Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలయ ప్రవేశమైనా... మరేదైనా... కోర్టు తీర్పు శిరోధార్యం! ఆ తీర్పును ఒకచోట స్వాగతించి... మరోచోట వ్యతిరేకించడమంటే కచ్చితంగా ద్వంద్వ వైఖరిని అవలంబించడమే! శనిసింగనాపూర్, మహాలక్ష్మి దేవాలయం, త్రయంబకేశ్వరాలయం గుళ్లలోకి మహిళల ప్రవేశంపై బొంబాయి హై కోర్ట్ తీర్పును స్వాగతించిన శ్రేణులు... ఇప్పుడు శబరిమల విషయంలో మాత్రం సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నాయి. ఆలయంలోకి ప్రవేశించ ప్రయత్నించిన మహిళలపైన దాడులు చేస్తున్నాయి. అక్కడ బీజేపీ అధికారంలో ఉండటం.. ఇక్కడ వామపక్ష ప్రభుత్వందే అధికారం కావడం. అందులో భాగమే... రిపోర్టింగ్ కోసం శబరిమలకు వెళ్లిన జర్నలిస్టు జక్కల కవితపై దాడి. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వందల కిలోమీటర్ల ప్రయాణం.. ఐదు కిలోమీటర్ల కాలినడకతో సాహసం చేసిందామె. వందల ఏళ్లుగా మహిళకు ప్రవేశం లేని చోట అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. అయినా ఆలయ గర్భగుడి వరకు వెళ్లకుండా వందమీటర్ల దూరం నుంచే వెనుదిరగాల్సిన పరిస్థితికి కారణమేంటి? అసలు శబరిమలలో ఏం జరుగుతోంది?
శబరిమల వెళ్లాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు?
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లొచ్చన్న సుప్రీం ఆదేశాలు వచ్చాయి. ఆ ఆదేశాల తరువాత మొట్టమొదటిసారి ఆలయాన్ని తెరుస్తున్నారు. కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుందో... వివరాలను తెలుగు ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో కవరేజ్కోసం నన్ను అక్కడికి పంపించారు. నేను రిపోర్టింగ్ కోసమే అక్కడికి వెళ్లాను.
రిపోర్టింగ్కు మాత్రమే వెళ్లినవాళ్లు... ఆలయ ప్రవేశం చేయాలన్న ఆలోచనలకు బీజం ఎలా పడింది?
న్యూస్ ప్రజెంటర్గా నేను, ఒక రిపోర్టర్, ఇద్దరు కెమెరామెన్ల టీమ్ అక్కడికి వెళ్లాం. మొదటిరోజు శబరిమలకు 50కిలోమీటర్ల దూరంలోనే ఆర్ఎస్ఎస్, శివసేన, బీజేపికి చెందిన మహిళలు నన్ను ఆపేశారు. జర్నలిస్టు అయినా మహిళనన్న కారణంతో నన్ను లోపలకు ముందుకు అడుగుపెట్టనివ్వలేదు. ఇక్కడే ఉంటే ప్రాణాలతో ఉండవు అని బెదిరించారు. ఆర్ఎస్ఎస్ మహిళలు కూడా పిలిచి బెదిరించారు. ఆలయంలోకి వెళ్లాలనుకుంటున్న మహిళలకు, ఆందోళనకారులకు మధ్య గొడవ జరుగుతున్నది. గందరగోళంగా ఉంది. ఆందోళనకారులపైన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మీడియాను కూడా ముందుకు వెళ్లనివ్వడం లేదు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది... తిరిగి వద్దామని వెహికిల్ ఎక్కాక మా వెహికిల్ను కూడా ఫాలో అయ్యారు. అక్కడినుంచైనా లైవ్ ఇద్దామని ప్రయత్నిస్తే.. అక్కడికి వచ్చి బెదిరించారు. నేను ఆలయ ప్రవేశానికి రాలేదు... రిపోర్టింగ్ కోసం వచ్చాను. అయినా నన్ను అడ్డుకుంటున్నారు. అసలు నేను ఎందుకు వెళ్లకూడదు? ఒక అమ్మాయి వెళ్తానంటే దాడికి ఎందుకు తెగబడుతున్నారు? ఈ గందరగోళంలోనే రాత్రయిపోయింది. తెల్లారి ఓవైపు బీజేపీ బంద్ప్రకటించింది. పోలీసులు144 సెక్షన్ విధించారు. దాంతో మా వెహికిల్ డ్రైవర్ రాలేనన్నాడు. ముందు రోజు ఘటనలతో... మాకు ప్రొటెక్షన్ కావాలని పోలీసులను అడిగాం. మా జిల్లా పరిధి వరకే ఇవ్వగలమని చెప్పి... 17 కిలోమీటర్లు తీసుకెళ్లి ఆపేశారు. వేరే జిల్లా పోలీసులు రక్షణ ఇస్తారని చెప్పారు. రోడ్డు మధ్యలో అడవిలో వదిలేస్తే... ఎలా? వాహనం కూడా లేదంటే... ఓ కంట్రోల్ రూమ్ వరకు తీసుకెళ్లారు. అర్ధంటలో పంబ పోలీసులు వస్తారని చెప్పారు. నాలుగు గంటలైనా రాలేదు. పోలీసులను అడిగితే మాట్లాడటానికి కూడా ఆసక్తి కూడా చూపించడం లేదు. 100కి డయల్ చేస్తే... సీఐ నెంబర్ ఇచ్చారు. ఆయనా మాకు రక్షణ ఇవ్వలేమని చేతులెత్తేశారు. బంద్ కాబట్టి ప్రభుత్వ వాహనాలు లేవు.. మహిళను ఉన్నాను కాబట్టి ప్రయివేటు వాహనాలు ఎక్కించుకోవడం లేదు.
అంతటి సంఘర్షణ వాతావరణంలో మీకు ముందుకే వెళ్లాలని ఎందుకనిపించింది?
మీడియా పర్సన్ను నేనే వెళ్లలేకపోతున్నా.. మామూలు మహిళల పరిస్థితి ఏమిటనే ప్రశ్నే నన్ను నడిపించింది. అటునుంచి ఓ మీడియా వెహికిల్ వెళ్తుంటే లిఫ్ట్ అడిగాం. నెలక్కల్ వరకు తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. అక్కడినుంచి వేరే మీడియా వెహికిల్ రెంట్ తీసుకుని... పోలీస్ ప్రొటెక్షన్తో పంబ వరకు వెళ్లాం. అక్కడినుంచి వాహనాలు వెళ్లవు. అందరం ఒక కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్లాం. అక్కడ గణపతి టెంపుల్ ఉంది. అక్కడిదాకా లైవ్ ఇచ్చుకుంటూనే వెళ్లాం. అది దాటి ఒక్క అడుగు ముందుకు వెళ్లినా.. అది శబరిమల పరిధిలోకి వస్తుంది. అప్పటికే రాత్రి 8 అయ్యింది. అక్కడ పోలీసులున్నారు. 'న్యూస్ కవరేజ్కి శబరిమల వెళ్లాలనుకుంటున్నాం. మాకు రక్షణ కల్పించండి' అని అడిగాను. అప్పుడే ఐజీ శ్రీజిత్ అక్కడికి వచ్చారు. కంట్రోల్ రూమ్కు పిలిచి మాట్లాడారు. 'న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ వెళ్తే.. వన్ కిలోమీటర్ నడవకముందే.. ఆందోళనకారులు పొదల్లో దాక్కొని రాళ్లు విసిరారు. 'నేను వెళ్లలేను' అని ఆ అమ్మాయి వెనక్కి వచ్చింది. అలాంటి పరిస్థితులున్నాయి' అని వివరించారు. 'పరిస్థితి ఏదైనా... నేను ముందుకే వెళ్తాను. మీరు రక్షణ కల్పిస్తారా లేదా చెప్పండి' అని అడిగాను. 'రాత్రి పూట కష్టం. పొద్దుటి వరకు ఉంటే తీసుకెళ్తామ'న్నారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. పోలీసులు కూడా నేలపై పడుకున్నారు. కొందరు లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్లతోపాటు నేనూ ఉంటానన్నా. మీడియా వాళ్లందరూ... 'పరిస్థితి భయానకంగా ఉంది. అమ్మాయి వస్తే... చంపడానికి కూడా వెనుకాడటం లేదు. జాబ్ కోసం లైఫ్ రిస్క్లో పెట్టుకోకు. మధ్యరాత్రి వెళ్లాలనుకున్నా... వాహనాలు ఉండవు. వస్తే మాతో రండి. వెళ్లిపోదాం' అన్నారు. నాతో వచ్చినవాళ్లు భయపడ్డారు. 'ఎవరైనా దాడిచేసినా అమ్మాయిపైన చేస్తారు. సమస్య వస్తే నాకు వస్తుంది. నేను ఫేస్ చేయడానికి రెడీ ఉన్నా. మీరు భయపడకండి!' అని చెప్పా.
అంత ధైర్యంతో వెళ్లిన మీరు.. వందమీటర్ల దూరం నుంచే వెనుదిరగాల్సి రావడానికి కారణాలేంటి? ఆ నాలుగు కిలోమీటర్లు ఎలా నడిచారు?
వెళ్లిపోయిన మీడియా మళ్లీ పొద్దున్నే వచ్చేసింది. ఆరుగంటలకల్లా ఐజీగారిని కలిశాను. ఆయన టీమ్ను మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు వందమంది పోలీసుల రక్షణలో 6.40కి బయల్దేరాం. కేరళ యాక్టివిస్టు రెహనా ఫాతిమా మాతో యాడ్ అయ్యింది. ఇద్దరికీ కలిపి ఇచ్చారు. రెండు కిలోమీటర్లు దాటాం. ఎవరో ఒకరు రాయి విసిరారు. నేను బాడీ ప్రొటెక్టర్, హెల్మెట్ పెట్టుకుని ఉన్నాను. దాంతో పెద్ద గాయాలేమీ కాలేదు. ఆ ఘటన తరువాత మళ్లీ ఐజీ వచ్చారు. 'దారంతా ఇలాగే ఉంటుంది పరిస్థితి' అని చెప్పారు. అయినా వెనుకడుగు వేయనన్నాను. నాలుగు కిలోమీటర్లు నడిచాం. ఇక వంద మీటర్ల దూరం.. ఎదురుగా టెంపుల్ కనిపిస్తూ ఉంది. ఆలయం దగ్గర మూడు నాలుగు వందల మంది... వందమంది పిల్లలను గేట్ ముందు పెట్టి నినాదాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు వెళ్లి ఒప్పించడానికి ప్రయత్నించారు. అయినా వాళ్లు 'మహిళలు మాకు దొరికితే చంపేస్తాం. మమ్మల్ని దాటుకుని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే... ఈ పిల్లల ప్రాణాలను తీస్తూ వెళ్లండి' అని చెబుతున్నారు. మరోవైపు 'మహిళలు అడుగు పెట్టాలని చూస్తే... పూజ మానేసి గుడి మూసేస్తాం..' అని తంత్రీలు(పూజారులు) హెచ్చ రిస్తున్నారు. అయినా 'మీరు వెళ్తాం అంటే రక్షణ ఇస్తాం' అంటున్నారు పోలీసులు. నా హక్కుకోసం చేసే పోరాటంలో... ఏమీ తెలియని పిల్లలను ఎందుకు బలి చేయాలి? అనిపించింది. సరే నేను వెనుదిరుగుతానన్నా. కానీ... మనసుకు బాధ. ఇక్కడి వరకు వచ్చి... వంద మీటర్ల దూరం నుంచి వెను దిరగాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అని ప్రశ్నించుకుంటే 'వందల ఏండ్లల్లో ఇక్కడిదాకా వచ్చిన అమ్మాయే లేదు. సుప్రీం తీర్పు వచ్చినంత మాత్రానా వందల ఏళ్లనుంచి ఉన్న మైండ్సెట్ వెంటనే మారదు కదా! ఏదైనా క్రమంగా మారతారు అనిపించింది.
మీపైన దాడి చేసింది నిజమైన భక్తులా?
నిజంగా భక్తులు నాపైన దాడి చేయలేదు. నేను పంబలో దిగిన తరువాత పంబ నుంచి గణపతి ఆలయం వరకు వెళ్లేప్పుడు చాలామంది స్వాములు నాకు దారెటో చూపించారు. అంతమంది ప్రొటెక్షన్తో నడుస్తున్నప్పుడు కూడా... స్వామివారి దర్శనం కోసం పోతున్నవాళ్లు కూడా... వాళ్ల మొక్కులు మొక్కుకుంటూ వెళ్లారు తప్ప... నన్ను ఆపే ప్రయత్నం చేయలేదు. ఇక స్థానికులతో మాట్లాడినప్పుడు... 'ఒక ఏజ్ గ్రూపు మహిళలు వెళ్లకూడదన్న ఆచారం అయితే ఉంది. అందరూ వెళ్లొచ్చని సుప్రీం తీర్పు ఇచ్చింది కాబట్టి... అమలు చేయాల్సిందే' ఇక నన్ను ఆపింది, కొట్టడానికి ప్రయత్నించింది ఎవరు అంటే... ఆర్ఎస్ఎస్, బీజేపీ, శివసేనకు సంబంధించినవాళ్లు. బీజేపీ బంద్ ప్రకటించింది. అందులో కాంగ్రెస్ భాగస్వామి అయ్యింది. వీళ్లంతా సాధారణ జనం కాదు. కొన్ని పార్టీల కార్యకర్తలు. అది రాజకీయం మాత్రమే. సాధారణ ప్రజల మనోభావాలు అని పేరుపెట్టి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నది రాజకీయ పార్టీలే. అక్కడి వామపక్ష ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడం కోసమే!
ఈ గేమ్లో భాగస్వాములు అవ్వడం ఎందుకని అని... కేరళలోని ప్రజలు అనుకున్నారు. ఇది బీజేపీకి మేలు చేకూరుతది, గందరగోళం, గొడవ అని మీకు అనిపించలేదా?
జర్నలిస్టులకు పార్టీలతో సంబంధం ఉండదు అనుకుంటున్నా. మేల్ ఆర్ ఫీమేల్ జర్నలిస్టు మీటింగ్ జరుగుతుంది అంటే ఏ పార్టీ అయినా వెళ్తాం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పుడు... అది ఎంతవరకు అమలవుతుందని పరిశీలించడానికి, కవరేజీకి వెళ్లాను. అక్కడ పరిస్థితి ఎలా ఉందని ప్రజలకు వివరించడం నా బాధ్యత. అక్కడికి వెళ్లి రిపోర్టింగ్ చేయడమే నా పని. ఏ పార్టీకి మేలు, ఏ పార్టీకి నష్టం అనేది నేను చూడను. జర్నలిస్టును అయినా... మహిళ అయినందుకు నన్ను అడ్డుకున్నారు.
ఈ ఘటన మీకు ఇచ్చిన అనుభవం?
నా లైఫ్ అఛీవ్మెంట్ అనుకుంటున్నా. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏ మహిళా అక్కడిదాకా వెళ్లలేదు. నేను అక్కడిదాకా వెళ్లగలిగాను. అయినా 'ఆలయంలోకి ప్రవేశించలేదు కదా!' అనేవాల్లున్నారు. ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేగానీ... ఏదీ ముందుకు కొనసాగదు. నేను వెళ్లాలనుకుంటే పోలీసుల రక్షణలో వెళ్లొచ్చు. ఒక జర్నలిస్టుగా హింసకు ప్రేరేపించకూడదు. నేను ఒక్క అడుగు ముందుకేసినా హింస జరిగే అవకాశం ఉంది. మతంకోసం, ఆచారం కోసం పిల్లల్ని బలిపెట్టడానికి సిద్ధంగా వాళ్లున్నారు. కానీ నా హక్కుకోసం నేను పిల్లల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నా పోరాటంలో నా ప్రాణాలు పోయినా పర్లేదు. కానీ వేరే పిల్లల ప్రాణాలు పోవడానికి నేను కారణం కాకూడదు అనుకున్నా. వంద మీటర్ల దూరంలో ఆగిపోయినా... నేను విన్నర్నే అనుకుంటున్నా. భవిష్యత్లో మహిళా సాధికారత, సామాజిక సమస్యలపై పనిచేయాలని అనుకుంటున్నా.
అడుగుపెడితే మైల పడుతుందా?
ఈ ప్రయాణంలో నా భర్త విప్లవ్కుమార్ ప్రోత్సాహం చాలా ఉంది. రిపోర్టింగ్ కోసం శబరిమల వెళ్తున్నా అని చెప్పగానే 'గో అహెడ'్ అన్నారు. అక్కడికి వెళ్లాక పరిస్థితి వివరించాను. 'లోపలికి వెళ్లానంటే... బయటకు వస్తానో లేదో తెలియదు. బాబును బాగ చూసుకో' అంటే... 'ఏం కాదు.. భయపడకు. ధైర్యంగా నిలబడు' అని చెప్పారు. ఇక అక్కడ ఉన్నన్ని రోజులు మా ఛానల్ యాజమాన్యం నా యోగక్షేమాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నది. నన్ను బాధించిన విషయమేమంటే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 'కొన్ని లక్షల మంది మనోభావాలను దెబ్బతీసి... శబరిమల వెళ్లాల్సిన అవసరం ఏముంది? నీకు పాపం తగులుతుంది?' అంటున్నారు. ఇంకొందరు అసభ్యంగా దూషిస్తున్నారు. మరికొందరు 'గొప్ప పనిచేశావ్' అంటున్నారు. మనోభావాలు ఇవన్నీ పక్కకు పెడితే... ఒక మనిషి ఒక పని చేస్తే కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు. నేను ఏ ఒక్కరినీ దూషించలేదు. ఏ ఒక్క మనిషిపై దాడి చేయలేదు. అయినా నాపై ఎందుకు దాడి చేస్తున్నారు? ఆసిఫా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఓ బాలికపై గుడిలోనే అత్యాచారం చేస్తే అంటుకోని పాపం.. నేను గుడిలో అడుగుపెడితే గుడి మైల పడుతుందా? పవిత్రమైన దేవాలయంలోనే అలాంటి ఘటనలు జరుగుతుంటే దెబ్బతినని మనోభావాలు... మహిళ గుడిలో అడుగుపెడితేనే దెబ్బతింటాయా? మహిళలు అడుగు పెట్టొద్దని చెప్పినవాళ్లు బతికిలేరు. విన్నవాళ్లు బతికి లేరు. ఆచారం ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. సమాజంలో ఎన్నో ఆకృత్యాలు జరుగుతుంటే... అన్నింటినీ వదిలేసి.. కేవలం మహిళ గుడిలో అడుగుపెడితేనే మనోభావాలు దెబ్బతింటాయంటున్నారు. అసలు ఈ మనోభావాలేంటో అర్థం కావడం లేదు.