Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల దేహమే యుద్ధభూమి
ప్రియాంక దుబే... ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న జర్నలిస్టు. మన దేశంలో బయటికి రాని రేప్ కేసుల మీద ఆరేండ్లపాటు పరిశోధన చేసి.. రికార్డు చేశారు. ఆ నివేదికలను 'నో నేషన్ ఫర్ ఉమెన్-రిపోర్టింగ్ ఆన్ రేప్ ఫ్రమ్ ఇండియా, ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమొక్రసీ' పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. ఇండియాలో డిసెంబర్లోనే విడుదలైన ఈ పుస్తకం... యూకే, యూఎస్లో మాత్రం మొన్న జరిగిన ఇంటర్నేషనల్ఉమెన్స్ డే సందర్భంగా ఆవిష్కరించారు. దేశంలో ఇప్పటిదాకా ఏ నేషనల్ మీడియా, ప్రత్యేకించి ఆంగ్ల పత్రికల వేదికలు పట్టించుకోని, అడుగు కూడా పెట్టని ప్రాంతాల్లో తిరిగి ఆమె పరిశోధనలు చేశారు. 2018 సంవత్సరానికి అసాధారణ జర్నలిస్టుగా చమేలీదేవి జైన్ అవార్డును దక్కించుకున్న ప్రియాంక దుబే... బీబీసీ ఢిల్లీ బ్యూరోలో పనిచేస్తున్నారు. తన నేపథ్యం, పుస్తక నేపథ్యం గురించిన వివరాలు ఆమె మాటల్లోనే...
''నేను భోపాల్లో పుట్టి పెరిగాను. తొమ్మిదేండ్ల కిందట ఎన్నో ఆదర్శాలతో జర్నలిజంలోకి అడుగుపెట్టాను. నా చుట్టూ వేళ్లూనుకుపోయిన అసమానతలు, జరుగుతున్న అన్యాయాలపై ఆగ్రహంతో... ఇందులో కొంతైనా మార్పుతేవాలను కున్నాను. అది నా ఇంటినుంచే ప్రారంభించాను. మాది సంప్రదాయ, చాందస కుటుంబం. మా కుటుంబం నుంచి జర్నలిజంలో ఎవ్వరూ లేరు. సాహిత్యం కాదు కదా.. పుస్తకాలు చదవడమే అలవాటు లేని నేపథ్యం. అలాంటిది నేను జర్నలిజం కోర్సులో చేరుతానంటే ఎవ్వరూ ఒప్పుకోలేదు. కోర్సు పూర్తయిన తరువాత... వృత్తిలోకి రావడానికి కూడా ఎన్నో అడ్డంకులు. తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది, ఉద్యోగానికి వేళంటూ ఉండదు. పోలీస్స్టేషన్లు, కోర్టుల వంటివాటికి వెళ్లాల్సి ఉంటుంది. అపరిచితులను, అందులోనూ పురుషులను కలవాల్సి ఉంటుంది. ఇవన్నీ మా కుటుంబానికి అభ్యంతరకరంగా తోచాయి. వాళ్లను ఒప్పించడానికి చాలా పోరాటమే చేయాల్సి వచ్చింది. కానీ... ఈ తొమ్మిదేండ్ల జర్నలిజం వృత్తిలోనేను చాలా నేర్చుకున్నాను. మత అసహనం, మహిళలపట్ల జరుగుతున్న నేరాలు, వ్యవస్థీకృత హత్యలు, విద్యా, వైద్యరంగాలు నిర్వీర్యమవుతుండటం, బూటకపు ఎన్కౌంటర్లు, ఆకలి, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు... ఇలా దశాబ్ద కాలంలో ఎన్నో అంశాలను రిపోర్ట్ చేశాను. ప్రత్యేకించి మానవ అక్రమ రవాణా, పిల్లలపై జరుగుతున్న హింస, కులపరమైన హింస, అత్యాచారాలు నన్ను బాగా కదిలించాయి. అదే భారతదేశంలో రిపోర్టు కాని అత్యాచారాల గురించి పరిశోధనకు ప్రేరేపించింది.
13 చాప్టర్ల పుస్తకం...
మహిళలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మైన ప్రాంతంగా మన దేశం ఈ మధ్య కాలంలో పేరు తెచ్చుకున్నది. ప్రతి పది హేను నిమిషాలకో మహిళ అత్యాచా రానికి గురవుతోంది. 1971 నుంచి 2011 వరకు చూస్తే... రిపోర్టవు తున్న కేసుల సంఖ్య 873శాతం పెరిగింది. అయినా... ఇంకా తొంబై తొమ్మిది శాతం అత్యాచారాలు నమోదు కానివే.
అంటే మన దేశంలో లైంగిక హింస ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2012లో జరిగిన నిర్భయ ఘటన దేశాన్నే కదిలించింది. ఆ తరువాత కూడా ఒకటా రెండా.. ఎన్ని ఘటనలు? పసిపిల్లలనుంచి పండు ముదుసలుల వరకు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. శరీర భాగాలను కత్తిరించడం, కోయడం, చివరకు ఉల్లిగడ్డల పొట్టు వలిచినట్టుగా చర్మాలను వలిచారు. 13చాప్టర్లున్న నా పుస్తకంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలపై కొనసాగుతున్న తీవ్రమైన హింసను పేర్కొన్నాను. బుందేల్ఖండ్ ప్రాంతంలో 'కరెక్టివ్ రేప్స్'(పెద్ద మనుషుల పంచాయితీ పెట్టి... అత్యాచార బాధితులకు ఎంతో కొంత ముట్టజెప్పడం) కొనసాగుతు న్నాయి. మధ్యప్రదేశ్లోనైతే... అత్యాచారం చేసి, సజీవదహనం చేస్తున్నారు. ఇక త్రిపురలో జరుగుతున్న రాజకీయ అత్యాచారాలు అంతంలేదు. ప్రత్యేకించి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ అత్యాచారాల సంఖ్య ఎక్కువ. పశ్చిమబెంగాల్లో అమ్మాయిలు ఎంత చదువుకుంటున్నా, ఎన్నో సాధిస్తున్నా... వారి జీవన పరిణామంలో కొంత అభివృద్ధి సాధించినా, మహిళల పట్ల వ్యవస్థీకృత నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ హింస అంతా... పురోగమిస్తున్న మహిళను, మునుపటిలా వంటింటి కుందేలును చేయడానికే.
కుల వ్యవస్థ కీలకం...
దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో కుల వ్యవస్థ చాలా కీలకపాత్ర పోషిస్తున్నది. మన దేశంలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన, తక్కువ కులానికి చెందిన మహిళల పైనైతే ఈ అత్యాచారాలకు మరింత ఎక్కువ అవకాశాలు న్నాయి. కుల దురహంకారానికి, పితృస్వామ్యానికి... మహిళల దేహాలు యుద్ధ భూమిలా పనిచేస్తున్నాయి. హర్యానాలోని ఓ గ్రామంలో నలుగురు బాలికలపై.. నివాసాలకు కేవలం 500 మీటర్ల దూరంలో సామూహిక హత్యాచారం చేసి, సజీవదహనం చేశారు. అది చేసింది జాట్ కులస్తులు అని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి దళితులది. జాట్ల దగ్గర దళితుడు పాలేరుగా పనిచేస్తే, వాళ్ల ఆడపిల్లలు, భార్యలపై పూర్తి హక్కు తమదేనని భావించే ఆధిపత్యం, భూస్వామ్య భావజాలం ఇంకా అక్కడ ఇంకా ఉంది. జాట్లు ఏ రాత్రి ఏ ఇంటి మీద పడతారో తెలియదు. ఇంటి యజమానిని తమ పొలానికి నీళ్లు పెట్టడానికో, మరోదానికో పంపించి... ఆ రాత్రి పాలేరు భార్యపై లైంగికదాడి చేసే సంస్కృతి ఇంకా కొనసాగుతున్నది. ఇలా అత్యాచారాలు చేసినా, తరువాత సజీవ దహనం చేసినా.. పోలీసు స్టేషన్ మెట్లెక్కని కేసులెన్నో. ఒక వేళ ఫిర్యాదులు చేసి, న్యాయస్థానాల వరకు వెళ్లినా.. అగ్రకుల పురుషులు నిర్దోషులుగా బయటికి వస్తారు. లేదంటే... కేసు ఏండ్లకు ఏండ్లు జాప్యం అవుతూనే ఉంటుంది. ఇదంతా ఓ వ్యూహం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా... అడుగడుగునా ఓ బాధిత స్వరం రోదిస్తోంది.
న్యాయం చచ్చిపోతుంది...
అత్యాచార బాధితులకు, బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం మాటేమోగానీ.. మనదేశంలో ప్రధాన స్రవంతి మీడియా ఇలాంటి వార్తలపై, ఘటనలపై ఆసక్తిని, పట్టించుకోవాలన్న స్పృహని ఎప్పుడో కోల్పోయింది. నిర్భయ ఘటన తరువాత... ఇలాంటి కేసుల కోసమే.. భారత పభ్రుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. అయినా.. గత ఏడాదికి లక్షా33వేల కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఒకవేళ పోలీసు స్టేషన్ వరకు కేసు వచ్చినా, పోలీసులు, డాక్టర్లు, చివరకు మేజిస్ట్రేట్స్ సైతం రేప్ కేసులను నమోదు చేసుకోవడానికి సుముఖత చూపరు. లేదా సాక్ష్యాధారాలను బాధితులకు విరుద్ధంగా తయారు చేసిపెడతారు. ఫోరెన్సిక్ ఆధారాలను ట్యాంపర్ చేస్తారు. చివరకు అవసరమైతే బాధితులను బెదిరించడానికి కూడా వెనుకాడరు. దాంతో చివరకు న్యాయం చచ్చిపోతుంది. డబ్బు, కులం, పురుష ఆధిపత్యం ముందు... మానవత్వం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఓడిపోతాయి.
బాధితురాలిని నిందితురాలిని చేసే నీ సంస్కృతి...
ఓవైపు లైంగిక హింస మిగిలిస్తున్న వ్యథ, మరోవైపు న్యాయం జరగకపోవడం... బాధితులకు తీవ్రమైన కళంకాన్ని తెచ్చిపెడుతోంది. రేపు కేసుల్లో బాధితురాలినే నిందితురాలే నీచ సంస్కృతి మన దేశంలో కొనసాగుతోంది. కుటుంబం నుంచి స్నేహితులు, పోలీసులు, చుట్టుపక్కల వాళ్లు... బాధితురాలినే సందేహిస్తుంటారు. ఆమె సాక్ష్యం పక్కకు పోతుంది. ఆమె వ్యక్తిత్వం మీద ప్రశ్నలు మొలకెత్తు తుంటాయి. అందుకే అట్టడుగు వర్గాల్లోని మహిళలకు న్యాయం అంటే... సుదూర, హాస్యాస్పద కల.
ఆ గాయాలు మాననివి..
ఎందుకంటే నేను ఫస్ట్ చాప్టర్లో పేర్కొన్నట్టుగా పితృస్వామిక భావజాలం అధికంగా ఉన్న ఓ మారుమూల ప్రాంతానికి ఓ స్టోరీ కోసం ప్రయాణిస్తున్నాను. ట్రైన్లో కొందరు పురుషుల గుంపు నన్ను వెంబడించింది. చదువుకుని, జర్నలిజంలో ఉన్న నాకే ఈ సమస్య ఎదురైంది. గ్రామీణ మహిళల పరిస్థితి ఏంటి? ఈ కథనాలు రిపోర్ట్ చేయడమే కాదు.. రాసే క్రమంలో బాధితుల మాటలను పదేపదే వింటున్నప్పుడు మనసుకు అయిన గాయాలు చెప్పలేనివి. అనుభవిస్తే గానీ తెలియనివి''