Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి రోజూ ఉదయమే మొట్ట మొదట తీసుకునే ఆహారం అంటే బ్రేక్ఫాస్ట్ పోషకాలతో నిండినదైతే ఇక ఆ రోజంతా శరీరం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. మనలో చాలామంది మధ్యాహ్న భోజనానికి ఇచ్చిన ప్రాధాన్యత బ్రేక్ఫాస్ట్కు ఇవ్వడం లేదు. దీనివల్ల శరీరం నీరసపడి పోతుందని ఆహార నిపుణులు అంటున్నారు. రోజంతా ఏమి తిన్నా మొదటిసారి తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, ఫైబర్ తప్పనిసరిగా ఉండాలి. శరీరానికి ప్రధానంగా కావల్సిన ఐదు పోషకాలు సమపాళ్లలో ఉండేటట్లు చూసుకోవాలి. దాదాపు ఏడు గంటల పాటు ఖాళీగా ఉన్న పొట్టకి ఆహారాన్ని అందిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడంటే అది అతను తీసుకునే బలమైన బ్రేక్ఫాస్ట్ వల్లే సాధ్యమవుతుందంటారు పోషకాహార నిపుణులు. రాత్రి వేళ తీసుకునే ఆహారం వల్ల శరీరానికి 25 శాతం మాత్రమే శక్తి అందుతుంది. మరుసటి రోజు శరీరం అలసట లేకుండా చురుగ్గా పనిచేయాలంటే బ్రేక్ఫాస్ట్లో అన్ని పోషకాలూ సమపాళ్లలో ఉండేలా తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, పాలు, పెరుగు, కోడిగుడ్డు, మాంసంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పండ్లు, కూరగాయలలో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కొవ్వు పదార్థాలను తీసుకోవద్దు.
- ఒక గ్లాసు పండ్ల జ్యూస్, మూడు లేదా నాలుగు కోడిగుడ్లు, బ్రెడ్ స్లయిస్ తీసుకోవచ్చు. ఉప్మా లేదా దోశ, సాంబారు, కొన్ని కూరగాయల ముక్కలు తిన్నా సరిపోతుంది. పప్పు, పరోటా, కూరగాయల బిర్యానీనైనా తీసుకోవచ్చు. కూరగాయల ముక్కలతో పాటు దాల్ చిల్లా, బ్రెడ్, రోటీ గానీ తీసుకుంటే సరిపోతుంది. కూరగాయల సాండ్విచ్, మిల్క్ షేక్, గుడ్డు, బ్రెడ్, ఉడకబెట్టిన కూరగాయలు తీసుకున్నా సమపాళ్లలో పోషక విలువలు అందుతాయి. ఉదయమే కాఫీ తాగుతూ కెఫిన్తో మీ దినచర్య ప్రారంభించవద్దు. నిద్రలేవటమే పండు, బిస్కెట్, పాలు.. వీటిల్లో ఏదైనా తీసుకోండి. ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు చేకూర్చే ఫలహారాన్ని ఆరగిస్తే అనారోగ్యం దూరం కావడం ఖాయం.