Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె మెడలో నల్లపూసల దండవేసి దేవదాసిగా మార్చినప్పుడు ఆమె వయసు ఏడేండ్లు. చేతికి పచ్చని గాజులు, పచ్చని చీర, మెట్టెలు... ఆడి పాడే వయసు వాటిని చూసి చాలా సంతోషిించింది. కానీ అక్కడ భరించరాని హింస. కానీ ఒక్కసారి అందులోకి వెళ్లాక ఉండే వివక్ష... బయటపడ్డా అది వదిలిపోదు. కొందరికి బయటపడటమెలాగో తెలియక.. బయటపడ్డా ఏం చేసి బతకాలన్న ఆలోచన లోక.. ఆ నరకకూపంలోనే మగ్గిపోతుంటారు. అలా ఆమె కూడా మగ్గిపోయింది. కానీ 1991లో కర్నాటక మహిళా సంక్షేమ శాఖ ఆమె జీవితంలోకి ఓ వెలుగు రేఖలా వచ్చింది. అప్పుడే 'అసలు మేం దేవదాసిలుగా ఎందుకు మారాలి' అన్న ప్రశ్న మొదలైంది ఆమెలో. 'మేం ఎందుకింత ఇబ్బందులు పడుతున్నాం' అని ఆలోచించింది. ఎవరి మీదో ఆధారపడి బతికేకంటే తమ బతుకు తాము బతకాలనుకున్నది. ఈమె 1997 సెప్టెంబర్లో మరికొందరితో కలిసి 'మహిళా అభివ ద్ధి మట్టు సంస్కరణ సంస్థే' - మాస్ను ఏర్పాటు చేసింది. నిజానికి మారాలనుకున్నప్పుడు వారిని ఎంతగానో వేధించారు. అనరాని మాటలన్నారు. కానీ తనలా మరెవ్వరూ బాధపడకూడదని భావించింది. అందుకే... సీతవ్వ, తను ఏర్పాటు చేసిన సంస్థ మొత్తం 4800 మంది దేవదాసిలను, వారి పిల్లలను ఈ ఉచ్చు నుండి కాపాడింది. దేవదాసిల పిల్లల కోసం ఉపకారవేతనాలను కూడా అందించిందా సంస్థ.
దేవదాసీ వ్యవస్థలో మగ్గిపోతున్న 4 వేల మంది మహిళలకు ఆశ్రయం కల్పించింది. దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు ఎన్నో అవగాహన సదస్సులు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. వారు ఆర్థికంగా ఎదిగేందుకు ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు ఇప్పించింది. దళితవాడల్లో బాలికలపట్ల మరణశాసనంగా మారిన దేవాదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు ఎంతో కృషి చేసింది సీతవ్వ. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. ''90 శాతం మంది దేవదాసిలు వేధింపులకు గురవుతుంటారు. కొంతమంది మీద అత్యాచారాలు కూడా జరిగాయి. ఆర్థిక అవసరాల రీత్యా వారితో వెళ్లమని తల్లిదండ్రులే చెబుతుంటారు. అలా దేవదాసి కుటుంబమంతా ఆమె సంపాదన మీదే ఆధారపడి బతుకుతుంది. అయితే ఇందులో అన్యాయానికి గురయ్యేది మాత్రం దేవదాసినే. బెల్గాంలో దేవదాసి వ్యవస్థ పూర్తిగా రద్దయినప్పటికీ, మేం చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళల అక్రమరవాణా... వీటన్నింటి పైనా మేం పని చేయాలనుకుంటున్నాం'' అని చెబుతుంది సీతవ్వ.