Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ అంటే.. జిల్లా పరిపాలనా బాధ్యతలు. కొందరు ఉపరితలంపైనే పనిచేసేవాళ్లుంటారు. ఇంకొందరు మూలాల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించేవారుంటారు. అలాంటివారిలో ముందుంటారు రీతుసేన్. ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లా కలెక్టర్. ఆమె బాధ్యతలు చేపట్టాక.. ఆ ప్రాంతపు రూపురేఖలు మార్చేశారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూనే.. శుభ్రతపై దృష్టిసారించారు. ఫలితం.. ఒకప్పుడు చెత్తను వేసే 16 ఎకరాల డంపింగ్ యార్డ్ శానిటేషన్ ఎవేర్ నెస్ పార్క్. ఇప్పుడీ జిల్లాలోని అత్యధిక ప్రాంతాలు... ఆదర్శ గ్రామాలు.
అది 2014 ఫిబ్రవరి నెల.. ఛత్తీసగఢ్లోని సర్గుజా జిల్లాకు 2003 బ్యాచ్కు చెందిన రీతు సేన్ కలెక్టర్గా నియమితులయ్యారు.. అధికారిక భవనానికి వెళ్లి విధుల్లో చేరడమే తరువాయి.. జిల్లా కేంద్రానికి వస్తుండగా అంబికాపూర్ పట్టణం.. ఆమెకు కంపుతో స్వాగతం పలికింది. ఎటు చూసినా చెత్తకుప్పలు.. అపరిశుభ్రంగా ఉన్న వాడలు దర్శనమిచ్చాయి. 16 ఎకరాల్లో భారీ డంప్యార్డు నుంచి వెదజల్లుతున్న కంపును భరించలేకపోయారు. ఆమెకు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. తన తొలి విధి ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చడమేనని నిర్ణయించుకున్నారు.అంబికాపూర్ పాలన బాధ్యతలు తన చేతుల్లోకి తీసుకొని రెండు నెలల్లో రోడ్మ్యాప్ సిద్ధం చేసుకొని చెత్త ఏరివేతకు పనులు ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించేలా చేశారు. చెత్తను సేకరించినందుకు ఇంటి యజమానుల వద్ద యూజర్ చార్జీలను వసూలు చేశారు. వీధి చివరలో గార్బేజ్ క్లినిక్ను ఏర్పాటు చేసి వాడలన్నింటినీ పరిశుభ్రంగా మార్చారు. అలా 2016 నాటికి పట్టణంలోని 48 వార్డులు క్లీన్గా మారిపోయాయి. డంప్యార్డును సానిటేషన్ అవేర్నెస్ పార్కుగా మార్చేశారు. ఆ పట్టణం 2018కి గానూ రాష్ట్ర స్థాయిలో పరిశుభ్రమైన చిన్న పట్టణంగా గుర్తింపు పొందింది.
జిల్లాలోని మహిళల సాధికారతకోసం కృషి చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సహకారంతో క్యాంటిన్ మేనేజ్మెంట్, పార్కింగ్ అటెండెంట్స్, నగరంలో చెత్త మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలతో ఉపాధి కల్పిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలతో కోడిగుడ్డు పొట్టునుంచి కాల్షియమ్ పౌడర్, ఎరువులను తయారు చేయిస్తున్నది. మహిళలకు ముందుగా పర్యావరణ వేత్త సి.శ్రీనివాసన్తో శిక్షణ ఇప్పించారు. క్యాల్షియమ్ పౌడర్, ఫర్టిలైజర్స్ తయారు చేయడానికి ముందుగా కోడిగుడ్డు పొట్టును శుభ్రంగా కడుగుతారు. ఎండబెడతారు. దాన్ని పొడిగా చేసి జల్లెడ పడతారు. మంచి కోడిగుడ్డు పొడి తయారవుతుంది. ఒక కిలోగ్రామ్ కోడిగుడ్డు పొట్టు పౌడర్ను ఒక క్వింటా కోళ్ల దానాకు కలపాలి. ఇది... గింజల్లో ఉన్న క్యాల్షియమ్ను తిరిగి అందిస్తుంది. కోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. పశుసంవర్ధక శాఖ కూడా ఈ మహిళలకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నది. దీని వల్ల చెత్త కుండీల్లోకి చేరిపోకుండా... రీసైక్లింగ్కు ఉపయోగపడుతున్నది. మహిళలకు ఆదాయ వనరుగా కూడా మారింది. కేవలం కోళ్లదానాగా మాత్రమే కాదు... ఈ కోడిగుడ్డుపొట్టును ఎరువుగా కూడా తయారు చేస్తున్నారు. నిజానికి ఇతర కూరగాయల నుంచి వచ్చిన పొట్టుకంటే.. కోడిగుడ్డు పొట్టు కుళ్లిపోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దాంతో దీన్ని విడిగా తయారు చేస్తున్నారు. కోడిగుడ్డు పొట్టు పౌడర్, ఫర్టిలైజర్ రెండూ... ఒక కేజీ రెండు వందల నుంచి ఆరువందల రూపాయల దాకా ఖరీదు చేస్తున్నాయి. వీళ్లు ప్రతి నెలా 50 నుంచి 60 కిలోల పౌడర్ను తయారు చేస్తున్నారు. దీనికి నెలకు 12 వేల నుంచి 36 వేలదాకా సంపాదిస్తున్నారు. అసలు దేనికీ పనికి రావనుకున్న కోడిగుడ్డు పొట్టు వీరికి ఎంతో ఉపయోగకరమైనదిగా మారింది. మహిళా సాధికారతకు ఉపయోగపడుతున్నది.