Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల అల్లరి ఎక్కువైతే తల్లిదండ్రులు వారిపై అరుస్తుంటారు లేదంటే చేయిచేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఫలితం లేకపోగా వారి చిన్నిమనసు గాయపడుతుంది. ఇది వారిపై ప్రభావం చూపుతుంది. వారి ప్రవర్తనకు గల కారణాలు తెలుసుకోవడమే కాకుండా... వారిలానే మారి.. వారికి నచ్చచెప్పితే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
- పెద్దలంతా ఒకప్పుడు పిల్లలే అని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఏ రకంగా పెంచాలి అనేది తెలుసుకోవాలి. పట్టు విడుపులతో పిల్లల్ని మంచి మార్గంలో ఎలా తీసుకొని వెళ్లాలి అనేది తెలుసుకోవాలి. గతంలో ప్రతీ ఇంట్లో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య వంటి పెద్దలు ఉండే వారు కాబట్టి ఓర్పుతో అన్ని విషయాలు తెలియ చెప్పేవారు. కానీ రాను రాను న్యూక్లియర్ఫ్యామిలీలు వచ్చేశాక మంచి, చెడు నేర్పేవారు తక్కు వ అయ్యారు. దీంతో పిల్లల పెంపకం కత్తి మీద సాములా మారుతోంది.
- ఇప్పుడు పిల్లలంతా చాలా స్పీడ్ గా ఉంటున్నారు. చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ చాలా ఫాస్టుగా ఉంటున్నారు. ఒకప్పుడు ప్రతీ ఇంట్లో నలుగురు, ఐదుగురు పిల్లలు ఉండేవారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీల కారణంగా ఒక్కరు తప్పితే ఇద్దరు పిల్లలే ఉంటున్నారు. వాళ్లకు ఆటా పాట అన్నీ తల్లిదండ్రులతోనే అవుతోంది. దీంతో గారాబం ఎక్కువ అవుతోంది. ఫలితంగా మొండిగా తయారవుతున్నారు. అయితే ఇలాంటి పిల్లలతో పట్టు విడుపుతో మెలగాలని నిపుణులు చెబుతున్నారు.
- కొంత మంది పిల్లలు గారాబం ఎక్కువ అయినప్పుడు ఎవరినైనా ధిక్కరించే లక్షణంతో ఉంటారు. ఇటువంటి వారికి క్రమంగా తామే అధికులం అన్న భావన కలుగుతుంది. ఇటువంటి వారు చిన్నపాటి ఇబ్బందిని కూడా సహించలేని వారుగా మారతారు. ఇటువంటి పోకడల్ని మొదట్లోనే గుర్తించి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది.
- ఇంట్లోని పెద్ద వారిని గౌరవించటం, తోటి వారిని అభిమానంగా పలక రించటం, ప్రశాంతంగా జవాబులు ఇవ్వటం వంటివి ఇంట్లోనే అలవాటు చేయాల్సి ఉంటుంది. ఇవి పెద్ద వారిని చూసి పిల్లలు బాగా నేర్చు కొంటారు. అందుచేత పిల్లలకు ఈ విషయాల్ని విడమరిచి చెప్పాలి. ఒకవేళ ఇటువంటి విషయాల్లో సక్రమంగా లేకపోతే నెమ్మదిగా నేర్పిం చాల్సి ఉంటుంది. అంతే తప్ప కేకలు పెట్టడం, ఒక్కసారిగా విరుచుకు పడటం మంచిది కాదు. మంచి అలవాట్లను నెమ్మదిగా తెలియచేయాలి.
- పిల్లలు ఎప్పుడూ పిల్లలతోనే ఆడుకోవాలని కోరుకొంటారు. తోటి పిల్లలతో అనుకరించటం లేదా తోటి పిల్లలకు నేర్పించటం అంటే బాగా ఇష్టపడతారు. సరిగ్గా ఈ టెక్నిక్ నే పెద్దలు కూడా అనుసరించాలి. అంటే పిల్లలతో బాస్ మాదిరిగా మాట్లాడటానికి బదులు తోటి పిల్లల మాదిరిగా అనునయించి చెప్పటం మేలు. ఒక పని వద్దని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం కన్నా నిదానంగా అందులోని మంచి చెడ్డల్ని విడమరిచి చెప్పటం మంచిది.
- పిల్లల్ని ఒంటరిగా ఉంచటం మంచిది కాదు. నలుగురిలోనూ కలిసి పోనివ్వాలి. చుట్టుపక్కల వారితో కలవకపోవటం, స్కూల్లో తోటి ఫ్రెండ్సుకి దూరంగా ఉండటం మంచి అలవాటు కాదని తెలియచెప్పాలి. తామే అధికులం అన్న భావన ఎంత ప్రమాదకరమో, తాము అల్పులం అన్న న్యూనత కూడా సరి కాదు. అందుచేత ఇతరులతో కలిసిపోయేందుకు పిల్లలను ప్రోత్సహించాలి.
- స్నేహితుల ఎదుట పిల్లల్ని చికాకు పడటం, కోప్పడటం, పోల్చి తిట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు. స్నేహితుల సమక్షంలో పిల్లలతో అభిమానంగా వ్యవహరిస్తే... పిల్లలూ తల్లిదండ్రుపై ఇష్టం, ప్రేమ పెంచుకుంటారు.