Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు పచ్చదనంతో స్వచ్ఛ వాతావరణం నిండివున్న మన ప్రపంచం కాలక్రమంలో కాలుష్యంతో నిండిపోతున్నది. కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం చెట్లను నరకడం ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు ప్రముఖులు... చెట్ల పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. అలాంటివారిలో వందన శివ ఒకరు. ఈమె పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యవసాయం, ఆహార లక్షణాల అలవాట్లో మార్పు తెచ్చేందుకు ఎంతో కృషి చేశారు.
శివ 1952 నవంబర్ 5వ తేదీన డెహ్రాడూన్లో జన్మించారు. ఈమె తండ్రి అటవీ సంరక్షుడు. తల్లి ప్రకృతి ప్రేమికురాలు. నైనిటాల్లోని సెయింట్ మేరీ స్కూల్లో, డెహ్రాడూన్లోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో శివ విద్యను అభ్యసించింది. 1972లో భౌతికశాస్త్రంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు. 'చేంజెస్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ పీరియాడిసిటీ ఆఫ్ లైట్' అనే పరిశోధనా వ్యాసంతో (అంటారియో, కెనడా) గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో 1974లో ఎం.ఏ పూర్తి చేశారు.
విద్యాభ్యాసం
1979లో ఆమె 'హిడెన్ వేరియబుల్స్ అండ్ లోకాలిటి ఇన్ క్వాంటం థిరీ' అనే అంశంపై తన పి.హెచ్.డి పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియో నుండి పట్టా పొందారు. అనంతరం బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్లలో విజ్ఞాన, సాంకేతికశాస్త్రము, పర్యావరణ పాలసీలపై బహుళశాస్త్ర పరిశోధనకు వెళ్ళారు.
రచయితగా
ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆన్ గ్లోబలైజేషన్ అనే సంస్థలో బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. అల్టర్ గ్లోబలైజేషన్ అనే పుస్తకాన్ని రచించి గుర్తింపును పొందారు. సుమారు 20 పుస్తకాల వరకు రచించారు. అలాగే సైటిఫిక్ కమిటీలో సభ్యురాలిగా కూడా పని చేశారు. వ్యవసాయం, ఆహార లక్షణాలు అలవాట్లో మార్పుకోసం ఈమె ఎంతో పోరాడారు. మేధో సంపత్తి హక్కులు, జీవ వైవిధ్యం, జీవ సాంకేతిక విజ్ఞానము, జీవ నీతి, జన్యు ఇంజినీరింగ్ మొదలైన క్షేత్రాలలో శివ మేధో సంపత్తితో, ప్రచారోద్యమాల్లో పాల్గొన్నారు.
ఎన్నో సంస్థల్లో...
1982లో నవ్దన్య ఏర్పాటుకు దారితీసిన వైజ్ఞానిక, సాంకేతిక, జీవావరణ శాస్త్రాల పరిశోధనా సంస్థను ఆమె స్థాపించారు. మూడవ ప్రపంచపు మహిళల సామర్ధ్యాలను పునర్నిర్వచించటానికి ఆమె వ్రాసిన పుస్తకం 'స్టేయింగ్ అలైవ్' దోహదపడింది. ప్రపంచీకరణపై అంతర్జాతీయ వేదిక, మహిళల పర్యావరణ, అభివృద్ధి సంస్థ, థర్డ్ వరల్డ్ నెట్వర్క్ వంటి ప్రభుత్వేతర సంస్థలతోపాటు భారత ప్రభుత్వ, విదేశీ ప్రభుత్వాలకు సలహాదారుగా ఈమె సేవలందించింది. సంరక్షణా, జీవావరణలలో, ఆహార భద్రతలపై అద్భుతమైన సేవలు అందించి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు. ఈమె అందించిన సేవలకు ఎన్నో అవార్డులు కూడా లభించాయి.1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డ్, అల్ట్మెటివ్ నోబుల్ ఫ్రైజ్ అందుకున్నారు.
మహిళలకు ప్రాధాన్యం ఇస్తేనే
పర్యావరణ, స్త్రీవాద ఉద్యమాల్లో ఈమె ముఖ్య పాత్రను పోషించారు. ఆమె వ్రాసిన వ్యాసం 'ఎంపవరింగ్ ఉమెన్' ద్వారా వ్యవసాయంలో మహిళల ప్రాధాన్యం గురించి గట్టిగా వాదించారు. వ్యవసాయ పద్ధతులలో మహిళలను సమ్మిళితం చేసి సాధికారిత కేంద్రీకృతం ద్వారా భారత, ప్రపంచ ఆహార భద్రతకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.