Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె కాలుకు గజ్టెకట్టి, చేతిలో చిటికెలు పట్టి పాట పాడుతుంటే ఆహుతులెవరైనా ఆదమరిచి పోవాల్సిందే. ఆమె హరికథా కళాకారిణి... పద్మాలయ. మరుగున పడిపోతున్న కలలకు జీవం పోస్తున్నారు. ఎంచుకున్న కథ ఏదైనా సరే... శభాష్ అనిపించుకోవడం ఆమె వంతు. తండ్రే తన మొదటి గురువని చెప్పే.. ఆ నాగర్కర్నూల్ కళామతల్లి ముద్దుబిడ్డ పద్మాలయ గురించిన పరిచయం.
బుర్రకథలు, యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, నాటికల వంటివి పల్లె ప్రజల నుంచి విడదీయరానివి. రెక్కాడితే గాని డొక్కనిండని పల్లె ప్రజలకు రాత్రిపూట వీటితోనే ఆనందం ఉండేది ఒకప్పుడు. పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు ఇదొక పెద్ద వినోదంగా ఉండేది. ఇందులో సంగీతం, సాహిత్యం అనే బండి చక్రాల మీద నడిచేదే హరికథ. అలాంటి హరికథను జీవంపోస్తూ బతికిస్తున్నది బట్టర్ పద్మాలయ ఆచార్య. నాగరకర్నూల్లో ఉంటున్న ఆమె సొంత ఊరు కొల్లాపూర్ మండలం పెంట్లవెల్లి. వృతిరీత్యా వీరి తండ్రి నరసింహాచార్య నాగర్కూర్నూల్లో స్థిరపడ్డారు. తల్లి జయలక్ష్మి. 1964 సెప్టెంబరు 14న పద్మాలయ జన్మించారు. ఇంటర్ వరకు నాగర్కర్నూల్లోనే చదివిన ఆమె.. ఆ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొంది 18వ ఏటనే ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత డిగ్రీ, పీజీ పూర్తి చేసి, పద్మాలయ పెద్దముద్దనూర్, నాగనూల్, నాగర్కర్నూల్, గగ్గలపల్లి, పెద్దూరు, తాడూరులో విధులు నిర్వహించారు. వనపర్తి పట్టణానికి చెందిన రామచంద్రయ్యతో 1985లో పెండ్లి అయ్యింది. భర్త పౌరోహితం చేస్తున్నాడు. తండ్రి కూడా హరికథలు చెప్పేవారు. దాంతో... ఆమెకు హరికథ అంటే ఆసక్తి పెరిగింది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే తెనాలికి చెందిన రామిరెడ్డి అనే హరిదాసు వనపర్తిలో స్థిరపడి ప్రతివారం హరికథను వినిపించేవారు. తండ్రితోపాటు ఆయనను కూడా తన గురువుగా భావించేవారు. నారాయణదాసు నుంచి కూడా అనేక వినూత్న విషయాలు నేర్చుకున్నారు. 1980లో హరికథల ప్రదర్శనలను మొదలుపెట్టిన ఆమె క్రమంగా ప్రజల మెప్పు పొందుతూ వచ్చారు. ఆమె గొంతు వింటుంటే కోకిల కంటే మాధుర్యంగా ఉంటుంది. ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తోంది. ఎంత సమయం అయినా కథ పూర్తయ్యే వరకు కథకు ప్రజలు హత్తుకుపోయేవారు. ఈమె స్త్రీ పాత్రల కంటే పురుష పాత్రలను అధికంగా ప్రదర్శించారు. శ్రీకృష్ణలీల, శివలీల, భక్తచుచేల, వినాయకవిజయం, హనుమాన్చరిత్ర, కన్యకాపరమేశ్వరీ చరిత్ర, భవననారుషి, ఊరుకొండ మహత్యం వంటి వాటితో పాటు అనేక సాంఘీక వివక్ష, చైతన్యం వంటి కారక్రమాల మీద ప్రదర్శనలు ఇచ్చారు. భక్యాలు, బడిదొంగ, అల్లరిపిల్లలు, దురాష, గుణపాటం, ప్రత్యక్షపురాణం, దేవతావస్త్రాలు, పరమానందయ్య శిష్యులు వంటి పుస్తకాలను తానే రచించి హరికథలుగా చెప్పినారు. పరమానందయ్య శిష్యుల కథను కూడా స్వయంగా రచించి గానం చేశారామే. రాష్ట్రాలకే పరిమితం గాకుండా అనేక దేశాలు తిరిగి ప్రదర్శలు ఇచ్చారు. రుక్మిణి కళ్యాణం, వర్తనశాల, గజేంద్రమోక్షం, గోగ్రహణ, పార్వతీ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం, సీతా కళ్యాణం అనేక కథనలు ప్రదర్శనలు ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారు.
ప్రధానంగా వేసవి కాలంలో అధిక ప్రదర్శనలు ఇస్తుంటారు. ఇప్పటివరకు ఈమె 5వేల ప్రదర్శనలు ఇచ్చారు. దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చిన పద్మాలయకు అనేక ఆవార్డులు వచ్చాయి. దుబాయికి చెందిన వేవ్ రిజోనెన్స్ ఈవెంట్స్ సంస్థ ప్రాచీణ హరికథతో కళలకు జీవం పోస్తున్న పద్మాలయను సన్మానించి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ ఆవార్డును అందజేశారు. ఆర్థనూటపదాహర్లు, నూట పదహార్లకు కూడా కచేరి చేసిన సందర్భాలు ఉన్నాయి. టీవీ, సాంకేతికత కారణంగా గ్రామాల్లో ప్రజలకు కళలు దూరం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ జీవన చిత్రపటాన్ని తెలియజేసే కళలను ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బతికించుకోవాలని ఆమె కోరుతున్నారు. పురాణ పురుషుల ఇతిహాసాలే గాకుండా సాంఘీక దురాచారాలపై కూడా విస్తృత ప్రదర్శనలు ఇస్తున్నారమే. తన తండ్రి కల నెరవేరేందుకు ఏటా కొంత మంది ఔత్సాహుకులకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే 'నవ్వుల నావ', 'ఊరుకుంద వీరన్న చరిత్ర', 'పాలమూరు జిల్లా హరికథలు', 'ఉప్పరిపల్లి అమ్మవార్ల దివ్య చరిత్ర', 'సోమశిల కీర్తనలు', 'పసిడి మొగ్గలు', 'హరికథా ఆవిర్బావం', 'వివేకానంద', 'రాధికారాధనం సమీక్ష', 'బాబోరు ఫోన్' హాస్య కథ, వివిధ నాటికలు, బాలగేయాలు ఆమె రచించారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించిన ఆమెకు 2000లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ, 2016లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ ఆవార్డు లభిచింది.
సంగీత కళాశాల ఏర్పాటు లక్ష్యం...
''ఎంత సాంకేతికత పెరుగుతుందో... అంత మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఇచ్చే ఏ కార్యక్రమం అయినా ప్రజలను చైతన్యం కల్గించే విధంగా ప్రదర్శనలు చేస్తున్నార. కులం, మతం వంటివి మనిషి ఎదుగుదలను నాశనం చేస్తున్నవి. ట్రైజమ్, డోక్రా పథకాలు వంటి అనేక అంశాలపై ప్రదర్శనలు ఇచ్చాను. గ్రామీణ కళలు అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యతపై ప్రజలు, ప్రభుత్వాలపై ఉన్నది. గ్రామాల్లో కళలు నశించిపోకుండా ప్రభుత్వం ఓ సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలి. రాబోయే తరాలు కళలను మరిచిపోకుండా ఉండాలంటే వాటిని అధ్యయనం చేయాలి. భావితరాలకు ఈ కళలను అందించేందుకు కృషి చేయాలి. నేను ఉద్యోగ విరమణ చేయగానే ముందు సంగీత కళాశాలపై దృష్టి పెడతాను. ఈ విషయమై అభిమానులు, ప్రజల సహకారం కూడా అవసరం''