Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉర్దూ ఇండో-ఆర్యన్ భాష. మన దేశంలో పురుడు పోసుకున్న భాష. 23 ఆధికారిక
భాషల్లో ఒకటిగా మారింది. మర్సియా, రుబాయి,మస్నవీ, ఖసీదా లాగే ఉర్దూ సాహిత్య
ప్రక్రియల్లో గజల్స్ ఒకటి. దక్కన్ ప్రాంతంలో ఎక్కువగా వాడుకలో ఉన్న ఈ ప్రక్రియలో
మహిళా సాహిత్యవేత్త గా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందారు సయీద తస్నీమ్ దుర్రాని.
ఉర్దూ, హిందీ, తెలుగు సాహిత్య సంస్థల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమె జాతీయ,
అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 'తస్నీమ్ జౌహర్' కలం
పేరుతో ఆమె రాసిన గజల్స్, షేర్స్ ప్రపంచవ్యాపంగా ఆదరణ పొందుతున్నాయి. చారులో
చక్కెరలా ఏ భాషలోనైనా ఉర్దూపదాలు కలిసిపోయి ఆ భాషకే తీయదనాన్ని ఇస్తాయి
అంటున్న ఆమె పరిచయం..
ఐదారు తరాల కిందట మా పూర్వీకులు అప్ఘనిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన దుర్రాని రాయల్ ఫ్యామిలీకి చెందిన వారు. నాన్న అహ్మద్ ముస్తఫా ఖాన్ దుర్రాని వరంగల్లో పోలీస్డిపార్ట్మెంట్లో పనిచేశారు. అమ్మ ఖైరున్నిసా. మేం ముగ్గురం అమ్మాయిలం. ఒక అబ్బాయి. మా ఇంట్లో సాహిత్యాభిరుచి ఎప్పటినుంచో ఉంది. మా పూర్వీకులు కళాభిలాషులు. మా చిన్నాన్న నజీద్ ఖాన్ రచించిన నాటికలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యేవి. హైదరాబాద్లో మా ఇంట్లో తరచుగా సాహిత్యసమావేశాలు జరిగేవి. ప్రముఖ రచయితలు మీర్, ఇక్బాల్, ఖదీర్ అహ్మద్ తదితరులు వచ్చేవారు. ప్రముఖ రచయిత షాజ్ తంకనత్ నాకు స్ఫూర్తి.
ఛందస్సు ఇష్టంగా..
నాన్న వరంగల్లో ఉద్యోగం చేయడంతో మేం అక్కడే ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. సెకండ్ లాంగ్వెజ్గా తెలుగు తప్పనిసరిగా ఉండేది. దాంతో చిన్నప్పటి నుంచి తెలుగు పై మక్కువ ఎక్కువే. మా తెలుగు టీచర్ పరీక్షల్లో ఒక మార్కు కూడా కట్ చేయకుండా నూటికి నూరుశాతం మార్కులు వేయాల్సినంత నీట్గా, కరెక్ట్గా రాసావు. కానీ, లాంగ్వెజ్లో వందకు వంద వేయడం సాధ్యం కాదు అనేవారు. పరీక్షల్లో నేను రాసిన ఆస్సర్ షీట్పై ఎక్కడా ఒక రెడ్ మార్క్ పడేది కాదు. పదోతరగతిలో తెలుగు వ్యాకరణంలో ఛందస్సు ఎంతో ఇష్టం. ఏదైనా పద్యం తీసుకుని గణవిభజన చేసేదాన్ని. మా టీచర్లు కూడా ఎంతో ప్రోత్సహించేవారు. మనసు స్పందించినప్పుడల్లా పదాలు కవితగా మారేవి. అయితే అవేవి నేను దాచుకోలేదు.
ఆటల్లోనూ మేటిగా..
కార్పోరెట్ స్కూలులో పిల్లలకు ఆడుకోవడానికి మైదానమే లేకుండా పోయింది. మా చిన్నప్పుడు మాత్రం చదువుతో పాటు ప్రతి విద్యార్థికి ఆటల్లోనూ, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, కల్చరల్ ఆక్టివిటీస్ ఇలా ఏదైనా ఒక విభాగంలో తప్పక ఉండాల్సిందే. టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాట్మెంటన్, త్రోబాల్ వంటి ఆటల్లో స్కూలు లెవల్ పోటీల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు ఎన్నో బహుమతులు గెలుచుకున్నాను. ఎన్సిసిలో చేరి ఏడేండ్ల పాటు శిక్షణ పొందాను. మూడేండ్ల పాటు రాష్ట్రస్థాయి బెస్ట్ క్యాడెట్ అవార్డు అందుకున్నాను. వీటితో పాటు రైఫిల్ షూటింగ్లోనూ మూడెండ్లు మెడల్ సాధించాను. ఎన్సిసిలో నా ఫర్ఫమెన్స్కు ఎయిర్ఫోర్స్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. అయితే నాన్నకు నన్ను ఆర్మీలోకి పంపడం ఇష్టం లేకపోవడంతో బిఎస్సీ సైన్సులో చేరాను.
సేకరణతో ప్రారంభమై..
సాహిత్యంపై ఆసక్తితో పుస్తకాలు చదివేదాన్ని. ఏదైనా పదాలు, షేర్ నచ్చితే వాటిని ఒక నోట్బుక్లో రాసుకుని భద్రపరుచుకునేదాన్ని. అలా స్కూలు చదువు అయిపోయే నాటికి నా నోట్బుక్ నిండిపోయింది. ఆ తర్వాత గజల్స్ రాయడానికి ఆ సేకరణే ప్రేరణ అయ్యింది. డిగ్రీలో చదువుతున్నప్పుడే పెండ్లి అయ్యింది. మా వారు బిజినెస్మాన్. ఏ రోజు కూడా నన్ను చదువు ఆపమనలేదు. ఆయన ప్రోత్సాహంతోనే పిజీలో ఇంగ్లీష్ లిటరేచర్లోనూ, ఉర్దూలోనూ ఎం.ఏ పూర్తి చేశాను. ఆ తర్వాత బి.ఎడ్ చదివి స్కూలులో టీచర్గా చేరారు. మా అత్తంటివారి సహకారం ఎంతో ఉండేది. పిల్లలను వాళ్లు చూసుకునేవారు. సెయింట్ డోమిక్స్ స్కూలులో పదిహేనేండ్లు పనిచేశాను. ప్రియదర్శిని హైస్కూల్లో ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాస్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు కూడా అందుకున్నాను. పిల్లలకు ఉర్దూలో చిన్నచిన్న వ్యాసాలు, కథలు రాసేలా పోటీలు నిర్వహించేదాన్ని.
సియాసత్లో మొదటి కవిత..
చిన్నప్పటి నుంచి భావోద్వేగాలను అక్షరాలుగా మార్చే అలవాటు ఉంది. అలా రాసిన వాటిని దాచుకోలేదు. ఏ పత్రికలకు పంపలేదు. టీచర్గా చేస్తున్న సమయంలో నేను రాసిన కవితను మాత్రం సియాసత్కు పంపించాను. వాళ్లు వెంటనే దాన్ని అచ్చువేశారు. ఆ తర్వాత సియాసత్తో పాటు మున్సిఫ్, 'గోల్కొండ దర్పణ్' హిందీ పత్రికలోనూ ప్రచురించారు. ఇప్పటివరకు రాసిన కవితలన్నీ దాదాపు మూడు వందలకు పైగా ఉన్నాయి. వాటిని పుస్తకరూపంలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను.
వందకు పైగా గజల్స్
నేను కేవలం కవితలే కాకుండా గజల్స్ రాస్తాను. మన రాష్ట్రంలో ఉర్దూలో గజల్స్ రాసే ఏకైక ఉర్దూ మహిళా సాహిత్య వేత్తగా నన్ను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం 2014లో అవార్డు ఇచ్చింది. ఇప్పటివరకు నేను వందకు పైగా గజల్స్ రాశాను. నిజానికి ఇది పర్షియా సాహిత్య ప్రక్రియ. దేశంలోని ప్రముఖ గజల్ సింగర్స్ అందరూ వాటిని వేదికలపై పాడారు.
దేశవిదేశాల్లో ముషాయిరాలతో..
ఉర్దూ సాహిత్యంలో ఎంతో మంది గొప్పకవులున్నారు. వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా అనేక సంస్థలు దేశవిదేశాల్లో ముషాయిరాలు నిర్వహిస్తున్నాయి. 'దక్కన్ లిటరరీ ఫౌండేషన్ ఆఫ్ హైదరాబాద్' కెనడాలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నాను. పాకిస్తాన్లో జరిగిన సాహిత్య సదస్సుకు అతిథిగా వెళ్లాను. దేశంలోని వివిధ నగరాల్లో ఇప్పటివరకు జరిగిన అనేక సదస్సులకు హజరయ్యాను. అనేక సంస్థలు అవార్డులతో సత్కరించాయి.
తెలుగు, ఉర్దూ రెండు కండ్లు..
నేటి తెలంగాణ ఒకప్పటి దక్కన్ ప్రాంతం. ఇక్కడ ఉర్దూ భాషకు మంచి ఆదరణ ఉండేది. ఉర్దూ మీడియంలోనూ విద్యాబోధన జరిగేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉర్దూకు గుర్తింపు ఇస్తున్నారడానికి నిదర్శనం ఈ ఏడాది విశిష్ట మహిళా సాహిత్యవేత్తగా నాకు అవార్డు ఇవ్వడం. ఏ మాతృభాష అయినా ప్రభుత్వాల ఆదరణతోనే మనగలుగుతుంది. భాష బతకాలంటే సాహిత్యాన్ని వెలికితీయాలి. . ఆదరించాలి.. నేటి తరానికి పరిచయం చేయాలి. మన రాష్ట్రానికి తెలుగు, ఉర్దూ రెండు కండ్లు. స్కూలు స్థాయి నుంచే ఉర్దూ సాహిత్యాన్ని పిల్లలకు చేరువ చేసేలా పుస్తక పఠనం, వ్యాసాలు, చిన్నచిన్న కథలు రాయడం వంటి పోటీలు నిర్వహిస్తున్నాం.
- వి. యశోద