Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'స్త్రీవిద్య - సాధికారత' అంశంపై అవగాహన కల్పిస్తూ..' అతివలు - అచీవర్స్' అంటూ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు డాక్టర్ ఎన్.రజని. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉమెన్ డెవలప్మెంట్ ఎక్సటెన్షన్ సెంటర్ ఇంచార్జిగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాహిత్యవాతావరణంలో పెరిగిన ఆమె శ్రీశ్రీ కవిత్వంతో, శివసాగర్ పాటలతో బాల్యం గడిపారు. 'విరసం' సమావేశ వేదికలపై అలవోకగా కవితలు చదివేవారు. సమాజమార్పులను ఆధునిక కవిత్వం ప్రతిబింబించాలంటూ ఆమె రాసిన ఎన్నో వ్యాసాలు భాషావేత్తలను ఆలోచింపచేశాయి. 16ఏండ్ల వయసులో దూరమైన అమ్మప్రేమకు అశ్రునివాళిగా ఆమె పేర్చిన అక్షరమాల 'అమ్మకోసం' పుస్తకంగా మారి తల్లిప్రేమ గొప్పదనాన్ని తెలియజెప్పింది. సెకండ్ ఇన్నింగ్స్లో విద్యార్థులుగా మారుతున్నవారికి పాఠాలు చెబుతూ.. వారి జీవితపాఠాలను తెలుసుకోవడం ఆసక్తిగా ఉందంటున్న ఆమె మానవితో పంచుకున్న ముచ్చట్లు..
జనగాం జిల్లా రాజవరంలో పుట్టిపెరిగాను. నాన్న వరవరరావు. ఆ ఊరికి పట్వారిగా పనిచేసేవారు. ఊర్లోవారందరికీ తనకు చేతనైన సహాయం చేసేవారు. మా ఇల్లు ఎప్పుడు వచ్చిపోయే వారితో సందడిగా ఉండేది. అమ్మ రంగనాయకమ్మ. ఆమె చదువు కున్నది రెండోతరగతే అయినా చదువు విలువ తెలిసిన మనిషి. మేం ఆరుగురం పిల్లలం. నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. మేమంతా పెద్దచదువులు చదవాలన్నది ఆమె కోరిక. ఎంత కష్టమొచ్చినా చదువు ఆపవద్దు అంటూ మమ్మల్ని ప్రొత్సహించేది. మా ఊరి బడిలో ఐదోతరగతి వరకే ఉండేది. ఆరు, ఏడు తరగతులు మూడు కిలోమీటర్ల దూరంలోని పెండ్యాలకు వెళ్ళి చదువుకున్నాం. ఎనిమిదోతరగతి నుంచి స్టేషన్ ఘన్పూర్ వెళ్లేవాళ్లం. పొద్దున్నే అమ్మ మాకు పెరు గన్నం, మామిడికాయ పచ్చడి టిఫిన్బాక్స్లో పెట్టి ఇచ్చేది. స్టేషన్ఘన్పూర్కు వెళ్లాలంటే చెరువు కట్ట మీదుగా వెళ్లాలి. కొన్నిసార్లు మధ్యలోనే ఆకలేసేది. అమ్మ పెట్టిన పెరుగన్నం కట్టమీద కూర్చొని తినేవాళ్లం. అక్కయ్య, అన్నయ్య వాళ్లు హైదరాబాద్ రావడంతో నేను వారితో పాటే వచ్చాను. తొమ్మిది, పది హైదరాబాద్లోని రైల్వే స్కూలులో పూర్తి చేశాను. ఆ తర్వాత సిద్ధిపేటలో బిఎస్సీ(బిజెడ్సి), ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ(తెలుగు), మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎం.ఫిల్ పూర్తి చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 'తొలితరం తెలుగు కథా రచయితలు స్రీ సమస్యల చిత్రణ' అన్న అంశంపై గురజాడ నుంచి కుటుంబరావు వరకు ప్రముఖుల కథలపై పి.హెచ్డి చేశాను.
ఇంట్లో సాహిత్యమే..
చిన్నతనం నుంచే మా ఇంట్లో సాహిత్యసమావేశాలు ఎక్కువగా జరిగేవి. శ్రీశ్రీ కవిత్వం ఇష్టంగా చదివేవాళ్లం. శివసాగర్ పాటలు పాడుతూ ఆడుకునేవాళ్లం. విరసం సమావేశాల వేదికలపై ఆ సమయానికి నా స్పందననే కవితగా చదివేదాన్ని. అయితే ఎప్పుడు రాయాలన్న ఆలోచన రాలేదు. పి.హెచ్డి పూర్తి చేసిన తర్వాత విజయనగరం వెళ్లినప్పుడు గురజాడ గారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లాను. ఎవరిని అడిగినా ఆయన ఇంటి అడ్రస్ చెప్పలేదు. దాంతో 'గురజాడ జాడ ఎక్కడ' అంటూ చిన్న వ్యాసం రాసాను. అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆ తర్వాత కొన్ని కథలు, కథాసాహిత్యంపై వ్యాసాలు రాశాను. అనేక సెమినార్లలో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చాను.
18ఏండ్లుగా..
తెలుగు లెక్చరర్గా 1991లో ప్రైవేటు కాలేజీలో చేరాను. ఆ తర్వాత ఐడియల్ కాలేజీ, తిరుపతిలోని విద్యాపీఠ్, హైదరాబాద్లో ప్రగతి డిగ్రీకాలేజీలో చాలా ఏండ్ల పనిచేశాను. 2010లో అంబేద్కర్ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్గా యూనివర్సిటీ స్టడీమెటీరియల్ రూపకల్పనలోనూ నావంతు కృషి చేశాను. ఉన్నతచదువులు చదివి ఉద్యోగాలు చేయాలన్నది నాన్న కోరిక. నాకు ఉద్యోగం వచ్చేనాటికి ఆయన మా మధ్యలేకపోవడం బాధాకరం. మా వారు గోపినాథ్, అమ్మాయిలు జాబిలి, కడలి ఎంతో సపోర్ట్గా ఉంటారు. పెద్దమ్మాయి జాబిలి ఉద్యోగం చేస్తుంది. ఆమె రెండో తరగతి నుంచి ఇంగ్లీష్లో కవితలు రాస్తోంది. ఆమె రాసిన కవితలతో ' నోమోర్ టీయర్స్' పుస్తకంగా తొమ్మిది తరగతిలో ఉన్నప్పుడే వచ్చింది. మరో పుస్తకం 'క్వీల్ ' రాసింది. చిన్నమ్మాయి కడలి ఎల్ఎల్బి చదువుతోంది. ఆమె కూడా కవితలు రాస్తోంది.
అమ్మమ్మలు సైతం..
అక్షరాలు నేర్చుకోవాలన్న ఆశ, చదువుతో బతుకు చక్కదిద్దుకోవాలన్న తాపత్రయం ఎంతో మంది మహిళల్లో ఉంటుంది. అవకాశాలు లేక కొందరు, ఆర్థిక స్తోమత లేక మరికొందరు తాము కోరుకున్న చదువులు చదవలేకపోతారు. అలాంటివారంతా దూరవిద్యద్వారా తమ కలల తీరం చేరుకుంటున్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా తీసుకున్నవారెందరో ఉన్నతవిద్యావంతులై ప్రొఫెసర్లుగా, టీచర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, విదేశాల్లో పెద్ద సంస్థల్లో సిఇవోలుగా, ఉన్నత ఉద్యోగులుగా పని చేస్తున్నారు. 'అతివలు - అచీవర్స్' గా మారి దూరవిద్య ద్వారా ఉన్నతవిద్యను అభ్యసించడంతో పాటు గోల్డ్మెడల్ సాధిస్తున్నారు. అక్షరం మీద ప్రేమతో అమ్మమ్మలు కూడా పుస్తకాలు పట్టుకుని స్టడీసెంటర్లకు రావడం ముచ్చటగా అనిపిస్తుంది.
అమ్మ జ్ఞాపకాలతో..
నాకు 16ఏండ్ల వయసు ఉన్నప్పుడే అమ్మ చనిపోయారు. అప్పటివరకు మా వెన్నంటి ఉన్న ఒక ధైర్యం మాకు దూరమైంది. ఆమె జ్ఞాపకాలు మాత్రం మాతోనే ఉన్నాయి. 1981లో ఆమె చనిపోయారు. చాలా ఏండ్ల తర్వాత దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చిన్నతనంలో ఆమెతో గడిపిన క్షణాలను అక్షరాలుగా రాసే ప్రయత్నం చేశాను. 'అమ్మ కోసం..' పడిన ఆరాటం చిరు పుస్తకంగా తీసుకువచ్చాను. ఆ పుస్తకం రాస్తున్నంత సేపు అమ్మనాతో ఉన్న భావన. పుస్తకం చదివిన వారంతా అమ్మప్రేమను ఇంత గొప్పగా చెప్పవచ్చా అంటూ అభినందించారు.
మహిళా విద్య ఆవశ్యతను ...
మహిళలు ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నా.. ఇంకా వారిపై దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టాలంటే మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి. మహిళలకు సంబంధించి విద్య, ఆరోగ్యం, సాహిత్యం తదితర రంగాల్లో మార్పులు రావాలి. సమస్యపై సదస్సులు నిర్వహించి వారిలో చైతన్యం కల్పించాలి. వ్యక్తిత్వవికాసం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. మా విశ్వవిద్యాలయం ద్వారా మహిళలను అన్ని రంగాల్లో అత్యున్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం. మహిళలను దేవతలుగా ఆరాధించాల్సిన అవసరం లేదు మనుషులుగా గుర్తిస్తే చాలు. చదువుకోవాలన్న వారి ఆలోచనను గౌరవిస్తే చాలు. వారి ప్రగతికి బాటలు వారే వేసుకుంటారు.