Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండవేళల్లో పిల్లలను ఆరుబయటకు వెళ్లనివ్వద్దు. చల్లబడిన తర్వాతే ఆరుబయట ఆటలకు అనుమతించండి. ఇంట్లోనే ఉండి ఆడుకుంటున్నా, పిల్లలు ఆటల ధ్యాసలో పడి మంచినీళ్లు తాగే విషయాన్ని పట్టించుకోరు. పిల్లల్లో ఎండను తట్టుకునే శక్తి సహజంగానే తక్కువగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులే వారిని ఓ కంట గమనిస్తూ ఆరారగా నీళ్లు తాగిస్తుండాలి. వీలైతే కొబ్బరి
నీళ్లు, గ్లూకోజ్, ఓఆర్ఎస్ లాంటివి కూడా ఇవ్వవచ్చు. నీడ పట్టునే ఆడుకుంటున్నా ఈ ఎండల ధాటికి పిల్లలకు వడదెబ్బ తాకే అవకాశాలు లేకపోలేదు. పిల్లలకు ఒళ్లు కాలిపోయేంతగా జ్వరం వస్తే బెంబేలెత్తిపోవద్దు. అలాంటప్పుడు వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
నుదుటిపై తడిగుడ్డ పెట్టడం, ఒంటిపై దుస్తులు వదులు చేసి ఫ్యాన్ లేదా కూలర్ దగ్గర పడుకోబెట్టి చంకలు, గజ్జల్లో ఐసుగడ్డలు పెట్టడం ద్వారా పిల్లల్లో శరీర ఉష్ణోగ్రతను చల్లబరచే ప్రయత్నం చేయాలి.
ఆరారగా ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగించాలి. ఓఆర్ఎస్ అందుబాటులో లేకపోతే చారెడు పంచదార, చిటికెడు ఉప్పు కలిపిన నీళ్లు తాగించవచ్చు. లేకుంటే, కనీసం ఒక అరటిపండు తినిపించి మంచినీళ్లు తాగించినా కాస్త ఫలితం ఉంటుంది.
ఇన్ని చేసినా జ్వరం అదుపులోకి రాకుంటే, మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించాలి.