Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారికి ఆకలిదప్పులు తెలియవు.. తమ పనులు తాము చేసుకోలేరు.. బాహ్యప్రపంచంతో వారికి సంబంధం లేదు.. అయినా ఆమె కనిపించగానే వారి పెదాలపై చిరునవ్వు..కన్నవారిని సైతం గుర్తుపట్టలేని మానసిక స్థితిలో ఉన్నా.. ఆమెను చూడగానే వారి కండ్లలో ఆనందం. ఇంటలెక్చువల్లీ డిసెబుల్డ్ చిన్నారులను కంటిపాపలా చూసుకునే ఆమె సమాజంలో వారిని మిళితం చేసే ప్రక్రియలో నిమగమై ఉన్నారు. ఆమే శ్రీవిద్యాస్స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంత వెంకట్. సమాజం నుంచి దూరంగా ఉంచబడుతున్న స్పెషల్ చిన్నారులను మోటివేట్ చేస్తూ.. వారి పనులు వారు చేసుకునేలా వివిధ స్థాయిల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సంస్థలో శిక్షణ తీసుకున్న పదకొండుమంది ఉద్యోగాలు చేస్తూ.. కుటుంబానికి అండగా ఉంటున్నారు. ఈస్ట్ మారేడ్పల్లిలో ప్రత్యేక పిల్లల కోసం శ్రీ విద్యాస్ సెంటర్ స్థాపించి ఇరవైయేండ్లుగా సేవలందిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఈనెల 26 నుంచి 28వరకు స్పెషల్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె పరిచయం..
నాన్న నారాయణరావు రైల్వేలో పనిచేసేవారు. అమ్మ సరోజ. ఆమె సేవ అన్న పదానికి మరోపేరు. అన్నయ్య తర్వాత నలుగురం ఆడపిల్లలం. మాలో ముగ్గురం స్పెషల్ చిల్డ్రన్ టీచర్స్గా ఉద్యోగాలు చేస్తున్నాం. చిన్నచెల్లారు అడ్వకేట్. నేను ఇంటర్ పూర్తికాగానే హైదరాబాదు నేషనల్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ సంస్థలో చేరి స్పెషల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేశాను. నాగార్జున యూనివర్సిటీ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎంఏ, ఎంఏ సైకాలజీ, ఫిలాసఫీ పూర్తి చేశాను. ఆ తర్వాత ఒక ప్రైవేటు స్కూలులో టీచర్గా పనిచేశాను. వేసవిసెలవుల్లో ఖాళీగా ఉండకుండా స్వచ్ఛందంగా పనిచేద్దామని మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం ఒక ఇనిస్టిట్యూట్కు వెళ్ళాం. అక్కడ ఉన్న పిల్లల్లో ఉండే వైకల్యాన్ని బట్టి వివిధ విభాగాలున్నాయి. సందర్శకులు, దాతలు అన్ని విభాగాలకు వెళ్లేవారు. కానీ ఇంటలెక్చువల్లీ డిసెబుల్డ్ విభాగానికి వెళ్లడానికి భయపడేవారు. ఆ పిల్లలు శుభ్రంగా ఉండరని, మీద పడతారని వారిని దూరంగా ఉంచేవారు. అది గమనించిన మేం అక్కడి ప్రిన్సిపాల్ను కలిసాం. ఇక వీరి జీవితం ఇంతేనా అని బాధపడ్డాం. అప్పుడు ఆయన ' వీరికి శిక్షణ ఇస్తే తమ పనులు తాము చేసుకోగలుగుతారు. వాళ్ల జీవితాన్ని వాళ్లే లీడ్ చేసుకుంటారు. అయితే వారికి నేర్పించడానికి ఓపిక కావాలి' అన్నారు. ఇంటలెక్చువల్లీ డిసెబుల్డ్ కోసం ప్రత్యేక మైన స్కూలు ఏర్పాటుచేయడానికి సమాజంలో వారి పట్ల ఉన్న నిర్లక్ష్య భావం కారణమైంది. పెండ్లి తర్వాత మా ఆయన వెంకటేశ్వర్లు కూడా ఎంతో ప్రోత్సహించా రు. ఆయన భావాలు నా ఆలోచనలకు దగ్గరగా ఉండటంతో 1997లో శ్రీ విద్యాస్ కేంద్రం ఏర్పాటు చేశాం.
ఇరవైయేండ్లుగా..
స్కూలుతో పాటు రెసిడెన్షియల్ స్కూలు కూడా ఏర్పాటుచేశాం. మొదట్లో మాకు ఇల్లు కిరాయికి ఇవ్వడానికి కూడా భయపడేవాళ్లు. పిల్లలను తీసుకుని వేరేవేరే చోటకు మారేవాళ్ళం. ఆ తర్వాత దాతల సహాయంలో ఒక భవనంలో ప్రస్తుతం మా స్కూలు నడుస్తుంది. ఇప్పటికీ రెండు దశాబ్దాలుగా వందలాది మంచి మా సంస్థ ద్వారా శిక్షణ తీసుకుంటున్నారు. వారిలో నాలుగేండ్ల వయసు నుంచి 50ఏండ్ల వరకు ఉంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా వారంతా చిన్నపిల్లల మాదిరిగానే ప్రవర్తిస్తారు. మా సంస్థలో శిక్షణ తీసుకుని సమాజంలో ఒకరుగా జీవిస్తూ.. వారి కుటుంబాలకు అండగా ఉంటున్నవారు కూడా ఉన్నారు.
లెవల్ ప్రకారం..
మా వద్ద హస్టల్లో ఉన్న వసతి సదుపాయాలు 50మందికి మాత్రమే సరిపోతాయి. అందుకే గత రెండేండ్ల నుంచి కొత్తగా అడ్మిషన్లు తీసుకోవడం లేదు. అయితే స్కూలులో దాదాపు వందమంది ఉన్నారు. డే స్కాలర్గా ఎక్కువ మందిని తీసుకుంటున్నాం. మా వద్ద శిక్షణ పొందిన సిబ్బంది పిల్లలకు కావల్సిన శిక్షణ ఇస్తారు. మా వద్దకు వచ్చేవారిని మొదటి పదిరోజులు అబ్జర్వేషన్లో పెట్టి మాతో ఉన్న చెక్లిస్ట్ ప్రకారం వారి పరిస్థితిని అంచనా వేస్తాం. కొంతమంది వారి పనులు కూడా చేసుకోలేరు. మలమూత్ర విసర్జనపై నియంత్రణ ఉండదు. ఆకలి అని కూడా చెప్పలేరు. మరికొందరు ఇతరులను చూస్తే భయపడతారు. ఇలా వివిధ స్థాయిల్లో ఉండేవాళ్ళను క్లాసిఫై చేస్తాం. ఐక్యూ పరీక్ష చేసి వారి తల్లిదండ్రులతో మాట్లాడి మా స్కూలులో చేర్చుకుంటాం. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు స్కూలు ఉంటుంది. ముందుగా వారి సొంతపనులు చేసుకునేలా అవగాహన కల్పిస్తాం. మెల్లమెల్లగా వారు తమ పనులను చేసుకోవడంతో పాటు ఆహారపదార్థాలను గుర్తుపట్టడం ప్రీప్రైమరీ లెవల్లో నేర్పిస్తాం. ప్రైమరీ లెవల్లో పెన్సిల్, పెన్ను పట్టుకోవడం, అక్షరాలను గుర్తు పట్టడం అలవాటు చేస్తాం.
చిన్నచిన్న పనులు..
ప్రైమరీ లెవల్ దాటిన తర్వాత వారికి చిన్నచిన్న పనులు నేర్పిస్తాం. ముఖ్యంగా మనీ మేనెజ్మెంట్ గురించి అవగాహన కల్పిస్తాం. నెలకు ఒకసారి పదిహేనుమందిని తీసుకుని బయటకు వెళ్తాం. వారిని గమనించడానికి నలుగురం వెంట ఉంటాం. ఒక్కొక్కరికి యాభై రూపాయలు ఇచ్చి ఒకసారి కూరగాయలు, మరోసారి ఐస్క్రీమ్ పార్లర్, ఇంకోసారి సూపర్మార్కెటుకు తీసుకుపోతాం. వారే స్వయంగా వెళ్ళి వారికి కావల్సినవి కొనుక్కు వస్తారు. ఇప్పుడు మా వద్ద శిక్షణ తీసుకుంటున్నవారిలో కొందరు కూరగాయలు కట్ చేయడం, వంటచేయడంలో నిమగమవుతున్నారు. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ కూడా పెంచుతున్నాం. భవిష్యత్లో వీరికి ఒకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి వారు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం.
రౌండ్-ది-క్లాక్..
వాస్తవానికి సమాజం ఈ పిల్లలను అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. చాలామంది తల్లిదండ్రులు కూడా వారిని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. వారి పట్ల చూపించే సానుభూతి వల్ల వారి జీవితంలో మార్పు రాదు. కాస్త ఓపిక, మరికాస్త ప్రేమతో వారికి టైమ్ కేటాయిస్తే చాలు. వారితో అనుబంధాన్ని పెంచుకోవాలి. మా వద్ద శిక్షణ తీసుకునే వారి తల్లిదండ్రులు కమిటీల్లో సభ్యులుగా చురుకైన పాత్ర పోషిస్తారు. మేం ఎలాంటి ఫీజులు తీసుకోం. ఆర్థిక స్తోమత ఉన్న తల్లిదండ్రులు డొనేషన్స్ ఇస్తారు. మా స్కూలులో 4 నుంచి 60 ఏండ్ల వయస్సు వరకు 150 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. మేం వారికి రౌండ్ ది క్లాక్ సర్వీస్ అందిస్తాం. సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే వారిలో మార్పు అంత త్వరగా తీసుకురావడం వీలవుతుంది. వాళ్ళ అమాయకత్వంలో అంతులేని ప్రేమ ఉంటుంది.
సృజనాత్మకత వెలికితీసుకువచ్చేలా..
మా స్కూలులో శిక్షణ తీసుకుంటున్న వారిలో చాలామంది కళాకారులున్నారు. నిజానికి ఇంటలెక్చువల్లీ డిసెబుల్డ్ వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను గుర్తిస్తే వారిలోని ఎంతో మంది కళాకారులు బయటకు వస్తారు. మా స్కూలులో ఉన్న వారిలో ఇరవై మంది అద్భుతంగా డాన్స్ చేస్తారు, దాదాపు ముఫ్పై మంది పెయింట్స్ వేస్తారు. వీరితో రవీంద్రభారతిలో, శిల్పకళావేదిక లో ప్రోగ్రామ్స్ చేశాం. ఈనెల 26 నుంచి 28వరకు లలితకళాతోరణంలో రాష్ట్రప్రభుత్వం స్పెషల్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తుంది. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ ఈవెంట్లో ఇంటలెక్చువల్ డిసెబుల్డ్ వారిలో ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీసేలా అనేక అంశాలను డిజైన్ చేశాం.