Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''30 ఏండ్లు దాటితే మోకాళ్ళ నొప్పులు... 40 ఏండ్లు దాటితే బీపీలు, షుగర్లు... 60 ఏండ్లు నిండితే అబ్బా ఇంకేం పని చేస్తాం.. రిటైర్ అయ్యాము కదా ఇక విశ్రాంతి తీసుకుందాం'' అని చాలామంది అనుకునే రోజులివి. కానీ సావిత్రి(చిట్టెమ్మ) అలా కాదు. ఆమె రిటైరయి 20 ఏండ్లు దాటిపోయింది. అయినా నవయువతిలా చలాకీగా ఉంటున్నారు. 63 ఏండ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ ''నిరంతర శ్రమే నా ఆరోగ్య రహస్యం'' అంటున్న ఆమె మానవితో పంచుకున్న మరికొన్ని విశేషాలు...
మాది కృష్ణాజిల్లా. నాన్న పేరు వెంకటాద్రి, అమ్మ సౌభాగ్యమ్మ. నాకు నలుగురు అన్నయ్యలు. ఒక అక్కలు. మా పెద్ద అన్నయ్యలు సత్యన్నారాయణ, కృష్ణమూర్తి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసేవారు. వాళ్ళు చదువుకునే రోజుల్లో చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్యల ఉపన్యాసాలు విని కమ్యూనిస్టు అభిమానులయ్యారు. మా అక్క కూడా తమ్ముళ్ళను చూసి కమ్యూనిస్టు అయ్యింది. కుటుంబం మొత్తాన్ని కమ్యూనిస్టులుగా మార్చేశారు. నేనైతే అన్నయ్యలు తెచ్చిన పుస్తకాలు బాగా చదివేదాన్ని. అయితే మా నాన్నకు మాత్రం అస్సలు నచ్చేది కాదు. చేతికందొచ్చిన కొడుకులు ఉద్యమాలంటూ ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నారని కోప్పడేవారు. పెద్ద భూస్వామి కాకపోయినా అవే భావాలు ఉండేవి. నాన్నకు భయపడి అన్నయ్యలు చాలా రోజులు అస్సలు ఇంటికే రాలేదు. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇలా దూరంగా ఉండడం మంచిది కాదని చండ్ర రాజేశ్వరరావు గారు నచ్చజెప్పి ఇంటికి పంపేవారు.
ఆడవాళ్ళు వంట చేసే పని లేదు
నా చిన్నతనంలో విజయవాడలో ప్రజాశక్తి పేరుతో ఓ కాలనీ కట్టారు. ఆ కాలనీలోనే మాకూ ఓ ఇల్లు ఇచ్చారు. సుందరయ్యగారు, లీలావతిగారు కూడా అక్కడే ఉండేవారు. లీలగారు మాతో చాలా క్లోజ్గా ఉండేవారు. నాకు చదువుకోవాలని బాగా ఉండేది. ''మీ చెల్లి బాగా చదువుతుంది మంచిగా చదివించండీ'' అని లీలావతిగారు అన్నయ్యలకు చెబుతుండేవారు. అక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఎవరి పని వాళ్ళే చేసుకు నేవారు. ఆడా మగా అంటూ తేడా ఉండేది కాదు. ఆడవాళ్ళను వంట చేయనిచ్చేవారు కాదు. కమ్యూన్లు ఉండేవి. అక్కడే అందరికీ వంటలు చేసేవారు. అందరూ అక్కడే తినేవాళ్ళు. మగవాళ్ళు కూడా ఎవరి పనులు వాళ్ళే చేసుకునేవారు. మా నాన్నకు ఇదంతా నచ్చేది కాదు.
టీచర్ ట్రైనింగ్...
మోటూరు ఉదయం, హనుమాయమ్మ, మానికొండ సూర్యావతి గారి స్ఫూర్తితో మా అక్క మహిళా సంఘంలో చురుగ్గా పనిచేసేది. మా బంధువులతనికి ఇచ్చి అక్కకు పెండ్లి చేశారు. పెండ్లి తర్వాత కూడా పార్టీలో పని చేసింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా కమ్యూనిస్టు అభిమానులుగా ఉన్నారు. నేను విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్ వరకు చదివాను. ఆర్థిక సమస్యల వల్ల ఇక చదవలేకపోయాను. టీచర్ ట్రైనింగ్ చేసి 1955లో టీచర్గా కొన్నాళ్ళు పనిచేశాను. ఆ తర్వాత మా బంధువుల వ్యక్తినే ప్రేమించి పెండ్లి చేసుకున్నాను. ఆయనకు ఎల్ఐసీలో ఉద్యోగం. పెండ్లి తర్వాత హైదరాబాద్ వచ్చేశాను..
ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు
హైదరాబాద్ వచ్చాక ప్లానింగ్ డిపార్ట్మెంట్లో చేరాను. అప్పుడు ఇక్కడ నైజాం ప్రభుత్వం ఉండేది. మెదక్ జిల్లాలో ఓ వెనుకబడిన ప్రాంతంలో నా పని. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వచ్చేది. ఇబ్బందిగా ఉండడంతో ఆ జాబ్ మానేశాను. రెండో బాబు పుట్టిన తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఎంప్లారుమెంట్ ఆఫీస్లో రిజిష్టర్ చేసుకున్నాను. టీచర్ ట్రైనింగ్ చేసి ఉన్నాను కాబట్టి టీచింగ్ పట్ల ఆసక్తి బాగా ఉండేది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారి హోమ్స్లో టీచింగ్ జాబ్ వచ్చింది. అక్కడ ఉండే వితంతువులు, భర్తలు వదిలేసిన ఒంటరి మహిళలు, అనాథలకు అక్షరాలు నేర్పేదాన్ని. అప్పటికే రెండు సార్లు ఉద్యోగానికి రాజీ నామా చేశాను. ఎలాగైనా ఈ జాబ్ను పట్టుదలతో చేయాలని నిర్ణయించుకున్నా. 1963లో చేరి 1994లో రిటైర్ అయ్యే వరకు చేశాను.
రిటైర్ అయిన తర్వాత
పార్టీలో యాక్టివ్గా పని చేయకపోయినా ఆ భావజాలం మాత్రం ఉండేది. రిటైర్ అయిన తర్వాత ఓ ఏడాది ఇంట్లోనే ఉన్నాను. 24 గంటలూ ఇంటి పనులకే సరిపోయేది. ఇలా ఇంటి పనులకే పరిమితం కావడం నచ్చలేదు. అప్పట్లో తెలిసిన వాళ్ళు నడిపే ''అన్నపూర్ణమ్మ మానవ సంక్షేమ సమితి'' అనే సంస్థ వుండేది. దీని ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పాతబస్తీలో చదువు మధ్యలోనే ఆపేసిన పిల్లల్ని సేకరించాలి. వారికి కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి మళ్లీ స్కూల్లో చేర్పించాలి. అలా ఐదేండ్లు పని చేశాను. అయితే ఇది చాలా కష్టంగా ఉండేది. పిల్లలు బడికి రావడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. అసలు వాళ్ళకు రావడానికి సమయం ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరూ పనికి పోయేవారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని ఆడించడం, రేషన్, కిరోసిన్ షాపులకు వెళ్ళి లైన్లో నిలబడడం లాంటి పనులన్నీ వీళ్ళే చూసుకునేవారు. 50 మందిని గుర్తిస్తే సరిగ్గా 10 మంది కూడా ట్రైనింగ్కి వచ్చే వారు కాదు.
ఆర్థిక సమస్యలతో...
మావారు రిటైర్ అయిన తర్వాత సినిమా డిస్ట్రిబ్యూటర్గా చేశారు. దాంతో నష్టాలు బాగా వచ్చాయి. మా పెన్షన్స్ మొత్తం అయిపోయాయి. ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాం. అప్పులు బాగా అయ్యాయి. మాకు తెలిసిన వాళ్ళ పాపను చూసుకోడానికి మూడేండ్లు చికాగో వెళ్ళాను. మా పిల్లలు వద్దని చాలా గోల చేశారు. కానీ ఆయనకు ఎలాగైనా సహకరించాలనే ఉద్దేశంతో వెళ్ళాను. అక్కడ మొదట్లో 300 డాలర్లు ఇచ్చేవారు. తర్వాత 500 డాలర్లు పెంచారు. ఇంకా ఉండమని అడిగారు కానీ నేనే వచ్చేశాను.
సీఆర్ ఫౌండేషన్కి...
చికాగో నుంచి వచ్చిన తర్వాత ఏం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఓసారి మా రెండో అన్నయ్య కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళారు. అక్కడకు పరుచూరి హనుమంతరావుగారు వచ్చారు. ఆయన ''చిట్టెమ్మా... సీఆర్ పేరుతో ఓ ఫౌండేషన్ ప్రారంభించబోతున్నాం. అక్కడ నువ్వు పని చేయాలి'' అన్నారు. మా వారికి ఇష్టం లేదు. కానీ హనుమంతరావుగారు పట్టుబట్టారు. దాంతో ఆరు నెలలు మాత్రమే ఉంటానని చెప్పి వెళ్ళాను. కానీ పదకొండేండ్లు సీఆర్ ఫౌండేషన్లో పనిచేశాను.
వెళ్ళ కూడదనుకుంటే...
ప్రస్తుతం విజయ హోమ్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓల్డేజ్ హోంలో మేనేజర్గా పని చేస్తున్నా. సీఆర్ ఫౌండేషన్లో మానేసిన తర్వాత మా పిల్లలు ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతావని గొడవ చేశారు. దాంతో అక్కడ మానేసి కొంత కాలం ఖాళీగా ఉన్నాను. సీఆర్ ఫౌండేషన్లో పనిచేశానని తెలిసి విజయ హోమ్స్ స్థాపించిన డాక్టర్ విజయలక్ష్మి గారు వచ్చి అడిగారు. కానీ మొదట్లో ఒప్పుకోలేదు. కానీ ఆమె స్వయంగా మూడు సార్లు మా ఇంటికి వచ్చారు. మీరు కచ్చితంగా ఉండాలి అని చెప్పి ఇక్కడకు తీసుకువచ్చారు. 2015లో దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. నిరంతరం శ్రమించడం, ఏదో ఒక పనిలో లీనమయితే ఆరోగ్యంగా ఉంటాం. అందుకే రిటైర్మెంట్తో నిమిత్తం లేకుండా మనకు ఇష్టమైన పనులు చేస్తుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడికి వచ్చే ఆడవాళ్ళకు అదే చెబుతుంటాను.
తప్పని పరిస్థితుల్లో
చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండడమంటే చిన్నతనంగా అనుకుంటారు. పిల్లలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటారు. గతంలో అంటే కుటుంబ సభ్యులందరూ ఒకే దగ్గర ఉండేవారు పెద్దవాళ్లను చూసుకునేవారు. కానీ ఇప్పుడు కెరీర్ కోసం పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. దేశం కాని దేశం పోతున్నారు. వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడం కరెక్టుకాదు. కాబట్టి ఇలాంటి చోట ఉంటే పెద్దవాళ్ళకు ఒంటరితనం అనేది ఉండదు. నా వరకు నేనైతే అలాగే భావిస్తాను.
ఆరోగ్య రహస్యాలు
మన మెదడు ఏం అనుకుంటే మనసూ, శరీరం కూడా అదే అనుకుంటాయి. ఖాళీగా ఉన్న మనసుకు పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఏదో ఒక పని చేస్తుంటే సమస్యలన్నీ మర్చిపోతాం. కాబట్టి నిరంతరం పనిలో ఉండాలి. నాకు ఇప్పుడు 82 ఏండ్లు. ఇప్పటి వరకు షుగర్ లేదు. అన్నీ తింటాను, కానీ మితంగా తీసుకుంటాను. తిండి విషయంలో మాత్రం కచ్చితంగా ఉంటాను. సమయానికి తినడం, నిద్రపోవడం, ఎంత నీరసంగా అనిపించినా రోజూ 15 నిమిషాలైనా నడవడం ఇవే నా ఆరోగ్య రహస్యాలు.
సలీమ