Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్లోబల్ వార్మింగ్ పై ఎక్కు పెట్టిన బాణాలు
నలుగురు యువతుల రెండేండ్ల సహవాసం, ఏడేండ్ల పరిచయం వారిలోని ఆలోచనల్లో సారూప్యత తీసుకువచ్చింది. వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి అంతరంగాల్లో కదిలే భావాలకు రూపమిస్తే.. అందమైన కళాకృతులుగా మారాయి. నలుగురు వేరువేరు థీమ్స్ తీసుకున్నా అందులోని అంతరార్ధం మాత్రం ఒక్కటే గ్లోబల్వార్మింగ్.
లలిత బండారు, అపరాజిత వాసుదేవ్, విక్కీ అరవిందన్, ప్రగ్యా భార్గవ. మారుతున్న పరిస్థితులపై వారు వేసిన చిత్రాలకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ తొలిసారి వేదికగా మారింది.
వారి పరిచయం..
లలిత.. పుట్టిపెరిగింది హైదరాబాద్లోనే. చిత్రలేఖనంపై మక్కువ తో ఆమె 2011లో సింగపూర్లోని లసలే ఆర్ట్స్ కాలేజీలో చేరారు. ఆ తర్వాత లండన్లోని చెల్సియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో ఎంఏ పూర్తి చేసి ప్రస్తుతం అమెరికాలో కిర్క్లాండ్ ఆర్డ్ సెంటర్లో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఆమె తన తొలి ప్రదర్శన 2010లోనే నిర్వహించారు. భారతదేశంలోని వివిధ నగరాలతో పాటు సింగపూర్, లండన్, అమెరికా లలో తన కళాఖండాలను ప్రదర్శించారు. ఫ్యూచర్ లీడర్ స్కాలర్షిప్, లసలే మెరిట్ స్కాలర్ షిప్ అందుకున్నారు. బెల్జియంలో 2015లో నిర్వహించిన 'వార్ప్ ఆర్టిస్ట్ విలేజ్ ' ఆర్ట్ ఫోరమ్లో పాల్గొన్న అతి చిన్న వయసు కళాకారిణిగా రికార్డు సృష్టించారు. క్లిఫోర్డ్ ఛాన్స్ స్కల్ప్చర్ ప్రైజ్ 2017కు ఎంపిక చేసిన షార్ట్ లిస్ట్లో ఆమె పేరు చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ స్టూడియో జాన గ్రేడ్లో పనిచేస్తున్నారు.
తన చిత్రాల గురించి లలిత మాట్లాడుతూ..'ప్రకృతిలో వస్తున్న మార్పులను ఇతివృత్తంగా తీసుకుని సముద్ర గర్భంలో ఉండే రంగు రంగుల కోరల్స్పై వేసిన ఆర్ట్స్ ఈ ప్రదర్శనలో ఉన్నాయి. వింతవింత రంగులతో అద్భుతంగా కనిపించే కోరల్స్ సముద్రంలో కలుస్తున్న కలుషితాలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణంలో మార్పుల మూలంగా చనిపోతున్నాయి.. వాటిలోని వర్ణాలన్నీ మాయమై క్రమంగా వివర్ణంగా మారడం చిత్రాల ద్వారా చూపిస్తున్నాను. ప్రకృతి విధ్వంసం కారణంగా సాగర అంతర్భాగంలోనూ వస్తున్న మార్పులే ప్రేరణగా ఈ చిత్రాలు ఉంటాయి' అంటున్నారు.
ప్రగ్యా భార్గవ..
ఢిల్లీ సమీపంలోని గుర్గాన్ ఆమె స్వస్థలం. విజువల్ బేస్డ్ ఆర్టిస్ట్గా పేరుతెచ్చుకున్న ఆమెకు ఫోటోగ్రఫీలోనూ ప్రతిభ ఉంది. సింగపూర్లోని లసలే కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్లో బ్యాచురల్ డిగ్రీ పూర్తి చేశారు. సింగపూర్, మలేషియా, స్విట్జర్లాండ్ లో ఏర్పాటుచేసిన ప్రదర్శనల్లో ఆమె తాను గీసిన చిత్రాలను ప్రదర్శించారు. లాసలే మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైన ఆమె రెండేండ్ల పాటు మిగతా ముగ్గురితో కలిసి సింగపూర్లో చదివారు. ఆ సమయంలో నలుగురు కలిసి ఉన్న ఇంటి నెంబర్తోనే తమ చిత్రాల ప్రదర్శనను '16/ 622 కలెక్టివ్' పేరుతో నిర్వహిస్తున్నారు. 2013లో విన్స్టన్ ఓహ్ ట్రావెల్ ప్రాక్టీస్ అవార్డు అందుకున్న ఆమె ప్రస్తుతం గుర్గావ్లో 'ది ఆర్ట్ రూం'లో ఫ్యాకల్టీగా పార్ట్టైమ్ జాబ్ చేస్తూ.. ఫుల్ టైమ్ ఆర్ట్కే కేటాయిస్తున్నారు. ఆమె తన చిత్రాల గురించి వివరిస్తూ..'లాండ్ స్కేప్లపై నేను ఎక్కువగా ఫోకస్ చేశాను. పర్వతాలు అనగానే.. పచ్చదనంతో కళకళలాడే ఎత్తైన కొండలను ఊహించుకుంటాం. కానీ, ఇప్పుటి పరిస్థితులు మన ఊహలకు భిన్నంగా ఉన్నాయి. పర్యావరణంలో వస్తున్న మార్పులు ప్రకృతిపై ప్రభావం చూపిస్తూ.. పెనుమార్పులకు కారణం అవుతున్నాయి. వాటిని నేను నా చిత్రాల ద్వారా ప్రదర్శిస్తున్నాను' అంటున్నారు.
వికీ అరవింద్..
సింగపూర్ ఆమె స్వస్థలం. ప్రస్తుతం లాస్ఏంజిల్స్లో ఉంటున్నారు. లాసలే కాలేజ్ ఆఫ్ ది ఆర్ట్స్లో బిఏ(హాన్స్) లో మిగతా ముగ్గురికి ఆమె క్లాస్మెట్. మెరిట్ స్కాలర్ షిప్ అందుకున్నారు. ఆ తర్వాత కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ది ఆర్ట్స్ లో ఎంఎఫ్ఎ పూర్తి చేశారు. సింగపూర్, మలేషియా, వియత్నాం, స్విట్జర్లాండ్, అమెరికా తదితర దేశాల్లో అనేక ప్రదర్శనలు నిర్వహించారు. 2013లో విన్స్టన్ ఓహ్ ట్రావెల్ ప్రాక్టీస్ అవార్డు అందుకున్న ఆమె 'ది ప్రూడెన్షియల్ ఐ అవార్డు' , 'కాల్ఆర్ట్స్ డీన్ స్కాలర్షిప్'లకు నామినేట్ అయ్యారు.
తన చిత్రాల గురించి వివరిస్తూ..'నేను సింగపూర్లో పుట్టిపెరిగాను. నా చిన్నప్పటి వాతావరణం ఇప్పటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. పెరుగుతున్న వలసల కారణంగా అక్కడి ప్రజాజీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. భాష, సంస్కృతి మారిపోయాయి. గ్లోబలైజేషన్ కారణంగా కాలనైజేషన్ పెరగడం తదితర మార్పులతో చోటుచేసుకున్న అంశాలను ప్రతిబింబించేలా వేసిన చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. మొదటిసారి మేం నలుగురం కలిసి నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ద్వారా మా ఆలోచనలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాం' అంటున్నారు. హైదరాబాద్లో ఈనెల 18వరకు మా చిత్రాల ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత దేశంలోని వివిధ నగరాల్లో, అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాం.
అపరాజిత వాసుదేవ్..
బెంగుళూరుకు చెందిన ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైనర్. సింగపూర్లోని లాసలే కాలేజ్ ఆఫ్ ది ఆర్ట్స్ (లండన్లోని గోల్డ్స్మిత్ అనుబంధ ఆర్ట్స్ కాలేజీ )లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఇంగ్లీస్ సాహిత్యంలో డిగ్రీ, యానిమేషన్లో డిప్లొమా పూర్తి చేసిన అపరాజిత కమర్షియల్ డిజైనింగ్ రంగంలో క్రియేటివ్ హెడ్గా పనిచేస్తున్నారు. భరతనాట్యం కళాకారిణిగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె ప్రస్తుతం 'ఆర్ట్ అండ్ డిజైన్ కన్సెల్టింగ్' సంస్థ తరపున ప్రభుత్వంతో కలిసి పబ్లిక్ ప్లేసెస్లో ఆర్ట్స్ ఫామ్స్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. తాను ఎంచుకున్న ఇతివృత్తం చాలా విభిన్నమైంది. మనిషి జ్ఞాపకశక్తి నేపథ్యంలో ఆమె చిత్రాలు ఉంటాయి. వాటి గురించి వివరిస్తూ..' ఆధునికయుగంలో మనిషి అన్నింటికీ యంత్రాలపై ఆధారపడి జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. ఒక మనిషి తాను చూసిన ప్రదేశాన్ని, వ్యక్తిని, సంఘటనను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు స్పష్టమైన రూపం కనిపించదు. అలా కొన్నికొన్ని ఆనవాళ్లు మాత్రమే వారి మనోఫలకంపై ముద్రించబడి ఉంటాయి. గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో కనిపించే వాటికే చిత్రరూప మిచ్చాను' అంటున్నారు అపరాజిత.
లలిత, అపరాజిత, వికీ ప్రగ్యా.. ఈ నలుగురు వేసిన చిత్రాలలో అంతర్లీనంగా కనిపించే అంశం మాత్రం గ్లోబలైజేషన్, గ్లోబల్వార్మింగ్ కారణంగా వచ్చిన .. వస్తున్న మార్పులే.
- వి. యశోద