Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు నిద్ర లేచింది మొదలు ఇంట్లో పనులతో బిజీ అయిపోతారు. ఇంటి పనులు, వంట పనులతో పాటు పిల్లలను రెడీ చేయడం, అందరికీ అన్నీ అందించడంలో నిమగమవుతారు. ఆకలి వేస్తున్నా పనుల ఒత్తిడితో తినేందుకు సమయం ఉండదు. అల్పాహార విషయంలో జాప్యం ఏర్పడుతుంది. లేదంటే ఏదో కొంచెం తిన్నామనిపిస్తుంటారు. కొందరైతే కేవలం టీ తో సరిపెట్టుకుంటారు. మరి కొందరైతే నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఉద్యోగం చేసే మహిళలకైతే ఈ సమస్య మరీ ఎక్కువగా. ఉదయం తీసుకునే అల్పాహారం ఎంత ఆరోగ్యకరమైనదైతే రోజు అంత ఉత్సాహంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అదెలాగంటే...
- అల్పాహారం తీసుకోవడం ద్వారా వాటి నుంచి వచ్చే శక్తి రోజువారి పనులు సక్రమంగా సాగుతాయి. ఏ విషయమైన సరిగా ఆలోచించగలుగుతాం. ఆరోగ్యవంతమైన అల్పాహారం వల్ల మంచి జీవన విధానం అలవడుతుంది. ఈ విషయంలో జాప్యం ఏర్పడితే శరీరానికి అవసరమైన పోషకాలలో లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా పిల్లలకు సరైన పోషకాహారం పెట్టకపోతే వారి ఎదుగుదలలో మార్పులు చోటుచేసుకుంటాయి. పెద్దయ్యే కొద్ది వారి జీవన విధానంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి.
- సాధారణంగా ఉదయం లేవగానే రక్తంలో షుగర్ లెవెల్స్ తక్కువ స్థాయిలో ఉంటాయి. అందుకే నిద్ర లేవగానే బుర్ర పనిచేయదు. కాస్త టీ లేదా కాఫీ తాగితే పనులు మొదలు పెట్టవచ్చని చెబుతుంటారు. కానీ వాటికి బదులు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. సరైన జీర్ణ వ్యవస్థ లేకుంటే ఆరోగ్యవంతంగా లేనట్టే. సరైన ఆరోగ్యం లేకుంటే పనిపై శ్రద్ధ తగ్గుతుంది. పనిపై తగిన శ్రద్ధ పెట్టాలంటే అల్పాహారం తప్పనిసరి.
- అల్పాహారం అంటే ఏదోకటి తినేస్తే సరిపోదు. పండ్లు, కూరగాయలు అందులో భాగం చేసుకోవాలి. ఇది బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. పీచు పదార్థాలు ఎక్కువసేపు పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తాయి. స్నాక్స్ వంటి వాటి జోలికి పోకుండా చేస్తుంది.