Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజస్థాన్ లోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు లో గల రిమోట్ ప్రాంతమైన బార్మర్ గ్రామం. ఎప్పుడు యుద్ధమేఘాలు కమ్ముకుంటాయో తెలియని ఆ గ్రామంలో పదోతరగతి వరకు చదువుకోవడం కోసం నిత్యం యుద్ధమే చేసింది పదహరేండ్ల కమల. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్రను తిరగరాసింది. తన తోటి విద్యార్థులో స్పూర్తి నిప్పింది. బార్మర్ గ్రామం నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క బాలిక కూడా పదో తరగతి పూర్తి చేయలేదు. మొట్ట మొదటి సారిగా కమల మాత్రమే పదో తరగతిని పూర్తి చేసి కొత్త రికార్డుకు నాంది పలికింది. ఆ గ్రామం అక్షరాస్యత రేటు కేవలం 20 శాతం మాత్రమే. బార్మర్ గ్రామం నుండి 7 కిలో మీటర్ల దూరంలో గాద్రా గామ పంచాయతీలో బడికి వెళ్లి తన పదో తరగతిని పూర్తి చేసింది. ఆ ప్రాంతంలో బడి చేరి విద్యార్ధుల డ్రాప్ అవుట్స్ దాదాపు 60 శాతానికి పైనే ఉండటం గమనార్హం. ఆ డ్రాప్ అవుట్స్ లో బాలికల శాతం డ్రాప్ అవుట్స్ దాదాపుగా 90 శాతానికి పైనే ఉంది. సరిహద్దు ప్రాంతం అవడం కారణంగా అక్కడ పిల్లలను ముఖ్యంగా బాలికలను పాఠశాలకు పంపించకపోవడంతో బాలికలకు 15 ఏండ్లు రాగానే పెండ్లి చేస్తారు. కమల స్నేహితురాళ్ల కు ఇప్పటికే పెండ్లిళ్లు అయిపోయాయి. కానీ కమల ఎంతో పట్టుదలతో తన పదో తరగతిని పూర్తి చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో కమలను స్పూర్తిగా తీసుకుని దాదాపు 123 మంది బాలికలు పాఠశాలకు వెళ్తున్నారు. 'సరిహద్దుల్లో ని భారత సైనికుల సహాయంతోనే తాను పదో తరగతి పూర్తి చేశానంటుంది కమల. గత కొంత కాలంగా పరిస్థితి మారిందని ప్రస్తుతం తమ గ్రామం నుండి 7 గురు బాలికలు తాను చదువుకున్న పాఠశాలకు వెళ్తున్నారని ఆమె అంటుంది. తమకు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. తాగడానికి కూడా సరిగా నీరు దొరకని ప్రాంతంలో తాము బతుకుతున్నామనికమల తండ్రి ద్వారకారామ్ బిల్ అంటున్నాడు. ఇలాంటి విపత్కర పరిస్థితులను దాటి కమల తన పదో తరగతిని పూర్తి చేసినందుకు బిల్ ఆనందిస్తున్నాడు. ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ గురించి పట్టించుకుంటే అక్షరాస్యత శాతం పెరుగుతుందన్న బిల్ కల నిజం కావాలని కమల మాదిరిగానే మరింత మంది చదువుకోవాలని ఆశిద్దాం.