Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజిక సేవ అన్న పదం వినగానే.. ఎంతో డబ్బు ఖర్చు చేయాలి.. మనకెందుకు.. ఉన్నామా? తిన్నామా? తెల్లారిందా? అని చూసుకోకుండా సామాజిక సేవ ఏంటీ అనేవారు మనలో చాలామంది ఉన్నారు. మార్పు అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలంటూ... అడుగు ముందుకేసినప్పుడు కనిపించే మార్పు ఎన్నో జీవితాలకు ఆదర్శం అవుతుంది. జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను లెక్కచేయకుండా ఆత్మ ధైర్యంతో తాను అనుకున్న పని నిబద్ధతతో చేయగలిగినప్పుడే విజేతలుగా మారుతారు. అలాంటి వారిలో ఒకరు దాసరి శ్రీలక్ష్మీరెడ్డి. గత మూడు దశాబ్దాలుగా సామాజిక సేవ చేస్తూ.. ఎన్నో అవార్డులను అందుకున్నారు. గతంలో సెన్సార్బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఆమె ఆశయాలకు తగ్గట్టుగానే.. పెద్దకూతురు రోహిణి సింధూరి కన్నడ ప్రజల మనసులను గెలుచుకున్న ఐఎఎస్ ఆఫీసర్గా, నిజాయితీకి మారుపేరుగా, వార్తల్లోవ్యక్తిగా నిలిచారు. రేపటి తరం నీతినిజాయితీగా.. తమ బాధ్యతలను గుర్తించాలంటే ఇంట్లోనే మార్పు రావాలంటున్న శ్రీలక్ష్మి పరిచయం..
మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు. నాన్న సివిల్ కాంట్రాక్టర్. ఉమ్మడికుటుంబం. ఇద్దరు అన్నయ్యల తర్వాత నేను. ఆడపిల్లంటే లక్ష్మీదేవి అంటూ ఎంతో ప్రేమగా పెంచారు. ఇంటర్ వరకు ఆత్మకూరులోనే చదివాను. స్కూలులోనూ.. కాలేజీలోనూ ఎంతో చురుగ్గా ఉండేదాన్ని. అందిరికీ ఉచితంగా వైద్యం అందించేలా డాక్టర్ కావాలనుకున్నాను. ఇంటర్ కాగానే ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన జైపాల్ రెడ్డితో పెండ్లి చేసారు. మాకు ముగ్గురు పిల్లలు. ఆయన అడ్వకేటు. హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించగానే.. మా కుటుంబం హైదరాబాద్కు వచ్చేసింది. ఆ తర్వాత మావారి ప్రోత్సాహంతో నేను బి.ఏ, ఎం.ఏ(పొలిటికల్ సైన్స్)పూర్తి చేశాను. రాజకీయాల్లో మహిళలు అన్న అంశంపై పిహెచ్.డి చేస్తున్నాను.
'వెస్ట్ టూ వెల్త్'..
మా ఆయన కోర్టుకు, పిల్లలు స్కూలుకు వెళ్లిన తర్వాత ఖాళీసమయం ఉండేది. ఈ టైమ్ను సద్వినియోగం చేయాలని పించిది. టీవీ సీరియల్స్పై పెద్దగా ఆసక్తి లేదు. పుస్తకాలు, వార్తాపత్రికలు బాగా చదివేదాన్ని. సామాజిక సమస్యలపై అవగాహన పెరిగింది. మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్న ఆలోచన లేకుండా చాలామంది చెత్తను ఇంటిచుట్టూ వేయడం కనిపించింది. ఇప్పుడు ప్రభుత్వం తడి చెత్త, పొడి చెత్త అంటూ ప్రకటనలు ఇస్తుంది. కానీ, చాలా సంవత్సరాల కిందటే నేను కిచెన్ వెస్ట్ నుంచి వర్మికంపోస్ట్ చేసి మొక్కలను పెంచేదాన్ని. నేను ఒక్కదాన్నే చేస్తే మా ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉంటుంది. మా అపార్ట్ మెంట్లోని వారందరు పాటిస్తే.. పరిసరాలన్ని శుభ్రంగా ఉంటా యనిపించింది. దాంతో ఇరుగు పొరుగు వారికి అవగాహన కల్పించేలా 'హైదరాబాద్ టెక్నికల్ యూత్ అపోషియేషన్' ప్రారం భించాం. తడి, పొడి చెత్త వేరు చేసేవాళ్లం.చిన్న చిన్న టెక్నిక్స్ తో ' వెస్ట్ టూ వెల్త్' అని నిరూపిస్తూ.. ఎంతో మందికి ఉపాధి కల్పించగలిగాం. ఆ తర్వాత వీధుల్లో, సిగల్స్ వద్ద బెగ్గర్స్, చిన్నపిల్లలు అడుక్కోవడం చూసి చాలా బాధ అనిపించేది. బిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి అత్యంత దయనీయం. చేయి చాచి అడుక్కోనే పరిస్థితి నుంచి వారిని బయటకు తీసుకు రావాలన్న ప్రయత్నంతో వారికి హౌమ్ ఏర్పాటు చేసి, బిక్షాటన నుంచి బయటకు వచ్చేలా కౌన్సెలింగ్ ఇప్పించాం. చాలామంది పిల్లలను బడిలో చేర్పించాం. చదువుతో జీవితాలను తీర్చిదిద్దుకోవచ్చని వారికి తెలిసేలా చేసాం.
ఆడవారికి అండగా..
బంధువుల్లో, స్నేహితుల్లో, ఇరుగు పొరుగు వారిలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా.. ఫస్ట్ ఫోన్ కాల్ నాకే వచ్చేది. మా ఆయన హైకోర్టు న్యాయవాది కావడంతో వారి సమస్యలను మాతో చెప్పి.. అవసరమైన న్యాయసూచనలను తీసుకునేవారు. ముఖ్యంగా గృహహింస సమస్యలు కొన్న వందలు వచ్చి ఉంటాయి. వాటిలో చాలావరకు కౌన్సెలింగ్ ఇచ్చి.. వారి తగాదాలను పరిష్కరించి పంపే వాళ్లం.
మార్పు ఇంటి నుంచే..
'మార్పు రావాలి.. ఈ సమాజం మారాలి' అంటూ చాలామంది చెప్తారు. కానీ, మార్పు ఇంటి నుంచే రావాలన్న విషయం మాత్రం వారు ఆచరించరు. మా పిల్లలకు చిన్నతనం నుంచి 'మనం ఈ సమాజం లో భాగం. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. మీకు చేతనైనంత మేరకు ఇతరులకు సహాయం చేయండి' అని చెప్పేవాళ్లం. ఈ రోజు మా పెద్దమ్మాయి రోహిణి సింధూరి కర్ణాటక ప్రభుత్వంలో ఐఎఎస్ అధికారిగా పనిచేస్తూ.. ప్రజలకు అండగా నిలబడి సివిల్ సర్వీస్ అన్న పదానికి సరైన నిర్వచనం చెప్తున్నది. ఆమెను చూసి తల్లిగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. మా అమ్మాయిని బాధ్యత గల ఆఫీసర్గా తీర్చదిద్దగలిగినందుకు అమ్మగా నా బాధ్యతను నేను నిర్వహించానని అనుకుంటున్నాను. మా అమ్మాయి సివిల్ కోచింగ్ తీసుకునే సమయంలో సివిల్స్కు ప్రిపేర్ కావాలన్న ఆలోచన ఉన్న పేదఅమ్మాయిలకు ఉచితంగా సివిల్స్ శిక్షణ ఇప్పించాలనుకున్నాం. అందుకు ఆర్.సి.రెడ్డి గారు అంగీకరించారు. ఒక ఏడాది 30మంది అమ్మాయిలకు ఉచితంగా భోజన వసతి కల్పించాం. వారిలో కొందరు ప్రభుత్వసర్వీసులకు ఎంపికయ్యారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం వస్తే.. వారి కుటుంబాలు బాగుపడుతాయి. అక్షరాస్యత, ఆత్మవిశ్వాసం, ఆర్థికస్వాతంత్య్రం ఈ మూడు ఆడవారికి ఎంతో అవసరం.
పిల్లలు దేశసంపద..
పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత తమను వృద్ధాప్యంలో చూడాలని చాలామంది తల్లిదండ్రులు ఆశిస్తారు. వద్దు.. మీ బిడ్డల నుంచి మీరు ఏమి ఆశించకండి. వారిని మంచి పౌరులు గా తీర్చిద్దిలాలి. సమాజానికి ఏదైనా మంచి చేసేలా వారిలో బాధ్యతలు గుర్తుచేయాలి. మన బిడ్డలు దేశసంపద. వారి సేవలు ఈ దేశప్రగతికి ఉపయోగ పడేలా చూడాలి.
- వి. యశోద