Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్కెట్ నుంచి తెచ్చిన కాయగూరల్ని, పండ్లను శుభ్రంగా కడిగిన తరువాతే తినేందుకు, వండేందుకు ఉపయోగించాలి. లేదంటే ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసుకున్నట్టే. వాటిమీద పేరుకుపోయే రసాయనాలు, హానికారక బ్యాక్టీరియాలను తొలగించేందుకు కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.
పండ్లు, కాయగూరల మీద చేరిన పెస్టిసైడ్స్ను ప్రభావవంతంగా తగ్గించడంలో బేకింగ్ సోడా భేషుగ్గా పనిచేస్తుంది. ఒక బకెట్లో నీళ్లు నింపి అందులో నాలుగు స్పూన్ల బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ నీళ్లలో కాయగూరలు, పండ్లు వేసి పావుగంట ఉంచాలి. తరువాత శుభ్రం చేసి మళ్లీ ఒకసారి మంచి నీళ్లలో కడిగి పొడి బట్టతో శుభ్రంగా తుడిచేయాలి.
పసుపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు కూరలు, పండ్లలోని క్రిములను నాశనం చేస్తాయి. పంటకోసం వాడిన క్రిమిసంహారక మందులు పండ్లు, కూరగాయల మీద అలానే ఉండిపోతాయి. అందుకని వాటిని పసుపు వేసిన నీళ్లలో కాసేపు ఉంచి తరువాత శుభ్రంగా కడిగి ఉపయోగించాలి.
పండ్లు, కూరగాయల మీద చేరిన క్రిములు, బ్యాక్టీరియాలను వెనిగర్ నాశనం చేస్తుంది. ఒక బకెట్లో కొంచెం నీళ్లు తీసుకుని అందులో వైట్ వెనిగర్ ఒక కప్పు వేయాలి. ఈ నీళ్లలో పండ్లు, కూరగాయలు వేసి ఐదు నిమిషాలు నానపెట్టడం వల్ల క్రిములు, బ్యాక్టీరియా నాశనం అవుతాయి.
రాళ్ల ఉప్పు లేదా మామూలు ఉప్పును నీళ్లలో కలపాలి. ఈ నీళ్లలో పళ్లు, కూరగాయలు వేసి పదినిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత కాయగూరల్ని మరోసారి మంచినీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల వాటిమీద ఉండే క్రిములు, క్రిమి సంహారక మందులు తొలగిపోతాయి.