Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈకామర్స్ ఇండిస్టీ మహిళలకు ఎన్నో అవకాశాలను సృష్టిస్తోంది. మారుమూల గ్రామాల్లో ఉన్న మహిళలు సైతం ఎంటర్ప్రెన్యూర్స్గా మారుతున్నారు. అటువంటివారిలో రీతూ కౌషిక్ ఒకరు. ఫ్లిప్కార్ట్తో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన ఆమె గురించి...
హర్యానాలోని సోనీపట్ దగ్గరలో నివాసం రీతూది. 16 ఏండ్లకే పెండ్లయ్యింది. చిన్నవయసులోనే పెండ్లి చేయడంతో చదువు కొనసాగించడానికి కుదరలేదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత వాళ్ల ఆలనాపాలనా చూసుకుంటూనే... ప్రభుత్వ ఉద్యోగయిన భర్త ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తి చేసింది. మరోవైపు 31 ఏండ్ల రీతూకి హ్యాండ్బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. తన కోసం హ్యాండ్బ్యాగులు తయారు చేసేది. వాటిని చూసి ఇరుగుపొరుగు, స్నేహితులు, బంధువులు మెచ్చుకోవడంతో ఇదే ఎందుకు బిజనెస్గా మార్చుకోకూడదనుకుంది. అయితే ఆమె ఉండేది ఓ మారుమూల గ్రామంలో. మరి బిజినెస్ ఎలా? అప్పుడే ఆలోచన వచ్చింది.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో కొంటున్నారు. తానెందుకు ఆన్లైన్లో అమ్మకూడదనుకుంది. కానీ అప్పటికే భర్త ప్రభుత్వ ఉద్యోగి. 'హాయిగా ఇంట్లో కూర్చుని వండిపెట్టక.. ఆడవాళ్లకు ఈ బిజినెస్లు, గిజినెస్లు ఎందుకు?' అన్నారు చుట్టుపక్కలవాళ్లు. అవేమీ పట్టించుకోలేదు. 2016లో ఫ్లిప్కార్ట్ ద్వారా తన హ్యాండ్బ్యాగ్లు రీతూపల్ కలెక్షన్స్ పేరుతో అమ్మడం మొదలుపెట్టింది.
భర్త ప్రోత్సాహంతో కంప్యూటర్ నేర్చుకుంది. పిల్లలు స్కూల్కు వెళ్లిన తరువాత కంప్యూటర్ ప్రాక్టీస్ చేసేది. దానికితోడు ఫ్లిప్కార్ట్ వాళ్లు ఆమెకు సలహాలు, సూచనలు, సహాయసహకారాలు అందించారు. అంతేకాదు ఆమెకు రుణ సహాయం కూడా అందిస్తామన్నారు. కానీ.. తాను పొదుపు చేసుకున్న డబ్బులనే వ్యాపారానికి పెట్టుబడిగా ఉపయోగించింది. మొదటి ఏడాదిలోనే నెలకు లక్ష రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగింది. ఈ మూడేళ్లలో అది కాస్తా.. నెలకు ఏడు నుంచి ఎనిమిది లక్షలకు చేరుకుంది. రీతూ కలెక్షన్స్లో రెండు వందల నుంచి పదిహేను వందల వరకు ఉంటాయి. అందులోనూ దక్షిణాది నుంచే ఆమెకు కస్టమర్స్ ఎక్కువ. నెలకు లక్ష రూపాయలు సంపాదించడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా తన పేరును బ్రాండ్గా సృష్టించుకోవడమే లక్ష్యమని చెబుతున్నది.