, బాబాల మాయాజాలం, అశాస్త్రీయ అంశాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆగుతుందంటున్నారు ప్రముఖ సోషల్ సైంటిస్ట్, రచయిత చందనా చక్రవర్తి. ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్, సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆర్ట్ సభ్యులుగా ఆమె దేశవిదేశాల్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేధావులు ఆవిష్కరించిన అంశాలను అతి మామూలు వ్యక్తులకు కూడా అర్థమయ్యేలా చెప్పగలిగినప్పుడే సైన్సు అందరికీ చేరువుతుంది అంటారామె. సిసిఎంబి వ్యవస్థాపనలో కీలకపాత్ర పోషించి దశాబ్దం పాటు కమ్యూనికేషన్ ఆఫీసర్గా ఆమె పనిచేశారు. వందలాది వ్యాసాలను రచించిన ఆమె స్వాతంత్య్రం తర్వాత జరిగిన శాస్త్రీయాభివృద్ధిని ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ పి.ఎమ్. భార్గవతో కలిసి 'ది సాగా ఆఫ్ ఇండియన్ సైన్స్ సిన్స్ ఇండిపెండెన్స్' పుస్తకం రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పుకోసం ఉద్యమిస్తున్న ఆమె పరిచయం..
నాన్న హరి నారాయణ్ చక్రవర్తి, అమ్మ సంధ్యా చక్రవర్తి. వారిద్దరి కుటుంబాలు బంగ్లాదేశ్ విభజన సమయంలో భారత్ వచ్చాయి. నాన్న ఆర్మీలో పనిచేస్తూ.. హైదరాబాద్ వచ్చారు. ఇద్దరు అన్నయ్యలు, నేను సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ఏరియాలోనే పుట్టిపెరిగాం. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన కుటుంబాల మధ్య పెరిగాను. నా తెలుగు కాస్త వేరుగా ఉంటుంది. అందుకు కారణం దాదాపు 30ఏండ్ల పాటు మా ఇంట్లో ఉన్న ఆయమ్మ పోశమ్మ. మా అమ్మ తర్వాత మాకు అమ్మ వంటిది. ఆమె ద్వారా నేను నేర్చుకున్న తెలుగు తెలంగాణ యాసలో ఉంటుంది. చాలా రోజుల తర్వాత నేను 'ఆనంద్' సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. ఆ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఇప్పటివరకు పది సినిమాల్లో, రెండు సీరియల్స్, ఒక వెబ్సీరిస్లో నటించాను.
స్కూల్ స్థాయిలోనే...
నా బాల్యమంతా కంటోన్మెంట్ ఏరియా గడిచింది. అన్ని పండుగలు అక్కడ చేసేవాళ్లం. సెయింట్ ఆన్స్లో పదోతరగతి వరకు చదివాను. స్కూల్లో జరిగే అన్ని ప్రోగ్రామ్స్లో చురుగ్గా ఉండేదాన్ని. చిన్నప్పుడే హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నాను. ఎక్కువగా కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనేదాన్ని. యాక్టింగ్ చాలా ఇష్టం. ఎలాంటి భయం లేకుండా స్టేజీ షోలు చేసేదాన్ని. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిఎస్సీ(సైన్స్) పూర్తి చేశాను. డిగ్రీ పూర్తికాగానే సుఖేందు చక్రవర్తితో పెండ్లి అయ్యింది. మాకు ఇద్దరు పిల్లలు సామ్రాట్ చక్రబర్తి( జర్నలిస్టు), చోయిటా చక్రవర్తి (పిహెచ్.డి, ఆంత్రోపాలజి). అనేక సెమినార్లు, సమావేశాలు, రేడియో కార్యక్రమాల్లో స్పీకర్గా ఉన్నాను. 1995లో న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ యువ సమ్మిట్లో పాల్గొన్నాను. పి.ఎమ్ భార్గవ ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీగా, అర్బన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ట్రస్టీగా, ఇండియన్ అకాడమీ సోషల్ సైన్సెస్లో జాయింట్ సెక్రటరిగా పనిచేసాను.
కెరీర్ను మలుపుతిప్పిన సిసిఎంబి..
రీజనల్ రీసెర్చ్ లాబరోటరీ(ఆర్ఆర్ఎల్) నుంచి ఐఐసిటి(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ), సిసిఎంబి (సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్కులార్ బయాలజీ ఏర్పాటు అయ్యాయి. సిసిఎంబి వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ పి.ఎమ్ భార్గవ సిసిఎంబి డైరెక్టర్గా ఉన్నారు. ఆ సమయంలో నేను కమ్యూనికేషన్ ఆఫీసర్గా సిసిఎంబిలో చేరాను. డాక్టర్ భార్గవ నేతృత్వంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సిసిఎంబిలో చేరేనాటికీ నేను డిగ్రీ మాత్రమే పూర్తి చేసాను. పరిశోధన కేంద్రంగా సిసిఎంబి 24గంటలు పనిచేసేది. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకోవడం సాధ్యమైంది. శాస్త్రీయ పరిశోధన అంశాలతో పాటు అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్, రైటింగ్ స్కిల్స్ తెలుసుకున్నాను. ఎక్స్పీరియన్స్తో నాలెడ్జ్ సంపాదించుకోవడంతో పాటు మంచి శిక్షణ నాకు అక్కడ లభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో వ్యాసాలు రాసే అవకాశం లభించింది. డాక్టర్ భార్గవ ఆధ్వర్యంలో రాసిన వ్యాసాలన్నింటిని కలిపి 'ఏంజిల్స్, డేవిల్స్ అండ్ సైన్స్' అన్న పేరుతో పుస్తకంగా తీసుకువచ్చాం. సామాన్య ప్రజల్లో సైన్స్ గురించి అవగాహన కల్పించడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.
మొదటి ఆర్ట్ గ్యాలరీ..
డాక్టర్ భార్గవ చాలా ఎనర్జిటిక్.. ప్రతి విషయాన్ని సైన్స్ దృక్పథంలోనే చూడాలనేవారు. ఆర్ట్స్కి సైన్స్కు అవినాభావ సంబంధం ఉందనేవారు. మన దైనందిన జీవితంలో ప్రతి అంశం సైన్స్తో మిళితమై ఉంటుందని చెప్పేవారు. శాస్త్రీయ దృక్పథం ప్రతిమనిషిలో ఉండాలనేవారు. ఆయన నేతృత్వంలోనే సిసిఎంబిలో ఆర్ట్గ్యాలరీ ఏర్పాటు చేసాం. ఈ గ్యాలరీలో ప్రముఖ ఆర్టిస్టు తోట వైకుంఠం ప్రదర్శనతో పాటు దేశవిదేశాలకు చెందిన ఎంతో మంది ఆర్టిస్టుల ప్రదర్శనలు నిర్వహించాం. 1989లో ఫస్ట్ ఆర్ట్ క్యాంప్ ఈ గ్యాలరీలో ఏర్పాటుచేసాం. డాక్టర్ భార్గవ సిసిఎంబి డైరెక్టర్గా పనిచేసినన్ని రోజులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. ఆ ప్రదర్శనలు నాలో ఆర్ట్స్పై ఆసక్తిని పెంచి.. నన్ను అద్భుతమైన కళాఖండాల సేకర్తగా మార్చాయి.
మూడు దశాబ్దాలుగా..
ఆ తర్వాత 1993లో నేను సిసిఎంబి నుంచి బయటకు వచ్చాను. పదేండ్లు సిసిఎంబిలో నేర్చుకున్న అంశాలు ఆ తర్వాత నాకు సైన్స్పై మక్కువ పెరగడానికి, సామాజిక అంశాలను సైన్స్ కోణంలో చూసేందుకు ఉపయోగపడ్డాయి. డాక్టర్ భార్గవ ఆధ్వర్యంలో లాబోరేటరీ డిజైన్స్ హెల్పింగ్ కన్సల్టెన్సీని ప్రారంభించాం. ఎన్నో ఫార్మసూటికల్ ల్యాబ్స్, బయోటెక్ లాబరెటీస్ నిర్మాణంలో సహకారం అందించాం. సైన్స్ ఇన్ లా, సైన్స్ ఇన్ ఆర్ట్, సైన్స్ ఇన్ సొసైటీ ఇలా అనేక అంశాలతో సెమినార్లు, వర్క్షాపులు ఏర్పాటు చేసాం.
సరికొత్త ప్రయోగం..
కళలపై ఆసక్తి చిన్నతనం నుంచే ఉండేది. అయితే స్టేజీ షోలు వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అలా కాకుండా తక్కువ ఖర్చుతో థియేటర్ ఆర్ట్ను పరిచయం చేయాలన్న ఆలోచన వచ్చింది. మెల్కోటేగారు ప్రారంభించిన 'లిటిల్ థియేటర్'లో నేను చేరాను. స్టేజీ షోల్లోని పాత్రలను చదివి వినిపించే కొత్త ప్రయోగం. కళలపై ఆసక్తి ఉన్నవారి నుంచి అభినందనలు అందుకున్నాం.
సామాజిక సేవలో..
భోపాల్ దుర్ఘటన జరిగిన తర్వాత అక్కడి ప్రజల దుస్థితి మాటల్లో చెప్పలేం. ఇప్పటికీ కలుషితమైన నీరు, వాతావరణం మధ్య అనారోగ్యసమస్యతో సహవాసం చేస్తూ.. బతుకుతున్నారు. వారికి వైద్యసహాయం అందించడానికి కొంతమంది డాక్టర్లతో కలిసి 'సంభావన ట్రస్టు'ను ఏర్పాటు చేసాం. దశాబ్దాలుగా క్లినిక్ను అక్కడ నడుపుతున్నాం. ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాం. హెల్త్కేర్లో పాటించాల్సిన నియమాలపై పనిచేసేలా ఎంఏఆర్సిహెచ్(మార్చ్) సంస్థను ప్రారంభించాం. ఈ సంస్థ సూచనల మేరకు ఎన్నో మార్పులు వచ్చాయి.
మార్పు కోరుతూ..
'పాలిటిక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్'. మన జీవితంలో ప్రతి అంశం సైన్సుతో ముడిపడి ఉన్నట్లే పాలిటిక్స్తోనూ ముడిపడి ఉంది. 'ఛీ.. చెత్త రాజకీయాలు' అనుకుంటూ ప్రజాస్వామ్యంలో విలువైన ఓటింగ్కు చాలామంది దూరంగా ఉంటున్నారు. దీంతో 60శాతం మందిలో 40శాతం మంది తిరస్కరించిన వ్యక్తి 20శాతం మెజార్టిటీతో గెలుస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. అందుకే డాక్టర్ భార్గవతో కలిసి ఎన్నో ఏండ్ల కష్టపడి 'అజెండా ఫర్ ది నేషన్' పుస్తకం రాసాం. అన్ని రాజకీయ పార్టీలకు పంపించాం. కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఓటింగ్ పెరగడం, ఎన్నికల ఖర్చు తగ్గడం జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యవిలువలు పెరుగుతాయి.
- వి. యశోద