Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1930, డిసెంబర్ చివరి రోజులు. హైదరాబాద్ సుల్తాన్షాహీలోని ఓ మహాభవనంలో చలికాలపు సాయంత్రాన మిస్ తాహిరా హాషిమ్ అలీ ఖాన్ జన్మించింది. పేరులాగే ఆమె మనసెంతో స్వచ్ఛమైనది. హృద్యమైనది.
- నిజాం సంస్థానంలో సుసంపన్నమైన కుటుంబం నుంచి వచ్చినా... నర్సింగ్ వృత్తిని ఎంచుకున్నారు తాహిరా. బాల్యంలో చెట్లు, పుట్టలు పట్టుకుని తిరిగిన అల్లరిపిల్ల... ఫ్లారెన్స్ నైటింగెల్ ప్రేరణతో నర్సింగ్లోకి అడుగు పెట్టారు.
- ఆ రోజుల్లో నర్సింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఏకైక వ్యక్తి. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి ఫౌండర్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్గా ఎందరో యువతులకు స్ఫూర్తి ప్రదాత.
తాహిరాకు ఐదుగురు అక్కలు, ఒక అన్న. ఏడుగురిలో చివరి వ్యక్తి. తండ్రి హాషిమ్ అలీ ఖాన్. ఐసీఎస్ చదివారు. తరువాత లా చేసి... హైకోర్టులో జడ్జిగా పనిచేస్తుండేవారు. పుట్టుకతోనే ఎడమకంటి చూపు లేదామెకు. అది తెలిసి తల్లిదండ్రులు బాధ పడ్డారు. జర్మనీకి తీసుకెళ్లారు. 'ఓ నెర్వ్ దెబ్బతినడం వల్ల చూపు పోయింది. ఏం చేయలేం' అన్నారు డాక్టర్లు. ఒక కన్ను కనిపించకపోవడం ఆమెకు పెద్ద ఆటంకం కాలేదు. తండ్రి హాషిమ్ అలీ ఖాన్... నిజాం రాజ్య ప్రధాన పరిపాలన అధికారి నవాబ్ మెహదీ నవాబ్ జంగ్ సన్నిహితులు. ఇద్దరూ కలిసి... బంజారాహిల్స్ను చదును చేసి.. ఇండ్లకు అనువైన స్థలంగా చేయించారు. దాంతో.. ఇరువురి కుటుంబాలు బంజారాహిల్స్కు మారాయి. అలా ఏడేండ్ల వయసులో తాహిరా కుటుంబం బంజారాహిల్స్కు తరలింది.
అల్లరిపిల్ల..
బాల్యంలో ఒట్టి అల్లరి పిల్ల తాహిరా. బంజారాహిల్స్లోని చెట్లు, పుట్టలెమ్మటి తిరిగేది. ఆమెను పట్టలేక తల్లి అలసిపోయేది. చాలా జిద్దీ. ఓసారి అక్కలతో గొడవ పడిన ఆమె... ఇంట్లో బట్టలన్నీ ఓ చద్దర్లో సర్దుకుని వెళ్లిపోయింది. ఓ పెండ్లికి వెళ్లిన తండ్రి ఇంటికి వచ్చేసరికి ఆమె లేదు. అంతటా వెదికారు. చివరకు ఎడ్లకొట్టం దగ్గర ఉన్న గదిలో పడుకుని ఉన్న ఆమెను లేపి ఇంటికి తీసుకొచ్చారు. ఆమె అల్లరికి విసిగి వేసారిపోయిన తల్లి.. బొల్లారం సెంటాన్స్లోని బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. ఇంట్లో పూర్తిగా ముస్లిం వాతావరణం.. స్కూల్లో పూర్తిగా క్రిస్టియిన్ వాతావరణం. ఇలా భిన్నమైన వాతావరణాల మధ్య పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదిగారు తాహిరా.
ఫ్లారెన్స్ నైటింగెల్ స్ఫూర్తితో...
స్కూలింగ్ తరువాత... కోటి ఉమెన్స్ కాలేజీలో చేరారు. ఆమె కజిన్...ఢిల్లీలోని మెడిసిన్ చదువుతుండేవారు. తానూ ఢిల్లీకి వెళ్లి చదువుకోవాలని ఆశ. మెడిసిన్తోపాటు... అక్కడి రాజకుమారి అమృత్ కౌర్ కాలేజ్ ఫర్ బీఎస్ హానర్స్ ఇన్ నర్సింగ్లోనూ దరఖాస్తు చేశారు. రెండింటిలోనూ సీటు వచ్చింది. కానీ బాల్యం నుంచి ఫ్లారెన్స్ నైటింగెల్ నుంచి స్ఫూర్తి పొందిన ఆమె... నర్సింగ్లో చేరడానికే సుముఖత చూపారు. సుసంపన్న ముస్లిం కుటుంబం. నర్సింగ్ చేయడమేంటన్న ప్రశ్న. అయినా తను పట్టిన పట్టు వదలలేదు. దేశ విభజన తరువాత జరిగిన కలహాల వల్ల కొంతకాలం హైదరాబాద్కు వచ్చేశారు. తిరిగి ఢిల్లీ వెళ్లి... 1953లో నర్సింగ్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తిరిగి రాగానే లాల్దర్వాజలోని ఎమ్సీహెచ్ సెంటర్లో హెల్త్ విజిటర్గా ఉద్యోగం వచ్చింది. అప్పట్లో నర్సింగ్లో డిగ్రీ చేసిన ఏకైక వ్యక్తి. అలాంటామె... హెల్త్ విజిటర్గా పనిచేయడమేంటని... రెడ్ హిల్స్లోని 'హెల్త్ విజిటర్ స్కూల్'కి అసిస్టెంట్ సూపరిం టెండెంట్గా డిప్యూట్ చేశారు. మూడేండ్లపాటు అక్కడ పనిచేశారు. తరువాత విశాఖపట్నం 'హెల్త్ విజిటర్ స్కూల్'లో శిక్షణ ఇచ్చేందుకు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే బోస్టన్లో ఎమ్ఎస్సీ నర్సింగ్ చదివేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి స్కాలర్షిప్ వచ్చిందామెకు.
నర్సింగ్ కాలేజీ ఏర్పాటులో..
బోస్టన్ నుంచి తిరిగి రాగానే... డీఎమ్ఈ డాక్టర్ కెఎన్ రావు.. నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ ఆమెను కోరారు. అట్లా 1959 నుంచి 63 వరకు స్పెషల్ ఆఫీసర్గా... కాలేజీ ఏర్పాటు చేశారు. అప్పటికి ఆమెకు 28 ఏండ్లు. పీజీ పూర్తి చేసి అప్పుడే ఇండియాకు వచ్చారు. అప్పటికే ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా మహామహులున్నారు. సమావేశాల్లో వాళ్లందరితో కూర్చోవాల్సి వస్తుంది. సమాన హౌదా ఇవ్వాలి. కేవలం చిన్న వయసు కావడం వల్లే ప్రిన్సిపల్ హౌదా ఇవ్వలేదు. నాలుగేండ్ల తరువాత ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటినుంచి 1985 వరకు 22 ఏండ్లపాటు కాలేజీ ప్రిన్సిపల్గా... పబ్లిక్ హెల్త్ నర్సింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా వ్యవహరించారు. వాషింగ్టన్లోని డిపార్ట్మెంట్ ఆప్ హెల్త్ ఎడ్యుకేషన్ అండే వెల్ఫేర్ సహాయంతో పబ్లిక్ హెల్త్పై అధ్యయనం చేశారు. తరువాత కొలంబియా యూనివర్సిటీలోని టీచర్స్ కాలేజీనుంచి టీచింగ్లే ఎమ్మే చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టంట్గా అనేక ఎన్నో యూనివర్సిటీలకు సలహాదారురాగా పనిచేశారు.
విజయ విహార్లోకి..
అప్పటిదాకా దేశంలో ఉన్న నర్సింగ్ కాలేజీలు రెండే రెండు. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఢిల్లీలోని ఆర్ఏకే కాలేజీ. వెల్లూర్లో మరోటి. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ఉండేది. అలా 1959లో ప్రారంభ మైంది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వపు నర్సింగ్ కాలేజీ... కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ఉండేది. మిస్ థా ఖాన్ ప్రిన్సిపల్గా.... మిస్ ఫ్లారెన్స్ మిల్టన్, మిస్ నాయక్ ట్యూటర్స్గా ఒక ఎరా మొదలైంది. కాలేజీ ఏర్పాటైంది. కానీ భవనం లేదు. రాజ్భవన్ పక్కనే ఉన్న విజయ్ విహార్ను అప్పటి మంత్రి కళావెంకట్రావుకు నివాసంగా ఇచ్చారు. ఊహించని విధంగా ఆయన మరణించడంతో 1959లో భవనం ఖాళీ అయ్యింది. ఆయన అలా అకస్మాత్తుగా ఎందుకు చనిపోయారనే అనుమానం అందరికీ ఉండేది. అందుకే ఆ భవనం లోకి వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. ఖైరతాబాద్ అప్పుడప్పుడే విస్తరిస్తున్న నగరడానికి గుండె కాయ. దాంతో ఆ భవనం కావాలని మిస్ ఖాన్ పట్టుబట్టారు. ఆమె పోరాటంతో చారిత్రాత్మక భవనం విజయ్ విహార్ నర్సింగ్ కాలేజీ భవనమైంది. మొదటి అంతస్తును హాస్టల్గా, గ్రౌండ్ ఫ్లోర్ కాలేజీ, లైబ్రరీ, ఇతర సిబ్బంది కార్యాలయాలుగా ఉపయో గించారు. 25 సీట్లు... నాలుగు సంవత్సరాలకు వంద మంది విద్యార్థులు. తక్కువ విద్యార్థులు కావడంతో ఎంతో శ్రద్ధతో బోధించేవారు. ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు.
ఆత్మీయ స్పర్శ..
హైదరాబాద్ నర్సింగ్ కాలేజీ అనగానే గుర్తొచ్చేది... విజయ్ విహార్, మిస్ ఖాన్ ముఖ చిత్రం. తన ప్రత్యేకమైన, అరుదైన వ్యక్తిత్వంతో విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నారామె. నిత్యం ముఖంపై చిరునవ్వుతో కరుణగలిగిన మనిషి. ఆ వ్యక్తిత్వమే విద్యార్థులు ఆమెను అమితంగా ఇష్టపడేట్టు చేసింది. కాలేజీలో విద్యార్థులు ఎవరన్నా ఏడస్తున్నారని తెలిసినా వెంటనే కార్ తీసుకుని కాలేజీకి వెళ్లేవారు. ఓసారి భూకంపం వచ్చింది. ప్రమాదం ఏం జరగలేదు. గిన్నెలు మాత్రమే పడ్డాయి. అయినా పిల్లలకు ఏమైందోనని.. అర్ధరాత్రి హుటాహుటిన కాలేజీకి వెళ్లారు. ఆ రాత్రంతా విద్యార్థులతోనే ఉన్నారు. అప్పటిదాకా తెలుగు మీడియంలో చదివి వచ్చిన విద్యార్థులు. నర్సింగ్ అంతా ఆంగ్లంలో. ఒకేసారి ఇంగ్లీష్ నేర్చుకోవడం మాట్లాడటం ఇబ్బందిగా ఉండేది. వాళ్ల ఇబ్బందులను సులభంగా తొలగించే వారు. ఇంగ్లీష్ అంతగా రాని యువతులపై ప్రత్యేక శ్రద్ధ చూపే వారామె. పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. తల్లిలాగా డీల్ చేసేవారు. 'మా తిండి విషయం లోనూ ఎంతో జాగ్రత్త వహించే వారు. 'తల్లిండ్రులను వదిలేసి... పిల్లలు మన దగ్గరకు వచ్చారు. వాళ్లకు మంచి తిండి పెట్టకపోతే మిమ్మల్ని డిస్మిస్ చేస్తాను' అని వంటవాళ్లను బెదిరించేవారు'' అని ఆమె 90వ బర్త్డేనాడు తెచ్చిన పుస్తకంలో ఆమె విద్యార్థులు పంచుకున్నారు. వృత్తిగతంగానే కాదు... విద్యార్థులు వ్యక్తులుగా ఎదగడానికి తోడ్పడ్డారు. డిగ్నిటీతో బతకడం నేర్పించారు. వేలాది మంది విద్యార్థులకు ఆమె స్ఫూర్తి ప్రదాత.
మరిన్ని కాలేజీల ఏర్పాటుకు...
విజయ విహార్ కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు.. ఎన్నో ఆశలతోవచ్చిన అమ్మాయిలను ప్రొఫెషనల్స్గా తీర్చిదిద్ధిన ఆలయం. నర్సింగ్ను కేవలం ఒక వృత్తిగా బోధించలేదు. ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా నేర్పించారు. కేవలం కాలేజీ హక్కుల కోసమే కాదు.. ఉస్మానియా హాస్పిటల్లో వసతుల కోసం పోరాడారామె. పబ్లిక్ హెల్త్ మీద ఇంత ఎక్స్పోజర్ ఇచ్చిన కాలేజీ లేదంటారు ఆమె విద్యార్థులు. 79 వరకు ఆంధ్రప్రదేశ్లో అది ఒక్కటే నర్సింగ్ కాలేజీ. ఆ తరువాత ఆంధ్ర ప్రాంతం కోసం విశాఖపట్నంలో ఒకటి ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రాంతం కోసం 81లో కర్నూలో ఇంకో కాలేజీ ప్రారంభమయ్యింది. తరువాత తిరుపతి, నిమ్స్లోనూ కాలేజీలు ఏర్పాటయ్యాయి. కేవలం ప్రిన్సిపల్గా తన కాలేజీ బాధ్యతలు చూడటమే కాదు... ఇతర నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ఆమె అందించిన సహాయ సహకారాలు మరువలేనివి. 1984లో హైదరాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఎమ్ఎస్సీ నర్సింగ్నూ ప్రారంభించారు. మూడేండ్ల ముందే స్వచ్ఛంద పదవీవి రమణ చేసిన తాహిరా... ఆ తరువాత తన సేవను కొన సాగించారు. రాజ్భవన్ ఎదురుగా ఉన్న మఖ్త.. ఇప్పుడు కాస్త అభివృద్ధి చెందింది. కానీ ఆ రోజుల్లో మురికివాడ. అక్కడవారి వైద్యం కోసం పనిచేశారు. ఆడపిల్లలకు చదువు చెబుతూ వాళ్ల సాధికారత కోసం కృషి చేశారు. ఇటీవలే 90వ పుట్టిన రోజును జరుపుకొన్న ఆమె... ఇప్పటికీ యాక్టివ్గా తన పనులు తాను చేసుకుంటారు. గార్డెనింగ్ అంటే ఇష్టం. ఇప్పటికీ తోట పనులు చూస్తుంటారు.
ఇప్పుడు నర్సింగ్ కేవలం ఉద్యోగం..
''నర్సింగ్ అంటే డాక్టర్స్ ఏది చెబితే అది చేయడం కాదు. మందులివ్వడం ఒక భాగమే. రోగి అవసరాలు.. మనసు విప్పి మాట్లాడటం, ఒక్కోసారి కేవలం చేయి పట్టుకుని నిలబడితే సరిపోతుంది. నర్సింగ్ అంటే మనిషికి తోడుగా ఉండటం. 'బాధలో నేనున్నాను' అని చెప్పడం. ఇప్పుడు నిజమైన నర్సింగ్ ఎవ్వరూ చేయడం లేదు. 1990 చివర్లలో ప్రయివేటు కాలేజీల పరంపర మొదలైంది. ఇప్పుడు నాలుగువందల కాలేజీలున్నాయి. కానీ వాటిలో నాణ్యత లేదు. ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. నర్సింగ్ కేర్ వాల్యూస్ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు జాబ్ కోసం, లేదా విదేశాలకు వెళ్లడం కోసం చదువుతున్నారు. నర్సులు కేవలం డాక్టర్లను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు మహిళలపై అనేక ఆంక్షలుండేవి. ఇప్పుడు ఇష్టమున్నది చదువుకునే, ఇష్టమైన ఉద్యోగం చేసే అవకాశం ఉన్నది. ఏ కొద్దిమందికో నచ్చిందే చేసే అరుదైన అవకాశం ఉండేది. అలా నేను నర్సింగ్ చేయగలిగాను. నేను ప్రిన్సిపల్ అయిన తరువాత.. అక్కలు, అన్న కాలేజికి వచ్చి చూసి గర్వపడ్డారు. ఇక పెండ్లి ఆలోచనే ఎప్పుడూ రాలేదు. పనే ప్రపంచంగా ఉండేది. నర్సింగ్ చేశాక అదే లోకమయ్యింది. ఇన్బిల్ట్గా వచ్చిందనుకుంటా.''