Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా? అయితే ఖచ్చితంగా ఇది మీ కోసమే. అదిరిపోయే మసాలా రొయ్యల కూర, బీరకాయ రొయ్యలు, బ్రెడ్ పకోడి, చుక్కకూర, చింతకాయతో రొయ్యలను వేసి వండితే కూర రుచి అదిరిపోతుంది. ఇంకా పచ్చిరొయ్యలు, దోసకాయ కలిపి కూర వండితే చాలా బాగుంటుంది. ఇందులోకి కూడా చిన్న రొయ్యలు అయితే రుచి మరింత వస్తుంది. రొయ్యల కూర అన్నంలోకే కాదు రొట్టెలలోకి అయినా చాలా బాగుంటుంది. రొయ్యలతో చేసిన స్పెషల్ వంటకాలు అందరికి తప్పకుండా నచ్చుతాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ప్రయత్నించి చూడండి.
బీరకాయ రొయ్యలు
కావలసిన పదార్థాలు : బీరకాయలు - రెండు, శుభ్రం చేసిన రొయ్యలు - 400 గ్రా||, నూనె - రెండు చెంచాలు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, కరివేపాకు - నాలుగు రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక చెంచా, కారం - ఒకటిన్నర చెంచా, గరం మసాల పొడి - సగం చెంచా, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుము- కొద్దిగా. దనియా, జీర, పసుపు పొడులు - అర చెంచా చొప్పున.
తయారీ విధానం : రొయ్యల్లో ఒక చెంచా కారం, సగం చెంచా ఉప్పు, దనియా, జీర, పసుపు పొడులు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్ది నూనెలో నీరంతా ఆవిరయ్యేవరకు చిన్నమంటపై వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో మరికొంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుము, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. తర్వాత (తొక్కతీసిన) బీర ముక్కలు, ఉప్పు కలిపి మగ్గించాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత రొయ్యలతో పాటు పావుకప్పు నీరు పోసి ఉడికించాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
బ్రెడ్ రొయ్యల పకోడి
కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు- ఆరు, పచ్చిరొయ్యలు-ఒక క ప్పు, గుడ్డు- ఒకటి, తరిగిన ఉల్లి కాడలు-రెండు, అల్లం ముక్కలు- ఒక చెంచా, సోయాసాస్- రెండు చెంచాలు, మొక్కజొన్నపిండి - ఒక చెంచా, మసాలా పొడి-అర చెంచా, వేయించిన నువ్వులు- సగం కప్పు, వేయించడానికి తగినంత నూనె.
తయారీ విధానం: రొయ్యలు, గుడ్డు సొన, ఉల్లికాడలు, అల్లం, మొక్కజొన్నపిండి, సోయాసాస్లను మిక్సీలో వేసి పేస్టులా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. బ్రెడ్ ముక్కల్ని త్రికోణంలో రెండు ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్క రొయ్య పేస్టుని రాసి, దానిపై నువ్వులు జల్లి అవి అతుక్కునేలా ఒత్తాలి. ప్యాన్లో నూనె వేడిచేసి ఒక్కో బ్రెడ్ముక్కని బంగారు రంగు వచ్చేవరకూ వేగించాలి. వీటిని వేడి వేడిగా చిల్లీసాస్తో తింటే చాలా బాగుంటాయి.
చింతకాయ
కావాల్సిన పదార్థాలు: రొయ్యలు - అరకిలో, చింతకాయ ముక్కలు - 100 గ్రా||, ఉల్లిపాయముక్కలు - అర కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక చెంచా, గరం మసాల - ఒక చెంచా, కారం - రెండు చెంచాలు, కరివేపాకు - రెండు రెబ్బలు, పసుపు - అర చెంచా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారీ విధానం: ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. లేత చింతకాయ ముక్కల్ని రోట్లో దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాత్రలో పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, రొయ్యల్ని కూడా వేసి కలపాలి. ఓ పది నిమిషాలు సన్నని మంటపై మగ్గాక దంచి పెట్టుకున్న చింతకాయ ముద్దను కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు గరంమసాలా వేసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. దీన్ని కొత్తిమీర తురుముతో అలంకరించుకోవాలి.
దోసకాయ ఎండు రొయ్యలు
కావలసిన పదార్థాలు: ఎండు రొయ్యలు - రెండు చెంచాలు, దోసకాయ ముక్కలు - రెండు కప్పులు, ఉల్లి తరుగు - అర కప్పు, టమోటా తరుగు - అరకప్పు, కారం - రెండు చెంచాలు, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒక చెంచా, కొత్తిమీర తరుము- ఒక చెంచా.
తయారీ విధానం: రొయ్యల్ని అరగంటపాటు నానబెట్టి నీరు పిండేయాలి. నూనెలో ఉల్లితరుగు వేగించి, టమోటా ముక్కలు, పసుపు, ఉప్పు కలపాలి. టమోటాలు మెత్తబడ్డాక రొయ్యలు, దోస ముక్కలు, కారం వేసి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూడు కప్పులు నీరు పోయాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర వేసి దించేయాలి. అన్నంతో ఎంతో రుచిగా ఉండే కర్రీ ఇది
పచ్చిరొయ్యల చింతచిగురు
కావలసిన పదార్థాలు: చింతచిగురు - పావు కేజీ, పచ్చిరొయ్యలు - అరకేజీ, ఉల్లిపాయలు - మూడు, పచ్చిమిర్చి - నాలుగు, నూనె - మూడు చెంచాలు, పసుపు - అర చెంచా, కారం - ఒక చెంచా, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: పచ్చిరొయ్యలు, చింతచిగురు విడివిడిగా శుభ్రం చేసి ఉంచుకోవాలి. నూనెలో ఉల్లి, తరిగిన పచ్చిమిర్చి దోరగా వేయించి పసుపు, రొయ్యలు వేసి మగ్గనివ్వాలి. రొయ్యలు మూడు వంతులు ఉడికిన తర్వాత చింతచిగురు, కారం, ఉప్పు కలిపి రెండు నిమిషాల తర్వాత కప్పు నీరు పోసి మూత పెట్టాలి. కూర చిక్కబడ్డాక దించేయాలి. (చింతచిగురు రుచి తెలియాలి కాబట్టి మసాల పొడి, కొత్తిమీర లాంటివి వాడకూడదు. మటన్, చికెన్లతో కూడా ఇలాగే కలిపి వండుకోవచ్చు. వీటిలో మాత్రం అల్లం వెల్లుల్లి, మసాల పొడి వాడాలి).
చుక్కకూర రొయ్యలు
కావలసిన పదార్థాలు : చిన్న రొయ్యలు (పొట్టు తీసి శుభ్రం చేసినవి) - అరకేజి, చుక్కకూర - నాలుగు కట్టలు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కారం - రెండు చెంచాలు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక చెంచా, పసుపు - అర చెంచా, నూనె - ఒక చెంచా, గరం మసాలా - ఒక చెంచా, కొత్తిమీర - ఒక కట్ట.
తయారీ విధానం: రొయ్యలకు పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పట్టించి అరగంట పాటు ఉంచాలి. పాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలతో పాటు రొయ్యలను వేసి వేయించాలి. ఐదునిమిషాలు మూతపెట్టి రొయ్యలు మగ్గాక చుక్కకూర తరుగు వేసి కూరని దగ్గరగా ఉడికించుకోవాలి. దించేముందు గరం మసాలాతోపాటు కొత్తిమీరను చల్లుకోవాలి.