Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందితాదాస్... పరిచయం అక్కర్లేని పేరు. భారతీయ సినిమా రంగంలో ఆమెది ఓ ముద్ర. నటన, దర్శకత్వం పనేదైనా తనకు నచ్చితేనే చేస్తుంది. అభిప్రాయమేదైనా ముక్కుసూటిగా చెబుతుంది. ఓ సినిమాకు దర్శకత్వం వహించింది. ఇప్పుడు ప్రముఖ రచయిత సాదత్ హసన్ మంటో జీవిత కథాంశంగా 'మంటో' సినిమాను తెరకెక్కించింది. ఇప్పటికే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై పలువురి ప్రశంసలందుకున్న ఆ సినిమా... సెప్టెంబర్ 21న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఆమె గురించి...
ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్వర్క్లో మాస్టర్స్ చేసినప్పటినుంచే ఆమె సేవా కార్యక్రమాలు మొదలుపెట్టింది. సోషల్ వర్క్ ట్రైనింగ్లో భాగంగా... దేశం నలుమూలలా వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసింది. ఏండ్లు గడిచాయి. నటిగా అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తరువాత కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నది. సినిమా వ్యక్తిగా కంటే... సామాజిక ఉద్యమకారిణిగానే ఎక్కువగా గుర్తింపు పొందింది. ఆమె ఎంచుకునే సినిమాలు సైతం... సామాజికంగా ఆమెకున్న అంకితభావాన్ని తెలియజేస్తాయి. ఆ సినిమాలు కొన్ని వివాదాస్పదం అయినప్పటికీ... నమ్మినదానికోసమే నిలబడిందామె.
సామాజిక బాధ్యత...
మహిళల పట్ల హింస, బాలల హక్కులు, ఎయిడ్స్పై ఉన్న అపోహలు వంటి అంశాలను తీసుకుని పనిచేసింది. 'అవి కచ్చితంగా చెప్పాల్సిన అంశాలు' అని అంటుందామె. జల సంరక్షణ, విద్య వంటి ప్రజాప్రయోజన అంశాలకు సంబంధించిన ప్రకటనలకు కూడా దర్శకత్వం వహించింది.
డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు, సాధారణ పిల్లల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పోగొట్టడం కోసం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి 2003లో ఇంటర్నేషనల్ స్పెషల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణలో పాలుపంచుకుంది. గివ్ ఇండియా, అమన్ బిరాదరి వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఆమె అధికార ప్రతినిధిగానూ నామినేట్ అయింది. సౌత్ ఏషియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్ఎహెచ్ఎఆర్) సభ్యురాలిగా... భారత్-పాక్ శాంతి చర్చల్లో క్రియాశీలకంగా ఉన్నది. నందిత మంచి వక్త కూడా. దేశ, విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వేదికలపైనా అనేక సామాజిక అంశాలపై తన గళాన్ని వినిపించింది. అద్భుతంగా రచనలు చేస్తుంది. అనేక సామాజిక సమస్యలపై తన ఆగ్రహాన్ని, అభిప్రాయాలను పత్రికలకు, వెబ్సైట్స్కు రాస్తున్నది.
స్పందించినప్పుడే...
'ప్రపంచం ఎలా ఉండాలనుకుంటున్నావో.. ముందు నువ్వు అలా ఉండాలి' అని నమ్ముతుంది. అందుకే ఆమె అలాగే ఉంటుంది. డబ్బు, వాణిజ్య వ్యవహారాలే ప్రధానంగా భావించే సినీ రంగంలో తనదైన ముద్రను, అభిరుచులను నిలబెట్టుకోవటం కష్టమైన పనే. అందుకోసం పోరాటం చేయాలి. అది చేసేందుకు ఆమె వెనుకాడదు. అందుకే ఆమె వాణిజ్యపరమైన సినిమాల జోలికి వెళ్లదు. 'మనం దేనికి స్పందిస్తామో, దాన్ని చేయడానికి మాత్రమే ఇష్టపడతాం. కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నపుడు ఆ మార్గంలోనే ప్రయాణం చేసేందుకు ఇష్టపడతాం. ఆ దారిలో వెళ్లినప్పుడే అంతర్గత సంఘర్షణ ఉండదు' అని చెబుతుంది. మీడియా, మార్కెట్ అంతా తెలుపు జపం చేస్తూ... నల్లగా ఉన్న అమ్మాయిల్లో ఆత్మన్యూనతకు కారణమవుతుంటే... 'స్టే అన్ ఫెయిర్, స్టే బ్యూటిఫుల్, 'బ్లాక్ ఈజ్ బ్యూటీఫుల్' పేరుతో ఒక క్యాంపెయిన్లో నిర్వహించింది. వేలాది మంది అభిప్రాయసేకరణ చేసింది.
సినిమాల్లో...
దీపా మెహతా, అదూర్ గోపాలక్రిష్ణన్, మృణాల్సేన్, శ్యామ్బెనగల్, మణిరత్నం వంటి దర్శకుల దగ్గర... వివిధ భాషల్లో 30 దాకా సినిమాలు చేసింది. ఫైర్, ఎర్త్, కమ్లి, ఐయామ్, హజార్ చౌరాసీ కా మా, తెలుగులో అమృత, ఇంగ్లీష్, మలయాళంలో వచ్చిన బిఫోర్ రెయిన్స్... ఒక్కో సినిమాలో ఒక్కో తరహా.. అద్భుతమైన నటనను ప్రదర్శించింది. కేవలం నటనకే పరిమితం కాలేదు. గుజరాత్ మతకల్లోహాలు, అది సృష్టించిన హింసపై... ఫిరాక్ చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో 2008 లో ఆమె రూపొందించిన 'ఫిరాక్' చిత్రం ఓ సంచలనం. ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. పాకిస్తాన్లోని కరాచి చిత్రోత్సవంలో కూడా ప్రదర్శితమైంది. 2002 గుజరాత్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో, గోద్రా ఘటన తరువాత కొన్ని కుటుంబాల చుట్టూ తిరిగే.. ఈ చిత్రం, భారత్లో విడుదల కాకుండానే పాక్లో విడుదలైంది. ఈ చిత్రం టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా ఎంపికైంది. అంతేకాకుండా లండన్, దుబారు, పుసాన్తో పాటు అనేక చోట్ల నిర్వహించే చిత్రోత్సవాలకు కూడా ఎంపికయ్యింది. ఈ నెల 21న 'మంటో' సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి, మహిళా దర్శకులు, సినిమాల్లో మహిళల చిత్రణ వంటి అనేక అంశాలపై ఆమె అభిప్రాయాలు...
ఆమె మాటల్లోనే...
''దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రివ్యూ వేశాం. స్పందన బాగుంది. ముందు ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమైంది కాబట్టి... ఇది ఫెస్టివల్ ఫిల్మ్ అనే భావన ఉంది చాలా మందిలో. ఏ విషయం గురించైనా ముద్రలు వేస్తుంటారు. మంటో చాలా వ్యక్తిగతమైన అంశాలపై ఎంతో సున్నితంగా రాశారు. ప్రగతిశీలవాదులైన ఆయన మిత్రులు సైతం ఆయనను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఈ సినిమా చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్ల తరువాత నిజంగానే మనం ప్రగతి సాధించామా? ఏమైనా మార్పు వచ్చిందా? మన నైతికతకు, మనలో దాగిన భయాలకు, పక్షపాతాలకు అద్దం ఈ సినిమా. 'నా కథలు ఈ సమాజానికి ప్రతిబింబాలు. అవి మీకు నచ్చకపోతే అది నా తప్పు కాదు' అని మంటోనే చెప్పాడు.
నాన్నకు దగ్గరగా...
మంటో రాసిన వ్యాసాలు, ఆయన గురించి ఇతరులు రాసిన వ్యాసాలు చదువుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు బాగా తెలిసిన విషయాలుగా తోచాయి. అలా ఎందుకనిపించిందని ఆలోచిస్తే.... తరువాత తెలిసిందేమంటే.. నేను అలాంటి విలువలున్న వ్యక్తితోనే పెరిగాను. మా నాన్న జతిన్దాస్... పెయింటర్... ఎప్పుడూ ఆర్ట్ మార్కెట్లో ఆయన లేరు. మంటో కూడా అలాగే... ఆయన రచనలు ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నా ఎప్పుడూ ప్రగతిశీల రచయితల అసోసియేషన్లో భాగస్వామిగా లేరు. డబ్బు సంపాదించాలన్న కనీస ఆలోచన కూడా లేదు ఇద్దరికి. ఏమన్నా సంపాదించినా అది జీవికకు సరిపోవడానికి మాత్రమే. తమ పనిపట్ల అంకిత భావం... మనుషుల పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు ఇద్దరికీ ఉన్నాయి. అందుకే మంటో జీవితాన్ని చూసినప్పుడు నాకు బాగా తెలిసిన జీవితంగా తోచింది. బాగా కనెక్ట్ అయ్యాను.
ఈ పదేండ్లలో...
2008లో ఫిరాక్ వచ్చింది. ఒక దశాబ్దం తరువాత ఈ సినిమా. నేను ప్రొఫెషనల్ డైరెక్టర్ను కాను. ఏదైనా కథ నను నిలవనీయకుండా చేసినప్పుడు మాత్రమే సినిమా చేస్తాను. అందుకే ఇంత గ్యాప్. ఈ పదేండ్లలో నేను చాలా పనులు చేశాను. భారతీయ బాలల సినిమా సొసైటీకి ఛైర్ పర్సన్గా పనిచేశాను. ఎనిమిదేండ్ల బాబుకు తల్లి. ఎనిమిదేండ్లుగా ఓ మంత్లీ కాలమ్ రాస్తున్నాను. నాలుగు నెలలపాటు యేల్ యూనివర్సిటీలో ఫెలోషిప్ చేశాను. అంతేకాదు... 'బిట్వీన్ ది లైన్స్' అనే నాటికను రాశాను, దర్శకత్వం వహించాను. నటించాను కూడా.
చిత్రీకరణ ముఖ్యం...
ఇక ఛాలెంజెస్ అంటారా... పురుషాధిపత్యం ఉన్న ఏ పరిశ్రమలో అయినా మహిళలు నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. ఇక మహిళా దర్శకులు అనగానే ఇలాంటి సినిమాలు తీస్తారనే ముద్ర ఉంది. చాలా మంది అడుగుతుంటారు నన్ను.. మహిళలకు సంబంధించిన సినిమాలెందుకు తీయడం లేదని. కానీ మహిళల సినిమాలు మాత్రమే తీసి ప్రయోజనం ఉండదు... సెన్సిటివ్ మెన్ను తయారు చేయడం ప్రధానం అని నా అభిప్రాయం. మహిళలు తీసినంత మాత్రానా, మహిళల గురించి తీసినంత మాత్రాన అది మహిళల సినిమా అయిపోదు. అందులో మహిళలను ఏ విధంగా చిత్రీకరించామనేది కీలకం. సమాజంలో ఉన్న భిన్నత్వానికి ప్రాతినిధ్యం ఇచ్చారా? మహిళగా దర్శకత్వం వహించడం ఎలా ఉంది అని అడుగుతుంటారు... సినిమా తీసేటప్పుడు జెండర్ ఎప్పుడూ గుర్తుండదు... కేవలం సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా.. డైరెక్షన్ మాత్రమే గుర్తుంటుంది.
వేదిక ఏదైనా...
డైరెక్ట్ చేయడానికి, నటించడానికి నా దగ్గరకు చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అందులో కొన్ని చాలా బాగుంటున్నాయి. అవి ఒప్పుకోవడానికి ముందు నా మనసు చెప్పింది వింటాను. ఇప్పుడు నటన అంటే... నాకు హాలీడే లాంటిది. అన్నీ ఒకే అయ్యాక షాట్ కోసం మాత్రమే నటులు ముందుకొస్తారు. అప్పటిదాకా పక్కన ఉంటారు. నేను ఆ వైపున ఉండాల్సి ఉంటుంది. సినిమా తీయడానికి, సినిమాలో నటించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది కూడా ఎంజారు చేస్తాను. చూడాలి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో. వెబ్ సిరీస్ డైరెక్షన్కోసం చాలా ఆఫర్స్ వస్తున్నాయి. మంచి స్టోరీస్ కోసం చూస్తున్నాను. అది సినిమా, వెబ్ సిరీసా అని ఎప్పుడూ అనుకోను. కాకపోతే ఇప్పటికయితే ఏదీ అనుకోలేదు. ప్రస్తుతానికి ఒకటే లక్ష్యం... మంటోను సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేర్చడం.
మంటో గురించి మరింత...
మనకు నచ్చిన కథలను మనం చెప్పాలంటే దర్శకత్వం ఒక్కటే మార్గం.. లేకపోతే ఎప్పటికీ ఇతరుల కథల్లో పాత్రలుగా మిగిలిపోతాం. మొదటి సినిమా ఫిరాక్ అయినా, ఇప్పుడు మంటో అయినా. నన్ను వెంటాడిన వాస్తవాలు. 'మంటో' 1940ల్లో రాసిన కథలు నేటికీ సరిగ్గా సరిపోతాయి. ఆరోజుల్లోనే ఆయన భావ స్వేచ్ఛపై విపులంగా చర్చించారు. సమాజంలో మహిళల పాత్ర, సెక్స్ వర్కర్ల జీవితాలపై మంచి కథలు రాశారు. బాంబే, లాహౌర్ల్లో మంటో జీవించిన పదేళ్ల కాలం ఈ చిత్రానికి కథా నేపథ్యం. సినిమాకోసం లాహౌర్వెళ్లి మంటో ముగ్గురు కూతుళ్లను కలిశాను. ఏదో ఒక పుస్తకం ఆధారంగానో ఈ చిత్రాన్ని చేయడం లేదు. ఆయన గురించి మా రచయిత అలీ మిర్తో కలిసి మూడేండ్ల పాటు పరిశోధన చేశాను. దాని ఆధారంగా స్క్రిప్టును రెడీ చేసుకున్నా. ఆయన జీవితం చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది. సాదత్ పాత్రలో నవాజుద్దీన్, ఆయన భార్య పాత్రలో రసికా దుగల్ నటించారు. వీరితోపాటు రిషి కపూర్, పరేశ్ రావెల్, జావేద్ అక్తర్, రణవీర్ శోరి, దివ్య దత్తా తదితర నటీనటులు కూడా ఉన్నారు. వీళ్లెవరూ పైసా కూడా పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నారు. మంచి పాత్రలు దొరికితే ఆర్టిస్టులు పారితోషికం గురించి పట్టించుకోరని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ.''
- కట్ట కవిత