Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరుకు చెందిన 31 ఏండ్ల పుష్ప సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అందరు టెకీస్లాగే ఆమె అయితే మనం ఇక్కడ చెప్పుకునే అవసరమే రాకపోయేది. అయితే ఏం చేసిందంటారా? 700లకు పైగా పరీక్షలు రాసింది. అదీ తనకోసమో, రికార్డుల కోసమో అస్సలు కాదు. డిఫరెంట్లీ ఏబుల్డ్ విద్యార్థులకోసం. అందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఆమెకు నారీశక్తి-18 అవార్డునిచ్చింది సత్కరించింది.
పుష్ప స్నేహితురాలు ఒకామె స్వచ్ఛంద సంస్థను నడుపుతుంది. 2007లో దృష్టిలోపం ఉన్న ఓ విద్యార్థికి పరీక్ష రాయడానికి పిలిచింది. అడిగిన వెంటనే అంగీకరించింది పుష్ప. ఎందుకంటే ఆమె జీవితంలో కష్టనష్టాలను చూసింది. ఏడో తరగతిలో స్కూల్ ఫీజు మొత్తం చెల్లించనందున ఎగ్జామ్ రాయకుండా బయట నిలబెట్టారు. ఆ తరువాత ఇంటిపక్కల వాళ్లు సహాయం చేయడంతో ఎగ్జామ్ రాసింది. అవసరంలో ఇతరులు చేసే సాయం విలువ అప్పుడు తెలిసొచ్చింది. ఆ తరువాత డబ్బులెప్పుడూ ప్రధానం అనుకోలేదామె. ఇతరులకు సేవ చేయడం ద్వారా పొందే తృప్తి వెలకట్టలేనిదని నమ్ముతుంది. అందుకే రోడ్డుపైనే కాదు.. ఎక్కడైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కనబడితే.. ఆ సమయంలో ఏ సాయం కావాల్సి ఉంటే ఆ సాయం అందించేది. ఈ పన్నెండేండ్ల కాలంలో... వందలమంది విద్యార్థులకు సాయం అందించింది పుష్ప. ఏడాదికి కచ్చితంగా 50 నుంచి 60 పరీక్షలు రాస్తుంది. పరీక్ష రాయడానికి వెళ్లిన ప్రతిసారీ.. సెలవు తీసుకుంటుంది. తను పనిచేస్తున్న కంపెనీ సహకారం వల్లే రాయగలుగుతున్నానంటోంది పుష్ప.
''డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ను చూడగానే చాలా మంది జాలి పడతారు. కానీ మనం చేయాల్సింది జాలిపడటం కాదు. ప్రోత్సహించడం. నేను రాసేది విద్యార్థుల భవిష్యత్ను నిర్ణయిస్తుంది. కాబట్టి రాసేటప్పుడు అప్రమత్తతతో, స్పృహతో ఉంటాను. ఎగ్జామ్లో అభ్యర్థి గందరగోళ పడ్డా... నేను మాత్రం ప్రశాంతంగా ఉంటాను. ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి'' అని చెబుతోంది పుష్ప.