Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకానొక బహిరంగ ప్రదేశం. చుట్టూ మగవాళ్లు వందల్లో ఉన్నారు. ఒక్క మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ఆ చుట్టూ ఉన్న మగవాళ్ల మనసుల్లో ఏముందో అవసరం లేదు. వాళ్లేమీ ఆమె మీద దాడి చేయడం లేదు. కానీ వాళ్లు చూసే చూపులకే ఆ మహిళ ఎంతో హింసకు గురవుతుంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నది కూడా అదే. ట్రోలింగ్... అంటే ఓ భయంకరమైన రూపం. మన దగ్గర మగవాళ్ల ఆలోచనలు కూడా అంత భయకరంగా ఉంటున్నాయి. మహిళ ఓ అభిప్రాయాన్ని కలిగి ఉండకూడదు. ఆలోచించకూడదు. ప్రశ్నించకూడదు. ఇవన్నీ ఉన్నా ఎదురుగా ఉండేపురుషుడి ఆలోచనలకు అనుగుణంగా ఉండాలి. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే నోరు మెదపకుండా కూర్చోవాలి. అంతేగానీ ప్రశ్నిస్తారా? మీ అభిప్రాయం చెబుతారా? మీ ఇష్టం వచ్చిన బట్టలేసుకుంటారా? అయితే కచ్చితంగా ట్రోలింగ్ చేస్తామంటున్నది భారత ఆన్లైన్ పురుషసమాజం.
మహిళలపై హింస.. తరాలుగా పాతుకుపోయి ఉంది. ఎంత ఆధునికత వచ్చినా, శాస్త్రసాంకేతిక పెరిగినా హింస రూపం మారింది. కానీ కొనసాగుతూనే ఉంది. అందుకు నిదర్శనం ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ను అందరూ ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మహిళలపై జరుగుతున్న ప్రత్యక్ష హింసకు ఇది కొనసాగింపు. ఇలాంటివి ఎదురైనప్పుడు మొదట్లో బ్లాక్లో పెట్టడమో, చూసీచూడనట్లుగా వదిలేసినా... ఇప్పుడు భరించలేని స్థితికి చేరింది. ప్రత్యేకించి మహిళా జర్నలిస్టులు, నటులు ట్రోలింగ్లో లింగపరమైన వివక్షను, వేధింపులు, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. భద్రత ప్రశ్నార్థకమవుతోంది. మునుముందు ప్రపంచాన్ని నడిపించనున్న డిజిటల్ వరల్డ్లో ట్రోలింగ్ ఓ తీవ్రమైన సమస్య అయ్యింది.
వివక్ష పునాదిగా...
ట్రోలింగ్కు కారణం... మనదేశంలో మహిళలపట్ల ఉన్న వివక్ష. సమాజంలో మార్పు వస్తున్నది. ఆధునికత, సాంకేతికత పెరుగుతున్నది. ఆ మార్పుకనుగుణంగా వివక్ష కూడా పెరుగుతున్నది. మంచికి ఉపయోగపడాల్సిన సోషల్ మీడియా శక్తి దుర్వినియోగమవుతోంది. ఇతరులను వేధించడానికి, దూషించడానికి ఉపయోగపడుతోంది. తరాలుగా మాట్లాడనీయకుండా చేసిన ఈ సంప్రదాయ పురుషాధిక్య ప్రపంచంలో ఓ మహిళ పురుషుల అధీనంలో ఉన్న ఏ ఆవరణలోకైనా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే, వాళ్లు పెట్టిన ఆంక్షలను ధిక్కరిస్తే, వాళ్లను కాదని తనదైన స్వరాన్ని వినిపిస్తే, ప్రశ్నిస్తే... అసభ్యకరమైన దూషణలే వస్తాయి. ఎక్కడనుంచయినా.. ఏ రూపంలోనైనా వెంటాడతాయి. ఈ ట్రోల్స్లో మహిళలు అనగానే వ్యక్తిత్వాన్ని దెబ్బతిసే కుట్ర మొదటగా జరుగుతుంది. అందుకోసం వాళ్ల వ్యక్తిగత విషయాల మీద దృష్టిపెడతారు. పెండ్లి, పిల్లలు, వాళ్ల లైంగికత, శరీరాంగాలపై... వినడానికి కూడా ఇబ్బంది పడే భాషను ఉపయోగిస్తారు. అన్ని రంగాల్లో ఉన్న మహిళలు ఈ ఆన్లైన్ అబ్యూస్ను ఎదుర్కొంటున్నారు. ఇక వాళ్లు బడుగు, బలహీనవర్గాల వారికి చెందినవారైతే ఆ వేధింపులు మరింత తీవ్రంగా ఉంటున్నాయి.
నిర్ణయాధికారమున్నా...
దేశంలో మహిళలపట్ల ట్రోలింగ్ ఎంత తీవ్రంగా ఉందో తెలియడానికి మన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఉదంతం చాలు. మతాంతర వివాహం చేసుకున్నవారికి పాస్పోర్టు ఇప్పించినందుకు, వారిని ఇబ్బందులకు గురించి చేసిన అధికారిని బదిలీ చేసినందుకు సోషల్ మీడియా వేదికగా కొన్ని మతతత్వ శక్తులు అసభ్య పదజాలంతో ఆమెపై దూషణలకు దిగాయి. ''ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. విమర్శించండి. కాని అసభ్యకర భాషలో కాదు. హుందాదనంతో కూడిన విమర్శ ఎల్లప్పుడూ ప్రభావవంతంగా ఉంటుంది'' అని తిరిగి పోస్టు చేసింది. అయినా పట్టించుకునేవారెవరు. ఇక్కడ ఆ మంత్రి మహిళ. సొంత పార్టీ మహిళ అయినా... ఆమె ఓ మతాంతర వివాహం చేసుకున్న జంటకు మద్దతు ఇస్తుందా? న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందా? అందుకే ఆ మాటల దాడి. ఆమెకు సపోర్టుగా నిలిచినందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ప్రియాంకా చతుర్వేదిపైనా చెలరేగిపోయారు. అంతటితోతో ఆగలేదు. ఆమె కూతురును రేప్ చేస్తామంటూ బెదిరించారు. రాజకీయాల్లో నిర్ణయాధికారాల్లో ఉన్న మహిళలైనా సరే... ఈ పురుషుల నిర్ణయాల అదుపాజ్ఞల్లోనే ఉండాలి.
జర్నలిస్టులపైనా...
న్యూస్రూమ్స్లో మహిళా ప్రొఫెషనల్స్ సంఖ్య గతంలో కంటే పెరిగింది. నిష్పత్తిలో తక్కువే అయినా ఇప్పటిదాకా పురుషుల ఆధిపత్యంలో ఉన్న రాజకీయ, అవినీతి, వివాదాస్పద, ప్రభుత్వ, పర్యావరణ సంబంధ వార్తా సేకరణలో మహిళలు అడుగుపెట్టారు. సంచలనాలు సృష్టిస్తున్నారు. వెటరన్ జర్నలిస్టు బర్ఖా దత్, గుజరాత్ఫైల్స్తో సంచలనమైన రానా అయూబ్లు... ట్విట్టర్లో కొన్ని వేలకు పైగా ట్రోలింగ్ మెసేజ్లు ఎదుర్కొన్నారు. రానా అయూబ్నైతే చంపుతామని బెదిరించారు. ఆమె వ్యక్తిగత విషయాలు, ఇంటి అడ్రస్ వివరాలన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ట్రోలింగ్ ఇంకా పెరిగింది. బర్ఖాదత్ను వేశ్య అంటూ సంబోధించారు. డిజిటల్ న్యూస్పేపర్ న్యూస్మినట్ ఎడిటర్ ధన్యారాజేంద్రన్కు ట్రోలింగ్ తిప్పలు తప్పలేదు. సినీనటుడు మమ్ముట్టిపై కామెంట్ చేసినందుకు ఆయన ఫ్యాన్స్ అందరూ ధన్యపై బూతులతో తెగబడ్డారు. ఇప్పుడు మనదాకా వచ్చేసింది.
భావ ప్రకటనే ఉండొద్దని..
సీనియర్ జర్నలిస్ట్ స్వాతి వడ్లమూడి ఓ కార్టూన్ వేసినందుకు ఆమెనుద్దేశించి సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో వందల సంఖ్యలో తిట్లూ, బెదిరింపులు. జుగుప్సాకరమైన భాష. కతువా, ఉన్నావ్ రేప్ ఘటనలు చూసి కదిలిపోయిన ఆమె... ఆ కార్టూన్ వేసింది. అందుకుగాను కొన్ని రోజుల పాటు ఎంతో మానసిక వ్యధకు గురయ్యింది. కాకపోతే 'ఇలాంటివన్నీ తనను మరింత దృఢంగా మార్చాయని చెబుతుంది. ట్రోలింగ్ చూశాక దేశం ఇంకా ఇంతగా వెనుకబడి ఉందా అనిపిస్తోంది. ఇంకా ఇంతటి స్త్రీ ద్వేషం, ఇంతటి పురుషాహంకారం పాతుకుపోయి ఉన్నాయి. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక బాధ్యతగల వ్యక్తిగా, జర్నలిస్టుగా, స్పందించకుండా ఎలా ఉండగలుగుతాం? ఇది నా బాధ్యత' అని చెబుతుంది. అయితే జర్నలిస్టు అయినా, మరేమయినా మహిళ ఓ అభిప్రాయాన్ని కలిగి ఉండకూడదు. దాన్ని ఇలా ప్రదర్శించకూడదు.
అభిప్రాయాలుండొద్దు..
మరోఛానల్ న్యూస్ ప్రజెంటర్ సుమతిపైనా ఓ వర్గం దుమ్మెత్తిపోసింది. బూతులతో తెగబడింది. ఆమె చేసిన నేరం... ఓ చర్చ నిర్వహించడం. అందులో పరిపూర్ణానంద స్వామి, కత్తి మహేష్ పాల్గొనడం. వాళ్లిద్దరూ వాళ్ల అభిప్రాయాలు చెప్పడం. చర్చ నిర్వహించింది ఆమె కాబట్టి ఆమె వల్లే ఆ అభిప్రాయాలు వెల్లడించారు కాబట్టి... ఆమెదే తప్పని నిర్ణయించేశారు. నిజానికి పరిపూర్ణానందకైనా, కత్తిమహేష్కైనా ఎవరి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛవాళ్లకున్నది. ఎలాంటి భాష వాడారన్నది వాళ్ల విచక్షణ. వాళ్ల మీద చర్యలు పక్కన పెడితే.. అసలు చర్చ నిర్వహించే స్వేచ్ఛ కూడా పోవడమేమిటి? ఒకరి అభిప్రాయాలను గౌరవించకపోయినా పర్లేదు... భిన్నాప్రాయాలుంటే చర్చ చేయాలి. ఆయన ఏ విషయంలో అయితే తిట్టారో.. సదరు వ్యక్తి ఆ సమయంలో అలా ఎందుకు ప్రవర్తించారో వివరణలు ఇస్తే సరిపోయేది. కానీ ఆ ప్రజాస్వామిక చర్చకు తావు లేకుండా వాళ్లిద్దరినీ కూడా వదిలేసి... న్యూస్ప్రజెంటర్ మీద దాడిచేయడం, ఆమెను బూతులు తిట్టడం ఎంతవరకు సమర్థనీయం. వారు గౌరవించే కథలోని స్త్రీలాగే సుమతి కూడా స్త్రీ అన్న విషయాన్ని ఎందుకు మరుస్తున్నారు? ఇదే అంశంపై ఉద్యమకారిణి పీఓడబ్ల్యూ సంధ్యపై కూడా ట్రోలింగ్ చేశారు. భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉండాలి, బహిష్కరణ తప్పు అని చెప్పడమే ఆమె నేరం. ఆమెపై వ్యక్తిగతంగా దాడి చేశారు. వ్యక్తిత్వ నిందలకు తెగబడ్డారు. కులం కూడా ఉపయోగించారు. రాజకీయాలను అంటగట్టారు.
ఉద్యమకారులపైనా ...
మల్లన్నసాగర్ బాధితుల పక్షాన నిలబడి కోర్టులో కేసు వేసినందుకుగాను అడ్వకేట్ రచనారెడ్డిపైనా ఈ ట్రోలింగ్ పర్వమే కొనసాగింది. ఆమె డ్రెస్సింగ్ మీద కామెంట్ చేశారు. రూపురేఖలను దూషించారు. అయితే ఈసారి దాడి జరిగింది మతతత్వ శక్తులనుంచి కాదు. రాజకీయకోణం నుంచి. తమ పార్టీ మీద కేసులు వేసేంత గొప్పదా? తమ నాయకుని గురించి మాట్లాడేంత ధైర్యమా? అన్న చిన్నచూపు. ఇది తెలిసీతెలియని యువతే అన్నారనుకుని వదిలేయలేం... ప్రముఖ జర్నలిస్టులనిపించుకుంటున్న వాళ్లు సైతం ఇదే ఆ ట్రోలింగ్ లిస్టులోకి చేరిపోయారు. ఇదేం జర్నలిజం? మహిళల పట్ల కనీసం గౌరవం లేదు కదా! బూతులు తిట్టకూడదన్న ఇంగితం లేకుండా వ్యవహరించారు. ప్రముఖ ఉద్యమకారిణి, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆమె పనిచేసిన యూనివర్సిటీలో విద్యార్థులు మనుస్మృతి దహనం చేసినందుకు... ఆమె చేయించిందంటూ ఫేస్బుక్లో విరుచుకుపడ్డారు మతతత్వ శక్తులు. వాళ్లే విద్యార్థుల గుంపులో చేరి, దాడి చేసి... విద్యార్థులే దాడి చేశారని సృష్టించారు. విద్యార్థులు మనుస్మృతి దహనమే చేశారు తప్ప మరే దాడి చేయలేదు. నిజానికి ఆ రోజు ఆమె యూనివర్సిటీలోనే లేదు. ఈ ఘటన వెనుక ఆమె ప్రమేయమే లేదు. ప్రొఫెసర్ సుజాతను కరీంనగర్లో లేకుండా చేయాలనుకున్నారు. ఎందుకంటే ఆమె పర్యావరణం గురించి మాట్లాడుతుంది. దళితుల గురించి మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది. మతతత్వాన్ని వ్యతిరేకిస్తుంది. వీటన్నింటికీ ఒకటే మందు అని ఆన్లైన్ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
డ్రెస్సింగ్ గురించి...
క్రికెట్లో మేరుశిఖరం మిథాలీరాజ్. ఆమె క్రికెట్లో రికార్డులు సృష్టించినప్పుడు పొగడ్తల్లో ముంచెత్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వ్యక్తిగత విషయాల్లోకి చొరబడి శల్య పరీక్ష చేయడమే ఇబ్బందికరం. మిథాళీ రాజ్ మోడ్రన్ డ్రెస్ ధరించినందుకు... 'నువు హీరోయిన్వి కాదు.. క్రికెటర్వి' అంటూ ఆమెను దుయ్యబట్టారు. ఒక యువతి ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆన్లైన్లో ఉన్న కొంత పురుష సమాజం నిర్ణయించేస్తుంది. పురుషాధిపత్య భావజాలంతో ప్రశ్నలడిగిన జర్నలిస్టుకే టిట్ఫర్ టాట్లాగా సమాధానం చెప్పిన యువతి మిథాలీ. నిజానికి ఆ మాటే నేరుగా అని ఉంటే చాచి కొట్టేది. కానీ ట్విట్టర్ ఓపెన్ వేదిక. ఏమన్నా ఏం చేస్తారులే అన్న ధీమా. అందరినీ తమ కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే భావన. వెరసి ట్రోలింగ్.
బాధితుల పక్షాన నిలిచినందుకు...
విలువలను ఎవరు నిర్ణయించాలి? అసలు విలువలు ఏమిటి? అనే ప్రశ్నే వస్తే... ఎవరి విలువలు వాళ్లకుంటాయి. ఎదుటి వ్యక్తి పట్ల గౌరవంతో ఉండాలి. కనీస రూల్స్ పాటించాలి. శారీరకంగా హాని కలిగించకూడదు. మానవత్వంతో ఉండాలి. కనీస మానవత్వం విలువలు. భావ ప్రకటనా స్వేచ్చ ఉండొద్దంటే ఎట్లా? వాళ్ల భావాలకు భిన్నంగా ఎవరైనా మాట్లాడితే... కొంచెం డబ్బు, కులం ఉన్న వాళ్లయితే మీరు అలాంటి ఇంట్లోంచి వచ్చి చెడ్డపేరు తెస్తారా? అని ప్రశ్నిస్తారు? నీతులు బోధిస్తారు. లేదు సాధారణ మహిళలయితే వాళ్ల భాష కటువుగా ఉంటుంది. రేప్ చేస్తామని, చంపుతామని బెదిరిస్తారు. లేదంటే ఏ యాసిడ్ అటాకో చేస్తామంటారు. ఈ ఆన్లైన్ ట్రోలింగ్ శారీరకంగా ఎలాంటి హాని కలిగించకపోవచ్చు. కానీ అంతకుమించి మనిషిని ఒంటరిని చేస్తుంది. నిస్సహాయురాలిని చేస్తుంది. డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. మానసికంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తోంది. ఒక్కోసారి పూర్తిగా గొంతును నొక్కేస్తుంది. ప్రజాస్వామిక గొంతులను నొక్కేసే చర్య, ఏ స్థాయిలో ఉన్నా మహిళలు పురుషుల అదుపాజ్ఞల్లోనే ఉండాలని కోరుకునే మనస్తత్వంలో భాగమే ఈ ట్రోలింగ్.
దేనికి సూచన...
అందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. చివరకు ఈ ట్రోలింగ్ చేసే పురుష పుంగవులకు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛ ఇంకొకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేదై ఉండకూడదు. ఇంకొకరి రూపాన్ని కించపరిచేదై ఉండకూడదు. మహిళలను లైంగికంగా వేధించేదై ఉండకూడదు. చంపుతామనో, రేప్ చేస్తామనో బెదిరించేంత సాహసానికి ఒడిగట్టకూడదు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలుండటం సహజం. అలాంటప్పుడు అభిప్రాయాల వారీగా ఇరువైపుల నుంచి ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. కానీ అలాంటిదేమీ లేకుండా కేవలం.. అసహనంతో బూతులు తిట్టడం, అసభ్య పదజాలంతో దూషించడం, బెదిరించడం మానవీయత అవుతుందా? నిజానికి ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్లాంటి సామాజిక మాధ్యమాలన్నీ ఉపయోగించేది చదువుకున్నవాళ్లు. అలాంటి వ్యక్తులే మహిళలపై ఇలాంటి కామెంట్లు చేయడం, కనీస విలువలు పాటించకపోవడం దేనికి సూచన?
- కట్ట కవిత