Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుస్తకాలతో సేదతీరిన ఆమె అక్షరాలతోనే ఆనందాన్ని అల్లుకున్నారు. రెండున్నర దశాబ్దాల పాటు లెక్కల టీచర్గా పనిచేసిన ఆమె లెక్కకు మించిన కవితలు రాసారు. టీచర్గా పిల్లల జీవితాలను స్పృశిస్తూ.. తనకు ఎదురైన సంఘటనలను ఇతివృత్తాలుగా మారుస్తూ రాసిన 'ఇస్కూలు కతలు' ఆమెలోని మనసున్న మ్యాథ్య్స్ టీచర్ను పరిచయం చేస్తాయి. ఆమే ప్రముఖ రచయిత శీలా సుభద్రాదేవి. ఆమె కథలు రాసినా.. కవిత్వం చెప్పినా అందులో సామాజి కాంశాలు తప్పక ఉంటాయి. సాహిత్యం సామాజిక పరిస్థితులను స్పృశించేలా, భావితరాల సృజనాత్మకతకు పదును పెట్టేలా ఉండాలని ఆశించే ఆమె మానవితో పంచుకున్న ముచ్చట్లు...
నాకు ఊహ తెలిసే నాటికే మా నాన్న మల్లికార్జున స్వామి జబ్బుతో ఉన్నారు. ఆయన వైద్యం కోసం అమ్మ రాజరాజేశ్వరమ్మ వంటి మీద నగలన్నీ కరిగిపోయాయి. అయినా ఆయన మాకు దక్కలేదు. నా పదో ఏట నాన్న చనిపోయారు. నాకు ఇద్దరు అన్నయ్యలు, అక్క. మా నలుగురు పిల్లలను పెంచడానికి అమ్మ ఎంతో కష్టపడ్డారు. ఏ కుటుంబంలోనైనా ఆర్థికఇబ్బందులు రాగానే మొదట చేసే పని ఆడపిల్లల చదువులు ఆపేయడం. మా ఇంట్లోనూ అదే జరిగింది. నా చదువు ఆగిపోయింది. పెద్ద అన్నయ్య జాబ్లో చేరిన తర్వాత పరిస్థితులు కాస్త కుదుటపడటంతో నేరుగా ఎనిమిదో తరగతిలో జాయిన్ చేసారు. అనుకోని అవాంతరాలతో మరోసారి చదువుకు బ్రేక్ పడింది. దాంతో మా అక్కయ్య పి. సరళాదేవి ఇంటికి చేరాను. అప్పటికే ఆమె విరివిగా కథలు రాస్తుండేది. వాళ్ళింట్లో మంచి గ్రంథాలయం కూడా ఉండేది. అక్కడ పుస్తకాలే మంచిచెడు చెప్పే గురువులు... బడికి పోలేదన్న నా బాధను పంచుకునే స్నేహితులు అయ్యాయి. శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు చదివాను. ఏడాది తర్వాత తిరిగి విజయనగరం వెళ్ళి బడిలో చేరాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా బియస్సీ పూర్తి చేసాను.
కలం స్నేహంతో మొదలై...
అక్కవాళ్ల ఇంట్లో కవి సమ్మేళనాలు జరిగేవి. గొప్పగొప్ప కవులు వచ్చేవారు. అలా ఎంతో మంచి సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. నాకు నచ్చిన రచయితలకు వారి రచనలపై అభిప్రాయాలు ఉత్తరాల ద్వారా చెప్పేదాన్ని. ఆ రోజుల్లోనే మా మేనత్తకొడుకు ప్రముఖ కవి , రచయిత, చిత్రకారుడు శీలావీర్రాజు సాహిత్యం చదివి దేవి పేరుతో ఉత్తరాలు రాసేదాన్ని. మొదట్లో ఆయన మా బంధువని తెలియదు. సాహిత్య పరమైన మా అభిరుచులు కలవడంతో మా మధ్య కొన్నిరోజులు కలం స్నేహం కొనసాగింది. తర్వాత ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో బహుభాషా కోవిదుడు రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభావివాహం చేసుకున్నాం.
ఆర్టీసీ స్కూల్లో టీచర్గా..
పెండ్లైన తర్వాత మా వారికి ఉద్యోగం రావడంలో హైదరాబాద్ వచ్చాం. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం చేయాలన్న ఆకాంక్ష ఎక్కువగా నాలో ఉండేది. పెండ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పెరిగాయి. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి మెంటల్లీ డిజార్డర్ కావడంతో కొన్ని ఏండ్లు బిజీగా ఉన్నాను. కాస్త తీరిక చేసుకుని ఎమ్మే తెలుగు, ఎమ్మెస్సీ మాథ్య్స్ పూర్తి చేశాను. మూడున్నర ఏండ్ల వయసులో బాబు చనిపోయాడు. అప్పటివరకు నన్ను అంటిపెట్టుకుని ఉండే బిడ్డ లేని లోటును తట్టుకోలేక పోయాను. మళ్లీ చదువే నన్ను ఊరడించింది. బీఇడీ చేసి ఆర్టీసీ ఎయిడెడ్ స్కూలులో లెక్కల టీచర్గా చేరాను. 25ఏండ్ల పాటు అక్కడే పనిచేసి ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసాను.
తొలి కథ..
చిన్నతనం నుంచి పుస్తకాలు నా నేస్తాలు. ఇంట్లో అందరూ సాహిత్యపిపాసులే. మా పెద్దన్నయ్య కొడవంటి లీలామోహనరావు 'భారతి'లో వ్యాసాలు రాసేవారు. నా కవితలు కొన్ని ఆంగ్లంలోకి ఆయనే అనువదించాడు. మా చిన్నన్నయ్య కొడవంటి కాశీ పతిరావు 1965 - 1985 మధ్య కాలంలో అన్ని పత్రికల్లో ఆయన కథలు వచ్చాయి. అక్క మంచి రచయితే. మాలతీచందూర్, పి.శ్రీదేవి, రామలక్ష్మి తదితరులకు ఆమె సమకాలీనురాలు. దాంతో ఇంట్లో ఉండే పుస్తకాలన్నీ చదివేదాన్ని. ' కురూపి' నవల చదివిన తర్వాత కథానాయిక అంటే అందంగానే ఉండాలా? అన్న ఆలోచనలో నుంచే వచ్చింది...నా మొదటి కథ 'పరాజిత'. 'పొలికేక' పత్రికలో అచ్చయింది.
కథ నుంచి కవిత వైపు..
హైదరాబాద్కు వచ్చిన తర్వాత మా ఆయనతో ముఖచిత్రాలు వేయించు కోవడానికి కవులెందరో మా ఇంటికి వచ్చేవారు. ఇంట్లో ఎక్కువగా కవితాసంపుటాలు ఉండటం, తరుచుగా కవితాగోష్టులు జరగటంతో కథాప్రక్రియ నుంచి కవిత్వ రచన వైపు ఆసక్తి పెరిగింది. ఇంట్లో పనులు చేస్తూనే వచ్చే భావాలను ఆ తర్వాత కాగితంపై పెట్టేదాన్ని. సమయం ఎక్కువగా లేకపోవడంతో కథలు రాయడం కన్నా కవితలు రాయడం, నా భావాలను వ్యక్తపరచడం సులభమనిపించింది. 1975 నుంచి కవితలు రాయడం ప్రారంభించాను. 'ఆకలినృత్యం' నా మొదటి కవిత. 'ఎక్స్రే' పత్రికలో అచ్చయింది. ఇప్పటివరకు నేను రాసిన కవితలన్నీ సంపుటాలుగా వచ్చాయి. 25ఏండ్ల స్కూలు టీచర్గా ఎదురైన అనుభవాలను, పిల్లల జీవితాలు ఇతివృత్తాలుగా 'ఇస్కూలు కతలు' రాసాను. కథల సంపుటాలతో పాటు కేంద్ర సాహిత్య అకాడెమి కోసం డాక్టర్ పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసాను. కొన్ని సామాజిక వ్యాసాలు, సాహిత్యవ్యాసాలు పుస్తకరూపంలో రానున్నాయి. నా కవితలూ, కథలూ ఆంగ్ల, హిందీ,తమిళ్, కన్నడ, మైథిలీ భాషలలో అనువదింపబడి ఆయా భాష పత్రికలలో ప్రచురితమయ్యాయి.
'ఇస్కూలు కతలు'లోని కథ ఒకటి మహారాష్త్ర ప్రభుత్వ పాఠశాలలలో ఏడవ తరగతి ద్వితీయభాష తెలుగువాచకం లో చేర్చారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీ విద్యార్ధులకు తెలుగు సిలబస్ లో నేను రాసిన కవిత చేర్చారు. నా రచనలపై మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్ డి పరిశోధనలు జరిగాయి.
సామాజిక స్పృహ అంటే కన్నీళ్ళూ, కష్టాలేనా..!
కథైనా, కవితైనా సామాజిక సమస్య ఉండి తీరాల్సిందే. సామాజిక స్ప హ అనగానే బడుగు బలహీన వర్గాల బాధలూ కన్నీళ్ళ గురించే అని చాలా మంది అపోహ. ఇది సరికాదు సమస్యలు రూపాంతరం చెందుతున్నాయి. సమస్యలు ఒక్కోస్థాయిలో ఒక్కో విధంగా ఉంటాయి. అమెరికా ఆప్ఘన్ యుద్ద నేపథ్యంలో రాసిన 'యుద్ధం ఒక గుండె కోత ' దీర్ఘకావ్యం యుద్ధం స్త్రీలను, తల్లులను ఎంత బాదపెడు తుందో అక్షరాల చెప్పాను. ఆర్తితో, ఆవేదనతో, ఆగ్రహంతో గుండెలోతుల్లో నుంచి ఒక మాతృహృదయంతో రాసిన రచన అది. దీనిని ఆంగ్లంలోకి డా.భార్గవీరావు, డా. జయలక్ష్మిగారు 'షaతీ a ష్ట్రవaత్ీర తీaఙవస్త్రవ' పేరుతో తీసుకురాగా... నిర్మలానంద వాత్సాయన్ 'యుద్ధ్ ఏక్ దిల్ కీ వ్యథ ' పేరుతో హిందీలో అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ దీర్ఘకవితపై ఎం.ఫిల్ చేసారు. అంతేకాదు ఆవంత్స సోమసుందర్గారు ప్రతి ఏటా దీర్ఘ కావ్య రచనకు ఇచ్చే కృష్ణశాస్రి పురస్కారాన్ని అందుకున్నాను.
ఆలోచనలకు సాన పెట్టాలి..
ప్రస్తుత ఆధునిక యుగంలో కవిత్వం రాసేవాళ్ల సంఖ్య పెరిగింది. కథలూ, నవలలు ఎక్కువగానే వస్తున్నాయి. పూర్వంలాగే సాహిత్యం రెండుగా పాపులర్ సాహిత్యం, సామాజిక సాహిత్యంగానే సాగుతోంది. అన్నీ రంగాల్లో మాదిరిగానే సాహిత్యంలోనూ కుల, మత, వర్గ, ప్రాంతాలుగా సాహితీవేత్తలు విడిపోయారు అనిపిస్తుంది. ఒకగ్రూపు వారి సాహిత్యం మరొక గ్రూపు చదవరు. దాంతో సాహితీ విమర్శకులు తగ్గిపోయారు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏది తోస్తే అది రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. రాసిన తర్వాత వారి రచనను వారే మరోసారి చదువుకోవడం లేదనిపిస్తుంది. నేటి యువత సమకాలీన సాహిత్యంతో పాటూ ముందు తరాల రచనలు చదివి తమ కవిహృదయానికి మెరుగులు దిద్దుకుంటే మంచిది.
- వి.యశోద