Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి అంటేనే మామిడి. పండ్లల్లో రారాజు. ఇది అందించే పోషకాలు అన్నీఇన్నీ కావు. మామిడి పండ్లతో జ్యూస్లు, సలాడ్స్, మిల్క్షేక్స్ చేసుకుంటే.. పచ్చిమామిడిని కూరల్లో వాడుకోవచ్చు. అందులోనూ నాన్వెజ్తో చేర్చితే అమోఘమైన రుచి. ఆ తరువాత ఆమ్ కా పన్నానో, ఆమ్కీర్నో తీసుకుని చూడండి. వేసవి మధ్యాహ్న భోజనం సంపూర్ణం..
మామిడి చికెన్
కావలసిన పదార్ధాలు
ఎముకలు లేని చికెన్-500 గ్రాములు, మామిడి పండు-1 (పొట్టుతీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి), కొబ్బరి - 1 కప్పు (బాగా తురుముకోవాలి), వెల్లుల్లి రెబ్బలు-2 నుంచి4, ఒక చిన్న ముక్క అల్లం, పచ్చిమిర్చి-2, ఎండు మిర్చి-2,
పసుపు-1 టేబుల్ స్పూన్, కారం - తగినంత, ఆవాలు -1 టేబుల్ స్పూన్, యాలకులు - 4, దాల్చిన చెక్క- చిన్న ముక్క, నూనె-3 టేబుల్ స్పూన్స్, బిర్యాని ఆకు- 1, ఉప్పు - రుచికి సరిపడేంత, బేబీ ఉల్లిపాయల పేస్ట్
తయారీ విధానం
చికెన్ని తీసుకుని నీటితో శుభ్రం చేసుకుని, వాటిని ఒక పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చిని కలుపుకుని, మెత్తగా దంచి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. దీన్ని చికెన్కు బాగా పట్టించాలి. రాత్రంతా చికెన్ను ఫ్రిజ్లో పెట్టేయాలి. మరుసటి రోజు ఒక పెనమును స్టౌ మీద వుంచి.. అందులో కొబ్బరి తురుము, ఉల్లిపాయ పేస్ట్ను వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇంకో పాన్ తీసుకుని... అందులో కొద్ది నూనె వేసి, వేడిచేసుకోవాలి. అందులో బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, ఆవాలు వేసి కొద్దిసేపు వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను అందులో వేయాలి. తరువాత 5 నుంచి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నప్పుడు కర్రీ నుంచి నూనె సెపరేట్ అవుతుంది. ఆ నూనెలో ఇంతకుముందు ఫ్రై చేసుకున్న కొబ్బరి, ఉల్లిపాయల పేస్ట్ను కలపాలి. మసాలా వేసి, కొద్దిగా ఉడికాక, మామిడికాయ ముక్కలు వేయలి. చివరకు రెండు లేదా మూడుకుప్పల నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి మీడియం మంట మీద ఉడికించాలి. మామిడి చికెన్ రెడీ!
మామిడి మటన్
కావలసిన పదార్థాలు
పచ్చి మామిడికాయలు- 2, ఉల్లిగడ్డలు-2, మటన్ ముక్కలు- 500 గ్రాములు,
నూనె- 4 టేబుల్ స్పూన్స్, లవంగాలు- 3, జీలకర్ర- 1 టేబుల్స్పూన్, దాల్చినచెక్క- 1, సోంపు- 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర- పిడికిలికి వచ్చినంత, మిరపపొడి- తగినంత, ఉప్పు- తగినంత, గరంమసాలా- 1 టేబుల్స్పూన్, ధనియాలపొడి- టేబుల్స్పూన్, జీలకర్రపొడి- 1 టేబుల్స్పూన్, పసుపు- అర టీస్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్- 1 టేబుల్స్పూన్.
తయారీ విధానం
మొదట మటన్ను శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత మామిడి, ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర, ధనియాలపొడి, గరంమసాలా, పసుపు, ఉప్పు ఇలా పైన చెప్పిన మసాలా దినుసులన్నింటిని దోరగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బ్రౌన్రంగు వచ్చే వరకూ వేయించాలి. ఆ తర్వాత మటన్ వేసి బాగా ఐదు నిమిషాలు మిక్స్ చేయాలి. కారంపొడి, ఉప్పు, తగినంత నీరు మటన్ కూరలో వేసి ఉడికించాలి. మటన్ ఉడికిన వెంటనే మామిడి ముక్కల్ని, తరిగిన కొత్తిమీరను వేసి పదినిమిషాల పాటు ఉంచాలి. మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి. చివరగా తాజాగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని చల్లితే మ్యాంగో మటన్ రెడీ.
ఆమ్కా పన్నా
కావలసిన పదార్థాలు : పచ్చి మామిడికాయ - 1, జీలకర్ర - 1టేబుల్స్పూన్, చక్కెర- 2 టేబుల్స్పూన్లు, నల్ల ఉప్పు - చిటికెడు
తయారీ విధానం
ముందుగా మామిడికాయ చెక్కు తీసి, కుక్కర్ లో రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత చాకుతో లేదా వెడల్పాటి స్పూన్ తో మామిడి గుజ్జంతా తీసి పెట్టుకోవాలి. ఈ గుజ్జుకు, చక్కెర, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఉడికించిన నీరు కలిపి ఫ్రిజ్లో పెట్టాలి. చల్లగా అయ్యాక లేదా ఐస్ ముక్కలు వేసుకుని తాగితే మంచిది. నల్ల ఉప్పు వేయకున్నా ఏమీ కాదు. నీళ్లు కావలసినన్ని కలుపుకోవాలి.
మామిడి రొయ్యలు
పదార్థాలు : రొయ్యలు - అరకిలో, పచ్చిమామిడికాయలు - చిన్నవి రెండు, టమాటాలు- రెండు, ఉల్లిగడ్డలు - మూడు, వెల్లులి తురుము - రెండు టీస్పూన్లు, అల్లం తురుము - ఒక టీస్పూన్, అవాలు - అరటీస్పూన్, కారం - ఒక టీస్పూన్, మంచినీళ్లు ఆరలీటరు
తయారీ విధానం: రొయ్యల్ని శుభ్రంగా కడగాలి. మామిడికాయల్ని తొక్కతీసి చిన్నముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె వేసి కాగాక అవాలు, మెంతులు, అల్లం వెల్లుల్లి తురుము వేసి వేయించాలి తరువాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకూ ఉడికించాలి. తరువాత మామిడికాయ ముక్కలు, ధనియాల పొడి, కారం, పసుపు వేసి ఉడికించాలి. మసాలా వాసన వస్తుండగా రొయ్యలు వేసి ఓ నిముషం వేయించాలి. తరువాత నీరు పోసి పదిహేను నిమిషాల పాటు ఉడికించి దించే ముందు కొత్తిమీర చల్లితే రుచికి చాలా బాగుంటుంది
ఖీర్ మామిడి
కావలసిన పదార్థాలు : మామిడిపండు - 1, పాలు - తగినన్ని, బియ్యం - టీ స్పూన్, చక్కెర - టీ స్పూన్, జీడిపప్పు పలుకులు (వేయించినవి) - అర టీ స్పూన్, యాలకులపొడి - చిటికెడు, మామిడి పండు గుజ్జు - టీ స్పూన్, బాదంపప్పు - అర టీ స్పూన్
తయారీ విధానం: పాలు, బియ్యం, చక్కెర కలిపి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత గంటపాటు ఫ్రిజ్లో ఉంచాలి. మామిడిపండుపై తొక్క తీసి, తురమాలి. రైస్ ఖీర్ను ఫ్రిజ్లోనుంచి బయటకు తీసి, అందులో మామిడిపండు గుజ్జు, మామిడిపండు తురుము, యాలకులపొడి వేసి కలపాలి. పైన జీడిపప్పు, బాదంపప్పు పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చల్లగా, తియ్యగా, మృదువుగా, రుచిగా ఉండే ఈ ఖీర్ను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. ఈ వేసవిలో వారికిది బలవర్ధకమైన ఆహారం కూడా. (చక్కెరకు బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు)