Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్ఞాపకాలు, సినిమాలు ఒక్కటే! రెండూ వెంటాడుతుంటాయి. అలాంటి వెంటాడే సినిమాల్లో ఒకటి 'గరమ్ హవా'. భారత విభజనపై వచ్చిన సినిమాల్లో ఉత్తమ సినిమా 'గరమ్ హవా'. సినీ విమర్శకులు సైతం చెప్పే మాట ఇదే! విడిపోయింది భూమే... అయినా ముక్కలయ్యింది ఇరు ప్రాంతాల్లోని మనుషుల మనసులు. ఇస్మత్ చుగ్తారు రాసిన ఓ కథ ఆధారంగా వచ్చిన సినిమా అది. కానీ ఈ సినిమా వెనుక మరో మహిళ ఉన్నారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె 'షమా జైదీ'. ఆ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్. భారతదేశంలో థియేటర్తోపాటే పుట్టి పెరిగిన ఆమె... థియేటర్కు చేసిన సేవ అపారం. లండన్లో స్టేజ్ డిజైనింగ్లో చదివి.. ఆ తరువాత సినిమాల్లోని పలు విభాగాల్లో తనదైన ముద్ర వేసిన సృజనశీలి.
షమాజైదీ.. ఫిల్మ్ మేకర్ మాత్రమే కాదు.. స్క్రిప్ట్ రైటర్, థియేటర్ ఆర్టిస్ట్, సెట్ డిజైనర్, కాస్టూమ్ డిజైనర్, ఫిల్మ్ క్రిటిక్. 1938 సెప్టెంబర్ 25న జన్మించింది. తండ్రి బషీర్ హుస్సేన్ జైదీ. లోక్సభకు ఎన్నికయ్యారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్గానూ పనిచేశారు. తల్లి ఖుద్సియా జైదీ... థియేటర్ ఆర్టిస్ట్. 1950లో హబీబ్ తన్వీర్, మరికొంతమందిస్నేహితులతో కలిసి హిందుస్థానీ థియేటర్ను ప్రారంభించారు. తల్లిదండ్రులిద్దరూ లెఫ్టిస్టులు. తల్లిదండ్రులిద్దరి ఆలోచనలను వారసత్వంగా పుచ్చుకుందామె. అందుకే ప్రధానస్రవంతి అనుకున్న రాజకీయాలు, సినిమా, సాహిత్యానికి దూరంగా ఉంది. ఇండియన్ థియేటర్కు అపారమైన సేవలందించింది. కైఫీ అజ్మీ, ముజఫర్ అలీ, శ్యామ్బెనగల్, సత్యజిత్రే, ఎమ్ఎస్సత్యులాంటి మహామహులతో కలిసి పనిచేసింది. ఆ తరువాత సత్యుతోనే కలిసి జీవితం పంచుకుంది.
లండన్లో థియేటర్...
ముస్సోరిలోని వుడ్స్టాక్ స్కూల్లో చదువుకుంది జైదీ. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ చదువుకుంది. థియేటర్తో తల్లికి అనుబంధం ఉండటమే కాదు.. ఆమె చదివిన ముస్సోరీ స్కూల్లో సైతం.. రెగ్యులర్గా నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. అదే ఆమెను స్టేజ్ వైపు నడిపించింది. అందుకే డిగ్రీ తరువాత తరువాత రెండేండ్లపాటు... జర్మనీలోని వివిధ థియేటర్స్లో స్టేజ్ డిజైన్ అప్రెంటీస్గా చేసింది. 1962లో ఇండియాకు వచ్చాక... తల్లి మరణంతో స్తబ్దంగా ఉండిపోయిన హిందుస్తానీ థియేటర్ను పునరుద్ధరించడానికి ప్రయత్నించింది. 1964లో పెండ్లి చేసుకున్న తరువాత బాంబేకి షిఫ్ట్ అయ్యింది. ప్రముఖ రచయిత రాజేందర్ సింగ్ బేడీ 'ఏక్ చాదర్ మైలీ సీ'కి నాటకాన్ని డైరెక్ట్ చేసింది. తరువాత ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్(ఇఫ్టా)లో చేరింది. అందులో కొన్ని ఏండ్లపాటు నాటకాలకుస్టేజ్ డిజైనింగ్తోపాటు, నటన, అనువాదం, దర్శకత్వం వహించింది. 1969లో ఆమె చేసిన 'గాలిబ్' డాక్యుమెంటరీ... సినిమా స్క్రిప్ట్ రైటింగ్లోకి ప్రవేశించేలా చేసింది.
గరమ్ హవాతో సినీ ప్రవేశం...
ఉర్దూ నాటక రచయిత రాజిందర్ సింగ్ బేడీ కోరిక మేరకు 'గరమ్ హవా'కి స్క్రిప్ట్ రైటర్గా పనిచేసింది. దీనికోసం ఓ కథ రాయమని ఇస్మత్ చుగ్తారుని అడిగింది. తరువాత ఆమె కథలను కొన్నింటిని ఒక్క దగ్గర చేర్చి సినిమాకు స్క్రిప్ట్ చేసింది. ఆ తరువాత శ్యామ్బెనగల్ 'మంతన్', 'భూమిక', సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసింది. 'మేకింగ్ ఆఫ్ మహాత్మ', 'హరీ బరీ', 'సుస్మాన్', 'ఆరోహణ్', 'మండి' సినిమాలకు స్క్రిప్ట్ రాసింది. 1987లో వచ్చిన 'సుస్మాన్' భారతదేశంలో పారిశ్రామికీకరణ, దాని ప్రభావంతో చేనేత కళాకారుల జీవితంలో వచ్చిన మార్పులు, వారి జీవన పోరాటాన్ని చిత్రీకరించింది. సంతానాన్ని కావాలనుకోవడం, వద్దనుకోవడం మహిళల హక్కు అని చెప్పిన సినిమా 'హరీ బరీ'. షబానా అజ్మీ, నందితాదాస్ ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమా 2000ల్లో విడుదలైంది. భారతదేశంలో శ్వేతవిప్లవం గురించి చర్చించిన సినిమా 'మంతన్'. ఇదు ఐదు లక్షల మంది రైతుల క్రౌడ్ ఫండింగ్తో నిర్మితమైంది. విడుదలైన ఏడాదే... ఆస్కార్కి నామినేట్ అయ్యింది. స్మితాపాటిల్ నటించిన 'భూమిక' (మరాఠీ నటి హంసావాడ్కర్ జీవితగాథ)కు, 'ఉమ్రావ్ జాన్' సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసింది జైదీ. మున్షి ప్రేమ్ చంద్ కథ ఆధారంగా సత్యజిత్రే దర్శకత్వం వహించిన 'శత్రంజ్ కె కిలాఢ'కి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. తన కళా నైపుణ్యంతో సినిమాకు 1857 ఎరాను తీసుకొచ్చింది. ఇండియన్ సినిమాకు ఆమె చేసిన సేవలు డిజిటల్ ప్రపంచానికి తెలియకపోవడానికి ప్రధాన కారణం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆమె మనస్తత్వం. ఎంత పనిచేసినా ప్రచారాన్ని కోరుకోలేదు.
మహిళగా వివక్ష...
నేటికి సైతం ఇటు ఇండియాలోనూచ, అటు పాకిస్తాన్లోనూ ఫిల్మ్ మేకింగ్లో మహిళలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. 1970ల్లో అంటే ఊహించడం కూడా కష్టమే! మూడు సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన తరువాత కూడా ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్... ఆమె మీద దాడి చేసింది. అసోసియేషన్లో సభ్యురాలు కానందున సినిమాలు చేయొద్దని బెదిరించింది. తరువాత సభ్యత్వానికి అప్లై చేసుకుంటే... 'ఆర్ట్ వర్క్ అంతా ఆమె భర్త.. ఎమ్ఎస్ సత్యు చేస్తారని.. కేవలం ఆయన ఆదాయపు పన్ను నుంచి తప్పించుకోవడానికి భార్య పేరును వాడుకుంటున్నాడ'ని అసోసియేషన్ ఆరోపించింది. కళా రంగాల్లో ఉన్న చాలా మంది మహిళలు ఎదుర్కొనే ప్రాథమిక సమస్య ఇది! ఆమె విదేశాల్లో ఆర్ట్ డిజైనింగ్ చదువుకుందని, దేశవిదేశాల్లో పనిచేసిన అనుభవం ఆమెకు ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు బన్సీ చందగ్రుప్తా వాదించడంతో... చివరకు అసోసియేషన్ ఆమెకు సభ్యత్వమివ్వడానికి అంగీకరించింది. అయితే ఈ వివక్ష ఏదీ ఆమెను ప్యాషన్నుంచి వెనుదిరిగేలా చేయలేదు. ఎందుకంటే... ఆమె కలిసి పనిచేస్తున్న శ్యామబెనగల్ ఆమె పట్ల ఏనాడూ వివక్ష చూపలేదు. సత్యజిత్రే అయితే... ఆడ, మగ అనే తేడా కంటే... వర్క్ ఎలా ఉందని మాత్రమే చూసేవారు. ఇక సత్యు ఒక్కరే నిర్మాతల విషయానికి వచ్చేసరికి ఆమెను కొంత వ్యతిరేకించేవారు. కారణం... 'భర్తతో కలిసి భార్య సినిమాకోసం పనిచేస్తే ఆమెకు రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన పని లేదు' అని నిర్మాతలకు ఓ గట్టి విశ్వాసం. దాంతో రెమ్యునరేషన్ విషయం వివాదాస్పదం అవుతుండేది. కానీ ఆమె ఎప్పుడూ తన కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం కొట్లాడేది!
నేటికీ అదే విలువలతో..
మొన్నసెప్టెంబర్తో 80పడిలోకి ప్రవేశించిన షమా... థియేటర్, సినిమా రంగానికి చేసిన సేవ అపారం. అయితే ఎప్పుడూ నమ్మిన విలువలకే కట్టుబడి ఉన్నారామె. అందుకు ఉదాహరణ ఈ ఘటన. ఇండియాలో ఇస్లాం గురించి ఒక డాక్యుమెంటరీ చేయమని భారత ప్రభుత్వం ఆమెను అడిగింది. ఆమె ఎంతో కష్టపడి, ఇష్టంతో డాక్యుమెంటరీని చేసింది కూడా. కానీ అది విడుదల కాలేదు. ఎందుకంటే... అది 'భారతదేశం మీద ఇస్లాం ప్రభావాన్ని ఎక్కువ చేసి చూపింద'ని బీజేపీ అనుకుంది. సినిమాల్లో కొన్ని మార్పులు చేసి... పార్టీ ప్రభావాన్ని చొప్పించాలని కాంగ్రెస్ చూసింది. ఆమె ఆ రెండింటికి నిరాకరించింది. ఫలితం డాక్యుమెంటరీ విడుదల కాలేదు. ప్రజల్లోకి వెళ్లలేదు. ఏండ్లుగా ఉన్న ఆ సినిమాను ఆమె స్నేహితులు కొందరు ఆ తరువాత యూట్యూబ్లో పెట్టారు. కేవలం ఫిల్మ్ మేకర్గానే ఉండిపోలేదామె... ఆర్ట్ క్రిటిక్గా వివిధ పత్రికలకు 'దిస్టేట్స్మెన్', 'పాట్రియాట్', 'శంకర్వీక్లీ'లకు ఆర్టికల్స్ రాసింది. అలాగే... టీవీ, సినిమాలు, థియేటర్పై లెక్కలేనన్ని వ్యాసాలు రాసింది. ''లాంగ్వేజ్ ఆఫ్ సినిమా'ను ఈ తరం ఫిల్మ్ మేకర్స్ అర్థం చేసుకోలేదు. అందుకే ఇప్పటి సినిమాల్లో... మన సహజత్వం ఉండదు' అని చెబుతుంది.
లింక్ తెగిపోయింది...
ఒకప్పుడు ప్రజల సంస్కృతికి, సినిమాలకు, ప్రజా ఉద్యమాలకు అనుబంధం ఉండేది. ఇప్పుడు వాటి మధ్య లింక్ తెగిపోయింది. ఈ బంధం సాహిత్యం, ప్రజల జీవనశైలినుంచి వస్తుంది. కానీ.. ప్రధానస్రవంతిలో ప్రజల జీవనశైలి, ఆ ప్రజలకు సంబంధించిన సాహిత్యాన్ని సినిమాలుగా చేయడాన్ని మన ఫిల్మ్ మేకర్స్ మరిచిపోయారు. ఇప్పుడు భారతీయ సినిమాలు ఆయా ప్రాంతాల భాషల్లో ఉంటాయే తప్ప... అవి ఆ ప్రాంతపు వాస్తవ స్థితిగతులను ప్రతిబింబించే సినిమాలు కావు.
కట్ట కవిత