Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదున్నర దశాబ్దాలకు పైగా రచనావ్యాసంగంలో ఆరితేరిన ఆమె స్వాతంత్య్రానంతర తొలిదశాబ్దం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మధ్యతరగతి మహిళల జీవితాలకు అక్షరరూపమిచ్చారు. కాలంతో పాటు మారుతున్న పరిస్థితులను తాత్విక దృక్పథంలో చూస్తూ.. సామాజిక, రాజకీయ రంగాల్లో వస్తున్న మార్పులను ఇతివృత్తాలుగా ఎంచుకుంటూ వందలాది కథలు రాశారు ప్రముఖ రచయిత్రి డి. కామేశ్వరి. సాహిత్యం ద్వారా భాష మనుగడతో పాటు సమకాలీన అంశాలు ముందుతరాలకు అవగతమవుతాయి అంటూ ఎనిమిది పదులు దాటిన వయసులోనూ సాహిత్యసేవలో నిమగమయ్యారు. ఆమె రచనలెన్నో ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. కథలు వర్తమాన జీవితాన్ని చూపిస్తాయి అంటున్న ఆమె పరిచయం..
అక్షరాలు తెలిసిన నాటి నుంచి ఊరి గ్రంథాలయంలోని పుస్తకాలే నా నేస్తాలు. మా ఊరు కాకినాడ సమీపంలోని చిన్న గ్రామం. ఎస్ఎస్ఎల్సీ వరకు అక్కడే చదివాను. నాన్న రఘురామయ్య ఆర్ అండ్ బిలో ఇంజనీరుగా పనిచేసేవారు. అమ్మ మాణిక్యాంబ పురాణాల నుంచి సమకాలీన పత్రికల వరకు అన్ని చదివేవారు. అలా ఇంటికి వచ్చే దిన, వార, మాస పత్రికలతో పాటు స్కూలు గ్రంథాలయం, ఊరి గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివేదాన్ని. ఏడో తరగతి నుంచి కథలు, నవలను చదవడం ప్రారంభించి ప్రముఖ రచయితలు శరత్, చలం, జంపన తదితరుల పుస్తకాలన్నీ చదివేశాను.
ఇంగ్లీష్ సాహిత్యంతో..
ఎస్ఎస్ఎల్సి పూర్తికాగానే పెండ్లి చేశారు. మా ఆయన ఒరిస్సాలో ఎలక్ట్రిసిటీ బోర్డ్లో ఇంజనీర్గా పనిచేసేవారు. దాంతో నేను ఒరిస్సా వెళ్ళిపోయాను. చిన్నతనం నుంచి అక్షరాలే నా నేస్తాలు. అక్కడ చదువుదామంటే తెలుగు పుస్తకాలు దొరికేవి కాదు. దాంతో అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ పుస్తకాలు చదవడంతో ఇంగ్లీష్ సాహిత్యంతో సాన్నిహిత్యం పెరిగింది. మా ముగ్గురు పిల్లలు స్కూలుకు వెళ్ళిన తర్వాత దొరికే ఖాళీ సమయంలో పెర్రీమాసన్, అగాధాక్రిస్ట్రితో మొదలుపెట్టి షిడ్నిషెల్డన్, అర్థర్హెయినీ, జెఫ్రి అర్బర్ తదితరుల వరకు అనేక మంది రచయితల సాహిత్యం చదివాను. పఠనాసక్తి పెరగడంతో పాటు వాటిలోని కథ, కథనం, శైలి, శిల్పం తెలుసుకునే వీలు కలిగింది. తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యంలో పేరెన్నిక గల వారి రచనలు చదవడంతో విశ్లేషణాశక్తి పెరిగింది. మావారు రిటైర్డ్ అయిన తర్వాత1984లో మేం హైదరాబాద్ వచ్చేశాం.
తొలి వ్యాసానికి..
తెలుగు పుస్తకాలు లభించడం కొద్దిగా కష్టంగా ఉన్నా వారపత్రికలు మాత్రం ఇంటికి వచ్చేవి. చదవడం ద్వారా తెలుసుకున్న అనేక విషయాలకు అక్షరరూపం ఇవ్వాలని మొదటిసారి ప్రయత్నించాను. 'వనితలు - వస్త్రాలు' అని చిన్న వ్యాసం రాసి 'ఆంధ్రపత్రిక'కు పంపించాను. ఆ వ్యాసాన్ని అచ్చువేయడమే కాకుండా ఎనిమిది రూపాయల మనియార్డర్ పంపించారు. ఆ తర్వాత కథ రాయాలనుకున్నాను. అప్పుడే ఆకాకర కాయ సీజన్ ప్రారంభమైంది. వాటిని చూడగానే 'ఆనందరావు - ఆకాకరకాయ' హాస్యకథ రాసి పంపించా ను. ఈ కథకు 25రూపాయల పారితోషికం వచ్చింది. రెట్టింపు ఉత్సాహంతో వెంటవెంటనే దాదాపు పదికథలు రాసి ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, వనిత మొదలైన పత్రికలన్నీంటికీ పంపించాను. అన్నీ అచ్చుకావడమే కాకుండా పారితోషికం కూడా వచ్చింది. అలా పదిపదిహేను కథలు రాసిన తర్వాత నేను కథలు రాయగలను అన్న నమ్మకం వచ్చింది. దాదాపు ఆరేడు ఏండ్లు కేవలం కథలే రాసాను. మా ఇంటి సమీపంలోనే డిఫెన్స్ క్లబ్ ఉండేది. అక్కడి వారితో పరిచయం, వారి జీవితాలను దగ్గరగా చూడడంతో నా కథలకు సరికొత్త ఇతివృత్తాలు దొరికేవి. కొన్ని సంఘటనను ఆధారం చేసుకుని.. మరింత ఊహ జోడించి నేను రాసిన కథలు ఎందరినో అలరించాయి.
కరువైన సద్విమర్శ...
కథలు రాయడంలో బిజీగా ఉన్న సమయంలో 1968లో హైదరాబాద్లో జరిగిన రచయితల మహాసభలకు నాకు ఆహ్వానం పంపించారు. ఆరోజుల్లో సాహిత్యానికి, రచయితలకు స్వర్ణయుగమని చెప్పాలి. అక్షరజ్ఞానం ఉన్న ఆడపిల్లలకు, యువతులకు కథలు, నవలలతోనే కాలక్షేపం. దాదాపు 1980వరకు మహిళా రచయితలకు మంచి రోజులు. నేను రాసిన కథలతో వచ్చిన తొలి కథాసంపుటి 'వానజల్లు' . ముందుమాట రాసిన ప్రముఖ రచయిత పాఠకులకు స్పూన్ ఫీడింగ్ అవసరం లేదని, క్లుప్తంగా చెప్పినా అర్థం చేసుకుంటారన్న సూచన ఎంతో ఉపయోగపడింది. ఆ తర్వాత వచ్చిన కథల్లో చాలావరకు కథనం మారిపోయింది. కథావస్తువు ఏదైనా.. శైలి బాగుంటే పాఠకులు ఆస్వాదిస్తారని అర్థం చేసుకున్నాను. ఒక ప్రముఖ రచయిత ఓ సభలో కలిసినప్పుడు ' పెద్ద బండరాయికి ముక్కుచెవులు పెడితే అది శిల్పం అనిపించుకోదు. ఎంత ఎక్కువగా ఆ బండను చెక్కితే అంత అందమైన శిల్పం తయారవుతుంది. పదాల్లోనూ సూటిదనం, కొత్తదనం కనిపించాలి. అప్పుడే పాఠకుల మనసు గెలుచుకోగలుగుతారు' అని చెప్పారు. ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా ఆయన చేసిన విమర్శ నాకు ఎంతో మేలు చేసింది. ఈ రోజుల్లో విశ్లేషణాత్మకంగా చదివేవాళ్లు, విమర్శ చేసేవారు కరువయ్యారు. ఎవరికీ వాళ్లు తాము రాసిందే గొప్ప అనుకుంటున్నారు.
న్యాయం కావాలి..
మొదటిసారి నవల రాయమని ఎమెస్కో ప్రచురణ సంస్థ వాళ్ళు అడిగారు. వారికోసం నేను రాసిన నవల ' కొత్తనీరు' . ఇప్పటివరకు 22 నవలలు రాశాను. వీటిలో ఒక నవల తమిళంలోకి అనువదించారు. నేను రాసిన నవలల్లో 'న్యాయం కావాలి' , ' కోరికలే గుర్రాలైతే' అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. 'న్యాయం కావాలి' సినిమాకు ఆరు అవార్డులు వచ్చాయి. అన్ని ప్రముఖ భాషల్లోనూ ఈ సినిమా వచ్చింది. జమునగారు అరుణ నవలను టీవి సీరియల్గా తీసుకువచ్చారు. మరికొన్ని నవలలు రెండుమూడు ఎపిసోడ్స్గా ప్రసారమయ్యాయి. కథలు, నవలలు రేడియోలోనూ టెలికాస్ట్ అయ్యాయి. 18కథలను ' ఫోటోఫ్రేమ్' పేరుతో ఇంగ్లీష్లోకి, చాలా కథలు తమిళం, హిందీ, కన్నడంలోకి అనువదించారు.
శ్రీశ్రీగారు చెప్పినట్టు కుక్కపిల్లా సబ్బుబిళ్లా ...కాదేది కవితకనర్హం అన్న అంశాన్ని బేస్ చేసుకుని వాటికి రివర్స్లో నేను రాసిన కథలు ' కాదేదీ కథకనర్హం' కథాసంపుటి మొదటి భాగంలో వచ్చాయి. 'కుక్కపిల్లా సబ్బుబిళ్లా' నుంచి 'గుర్రపు కళ్ళెం హారతిపళ్లెం' వరకు తొమ్మిది కథలు ఎంతో మంచి పేరు తెచ్చాయి. ఐదుతరాల మహిళల జీవితాలను చూశాను. ఇప్పటివరకు నేను రాసిన 300వందల కథలు, 12 కథా సంపుటాలు, కవితాసంపుటి, యూరప్ అమెరికా యాత్రాను భవాలతో ఒక పుస్తకం ప్రచురితమయ్యాయి. నా కథలు, నవలపై నలుగురు అమ్మాయిలు డాక్టరేట్ చేశారు.
సాహిత్యం అందుబాటులోకి..
తెలుగుభాషను బతికించాలన్న ఆరాటం చాలామందిలో ఉంది. అయితే ప్రభుత్వాలు ఇందుకు ముందుకురావాలి. వ్యవసాయం చేస్తూ ఆకలి తీర్చే రైతు, సాహిత్యంతో భాషను బతికించే రచయితలు తమ స్వార్థం చూసుకోరు. వారిని పట్టించుకోవల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈరోజు ఒక పుస్తకం అచ్చు వేయించుకోవాలంటే వేలాదిరూపాయల ఖర్చు అవుతుంది. తమ అభిరుచిమేరకు అచ్చువేయించుకున్నా ఆ తర్వాత మార్కెటింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. పదోతరగతి వరకో, ఇంటర్ వరకో తప్పనిసరిగా చదవాలన్న నిబంధన ఒక్కటే సరిపోదు. ప్రభుత్వం ప్రతిఊరిలో గ్రంథాలయాలు ఏర్పాటుచేసి మంచిసాహిత్యాన్ని పిల్లలకు, విద్యార్థులకు, యువతకు అందుబాటులోకి తీసుకువస్తే భాష బతుకుతుంది.