Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెబ్బయి రెండేండ్ల స్వాతంత్య్రభారతంలో అక్షరాస్యతకు నోచుకుని కమ్యూనిటీలు ఎన్నో ఉన్నాయి. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు కేటాయించినా వాటి ఊసుకూడా తెలియని తెగలు మరెన్నో ఉన్నాయి. అలాంటి ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన అమ్మాయి పెండ్లి తర్వాత ఆగిపోకుండా, ఇంటికే పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదివారు. పట్టుదలతో పోటీ పరీక్షలు రాసి అత్యున్నత సర్వీస్కు ఎంపికైన మొట్టమొదటి గిరిజన మహిళగా రికార్డు సృష్టించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఉపయోగించుకుంటూ ఉన్నతవిద్య, ఉద్యోగాల దిశగా ఆడపిల్లలు అడుగులు వేసేలా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమే అడిషనల్ సెక్రటరీ భారతీ లక్పతి భూక్యా,ఐఎఎస్. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమె ఇటీవలే అడిషనల్ సెక్రటరీగా పదోన్నతి పొందారు. గిరిజన యువతులకు ఆదర్శంగా నిలిచిన ఆమె ప్రస్థానం...
ఖమ్మం జిల్లా పాల్వంచలో పుట్టిపెరిగాను. నాన్న భూక్యా బీమానాయక్, అమ్మ భూక్యా మంగమ్మ . మాకు చిన్న కిరాణం షాపు ఉండేది. ఒక అక్కయ్య, ఒక చెల్లారు. నేను ఏడోతరగతిలో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మే అన్నీ తానై మమ్మల్ని పెంచారు. అమ్మమ్మ మాకు తోడుగా ఉండేవారు. పదోతరగతి వరకు పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాను. మా ఇండ్లల్లో ఆడపిల్లలకు త్వరగా పెండ్లి చేస్తారు. అదేవిధంగా పదోతరగతి కాగానే నాకు పెండ్లి చేశారు. మా వారు బోడా లక్పతి. మా పెండ్లి తర్వాత ఆయనకు డిఫెన్స్లో టెక్నికల్ ఆఫీసర్గా ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వచ్చాం. చదువుకోవాలన్న నా ఆసక్తిని గమనించిన మావారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. నాంపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియేట్, కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ, పిజీ(ఎంఏ పొలిటికల్ సైన్సు)పూర్తి చేశాను. ఈ లోగా ముగ్గురు పిల్లలు. ఒకవైపు చదువు, మరోవైపు ఇంట్లో బాధ్యతలు. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలన్న ఆసక్తితో బిఎడ్ కూడా పూర్తి చేశాను. పిల్లలను సంతోష్నగర్లోని చైల్డ్కేర్ సెంటర్లో కేర్టేకర్ ఆంగ్లో ఇండియన్ జెన్నీ టీచర్ దగ్గర వదిలి కాలేజీకి వెళ్లేదాన్ని.
ఎపీపీఎస్ఎస్సీ పరీక్షల ద్వారా..
పిజీ చదువుతూనే పోటీ పరీక్షలకు ప్రిపేరు అయ్యాను. ఫైనల్ ఇయర్ పరీక్షలు కాగానే గ్రూప్ 2 బి రాశాను. ఫస్ట్ అటెమ్ట్లోనే పోస్టింగ్ రావడంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పరీక్ష రాయగా ఎస్టిసిలో పోస్టింగ్ వచ్చింది. ఏపీ స్టేట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాయగా ఫస్ట్ అటెమ్ట్లోనే డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. సొంత ప్రిపరేషన్, మా ఆయన కోఆపరేషన్తో మా కమ్యూనిటీ నుంచి మొట్టమొదటి ఐఎఎస్ ఆఫీసర్గా ఎంపికయ్యాను.
అంబరాన్ని అంటిన అమ్మమ్మ సంబరం..
నాన్న మా చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మమ్మ మాకు తోడుగా ఉండేవారు. అమ్మమ్మ, అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచారు. మా కమ్యూనిటీలో అక్షరాస్యత చాలా తక్కువ. అమ్మ, అమ్మమ్మ సపోర్ట్గా నిలిచి నన్ను పదోతరగతి వరకు చదివించారు. పెండ్లి తర్వాత మా వారి మద్దతులో నేను ఉన్నత చదువులు చదవడంతో పాటు ఏపీ స్టేట్ సివిల్ సర్వీస్కు ఎంపికైన మొదటి అమ్మాయిని కావడంలో మా పాల్వంచలో అమ్మమ్మ, అమ్మ, నాన్న బంధువుల ఆనందానికి అవధులు లేవు. 'మన కమ్యూనిటీ నుంచి ఉన్నత ఉద్యోగం సాధించిన మొట్ట మొదటి అమ్మాయిగా రికార్డు సృష్టించి ఎందరికో ఆదర్శంగా నిలిచావు' అంటూ అభినందించారు. ప్రముఖ దినపత్రికలు ఎంతగానో ప్రశంసిస్తూ మొట్ట మొదటి గిరిజన ఉన్నతాధికారిగా గుర్తింపు ఇచ్చాయి. ఆడపిల్లకు చదువెందుకు అన్న వాళ్లే చదువుకుంటే ఎన్నో సాధించవచ్చు అంటూ మెచ్చున్నారు. వారి ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నా, ఒక పూట తిండి మానుకుని వారి పిల్లలను బడికి పంపిస్తున్నారు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎందరో ఆడపిల్లలు బడికి వెళ్లడం సంతోషాన్నిచ్చింది. నేను పడిన కష్టం ఎందరికో విద్య విలువను చాటి చెప్పింది.
నిర్వహించిన శాఖలు..
రంగారెడ్డి జిల్లాలో ఏడాది ట్రైనింగ్ తర్వాత నిజామాబాద్ ఆర్డిఓగా ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత జెఏడిలో డిప్యూటి డైరెక్టర్గా, అధికార భాష విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా , యానిమల్ హబ్సెండరీలో జాయింట్ డైరెక్టర్గా, ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ ఆఫీసర్గా, చిన్నమొత్తాల పొదుపు శాఖలో స్టేట్ అసిస్టెంట్ కమిషనర్గా, మహబూబ్ నగర్ రెండో జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. అక్కడ పనిచేస్తున్న ప్పుడే 2006బ్యాచ్లో ఐఎఎస్గా కన్ఫమ్ అయ్యాను. ఆ తర్వాత జెఎడిలో డిప్యూటీ సెక్రటరీగా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో డిప్యూటీ, జాయింట్ సెక్రటరీగా, పబ్లిక్ల్ ఎంటర్ ప్రైజెస్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తూ ఇటీవల అడిషనల్ సెక్రటరీగా ప్రమోషన్ పొందాను.
ప్రజలకు దగ్గరగా..
ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి చాలా శాఖల్లో పనిచేసినా మహబూబ్నగర్లో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన సమయం సంతృప్తిని ఇచ్చింది. మహిళలైతే సమస్యలను సావధానంగా విని, సరైన పరిష్కారం సూచిస్తారన్న విషయం అందరూ అంగీకరించాల్సిందే. నేను మహబూబ్నగర్లో బాధ్యతలు నిర్వహించే సమయంలో కలెక్టర్, మరో జాయింట్ కలెక్టర్ మగవారు ఉండటంతో ప్రతి సోమవారం నిర్వహించే 'ప్రజావాణి' కార్యక్రమం నన్ను నిర్వహించమని చెప్పేవారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరగా పనిచేస్తూ, వారి సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం వచ్చింది.
ప్రభుత్వ పథకాలపై...
నేరుగా ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యను చెప్పే వీలు ఉండటంతో ప్రజావాణి కి మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యతో వచ్చేవారు. వారి ఫిర్యాదులు విన్నప్పుడు వారిలో చాలామందికి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి, సదుపాయాల గురించి అవగాహన లేదు అన్న విషయం స్పష్టమైంది. వారికి అర్థమయ్యేలా చెప్పడంతో పాటు కొన్నిసార్లు వారి తరపున దరఖాస్తులు రాయించడం, సంబంధిత అధికారులకు ఫొన్ చేసి చెప్పడం చేసేదాన్ని. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వచ్చేవారు. ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాల ప్రజలకు తెలియకపోవడానికి కారణం వారి నిరక్ష్యరాస్యతే. మా దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారంతో పాటు ఎక్కువగా విద్య, వైద్య సంస్థల పరిశీలనకు వెళ్లేదాన్ని. అకస్మిక తనిఖీల ద్వారా వాస్తవాలు తెలిసేవి. సంక్షేమ పాఠశాలలు, హాస్టల్స్కు వెళ్లినప్పుడల్లా అక్కడి పిల్లలతో మాట్లాడేదాన్ని. వారి సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉండేది. విద్య ద్వారానే వారి సమస్యలు తీరడంతో పాటు వారి జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందన్న విషయం ప్రతి విద్యార్థికి చెప్పేదాన్ని. ఇప్పుడిప్పుడే ఉన్నత చదువుల వైపు వెళ్తున్నా ఉన్నత ఉద్యోగాల్లో చాలా తక్కువ మందే ఉన్నారు.
ప్రగతి దిశగా..
ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందిస్తున్నా వాటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నా వాటిని ఉపయోగించుకునే విధానం తెలియక ఎంతో మంది పేదరికంలో మగ్గుతున్నారు. సంక్షేమ పథకాల వద్దనే ఆగిపోతున్నారు. మారుమూల తాండాల వరకు విద్య, వైద్యం అందడం లేదు. సమాజంలో వెనుకబడిన వర్గాలను గుర్తించి వారిని ప్రగతిదిశగా నడిపించాలన్న అంబేద్కర్ ఆశయాలు నిజం కావాలంటే రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు అందరికీ అందాలి. విద్య విలువ తెలుసుకుని తమ బతుకులు దిద్దుకునేలా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఇంకా ఉంది.
- వి. యశోద