Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దసరా అంటేనే ఘుమఘుమల మేళవింపు. వేడివేడి గారెలు, నాటుకోడి పులుసు కాంబినేషన్ ఇష్టపడని వారుండరు. పెసర, బొబ్బెర, మొక్కజొన్న, పాలక్ చికెన్ ఇలా గారెలు ఏవైనా సరే నాటుకోడి పులుసుతో తింటే ఆహా అనాల్సిందే..! వీటన్నింటినీ చేసుకోవడం ఎలాగో తెలుసుకొందాం.
నాటుకోడి పులుసు
కావలసిన పదార్థాలు: నాటుకోడి మాంసం - 1 కేజీ, ఉల్లిపాయలు - పెద్దవి నాలుగు, అల్లం వెల్లుల్లి ముద్ద - మూడు చెంచాలు, నూనె - ఆరు చెంచాలు, నిమ్మరసం - మూడు చెంచాలు, పెరుగు - అర కప్పు, ఎండుకొబ్బరిముక్కలు - 3 చెంచాలు, పచ్చి మిర్చి తరుగు - పావు కప్పు, గసగసాలు - 50గ్రాములు, ధనియాలపొడి - 2 చెంచాలు,
జీలకర్ర పొడి - 1 చెంచా, గరం మసాలాపొడి - 2 చెంచాలు, దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క, కొత్తిమీర తరుగు - పావుకప్పు, పసుపు - అర చెంచా, ఉప్పు, కారం - రుచికి సరిపడా
తయారుచేసేవిధానం: ముందుగా నాటుకోడి మాంసాన్ని బాగా కడిగి నీళ్ళు పూర్తిగా పోయేవరకు చిల్లులగిన్నెలో ఉంచాలి. ఆ తర్వాత దీనికి కొద్దిగా ఉప్పు, కారం, ఒక చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు, కొంచం పసుపు, నిమ్మరసం వేసి కలిపి గిన్నె మూతపెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి. స్టౌవ్ మీద కుక్కర్ పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత కలిపి పెట్టుకొన్న చికెన్ వేయాలి. ఐదు నిమిషాలు పాటు ఎక్కువ సెగమీద పెట్టాలి. ఆ తర్వాత గరిటెతో కలపాలి. చిన్న గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టాలి. ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్ చల్లారేలోగా గ్రేవీ తయారు చేసుకోవాలి.
గ్రేవీ కోసం: కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎండుకొబ్బరి, గసగసాలను కలిపి మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిముద్దకూడా వేసి దోరగా వేయించాలి. ఉల్లిముద్ద సగానికి పైగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, పచ్చిమిర్చిముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేయాలి. గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. అందులో ఎండుకొబ్బరి, గసగసాల ముద్దను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా వేగి నూనె పైకి వస్తుంది. అప్పుడు రుచికిసరిపడ ఉప్పు, కారం, ధనియాలపొడి, జీర పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో అర కప్పు నీళ్ళు పోసి గ్రేవీ వచ్చేలా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత కుక్కర్లో ఉడికించిన నాటుకోడిమాంసం వేసి కలపాలి. ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మిగిలిన కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక పదినిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా పొడి వేసి కలిపి రెండు నిమిషాలు ఉడికించుకొని దించితే ఘుమఘుమలాడే నాటుకోడి పులుసు రెడీ అయినట్లే. గారెల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది.
మొక్కజొన్న గారెలు..
కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు - పావు కేజీ, ఎండుమిర్చి - 10, పచ్చిమిర్చి - 10, తరిగిన క్యాప్సికమ్ - పావు కప్పు, తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు, తరిగిన కొత్తిమీర - అర కప్పు, జీలకర్ర - ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు - 5, నూనె - వేయించడానికి సరిపడా, ఉప్పు - తగినంత
తయారుచేసేవిధానం: మొక్కజొన్నగింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు అన్ని కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండికి తరిగిన క్యాప్సికమ్, కొత్తిమీర, జిలకర్ర వేసి బాగా కలపాలి. స్టౌవ్పై బాణలిలో నూనె కాగిన తర్వాత గారెలు వేయాలి. వేడివేడిగా నాటుకోడిపులుసుతో భలేగా ఉంటాయి.
పెసర గారెలు
కావలసిన పదార్థాలు: పెసలు - పావు కేజీ, మినపప్పు - 50గ్రాములు, పచ్చిమిర్చి - పది, అల్లం - చిన్నముక్క, జీలకర్ర - టీ స్పూన్, ఉప్పు - తగినంత, తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు - కప్పు, నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసేవిధానం : పెసలు, మినపప్పు నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి. ఆ తరవాత నీళ్లు పూర్తిగా వంపేసి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీన, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. స్టౌవ్పై కడాయి బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని గారెలగా వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. నాటుకోడి పులుసు కాంబినేషన్తో ఎంతో రుచిగా ఉంటాయి.
బొబ్బెర్ల గారెలు..
కావలసిన పదార్థాలు: నానపెట్టిన బొబ్బర్లు - పావు కిలో, మిపపప్పు - 50గ్రాములు, పచ్చిమిర్చి - పది, ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు, జీలకర్ర - ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర, కరివేపాకు - పాపు కప్పు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసేవిధానం : బొబ్బర్లు, మినపప్పు నాలుగు గంటల పాటు నానపెట్టిన తర్వాత నీళ్లు పూర్తిగా వంపేసి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. స్టౌవ్పై కడాయి బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని గారెలుగా వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.
పెసరపప్పు పాయసం.
కమ్మని రుచి.. సువాసనతో తింటుంటే తినాలిపిస్తాయి పెసల వంటకాలు. గారెలే కాదు పాయసం కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఈజీగా.. త్వరగా తయారయ్యే పెసరపప్పు పాయసం చేసుకుని చిన్నా పెద్దా అందరూ పండగపూట కలిసి రుచులను ఆస్వాదించండి.
కావలసిన పదార్థాలు :పెసరపప్పు - ఒక కప్పు, బెల్లం - ఒక కప్పు, పాలు - అరలీటరు, కొబ్బరి - అరకప్పు, యాలకులు -4, కిస్ మిస్ -10, జీడిపప్పు - 10, నెయ్యి -4 స్పూన్లు
తయారుచేసేవిధానం : ముందుగా పెసరపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ లు వేయించుకోవాలి. స్టౌప్పై గిన్నె లో పాలు పోసి వేడి అయ్యాక అందులో పెసరపప్పు వేయాలి.కాస్త మెత్తగా
ఉడికిన తర్వాత బెల్లం తురుము కలపాలి. బెల్లం కరిగి.. పాయసం చిక్కబడే ముందు కొబ్బరి తురుము కలిపి కాసేపు మరగనివ్వాలి. తర్వాత యాలకుల పొడి కలపాలి. స్టవ్ కట్టేసి ముందు వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ కలిపి.. వేడి వేడిగా తింటే కమ్మగా ఉంటుంది.