Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముస్తఫా..ముస్తఫా డోంట్వరీ ముస్తఫా...కాలం నీ నేస్తం ముస్తఫా...జూన్ పోయి జులై పుడితే కాలేజీ క్యాంపస్లోనే ర్యాగింగ్ ఆరంభం..స్టూడెంట్స్ మనసో నందనవనం మల్లెలుంటారు, ముళ్ళు ఉంటారు..స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందోరు సాయం..ఇలా 'ప్రేమదేశం' సినిమా పాట ఎంతో పాపులర్...కాని ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో స్నేహం చిగురించాల్సిన చోట పైశాచికత్వం పుట్టుకొస్తోంది. వికృతం నాట్యం చేస్తోంది. ఈ వికృత చేష్ఠలకు జులై 14న రిషితేశ్వరి బలయ్యింది. అంటే సుమారు నెల రోజులు కావొస్తుంది. తమ బిడ్డ ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థులతో పాటు, ప్రిన్సిపాల్ బాబురావు కూడా కారణమే అంటూ ఆమె తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు గొంతు చించుకొని అరుస్తున్నారు. అయినా అతన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు...
ఒకరిని హింసించి ఆనందించే లక్షణం యువతలో ఎక్కడి నుండి పుట్టుకొస్తుంది? దీనికి సవాలక్ష కారణాలు మన చుట్టూనే ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పొరేట్ విద్యావిధానం, పెరుగుతున్న విలాసాలు, సరదాలు, విద్యాసంస్థలు, యాజమాన్య నిర్లక్ష్యం, సినిమాలు, క్లబ్బు, పబ్బు సంస్కృతి వెరసి ఇవన్నీ ఎంతో విశాలంగా ఆలోచించాల్సిన యువతను చెడువైపుకు నెట్టేస్తున్నాయి. ఉపాధ్యాయులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారు. కాని కొందరు వారి విలాసాలకు విద్యార్థులను పావుల్లా వాడుకుంటున్నారు. అలాంటి ఆలోచనల నుండి పుట్టిన వాడే ఎఎన్యు ఆర్కిటెక్చర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ బాబూరావు.
రిషితేశ్వరి మరణానికి కారణం ఎవరు? చదువుకోసం వెళ్ళిన బిడ్డలు అక్కడ వికృతంగా ప్రవర్తిసుంటే, పట్టించుకోని తల్లిదండ్రులదా? జ్ఞానాన్ని అందించాల్సిన విద్యాసంస్థలదా? ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న యాజమాన్యానిదా? విషసంస్కృతిని వెదజల్లుతున్న సమాజానిదా? సీనియర్లు రిషితేశ్వరిని ప్రేమించమంటూ వేధించారు. ఒప్పుకోనందుకు కక్ష కట్టారు. క్యాంపస్లో ఆమెను అర్థనగంగా ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించారు. మనోవేదనకు గురిచేశారు. చివరకు ఆమె ప్రాణాలు తీసుకోడానికి కారణమయ్యారు. విద్యార్థుల మధ్య స్నేహ భావాన్ని పెంచాల్సిన ప్రిన్సిపాల్ ఈ వికృత క్రీడను చూస్తూ ఎంజారు చేశాడు. వారికితో కలిసి తాగి, చిందులేశాడు.
అందుకే క్యాంపస్లోని విద్యార్థులందరూ ఏకమై రిషితేశ్వరి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని ఆందోళన చేశారు. దాంతో విద్యార్థులను వేరు చేసి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. పైగా ఆమె తల్లిదండ్రులకు డబ్బులిచ్చి నోరు మూయించాలని చూశారు. కాని కన్న ప్రేమ ముందు డబ్బు ఓడిపోతుందని ఆ తల్లిదండ్రులు నిరూపించారు. తన కూతురికి జరిగిన అన్యాయం మరే బిడ్డకు జరగకూడదని వారు గట్టిగా నిలబడ్డారు. వారి పోరాటానికి, ఆరాటానికి విద్యార్థి సంఘాలు తోడుగా నిలిచాయి. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్నాయి.
ఒక నిండు ప్రాణం పోయిన తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ యాజమాన్యం హడావుడి చేస్తుంది. అసలు సమస్య రాకుండా సమూల మార్పులు జరగాలి. విద్యావిధానంలో మార్పులు రావాలి. యూనివర్సిటీలో కొత్త కొత్త బిల్డింగ్లు కట్టిస్తూ ప్రైవేట్ కోర్సులకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తున్నారు. కొత్త కోర్సులు రావడం యువతకు మంచిదే. కాని ఆ కోర్సులు యువతకు మంచి బతుకులు ఇవ్వాలి. ప్రాణాలు తియ్యకూడదు. అలా జరగాలంటే బాధ్యత తెలిసిన వారిని ప్రధాన బాధ్యతల్లో ఉంచాలి. సమస్య వచ్చిన వెంటనే స్పందించి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని కొంత మంది ప్రొఫెసర్ల అభిప్రాయం.
ప్రత్యామ్నాయం చూపించాలి
ఈ వయసులో విద్యార్థులకు ఎనర్జీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు కేవలం చదువుకు మాత్రమే పరిమితమవుతున్నారు. శారీరక ఆటలకు ఇప్పటి పిల్లలు దూరమయ్యారు. దాంతో వీరిలో ఉన్న ఎనర్జీని ఏదో ఒక రూపంలో బయటకు చూపించాలి. దానికి వీరు ఎంచుకున్న మార్గమే ర్యాగింగ్. ఇతర విద్యార్థులను బాధపెట్టి ఆనందిస్తున్నారు. చాలామంది స్నేహం కోసమే ర్యాగింగ్ అంటారు. ప్రస్తుత సమాజంలో ర్యాగింగ్ అంగీకారంగా మారిపోయింది. కాని ఇది మంచి పద్ధతి కాదు. కాలేజీ యాజమాన్యం కొత్త విద్యార్థులతో స్నేహం చేసుకోడానికి సీనియర్లకు ప్రత్మామ్నాయాలు సృష్టించాలి. దీని కోసం మిత్రా టీమ్స్ ఏర్పాటు చేయాలి. సీనియర్లతో జూనియర్స్కు గిఫ్టులు ఇప్పించడం, గ్రూపు చర్చలు జరపడం, సాంస్కృతిక కార్యక్రమాల వంటివి విస్తృతంగా జరపాలి. ఇలా చేస్తే వారిలో ర్యాగింగ్ చేయాలనే ఆలోచనలు రావు. ర్యాగింగ్కి గురైన వారు కూడా విద్యార్థులతో, తల్లిదండ్రులతో తమ బాధలను పంచుకోవాలి. ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఇలా ఆత్మన్యూనతతో బాధపడుతున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించాలి. తల్లిదండ్రులను కూడా ర్యాగింగ్ నిరోధక కమిటీల్లో భాగస్వామ్యం చేయాలి.
- గీత చల్లా, కౌన్సెలర్
నిద్రపోతున్న యాజమాన్యం
ఒక ప్రాణం పోయిన తర్వాత ఇంతగా స్పందిస్తున్నారు. యూనివర్సిటీ గేట్లు మూసేశారు. ఎవరైనా లోపలికి రావాలంటే అనుమతి కావాలి. అయితే తనను సీనియర్ విద్యార్థులు హింసిస్తున్నారని రిషికేశ్వరి ఫిర్యాదు చేసినపుడు ఈ యాజమాన్యం ఏం చేసింది? ఆమె తల్లిదండ్రులు తమ కూతురి మరణానికి ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే కారణమంటూ ఎన్ని సార్లు చెప్పినా అతన్ని అరెస్టు చేయడం లేదు. వీరి ప్రతాపాన్ని కేవలం విద్యార్థులపై చూపుతున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో విద్యా వాతావరణం లేదు. మా తల్లిదండ్రులను గేటు దగ్గరే నిలబెట్టేశారు. యూనివర్సిటీ ప్రస్తుతం పోలీసుల పహారాలో నడుస్తుంది. మమ్మల్ని జైల్లో కూర్చోబెట్టి నట్లుగా ఉంది. ఈ హడావుడి మొత్తం కేవలం గేటు దగ్గరే. లోపల ఏమీ లేదు. హాస్టల్స్లో ఒక్కో బ్లాక్కు ఓ ఇన్చార్జ్ని పెడతామని ఆగస్టు ఐదో తేదీన ప్రకటించారు. వారం గడుస్తున్నా దీని గురించి పట్టించుకోలేదు. ఇదేనా బాధ్యతగా వ్యవహరించాల్సిన యాజమాన్య తీరు?
- టి. పావని, వివి రమణ,
ఎన్యు జర్నలిజం విద్యార్థులు
బాబురావును ఎందుకు అరెస్టు చేయరు?
క్యాంపస్లో ర్యాగింగ్ ఉందని బాలసుబ్రమణ్యం కమిటీ నిర్ధారించింది. రిషితేశ్వరి తల్లిదండ్రులు తమ బిడ్డ మరణానికి ప్రిన్సిపాల్ బాబూరావు ప్రవర్తనా, నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా చెబుతున్నారు. విద్యార్థి సంఘాలు ఇతన్ని ఎ1 ముద్దాయిగా అరెస్టుచేయాలని పోరాటం చేస్తున్నారు. విద్యార్థుల పోరాటాన్ని తట్టుకోలేని యాజమాన్యం అతన్ని డిస్మిస్ చేసింది. కాని ఇప్పటి వరకు అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదు. పైగా ప్రశ్నిస్తే అతను నేరానికి పాల్పడ్డాడని తేలితే అప్పుడు అరెస్టు చేస్తామంటున్నారు. అతనికి అధికార పార్టీ అండదండలు ఉన్నాయి. గతంలో పని చేసిన చోట కూడా ఇతనిపై అనేక నేరారోపణలు ఉన్నాయి. విద్యార్థులతో కలిసి మందు తాగడం, చిందులేయడం ఇతని నిత్య కృత్యం. అదే డిపార్ట్మెంట్కు చెందిన ఓ ఫ్యాకల్టీ, బాబూరావు ప్రిన్సిపల్గా ఉన్న సమయంలో చేసిన అరాచకాలను బయట పెట్టినందుకు, యూనివర్సిటీ పరువు తీశాడంటూ ఆ వ్యక్తిని సప్పెండ్ చేశారు. అంటే యూనివర్సిటీలో ఎలాంటి అన్యాయం జరిగినా నోరు తెరవకూడదా? ఆయేషా కేసు మాదిరిగా రిషితేశ్వరి కేసును కూడా పక్కదోవ పట్టించాలని చూస్తున్నారు. అసలు యూనివర్సిటీ భవనాలను ప్రైవేటు విద్యాసంస్థలకు అప్పగించడం వల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి దీనిపై కూడా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి.
- జ్యోతి, ఎస్.ఎఫ్.ఐ ఏపి రాష్ట్ర కమిటీ సభ్యురాలు