Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షీటీమ్స్ కానిస్టేబుల్గా ఉద్యోగ నిర్వహణలో శహభాష్ అనిపించుకున్నారు. ప్యాషన్గా ఎంచుకున్న బైకింగ్తో దేశవిదేశాల్లో 17వేల కిలోమీటర్ల మేరకు రైడింగ్ చేసి ..
తెలంగాణ రాష్ట్ర షీటీమ్స్ను ఏడు దేశాల్లో ప్రమోట్ చేశారు. వృత్తిలోనే కాదు వ్యక్తిగతజీవితంలోనూ ఎంతో ధైర్యంగా తన ఇద్దరు ఆడపిల్లలను పెంచుతున్నారు. ఆమె షీటీమ్స్ కానిస్టేబుల్ శాంతి . కండ్లకు గంతలు కట్టుకుని ఆయుధాలను అస్సెంబుల్, డిస్సెంబుల్ చేసే నైపుణ్యం ఆమె సొంతం. ఇటీవల పోలీస్మీట్లోనూ రెండు బంగారు పతకాలతో సహా ఏడు పతకాలు గెలుచుకున్న ఆమె పరిచయం..
మాది బెంగుళూరు. నాన్న ఎల్.ఎ. సుసైనాథ్ రైల్వేపోలీస్ గా పనిచేసేవారు. నాకు నాలుగేండ్లు ఉన్నప్పుడు నాన్నకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది. దాంతో మా కుటుంబం హైదరాబాద్ వచ్చింది. రైల్వే స్కూలు, కాలేజీలో చదువుకున్నాను. ఇంటర్ కాలేజీ లెవల్లో వాలీబాల్ నేషనల్స్ ఆడాను. అక్క, ఇద్దరు అన్నయ్యల తర్వాత నేను. అమ్మ ఎల్.ఎ. మణి చిన్నప్పటి నుంచి మా అందరినీ సమానంగానే పెంచడమే కాదు నా డ్రస్సింగ్ కూడా అబ్బాయి మాదిరిగానే ఉండేది. ఒకసారి మా పెద్దనాన్న బిడ్డకు రైల్వేపోలీస్లో సెలక్షన్ కోసం వెళ్లుతుంటే నేనూ కూడా వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ ఆమెను వదిలేసి నన్ను లోపలికి నెట్టేశారు. నేను ఆమె కన్నా పొడవు ఎక్కువగా ఉండటంతో నేనే సెలక్షన్స్కు వచ్చాను అనుకున్నారు. ఆ రోజు నుంచి నా మనసులో పోలీస్ కావాలన్న ఆలోచన వచ్చింది. నాన్నకు ఇష్టం లేదు. కానీ పెద్దన్నయ్య మాత్రం చాలా ప్రోత్సహించేవారు. నాన్న విఆర్ఎస్ తీసుకోవడంతో ఎవరైనా ఒకరు డిపార్ట్మెంట్లో ఉండాలని పెద్దన్న చెప్పేవాడు. అన్నయ్యల ప్రోత్సహంతో నేను కాలేజీకి అన్నయ్య బైక్పై వెళ్లేదాన్ని. అందరూ వింతగా చూసేవారు. నేను, చిన్న అన్నయ్య రైల్వే పోలీస్ జాబ్కు ట్రై చేసినా రాలేదు. ఆ తర్వాత డిగ్రీ సెకండియర్లో ఉన్నప్పుడు నేను, చిన్న అన్నయ్య కానిస్టేబుల్ పరీక్ష రాసాం. అన్నయ్య రిటర్న్ టెస్ట్లో ఒక మార్కులో అవకాశం కోల్పోయాడు. నేను కానిస్టేబుల్గా సెలక్ట్ అయ్యాను. ఫైరింగ్లోనూ సెమిఫైనల్స్ వరకు వెళ్లాను. కార్బన్, ఎస్ఎల్ఆర్, పిస్టల్ను బ్లైండ్గా డిస్సెంబుల్, అస్సెంబుల్ చేస్తాను. క్యాష్ప్రైజ్ కూడా అందుకున్నాను.
ఫస్ట్ పోస్టింగ్...
2005లో బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫస్ట్ పోస్టింగ్. అన్నయ్య బాక్సర్పై పోలీస్స్టేషన్కు వెళ్లేదాన్ని. ప్యాంట్, షర్టు వేసుకుని బాక్సర్పై రావడంతో మా తోటి ఉద్యోగులు హేళనగా మాట్లాడేవారు. ఒకసారి వారి మాటలు భరించలేక పంజాబీడ్రస్సులు కుట్టించుకుందాం అనుకున్నాను. మల్కాజిగిరి నుంచి బేగంపేటకు వచ్చేదాన్ని. దారిలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉండేది. ప్రతిరోజూ అక్కడకు రాగానే సిగ్నల్ పడేది. చాలాసార్లు సిగ్నల్ జంప్ చేసేదాన్ని. దాంతో ఒకరోజు ట్రాఫిక్ కానిస్టేబుల్ నా బండి ఆపాడు. నేను హెల్మెట్ తీయగానే ఆశ్చర్యపోయాడు. ' సిగ్నల్ జంప్ చేసినప్పుడల్లా వీడికెంత పొగరు అని తిట్టుకుంటాను. నువ్వు అమ్మాయివా? పైగా పోలీస్ కానిస్టేబుల్వి. ఇలా రూల్స్ను బ్రేక్ చేయవచ్చా?' అంటూ మందలిస్తూ... భేష్ అమ్మాయిలు ఇలా ధైర్యంగా ఉండాలి అంటూ అభినందించాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజూ అతనికి గుడ్మార్నింగ్ చెప్పేదాన్ని. నా డ్రస్సింగ్ స్టైల్ మార్చుకోవాలనుకున్న ఆలోచన వదిలేసాను.
ఎవడ్రా వీడు..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డ్యూటీ అసెంబ్లీలో వేశారు. ఫస్ట్ టైం. అసెంబ్లీలోకి వెళ్లడానికి వేరువేరు గేట్లు ఉంటాయని కూడా తెలియదు. ఫస్ట్ గేట్ నుంచి వెళ్లేదాన్ని. రెండు రోజులు అలాగే వెళ్లాను. మూడోరోజు నేను గేట్ సమీపంలోకి వెళ్లగానే.. అక్కడ ఉన్న పోలీస్లు నన్ను ఆపారు. బండి ఆపగానే నన్ను పట్టుకోవడానికి ముందుకు వచ్చారు. హెల్మెట్ తీయగానే.. ఒక అడుగు వెనక్కి వేశారు. నేను బండి ఆపి కిందికి దిగాను. అక్కడే ఉన్న డిఎస్పీ నన్ను పిలిచి వివరాలు అడిగారు. 'ఫస్ట్ గేట్ నుంచి రావద్దని నీకు తెలియదా?నువ్వు బండిపై దూసుకుపోతుంటే ఎవరా అనుకున్నాం. బండి నడపడం బాగానే ఉంది కానీ, రాంగ్రూట్లో రావడం బాగాలేదు' అంటూ మందలించారు. ఇక అప్పటి నుంచి బుల్లెట్ రాణి అంటూ సరదాగా కోలిగ్స్ పిలిచేవారు.
గేర్ బండి వద్దు..
ఇంట్లో నాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పెండ్లి విషయంలో నూ నా నిర్ణయాన్ని అంగీకరించారు. ప్రేమించి పెండ్లి చేసుకున్నాను. పెండ్లి తర్వాత గేర్ బండి వద్దు.. మోపెడ్ తీసుకో అని మా ఆయన సూచించారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన జీవితం ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత అనుకోని మలుపు తిరిగింది. ఆడపిల్లలను కన్నావంటూ అనునిత్యం వేధింపులు. ఆడపిల్లలను తక్కువగా చేసి మాట్లాడటం భరించలేక పోయాను. ఇక అతనితో కలిసి ఉండలేక పిల్లలను తీసుకుని అమ్మవాళ్లింటికి వచ్చాను. ఈ సమాజంలో ధైర్యంగా, గౌరవంగా బతికేలా నా పిల్లలను పెంచాలన్నదే నా తపన.
షీటీమ్స్ లోకి..
రాష్ట్రప్రభుత్వం 2014లో ఏర్పాటుచేసిన షీటీమ్స్లోకి నన్ను తీసుకున్నారు. 'కమ్యూనిటీ లీడ్ యాక్షన్ ప్రోగ్రామ్ బై పోలీస'్ లోనూ చురుగ్గా పాల్గొన్నాను. స్టూడెంట్స్, పోలీస్లు కలిసి పనిచేసే ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్వేత దండపాణి, ట్రావెలర్, బైకర్ జయభారతి పరిచయం అయ్యారు. ఎప్పటి నుంచో బైక్పై లాంగ్డ్రైవ్ చేయాలన్న ఆసక్తి వారితో షేర్చేసుకున్నారు. రైడ్ ఉన్నప్పుడు చెబుతాను అన్నారు. వారితో పరిచయం నా జీవితాన్ని కొత్తమలుపు తిప్పింది. నేను ఉమెన్రైడర్స్ గ్రూప్లో చేరాను. చాలా రైడ్స్ వారితో కలిసి చేశాను.
రెండునెలల పాటు..
కాశ్మీర్ టూ కన్యాకుమారి బైక్ రైడ్కు జయభారతి, మరికొంత మంది వెళ్ళుతున్నారు. నన్ను అడిగారు. అయితే ఖర్చులకు దాదాపు అరవైవేలు అవుతాయి అని చెప్పారు. డబ్బులు లేకపోవడంతో రాలేను అని చెప్పాను.. నెక్ట్స్ రైడ్ వరకు డబ్బులు జమ చేసుకుని తప్పక వస్తాను అన్నాను. ఎంతో బాధపడ్డాను. కొన్ని నెలల తర్వాత ఒకరోజు జయభారతి నుంచి ఫోన్' ట్రిప్ ఉంది. రెండునెలల పాటు మాతో వస్తావా?' అనగానే..' ఎంత ఖర్చు అవుతుంది' అని అడిగాను. 'డబ్బులు అవసరం లేద' ని చెప్పగానే.. ఎక్కడికి అని కూడా అడగలేదు. 'వస్తాను. మరి ఆఫీస్?' అన్నాను. నేను మాట్లాడుతాను అంది జెబి. రెండు రోజుల తర్వాత జెబీ ఫోన్ చేసి పాస్ఫోర్ట్ ఉందా' అనగానే లేదని చెప్పాను. పాస్ట్పోర్ట్ మేళా పెట్టినప్పుడు నేను హైదరాబాద్ వదిలి ఎక్కడకు వెళ్తాను అని అప్లై చేయలేదు. ఇప్పుడు ఇలా అవకాశం వస్తుందని ఆ రోజు తెలియదు. అన్నయ్య తాత్కాల్లో పాస్పోర్ట్కు అప్లై చేసాడు. పిల్లలను చిన్నప్పటి నుంచి మా అక్కే చూసుకునేవారు. అమ్మ, అక్క, అన్నయ్యలు నీవు వెళ్ళు మేం చూసు కుంటాం అనడంతో పిల్లల గురించిన దిగులు లేదు. నలుగురు అమ్మాయిలు కలిసి ఏడు దేశాలు, 17వేల కిలోమీటర్ల దూరం బైక్లపై వెళ్లే ట్రిప్. స్వాతిలక్రామేడమ్ ఎంతో ప్రోత్సహించారు. ఆఫీస్ నుంచి పర్మిషన్ రావడం, పాస్పోర్ట్ తీసుకోవడం అన్ని చకాచకా జరిగిపోయాయి. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ సాగే ఈ బైక్రైడింగ్లో పాల్గొన్న నలుగురు అమ్మాయిలో నేను ఉండటం గర్వంగా అనిపించింది. ఇది లైఫ్ టైమ్ ట్రిప్. మా ట్రిప్ విజయవంతంగా పూర్తికావడంతో స్నేహితులు, బంధువులు ఎంతో అభినందించారు. డ్యూటికి నా ప్యాషన్ తోడు కావడంతో డిపార్ట్మెంట్ లో హేళన చేసిన వారే గొప్పగా మాట్లాడారు. బైకింగ్ అంటే ఎంత ఇష్టమో.. ఫ్రెండ్ జయభారతి, తన ఇద్దరు పిల్లలు అంటే కూడా అంతే ఇష్టం. అందుకే పచ్చబొట్టుగా పదిలపరుచుకున్నాను. థారులాండ్ టూర్ తర్వాత తొమ్మిది జిల్లాల్లో తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ రైడ్ నిర్వహించాం. బేగంపేటలోని ట్రాఫిక్ గ్రౌండ్లో టూవీలర్ నేర్పించాం. ఇప్పటివరకు ఐదువందలకు పైగా మహిళలు టూవీలర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.
అమ్మ నుంచే ప్రారంభం..
నా చిన్నప్పుడు మా అమ్మ అందరినీ సమానంగా చూసేవారు. ఆడపిల్ల అని ఏ రోజు నన్ను ఆంక్షల మధ్య పెంచలేదు. అదేవిధంగా నేను నా పిల్లలను పెంచుతాను. నా జీవితంలో ప్రతి మార్పును నా పిల్లలకు అర్థం అయ్యేలా చెప్తాను. వారిని ధైర్యంగా, గౌరవంగా బతికేలా పెంచుతాను. ఆడపిల్లలను తక్కువగా చూసేవారు తమ ఆలోచనలను మార్చుకోనేలా వారి భవిష్యత్త్ తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను. ఆడపిల్ల అన్న వివక్షను ఎదిరించాలంటే అది అమ్మ నుంచే ప్రారంభం కావాలి. ఆడ, మగబిడ్డలను సమానంగా చూసినప్పుడే సమాజంలో లింగవివక్ష తగ్గుతుంది.
- యశోద