Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నృత్యం... తనువు, మనసు ఏకమై చేయాల్సిన ప్రక్రియ. దానిమీద ఎంతో ప్రేమ, మరెంతో ఏకాగ్రత... దానికి మించిన అభినయం ఉంటే కానీ... అంత అద్భుతంగా ప్రదర్శించలేం. అవన్నీ అపారంగా కలిగిన నృత్యకళాకారిణి డాక్టర్ పద్మజారెడ్డి. 45 ఏండ్లకు పైగా కూచిపూడి నృత్యప్రస్థానంలో ఆమె సాధించిన విజయాలెన్నో. కూచిపూడి తెలుగువారి ఆస్తి. భారతదేశ సంప్రదాయానికి చెందిన ప్రధాన నృత్యాలలో కూచిపూడి కూడా ఒకటి. ఈ ప్రాచీన కూచిపూడి నృత్యంలో దాదాపు అరశతాబ్ది ఆమె చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ దక్కింది. సంగీతమైనా, నృత్యమైనా శాస్త్రీయమనగానే ఇతిహాసాలే గుర్తుకొస్తాయి. కానీ ఆమె వాటికే పరిమితమైపోలేదు. సామాజిక సమస్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. తెలంగాణకు ఓ శాస్త్రీయ నృత్యం కావాలని... కాకతీయం పేరుతో నృత్యాన్ని రూపొందించారు. ఇప్పుడు కాకతీయం-2 రూపొందించడానికి సన్నద్ధమవుతున్నారు.
కృష్ణా జిల్లా పామర్రులో జన్మించారు పద్మజా. అక్కడి నుండి కూచిపూడి గ్రామం అత్యంత సమీపంలో ఉంటుంది. చిన్నతనంలో తాతయ్య, అమ్మమ్మ ప్రోత్సాహంతో కూచిపూడి నాట్యం నేర్చుకున్నారామె. కూచిపూడి నుంచి సైకిల్ మీద వచ్చి నేర్పించేవారు. మూడునాలుగేండ్ల వయసులో పెద్దగా ఆసక్తి ఏముంటుంది? పెద్దవాళ్లు ఏం చెబితే అది చేసేస్తారు. ఆమె కూడా అలాగే. తాతయ్య, అమ్మమ్మ 'నేర్చుకోమ్మా' అని చెప్పారు. తరువాత స్కూల్లో ప్రోగ్రామ్స్ చేస్తుంటే.. టీచర్స్, ఫ్రెండ్స్ ప్రత్యేకంగా చూసేవాళ్లు. టీచర్స్ మెచ్చుకునేవాళ్లు. క్లాసులకు రాకపోయినా పర్లేదు.. ఎగ్జామ్స్ రాయడానికి మాత్రం కచ్చితంగా రావాలి అంటూ... ఉపాధ్యాయుల ప్రోత్సాహం. అందరూ స్పెషల్గా చూస్తున్నారు. ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. మిగతా పిల్లల్లాగ కాక... హౌంవర్క్ చేయకపోయినా, స్కూల్కి రాకపోయినా తిట్టరు. ఇదేదో బాగుందనుకున్నది. అదే డ్యాన్స్పై ఆమె ఇష్టాన్ని మరింత పెంచింది. తరువాత నృత్యమే లోకమైపోయింది.
శోభానాయుడి శిష్యురాలిగా...
తండ్రి హైదరాబాద్ లో రేడియాలజిస్ట్. దాంతో అక్కడి నుండి కుటుంబం హైదరాబాద్కు వచ్చింది. స్కూల్లో కళాకృష్ణ నేర్పించేవారు. కూచిపూడిలో గురువులకు కొదువ లేదు, కానీ హైదరాబాద్లో ఎలా అనుకుంటున్న సమయంలో... ఆమె అదృష్టవశాత్తు ప్రముఖ నృత్యకారిని శోభ నాయుడు గారు ఇక్కడే అకాడమీ ప్రారంభించారు. అలా శోభానాయుడిగారి ప్రథమ శిష్యురాలైనారు పద్మజా. గురుశిష్యుల సంబంధమే అయినా... తల్లికీ బిడ్డకీ ఉన్న అనుబంధం వాళ్లిద్దరిదీ. అంత గౌరవమిస్తారు పద్మజా. పదేళ్ళు దాటకముందే కూచిపూడిలో విశేష ప్రతిభ కనబరిచి ప్రదర్శనలు ఇవ్వడం మొదలుబెట్టారు. మనలో ఏ టాలెంట్ ఉంటుందో దాని మీదే ఎక్కువ కష్టపడతాం మిగితావాటి మీద అంతగా దృష్టిని కేంద్రీకరించలేము, అలాగే చిన్నప్పటి నుండి కూచిపూడి నే దైవంగా భావించి నేర్చుకుంటున్న పద్మజా గారు కూడా చదువులో కాస్త వెనుకబడినా బి.ఏ పూర్తి చేశారు. తను ప్రదర్శించే కూచిపూడి నాట్యానికి ప్రజలు సమ్మోహితులు అవ్వడంతో ఆ కళలోని గొప్పతనం ద్వారా కూచిపూడి మీద మరింత గౌరవం పెరిగింది. సినిమా అవకాశాలు వచ్చినా... ఆమె అటువైపు వెళ్లలేదు. నృత్యానికే అంకితమైపోయారు. బీఏ అయిపోగానే పెండ్లి చేశారు తల్లిదండ్రులు. నిజామాబాద్ మాజీ ఎంపీ గంగారెడ్డి తనయుడు శ్రీనివాస్రెడ్డిని చేసుకున్నారు పద్మజా.
సామాజిక చైతన్యంతో...
పురాణగాథల మీద కూచిపూడి అందరూ చేస్తారు. ఆమె కూడా చేశారు. అయితే వాటిని వేరే విధంగా చూపించడానికి వీల్లేదు. ఎలా ఉందో అలాగే నృత్యం చేయాలి. కానీ సామాజిక సమస్యలమీద చేయాలంటే.. దానికి ఒక స్టోరీ కావాలి. ఆసక్తికరంగా మలచాలి. ఒక గంట ప్రదర్శన అంటే... ప్రేక్షకులను కనుతిప్పనివ్వకుండా చేయాలి. స్టోరీని ఎంపిక చేసుకోవడం, దానిమీద వర్కవుట్ చేయడానికి ఐదారు నెలలు పడుతుంది. మ్యూజిక్ చేయించాలి. కొరియగ్రాఫ్ చేయాలి. ఏది కూచిపూడిలోంచి బయటికి వెళ్లకుండా అందులోనే చేయాలి. అంటే బిగ్ టాస్క్. అది చాలా కష్టం. కానీ ఆమెకు అలాంటివే ఇష్టం. ఎందుకంటే కళ కలగానే మిగలకుండా... అదో సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండాలనుకున్నారు. అందుకే ఇప్పుడు సమాజం ముందున్న ఎన్నో సమస్యలను నృత్యరూపకంలో ప్రదర్శించారు. ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. రామాయణ, మహాభారతాల కాలం నుంచి స్త్రీలను హింసిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే... ఆ గర్భాన్ని తీసేయించే పరిస్థితి. ఆడపిల్లలు మగాళ్లతో శారీరకంగా సమానం కాకపోవచ్చు. కానీ అందరూ సమానం. ఎవ్వరు ఎక్కువగాదు, తక్కువగాదు. ఈ సమాజం మారాలనే ఆలోచనతో 'బ్రూణహత్యల'కు వ్యతిరేకంగా నృత్యాన్ని రూపొందించారు. అలాగే ప్రకృతి... మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన పంచేంద్రియాలు బాగుండాలంటే పంచభూతాలు బాగుండాలి. పంచభూతాలను కాపాడితే అవి పంచేంద్రియాలను కాపాడతాయి. ఇలా అనేక సోషల్ థీమ్స్పైనా ఆమె నృత్యాన్ని రూపొందించారు. అయితే మైథలాజికల్ థీమ్స్ కూడా ఇష్టమే ఆమెకు. అందుకే రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సాగిపోతున్నారు.
తెలంగాణకు కాకతీయం ...
14వశతాబ్దంలో కాకతీయుల సేనాని జాయప్ప 'నృత్త రత్నావళి' అనే గ్రంథాన్ని రాశారు. అందులోంచే పేరిణి నృత్యాన్ని సృష్టించారు నటరాజ రామకృష్ణ. సంస్కృతంలో ఉన్న ఆ పుస్తకాన్ని పప్పు వేణుగోపాల్గారు ఆంగ్లంలోకి అనువదించారు. ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆ పుస్తకాన్ని ఆమెకు కానుకగా ఇచ్చారు. అది చదవడం మొదలుపెట్టాక ఆసక్తికరంగా తోచిందామెకు. అందులో కుందుకు, భ్రమరీ, కోలాటం, లాస్యాంగాలు, పేరిణి (మహిళలతో) అన్నింటినీ మేళవించి 'కాకతీయం' పేరుతో రెండున్నర గంటల ప్రదర్శన చేశారు పద్మజా. ఆషామాషీగా కాదు. ఎందరో స్కాలర్స్ను కలిసి, ఎన్నో పరిశోధనలు చేసి రూపొందించారు. దాని వెనుక ఐదేండ్ల కృషి ఉంది. ఆమె ప్రయత్నం నచ్చీ అందరూ ప్రోత్సాహంతోపాటు, సహకారం కూడా అందించారు. ఇప్పుడు 'కాకతీయం -2' రూపొందించే పనిలో ఉన్నారు.
వేలల్లో ప్రదర్శనలు..
దశాబ్దం కిందట ప్రణవ్ కూచిపూడి అకాడమీని స్థాపించి నృత్య శిక్షణ ఇస్తున్నారు. ఎంతో మంది ఆమె దగ్గర నృత్యం నేర్చుకున్నారు. అందరూ దేశవిదేశాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రణవ్ కూచిపూడి అకాడమీకి హైదరాబాద్లో మూడు బ్రాంచిలున్నాయి. 500 మంది విద్యార్థులు ఉన్నారు. 45 ఏండ్ల ఆమె నృత్య ప్రస్థానంలో దేశవిదేశాల్లో మూడు వేలకు పైగా ప్రదర్శనలిచ్చారు. శిష్యులతో కలిసి ప్రతి ఏటా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇస్తుంటారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో విశేష ప్రతిభకు గుర్తింపుగా 2015 కి గానూ 'సంగీత నాటక అకాడమీ' అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా తీసుకున్నారు. నట విశారద, దశాబ్ధపు నర్తకి లాంటి పురస్కారాలను, శ్రీకృష్ణ దేవరాయులు యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ను కూడా అందుకున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న సంగీత నాటక అకాడమీ పురస్కారం మాత్రం అత్యున్నతమైనది.
ప్రశంసకు మించిన
సంతృప్తి లేదు...
మావారు బిజినెస్లో ఉన్నారు. 'మన హోటల్ చూసుకో' అని అప్పుడప్పుడు అంటుంటారు. కానీ నేను డ్యాన్స్లో మునిగిపోయాను. డ్యాన్స్ను ఎంజారు చేస్తాను. చాలా మందికి చదువు, చేసే ఉద్యోగం వేర్వేరు. కానీ నాకు ఇష్టమైన పనినే కొనసాగిస్తున్నాను. దానికి నా భర్త ప్రోత్సాహం కూడా చాలా ఉంది. మా మామయ్య, అత్తమ్మ కూడా ఎంతో సహకరించారు. ఏ కార్యక్రమం అయినా వచ్చి చూస్తారు. మా అత్తమ్మ అయితే.. డ్యాన్స్ అయిపోయాక దిష్టి కూడా తీస్తుంది. అంత ఇష్టం! డబ్బు ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు. ఇంకా సంపాదించాలని ఉంటుంది. కానీ.. డ్యాన్స్ అలా కాదు. నా నృత్యం చూసి ఎవరైనా బాగుందని అంటే.. అంతకుమించిన ఆనందం మరోటి ఉండదు. కళాకారులెవ్వరైనా గుర్తింపు కోరుకుంటారు.