Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రమ్యారమణ.. ఒక తెలుగు అమ్మాయి. కవిత్వమే తన ఆయుధం. అమెరికాలో అందరు డాలర్లవేటలో పడితే తాను మాత్రం అక్షర చైతన్యాన్ని వెదజల్లుతుంది. అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచి సామాజిక సమస్యలు, మహిళల హక్కులు, చైతన్యశీల అంశాలను వస్తువులుగా చేసుకుని కవిత్వం రాయడం తన పనిగా భావిస్తున్నారు తమిళనాడుకు చెందిన రమ్యారమణ. ఆమె ప్రయాణంలోని కొన్ని అనుభవాలు...
మ్య తల్లిదండ్రులిద్దరిదీ తమిళనాడులోని రాజాపాలెయం. అమ్మ పేరు విద్య, నాన్న పిల్లయార్ రమణబాబు. తమిళనాడులో స్థిరపడిన తెలుగువాళ్లు. ప్రస్తుతం ఈ కుటుంబం మొత్తం న్యూయార్క్లో స్థిరపడింది. అయితే ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడుతారు. రమ్య రెండేళ్ల వయసులో తమిళనాడులోని రాజాపాలెయంలో అమ్మమ్మ దగ్గర పది నెలల పాటు ఉన్నారు. దాంతో తనపై అమ్మమ్మ ప్రభావం ఎంతో ఉంది. చిన్నప్పటి నుంచే కర్ణాటక సంగీతం, భరతనాట్యం నేర్చుకుంది.
జాతి వివక్ష...
న్యూయార్క్లో తెల్లవారు ఎక్కువగా ఉంటారు. వాళ్లలో కొందరు రమ్య రంగుచూసి, వ్యవహారశైలి చూసి గేలిచేసిన సందర్భాలు అనేకం. ఆమె అనుభవించింది ఒక రకంగా జాతివివక్ష. ఇంగ్లీష్ మాట్లాడితే.. తనను ఏడిపించరు అనుకునేది. కానీ వాళ్ల ప్రవర్తనలో కొంచెం కూడా మార్పు రాలేదు. చిన్నతనంలో ఎదుర్కొన్న జాతివివక్ష రమ్యను తీవ్రంగా కదిలించింది. పెరిగేకొద్ది అలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదు.. కానీ రమ్యలాగే మరికొందరు బాధితులు ఆ బాధ పడకూడదన్న నిర్ణయానికి వచ్చింది. ఆమెలో రగిలే ఆ కసి నుంచే కవిత్వం పుట్టింది. పెన్ను పట్టి కాగితం మీద రాయకుండా ఉండలేకపోయేది.
ఉచితంగా స్కాలర్షిప్...
మనసులోని భావాలను కవిత్వీకరించడం ఒక కళ. అయితే ఆ కళకు చక్కగా మలిచే శిల్పి కూడా అవసరం. అమెరికాలో పొయెట్రీ ప్రియులకు శిక్షణ అందించే సంస్థలు చాలా ఉన్నాయి. రమ్య కూడా అర్బన్ వర్డ్ న్యూయార్క్ సిటీ అనే సంస్థలో చేరింది. కవిత్వానికి మెరుగులు దిద్దుకునే అవకాశం దీంతో లభించింది. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మన భారతీయుల్లో చాలామంది అమెరికాకు వచ్చాక రకరకాల కెరీర్లను ఎంచుకుంటుంటారు. కానీ తాను మాత్రం కవిత్వాన్నే కెరీర్గా మలుచుకున్న భిన్నమైన వ్యక్తి. 'నిక్స్ పొయెట్రీ స్లామ్ ప్రోగ్రామ్' లో పాల్గొన్నందుకు చదువుకు అవసరమయ్యే స్కాలర్షిప్ మొత్తాన్ని అందించింది ఆ సంస్థ. ప్రస్తుతం ఈమె న్యూయార్క్లోని సెయింట్ జాన్స్ యూనివర్శిటీలో ఫిలాసఫీ, గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ చదువుతున్నారు.
న్యూయార్క్ ఆస్థాన కవయిత్రిగా
జాతివివక్ష, విమర్శలకు చలించిపోయింది. ఆ ఆవేదనకు కవితారూపాన్నిచ్చి 'యూత పొయెట్ లారెట్' (వైపిఎల్) పోటీల్లో తన కవిత్వాన్ని వినిపించింది. ఆ కవిత న్యాయనిర్ణేతల మనసును గెలుచుకుంది. 'శరీరవర్ణం వేరయినంత మాత్రాన అన్ని అర్హతలు ఉండి అందాల కిరీటాన్ని గెలుచుకున్న నీనాకు సైతం జాతి వివక్ష ఎదురవ్వడం అవమానకరం. అది అమెరికాలో వేళ్లూనుకున్న జాతి వివక్షకు నిదర్శనం' అన్న అర్థంతో సాగింది ఆమె కవిత్వం. ఆ నేపథ్యంలోనే న్యూయార్క్ యువ ఆస్థాన కవయిత్రిగా ఎంపికయ్యారు. ఆ గౌరవం దక్కిన తొలి భారతీయురాలు రమ్య కావడం గర్వకారణం. న్యూయార్క్ ఆస్థాన కవయిత్రిగా పలు వేదికల మీద కవిత్వాన్ని చదవడం, ప్రదర్శనలు నిర్వహించడం చేసింది. ఆ సమయంలో తాను రాసిన కవితలు 'డోంట్ డ్రౌన్ హర్ ఇన్ ద బాప్టిజమ్' పేరుతో అచ్చయ్యాయి. త్వరలో తాను స్వయంగా కవితాగానం చేసిన ఒక ఆల్బమ్ను కూడా విడుదల చేయబోతున్నారు.
విస్తరిస్తున్న చెతైన్యం...
సమయం దొరికితే అమెరికాలోని పాఠశాలలకు వెళ్లి.. పిల్లలకు కవిత్వం గురించి, స్త్రీల సాధికారత, జాతి వివక్ష, మానవహక్కుల గురించి బోధిస్తున్నారు. ఇది తెలిసిన పలు దేశాలు తమ విద్యార్థులలోను అలాంటి కవితాచైతన్యం తీసుకొచ్చేందుకు రమ్యను ఆహ్వానిస్తున్నారు. ఏ దేశంలో అయినా సమస్యలు ఒక్కటే. ముఖ్యంగా స్త్రీలు ఎదుర్కొంటున్న గృహహింస. అందుకే రమ్య వివిధ దేశాలకు వెళ్లినప్పుడు బాధితులు తనకు దగ్గరవుతున్నారు. స్త్రీ హక్కులకు భంగం కలిగించేలా, వారి స్వేచ్ఛకు హాని కలిగేలా ఏ ఒక్కరు మాట్లాడినా తట్టుకోలేకపోతున్నారు మహిళాలోకం. ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా అదే చైతన్యం విస్తరిస్తుంది. వివిధ దేశాల్లోని చాలామంది మహిళలు జాతి వివక్షకు, సాధికారతకు, మానవహక్కుల కోసం చేస్తున్నా పోరాటంలో కవిత్వం కూడా ఒక ఆయుధమని నిరూపించారు రమ్యారమణ.