Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన బతుకు... మనం బతకడానికి కూడా సమాజం కొన్ని చట్రాలు
గీస్తుంది. ఆ పరిధుల్లోనే ఉండాలని సూచిస్తుంది. కానీ ఆమె... తన జీవితం
తాను కోరుకుంటున్నట్లు ఉండాలనుకుంటుంది. అలాగని ఫెమినిస్టూ
కాదు. ఓ సామాన్య మహిళ . పేదరికం చిన్న వయసులో పెండ్లికి
కారణమైంది. పెండ్లి ఆమె రెక్కలు విరిచింది. కానీ... ఆమె ఓ ప్రవాహం. ఎన్ని
ఆటంకాలు ఎదురైనా... కొత్త దారులు సృష్టించుకున్నది. పదో తరగతిలోనే
ఆగిపోయిన చదువు... పన్నెండేండ్ల తరువాత తిరిగి మొదలుపెట్టింది.
రోజు గడవడం కోసం ఒకప్పుడు కరువు పనికి పోయిన వ్యక్తి.. ఇప్పుడు
రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ అయ్యింది. అసాధారణంగా ఎదిగిన ఆమె..
సొన్నాయిల కృష్ణవేణి. ఫేస్బుక్ వేదికగా అద్భుతమైన కవిత్వాన్ని రాస్తున్నది.
సామాజిక సమస్యలపై తన గళాన్ని వినిపిస్తున్నది. ఆ ప్రస్థానం ఆమె
మాటల్లోనే...
నాన్న సొంతూరు వరంగల్ దగ్గర ముత్తారం. చిన్నప్పుడే నాన్నమ్మ చనిపోయింది. వాళ్ల నాన్నమ్మ దగ్గర పెరిగాడు నాన్న. హైస్కూల్ మధ్యలోనే చదువాపేసి వెల్డింగ్ పని నేర్చుకున్నాడు. నాగార్జునసాగర్, నిజాంసాగర్ డ్యామ్ మీదా పనిచేశాడు. అది కడుపు నింపుకోవడానికే! నిజానికి నాన్నకు చదువంటే ఇష్టం. హిందీ సాహిత్యం అంటే ఇంకా ఇష్టం. హిందీ నవలలు చదువు తుండేవాడు. నిజాంసాగర్లో పనిచేస్తున్నప్పుడే నేను పుట్టాను. ముగ్గురం ఆడపిల్లలం, నా తరువాత తమ్ముడు. నేను పుట్టిన తరువాత.. 'ఎవ్వరికేమైనా.. ఒకరికొకరు తోడు లేకుండా ఎందుకు బతకడం? అందరం ఒకే దగ్గర ఉందాం రండి' అని అమ్మమ్మ వాళ్లు చెప్పడంతో గోదావరిఖని సింగరేణి కార్మికుల కాలనీలోకి వచ్చి స్థిరపడ్డాం. తాతకు సెలూన్ షాప్ ఉండేది. అక్కడో స్కూల్ అవసరం వచ్చింది. నాన్న అంతో ఇంత చదువుకున్నడని.. ఖాళీ ప్లేస్లో గుడిసె వేసి స్కూల్స్టార్ట్ చేసిండ్రు. నాలుగో తరగతివరకు... 50, 60 మంది ఉండేవాళ్లు. నేను అక్కడే చదువుకున్నా. తరువాత హైస్కూల్కు పొయిన... అక్క చనిపోయాక నాన్న స్కూల్ బంద్ పెట్టిండు. తరువాత మేం చదువుతున్న స్కూల్ హైస్కూల్ అయ్యింది. కానీ టీచర్స్ లేరు. నాన్న గోదావరిఖని వచ్చాక ఓపెన్ డిగ్రీ చేసి, హిందీ పండిట్ ఎగ్జామ్స్ రాశాడు. నెలకు 500 రూపాయల జీతంతో హిందీ టీచర్గా తీసుకున్నారు. కొత్త స్కూల్, టీచర్స్ సరిగ్గా లేరు. దాంతో ఫస్ట్ బ్యాచ్ అంతా ఫెయిలయ్యింది. మళ్లీ సప్లిమెంటరీ కట్టి రాసి పాసయిన.
17 ఏండ్లకే పెండ్లి...
కాలేజికి వెళ్లాల్సిన సమయం. ఓ పెండ్లి సంబంధం వచ్చింది. నాకు చదువుకోవాలని ఉంది. చదివించే పరిస్థితి ఇంట్లో లేదు. అబ్బాయి... నాన్న పెద్దమ్మ కూతురి కొడుకు. పెండ్లయిన తరువాత ఇక్కడ(వాళ్లది వరంగల్) చదివిస్తమని చెప్పిండ్రు. దాంతో ఎక్కడైనా చదువుకునేదే కదా అని చేసుకున్న. ఊహించిందొకటి.. జరిగిందొకటి. పెండ్లి తరువాత చదువు మాట వస్తే తిట్టేది మా అత్తమ్మ. మా వారినడిగితే.. 'అమ్మను అడుగు' అనేటోడు. కుదరదని అడుగుడు మానేసిన. ఓసారి ఆయన శబరిమలై వెళ్లినప్పుడు 2ఇన్1 తీసుకొచ్చిండు. రేడియో వచ్చాక నాకు ప్రాణం లేచొచ్చింది. రేడియో ప్రసారాలు వినేదాన్ని. రేడియోకు లెటర్స్ రాసేదాన్ని. చిన్న చిన్న కవితలు. ఓసారి రేడియోలో 'కృష్ణవేణిగారు మీరు రాస్తున్న చిన్నచిన్న కవితలు బాగుంటున్నయి. మీరు పెద్దవి రాస్తే తీసుకుని రండి. యువవాణిలో శ్రోతలకు కూడా చదివే అవకాశం ఇస్తం' అని అనౌన్స్ చేసిండ్రు. రేడియోలో అది విని వెళ్లిన. అప్పటినుంచి నా కవితలు నేనే చదవడం, వేరేవాళ్ల కవితలు, కథానికలకు వాయిస్ ఇవ్వడం చేసేదాన్ని. 2007 రేడియోలో అనౌన్సర్కు నోటిఫికేషన్ వచ్చింది. 'ప్రోగ్రామ్స్కి వాయిస్ ఇస్తున్నావు కదా! నువ్వ అప్లయి చేయి' అన్నారు. తీరా చూస్తే ఆ పోస్టుకు డిగ్రీ ప్రొవిజనల్ కావాలన్నరు. గాదె మోహన్ గారని పెద్దాయన 'టెంత్తో చదువాపేసి... చదువుకుంటా అని ఇంట్లో వాళ్లను అడిగే ధైర్యం లేదు నీకు... నువ్వు అనౌన్సర్వి అయితవా' అని వెక్కిరించినట్టుగా సరదాగా అన్నారు. ఇంటికొచ్చి బాగా ఏడ్చిన. 'నేను చదువుకుంట అంటే చదివియ్యలేదు' అని. అప్పుడు నా భర్త 'చదువుకో.. కానీ నన్ను డబ్బులడగొద్దు' అన్నడు. నాన్నకు చెబితే 'సంతోషం... కనీసం చదవడానికి అవకాశమిచ్చిండ్రు' అని... డిస్టెన్స్లో చదవడం కోసం ఫీజుకు 200 ఇచ్చిండు. రాసిన సీట్ వచ్చింది.
స్నేహితుల ప్రోత్సాహంతో...
అడ్మిషన్కి రెండు వేలు కట్టాలి. నాన్న దగ్గర డబ్బులు లేవు. అప్పటికే ఆయన ఆరోగ్యం పాడయ్యింది. రోజూ మందులు వాడాలి. డబ్బులు లేక రోజు వేసుకోవాల్సిన మందులు రోజు తప్పించి రోజు వేసుకుంటున్నడు. అలాంటి పరిస్థితుల్లో నేనెలా అడగాలి? ఎండాకాలంలో కరువు పనికిపోయేదాన్ని. మా కులంల.. చిన్న పిల్లలకు, పెద్ద మనిషి అయిన పిల్లలకు స్నానం చేయిస్తే... డబ్బులిస్తారు. అట్ల వచ్చినవాటిలో కొంత ఇంటికి ఖర్చుపెట్టి... కొన్ని జమ చేసుకుని ఫస్టియర్ ఫీజు కట్టిన. జులై 14న ఎగ్జామ్స్... జూన్ పద్నాలుగున నాన్న చనిపోయారు. చదవడానికి మనసొప్పేది కాదు. పుస్తకం ఓపెన్ చేస్తే నాన్న గుర్తొచ్చేవాడు. పక్కన పడేసేదాన్ని. రాయనని అనుకున్నా. స్నేహతుల ప్రోత్సాహంతో రాసిన. పాసయిన నా మీద నాకు నమ్మకం వచ్చింది.
అధ్యాపకుల సహకారంతో..
అప్పుడే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటోంది. మాకు నర్సింహస్వామి అని లెక్చరర్ ఉండేవారు. ఓ రోజు క్లాసుకు వచ్చి.. 'రెగ్యులర్ వాళ్లే విద్యార్థులా? మీరు కదా! ఏమన్నా ఫలితాలు వస్తే మీకు రావా? ఉద్యమంలో ఎందుకు పాల్గొనరు?' అని అడిగిండు. 'అందరం కలిసుంటే బాగుంటది' అనుకునేదాన్ని తప్ప రాజకీయాలు ఏమీ తెలియవు. అందుకే 'ఎందుకు విడిపోవాలి సర్!' అని అడిగిన. అప్పుడు తెలంగాణ చరిత్ర చెప్పారు. అలా రెగ్యులర్ స్టూడెంట్స్తోపాటు మేం ఉద్యమంలో భాగస్వాములమయ్యాం.
డిగ్రీ ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసిండ్రు. అందరూ వాళ్ల గురించి చెబుతుంటే.. నా జీవితం గురించి నేనూ చెప్పిన. మా పొలిటికల్ సైన్స్ లెక్చరర్ వంగరి భూమయ్యగారు 'నువ్వు డిగ్రీతో చదువాపేయడం నచ్చడం లేదు. బీఎడ్ చేసి... టీచింగ్ ఫీల్డ్లోకి రా' అనిఫీజు కట్టిండు. బీఎడ్లో సీటు రాకపోతే ఎట్లా అని ఫ్రెండ్స్ అంటే.. పీజీకీ కూడా అప్లయి చేసిన. నిద్రాహారాలు మాని చదివిన. బీఎడ్లో1500 ర్యాంక్ వచ్చింది. స్థానిక ఎల్బీ కాలేజీలో సీట్ వచ్చింది. పీజీలో కూడా సీటొచ్చింది. కానీ బీఎడ్ చేయమని సూచించారు సార్. బీఎడ్ అయిపోయాక... పీజీ రాసిన. తెలుగులో. క్యాంపస్ సీట్ వచ్చింది. అది అయిపోయాక పీహెచ్డీ రాసిన... కానీ తెలుగులో ఆరే సీట్లున్నయి. 'నీకంటే సూపర్ సీనియర్స్ చాలా మంది ఉన్నరు. టైమ్ వేస్టు చేసుకోకు. ఎమ్మెడ్ కూడా అప్లై చేయి' అని ఐలయ్య సార్ చెప్పిండ్రు. 'ఇంగ్లీష్ రాదు' అని నేనంటే.. 'ఇంతదాకా వచ్చి రాదంటే ఎట్లా? అదేమన్నా బ్రహ్మ విద్యనా' ప్రోత్సహించిండు. జనగాం దగ్గర ఏకశిలలో ఎమ్మెడ్ పూర్తిచేసిన.
పిల్లల సపోర్టుతో...
ఏడాదిపాటు కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో టీచర్గా చేసిన. ఆ తరువాత... యాసిన్ కాలేజీలో బీఎడ్ ఫ్యాకల్టీగా రెండేండ్లపాటు చేసిన. అక్కడ ఉద్యోగం చేసుకుంటూ గురుకుల్ నోటిఫికేషన్రాంగనే దీనికి ప్రిపేరయిన. 2018 ఫిబ్రవరిలో జాబ్ వచ్చింది. ఏడాది పూర్తయ్యింది. పీజీ చేసేటప్పుడు రేడియోలో మళ్లీ అనౌన్సర్ నోటిఫికేషన్ పడింది. ఎంపికయిన. ఇప్పుడు రెసిడెన్షియల్ టీచర్గా చేస్తున్నా... రేడియో వల్లనే ఇక్కడిదాకా రాగలిగిన. కాబట్టి... దాన్ని వదులుకోదలుచుకులేదు. 17 ఏండ్లకు పెండ్లి. 18 ఏండ్లకు పెద్దబాబు, 20 ఏండ్లకు పాప, మళ్లీ బాబు. వాళ్లను బాగా చదివించాలన్నది కల. పెద్దబాబు అగ్రికల్చరల్ డిప్లొమా, పాప ఇంటర్, చిన్నోడు టెంత్ చదువుతున్నారు. పిల్లల సపోర్ట్ లేకపోతే ఇక్కడిదాకా వచ్చేదాన్ని కాదు. నేను చదువుకుంటుంటే వంటతోపాటు, ఇంట్లో పనులన్నీ వాళ్లే చేసుకునేవాళ్లు. నాకు ఆర్థ్రరైటిస్ వల్ల చేతులు నొప్పితో తినడానికి కూడా కష్టమవుతుంది. అప్పుడు పాప అన్నం కలిపి స్పూన్ వేసి ఇస్తుంది. నేను ఎంత వివక్ష ఎదుర్కొన్నానో... అలాంటి వివక్షకు దూరంగా పిల్లలను పెంచాలను కుంటున్నా. ప్రొబెషనరీ పీరియడ్ అయిపోయాక పీహెచ్డీ చేయాలను కుంటున్న. మనకు ఏదైనా చేయాలన్న సంకల్పం ఉంటే.. దానికి పంచ భూతాలు సహకరిస్తాయని ఎక్కడో విన్నాను. పంచభూతాలేమో కానీ... నేను చదువుకోవడానికి వెళ్లిన ప్రతిచోటా ఏదో ఒకరకంగా, ఎవరో ఒకరు సాయం చేశారు. ఇక్కడ పేర్లు చెబితే పెద్ద జాబితా అవుతుంది.. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
చీపురుతో కొట్టింది...
ఓసారి 'హెల్పింగ్ హ్యాండ్స్' అనే స్వచ్ఛంద సంస్థ 'యాంటీ డ్రగ్స్ డే' సందర్భంగా కవితలు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించింది. నేనూ పాల్గొన్న. కవిత, ఉపన్యాసం, వ్యాసరచన మూడింటిలో సెకండ్ ప్రైజ్ వచ్చింది. నా గురించి తెలుసుకున్న అప్పటి కలెక్టర్ వాకాటి కరుణ.. నన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఆ ఫొటో పేపర్లో వచ్చింది. ఆర్ఈసీ మెస్లో పనిచేస్తున్న మా అత్తకు.. అక్కడ పనిచేసేవాళ్లే చెప్పారట. 'వాళ్లందరూ నీ గురించి మాట్లాడుతున్నరు. మంచయినా, చెడయినా ఎవ్వరి నోట్లో పడొద్దు. ఇంట్లున్నోళ్లను బయటేస్తవా' అని చీపురు తీసుకొని కొట్టింది. ప్రపంచానికి పరిచయం కావాలన్నది నా ఆలోచన... మనం ఎవరో తెలియద్దొనేది వాళ్ల అభిప్రాయం. వాళ్లకు ఒకప్పుడు అదనపు భారంగా కనబడ్డ. ఇప్పుడు ఏటీఎం మెషీన్లాగా కనబడుతున్న.
ఒంటరితనం సాహిత్యానికి దగ్గర చేసింది...
నాన్న అలవాటు చేసిన రెండే రెండు విషయాలు. పుస్తకాలు చదవడం, రేడియో వినడం. పెండ్లి తరువాత ఎక్కువ పుస్తకాలతోనే గడిపేదాన్ని. పండుగకు పోయినప్పుడుల్లా పుస్తకాలుంటే తెచ్చుకునేదాన్ని. పప్పు, చక్కెరలాంటివి కొనుకొచ్చినప్పుడు వాటికొచ్చిన పేపర్లు కూడా వదలకపోయేది. అక్కడ నాకంటూ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. ఏ విషయం ఎవరికైనా చెప్పాలనిపించినా పేపర్మీద పెట్టేదాన్ని. అట్లా ఒంటరితనం సాహిత్యానికి దగ్గర చేసింది. ఉద్యమ సమయంలో ఉద్యమ కవితలు రాసిన. తరువాత ఫేస్బుక్, కవిసంగమం నన్ను ప్రోత్సహించింది. ఇప్పటిదాకా నేను రాసిన కవితలతో త్వరలో పుస్తకం తెద్దామనుకుంటున్న.