Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకమ్మ అంటేనే సరదాల పండుగ. ఈ పండుకకు వండే వంటలూ సరదాగానే ఉంటాయి. అన్నంతో రకరకాల వంటలు చేస్తారు. అందులో పులిహోర, దద్దోజనం, పరమాన్నం, నువ్వలన్న ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవి రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. ఈ బతుకమ్మకు సద్దులను కడుపారా ఆస్వాదించాలని మీకూ ఉందా. అయితే మరింకెందుకు ఆలస్యం ఈ బతుకమ్మకు రకరకాల సద్దులను మీరు ప్రయత్నించి చూడండీ...
పులిహోర
కావల్సిన పదార్థాలు: బియ్యం - ఒక కిలో, చింతపండు గుజ్జు - కప్పు, నూనె - పావు కప్పు, పల్లీలు - పావు కప్పు, శనగపప్పు - టీ స్పూను, మినపప్పు - టీ స్పూను, ఎండుమిర్చి - 6, నువ్వుల పొడి - టీస్పూన్లు, పసుపు టీ స్పూను, ఉప్పు - తగినంత, కరివేపాకు - 4 రెమ్మలు.
తయారు చేసే విధానం: చింతపండు వేడి నీళ్ళు పోసి నానబెట్టి కప్పు గుజ్జు తయారు చేసుకోవాలి. అన్నం ఉడికించి చల్లార్చాలి. బాణలిలో నూనె పోసి ఎండు మిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి. ఆ తరువాత పసుపు, చింతపండు, ఉప్పు వేసి దగ్గరపడే వరకూ ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఘుమఘుమలాడే పులిహోర రెడీ.
దద్దోజనం
కావల్సిన పదార్థాలు: మెత్తగా ఉడికించిన అన్నం - కప్పు, పెరుగు - కప్పు, పాలు - అర కప్పు, పోపు గింజలు - టేబుల్ స్పూన్, అల్లం - చిన్న ముక్క (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి - ఐదు(సన్నగా తరగాలి), కరివేపాకు - ఒక రెమ్మ, కొత్తిమీర - చిన్న కట్ట, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: స్టౌ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె పోసి వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. వేడయ్యాక పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాలు తర్వాత స్టౌ ఆపెయ్యాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని అందులో వేసి రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. కలిపిన తర్వాత పెరుగు పోసి బాగా కలపాలి. తర్వాత పాలు పోసి బాగా కలపాలి. చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నోరూరించే దద్దోజనం రెడీ.
బెల్లమన్నం
కావల్సిన పదార్థాలు: బియ్యం - కప్పు, పాలు - అర లీటరు, బెల్లం - కప్పు, చక్కెర - పావు కప్పు, ఏలకులు - 3, జీడిపప్పు - 2 టీ స్పూన్లు, కిస్మిస్లు - 2 టీ స్పూన్లు, నెయ్యి - 4 టీ స్పూన్లు.
తయారు చేసే విధానం: జీడిపప్పుని, కిస్మిస్లను విడివిడిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. యాలకులను పొడి చేసుకోవాలి. పాలు బాగా కాగిన తరువాత బియ్యం వేసి బాగా ఉడకనివ్వాలి. పూర్తిగా ఉడికాక బెల్లం, చక్కెర వేసి కొంచెం దగ్గర పడిన తరువాత దింపుకోవాలి. గార్నిషింగ్ కోసం ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పులను కిస్మిస్లను వేసి స్టౌ పై నుంచి దించేయాలి.
నువ్వల అన్నం
కావల్సిన పదార్థాలు: వండిన అన్నం - మూడు కప్పులు, తెల్ల నువ్వులు - రెండు టేబుల్ స్పూన్లు (వేయించినవి), నల్ల నవ్వులు - రెండు టేబుల్ స్పూన్లు(వేయించినవి), కరివేపాకు - నాలుగు రెమ్మలు, ఉల్లిగడ్డ - రెండు (మీడియం సైపువు), పచ్చిమిర్చి - నాలుగు, నూనె- రెండు టేబుల్ స్పూన్లు, రెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, మిరియాలు - అరటీ స్పూను.
తయారు చేసే విధానం: పాన్లో నూనె, టీ స్పూన్లు నెయ్యి వేయాలి. తరువాత ఆవాలు, శనగపప్పు వేసి వేయించాలి. ఉల్లి గడ్డ ముక్కలు, మచ్చిమిర్చి వేసి వేయించాలి. సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసి వేయించాలి. పసుపు, అన్నం వేసి కొద్దిగా వేయించాలి. పావుకప్పు నీళ్లు పోసి కలపాలి. ఉప్పు, వేయించిన తెలుపు, నలుపు నవ్వులు, నిమ్మరసం, కచ్చాపచ్చాగా నూరిన మిరియాలు వేసి కలపాలి. చివరగా మిగిలిన నెయ్యి వేసి కలిపి వేడిగా వడ్డించాలి.
కొబ్బరి అన్నం
కావల్సిన పదార్థాలు: కొబ్బరి చిప్పలు - రెండు, బియ్యం - అరకిలో, జీలకర్ర, ఆవాలు - రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి - 6, ఎండుమిర్చి - 4, అల్లం ముక్కలు - టేబుల్ స్పూన్, కరివేపాకు - రెండురబ్బలు, పల్లీలు - టేబుల్స్పూను, జీడిపప్పు - టేబుల్స్పూను, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - తగినంత.
కావల్సిన పదార్థాలు: ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. తరుతాత కొబ్బరి చిప్పలను తురుముకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అన్నం వేసి దానిలో కొంచెం ఉప్పు కలిపి బాగా కలియబెట్టాలి. దించే ముందు నిమ్మకాయ పిండుకుంటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది.