Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్లు పలికించలేని.. పెదాలు పలకలేని భావోద్వేగాలను సైతం ఆమె కాన్వాస్ మీద ప్రతిఫలిస్తుంది. గ్రామీణ ప్రాంతాలు, అక్కడి సాధారణ మనుషులు వాళ్ల జీవితాల్లోని కష్టసుఖాలు, సుఖదు:ఖాలు, భావోద్వేగాలను రంగుల్లో పలికిస్తుంది. మూడేండ్ల వయసునుంచే చిత్రకళ మీద ఆసక్తి పెంచుకుని... వృత్తినీ, ప్రవృత్తినీ సమన్వయంతో కొనసాగిస్తున్న ఆ చిత్రకారిణి జానకి ఇంజేటి. విజయవాడలో పుట్టి... హైదరాబాద్ మీదుగా, ఇప్పుడు బెంగళూరులో స్థిరపడ్డ జానకిది... కాంటెంపరరీలో తిరుగులేని ముద్ర. అందుకే నేషనల్, ఇంటర్నేషనల్ ఆన్లైన్ గ్యాలరీస్లో ఆమె ఆర్ట్కు డిమాండ్. 'పెయింటింగ్... నాకు మెడిటేషన్' అంటున్న జానకి పరిచయం...
కుటుంబ నేపథ్యం? అసలు చిత్రకళ మీద ఆసక్తి ఎలా పుట్టింది?
మాది విజయవాడ. పుట్టి పెరిగింది, చదువుకున్నది మొత్తం విజయవాడలోనే. నాన్న కాంతారావు, అమ్మ రమాదేవి. నాన్న సొంతూరు పశ్చిమగోదావరి. కానీ ఎప్పుడో వచ్చి విజయవాడలోనే సెటిలయ్యారు. అమ్మ ఎమ్మార్వోగా చేసి పనిచేసి పదవీవిరమణ పొందారు. అమ్మవాళ్ల చివరి తమ్ముడు, మా మేనమామ శ్రీహరి స్కూల్లో డ్రాయింగ్ టీచర్. నాకు మూడునాలుగేళ్ల వయసులో అమ్మమ్మవాళ్లింటికి వెళ్లినప్పుడు... మామయ్య పెయింటింగ్స్ వేస్తుండటం చూసేదాన్ని. ఇంత పెద్ద మనిషి... ఆ పేపర్ మీద ఎలా నిలబడ్డాడు అని చెప్పి.. ఆశ్చర్యపోయేదాన్ని. మొత్తానికి ఆర్ట్ని చూస్తుంటే థ్రిల్లింగ్గా ఉండేది. ఆ వయసులోనే నాకు చిత్రకళ మీద ఆసక్తి పుట్టింది. చూసిన ప్రతీది గీయడం మొదలుపెట్టిన.
ఆర్టిస్టు అవ్వాలని ఏ వయసులో రియలైజ్ అయ్యారు?
రియలైజ్ అవ్వడమంటూ ఏం లేదు. చిన్నప్పటినుంచి ఆర్ట్ను అసలు ఆపింది లేదు. ప్రైమరీ స్కూల్ నుంచే ప్రతి పోటీలో పాల్గొనేదాన్ని. ఎక్కడ పోటీలున్నా అమ్మా, మామయ్య దగ్గరుండి తీసుకెళ్లేవాళ్లు. వెళ్లిన ప్రతి చోటా బహుమతి నాకే వచ్చేది. స్కూల్, కాలేజీ స్థాయిల్లో బహుమతులు గెలుచుకున్నాను. టెంత్ అయిపోగానే ఫైన్ ఆర్ట్స్లో చేర్చుదామనుకున్నారు. మా అన్నయ్య ఫ్రెండ్ ఒకరు అన్ని యూనివర్సిటీలవి దరఖాస్తు ఫారాలు కూడా తెచ్చారు. కానీ... అప్పుడు నేను చాలా సిగ్గరిని, అందరిలో కలవకపోయేదాన్ని. ఎక్కడికెళ్లాలన్నా అమ్మనో, నాన్ననో, చెల్లినో తీసుకెళ్లేదాన్ని. అంత షై నాకు. ఇలాంటి పిల్లను పంపితే ఎక్కడ ఇబ్బందులు పడతదో అని పేరెంట్స్ పంపించలేదు. చిన్నప్పుడు బొమ్మలేస్తుంటే చూసి... 'ఎందుకు ఆ బొమ్మలు అనవసరంగా. ఏదైనా లెక్కలు చేసుకుంటే జ్ఞానం పెరుగుతుంది' అన్న నాన్ననే... ఇంటర్కు వచ్చేనాటికి నా ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. కలర్స్ దగ్గరనుంచి కాన్వాస్ వరకు కొత్తదేది వచ్చినా తెచ్చి ఇచ్చేవారు. అలా కుటుంబమంతా నాకు ప్రోత్సాహమందించింది. బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను.
ప్రారంభంలో ఆర్ట్ ఎక్కడా చదువుకోలేదు కదా! కాంటెంపరరీని అంతలా ఎలా పట్టుకోగలిగారు?
ఆర్ట్ను నేను సొంతంగా నేర్చుకున్నాను. గ్రాడ్యుయేషన్ తరువాత.. డిస్టెన్స్లో బీఎఫ్ఏ, ఎమ్ఎఫ్ఏ పూర్తి చేసిన. 1997 నుంచి నేటివరకు దేశవ్యాప్తంగా అనేక గ్రూప్షోస్లో పాల్గొన్నాను. నేను హైదరాబాద్లో ఉన్నా... చిత్రాలను తీసుకుని రావడం, గ్యాలరీస్లో ఇవ్వడం అంతా నాన్న చేసేవారు. 2004 తరువాత ఇల్ల స్ట్రేషన్స్ కూడా మొదలుపెట్టాను. ఆ కాలంలో ఇల్లస్ట్రేషన్స్ వేసిన మొదటి తెలుగు మహిళననుకుంటా. 2013నుంచి 2015 వరకు హైదరాబాద్, మైండ్స్పేస్లోని రియల్పేజ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను. ఆ సమయంలో అంటే... 2014లో రెయిన్బో ఆర్ట్ గ్యాలరీలో సోలో ఎగ్జిబిషన్ నిర్వహించాను. 2015లో పెండ్లయ్యింది. ఆయన కూడా సాఫ్ట్వేర్లోనే పనిచేస్తున్నారు. దాంతో ఇద్దరం బెంగళూరులో సెటిలయ్యాం. 2017లో విజయవాడలో సోలో ఎగ్జిబిషన్ నిర్వహించాను. ఇప్పుడు బెంగళూరులో సోలో నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నా.
తెలుగు రాష్ట్రాలు, బెంగళూరులో ఆర్ట్ కల్చర్ ఎలా ఉంది?
వృత్తి, ప్రవృత్తి వేర్వేరు కావడంతో... పెయింటింగ్కు సమయం చిక్కడం లేదు. అయినా బెంగళూరులో వీకెండ్స్లో చిత్రకళా పరిషత్కు వెళ్లొస్తుంటా. ఇక్కడ గొప్పగొప్ప చిత్రకారులున్నారు. ఆర్ట్కు ఆదరణ కూడా బాగుంటుంది. ఎంతలా అంటే... అసలు చిత్రకళాపరిషత్ ఏడాదికి ముందే బుక్ అయి ఉంటుంది. ఎగ్జిబిషన్స్ అంత ఎక్కువ. సోలో ప్లాన్ చేసుకుంటున్నా. ఈ మాతృ దినోవత్సవానికే అనుకున్నా. కానీ కుదరలేదు. త్వరలో పెట్టాలి.
మీరు ఎక్కువగా ఏ చిత్రాలు గీయడానికి ఇష్టపడతారు?
ఎక్కువగా కాంటెంపరరీ ఇష్టపడతాను. రియలిస్టిక్ కూడా ఇష్టమే. కానీ... ఫిగరేటివ్ కాంటెంపరరీ ఆర్ట్కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంటుంది. రియలిస్టిక్లో అందరివీ ఒకేలా ఉంటాయి. కానీ... కాంటెంపరరీలో మనదైన ముద్ర, శైలి కనిపిస్తుంది. చిత్రాలను చూసి... ఫలానా ఆర్టిస్టువి అని చెప్పేయొచ్చు. అందుకే ఎక్కువగా కాంటెపరరీనే గీస్తుంటా. రియలిస్టిక్నూ అప్పుడప్పుడు చిత్రిస్తుంటా. మొజాకోవాళ్లు.. 'ట్రెండింగ్ ఫిగరేటివ్ స్టయిల్స్ ఇన్ ఇండియా ఇన్ కాంటెపరరీ' ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. రవివర్మ కాలం నుంచి ఫిగరేటివ్ ఎట్లా మారుతూ వచ్చిందనేది ఆర్టికల్. రవివర్మ, ఆనంద్ పాంచాల్ వంటి వారి సరసన యువతరంలో నా పెయింటింగ్స్ లిస్ట్ చేశారు. చాలా గర్వంగా ఫీలయ్యాను.
మీరు చిత్రకళా వస్తువులుగా ఏం ఎంచుకోవడానికి ఇష్టపడతారు? ఆర్ట్ని మీరు ఏవిధంగా చూస్తారు?
గ్రామీణ వాతావరణం, అక్కడి సాధారణ మనుషులు, వాళ్ల రోజువారీ జీవితంలో ఉండే కష్టసుఖాలు, భావోద్వేగాలను చిత్రిస్తుంటా. ఒక మనిషి తనలోని భావాలను, ఉద్వేగాలను నోటితోగానీ, చూపుతోగానీ... వ్యక్తపరుస్తుంటారు. కళ్లు పలికించలేని, మాటల్లో చెప్పలేని ఆ భావోద్వేగాలను రంగుల్లో ప్రతిఫలిస్తాను నేను. మొదట ఆర్ట్ లవర్ని. నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఒక ఫామ్ అని లేదు... అన్ని ఆర్ట్ ఫామ్లను ఆస్వాదిస్తాను. పెయింటింగ్ వేయడం నాకు మెడిటేషన్ లాంటిది. ఒక చిత్రం గీస్తున్నానంటే... ఏదీ గుర్తుండదు. ఆర్ట్ వల్ల... ఆలోచనా తీరులో పరిణితి వస్తుంది. పరిశీలనా శక్తి పెరుగుతుంది. లోతైన పరిశీలన పెయింటింగ్లో సహాయ పడుతుంది. అదీ పెయింటింగ్ మొదలుపెట్టాక.. పరిశీలనా శక్తి మరింత పెరుగుతుంది. ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతాయి. మానవ నాగరికతకు... టెక్నాలజీ, ఆర్ట్ నాణానికి రెండు వైపుల్లాంటివి. ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో క్లాసెస్ తీసుకోమని అడుగుతున్నారు. ఉద్యోగం, ఆర్ట్.. సమయాభావం వల్ల కుదరడం లేదు. కానీ భవిష్యత్లో చేయాలి.
ఉద్యోగం, చిత్రకళ... ఈ రెంటి కొనసాగింపులో కుటుంబ సహకారం ఎలా ఉంది?
చాలా... ఉంది. కుటుంబంలో, మన చుట్టూ ఉన్న మహిళలు.. మనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తా ఉంటారు. అమ్మ, అమ్మమ్మ అందరూ... వాళ్ల జీవితాలను మలు చుకున్న తీరు స్ఫూర్తినిస్తుంటుంది. మా అమ్మ... వర్కింగ్ ఉమెన్ అయి ఉండి కూడా చాలా సపోర్ట్ అందించారు. నేను పెయింటింగ్ ముందు కూర్చుంటే... అన్ని సమకూర్చి పెట్టేవారు. ఆర్ట్ ఎగ్జిబిషన్స్, షోస్ అన్నీచేయ గలిగానంటే అమ్మానాన్న, కుటుంబం సపోర్ట్ వల్లే. ఇక పెండ్లయ్యాక... భర్త చంద్రశేఖర్ ఇచ్చిన భరోసా అంతా ఇంతా కాదు. మాది పెద్దలు కుదిర్చిన పెండ్లి. నేను చెప్పింది ఒక్కటే... 'నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. అది ఆపకూడదు. ఆపేటట్టయితే ఈ సంబంధమే వద్దు' అన్నాను. 'ఉద్యోగం చేస్తే చేయండి లేకపోతే మానేయండి. ఇంట్లో కూర్చుని పెయింటిగ్ వేసుకోండి. లేదంటే... ఏదైనా చదువుకోండి. మీ ఇష్టాన్ని ఎప్పుడూ కాదనను' అని చెప్పారు. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారు. తనకూ కాంటెంపరరీ ఆర్ట్ అంటే ఇష్టం.