Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన శరీరం సరిగా పనిచేయాలంటే కేవలం కేలరీలు మాత్రమే కాదు. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల వంటి పోషకాలు కూడా కీలకం. ముఖ్యంగా పిల్లలకు ఇవెంతో అవసరం. పోషకాల లోపంతో చూపు కోల్పోవడం, మెడ వద్ద ఉబ్బు (గాయిటర్), పొడవు తగ్గటం, రోగ నిరోధక శక్తి బలహీన పడటం వంటి సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి కీలకమైన పోషకాల గురించి, వాటితో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకొని ఉండటం మంచిది.
ప్రోటీన్: శరీర నిర్మాణంలో ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. రోజూ ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే కొన్నాళ్లకు తీవ్ర నిస్సత్తువ, కండరాల మోతాదు తగ్గటం వంటి వాటికి దారితీస్తుంది. పిల్లల్లో ప్రోటీన్ లోపిస్తే శారీరక, మానసిక ఎదుగుదల కుంటుపడుతుంది. శరీరం తగినంతగా యాంటీబాడీలను ఉత్పత్తి చేయకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా సన్నగిల్లుతుంది .
విటమిన్ 'ఎ': ఆహారం ద్వారా అవసరమైనంత విటమిన్ 'ఎ' తీసుకోకపోతే చూపు కోల్పోవడంతో పాటు రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది కూడా. దీని లోపం మూలంగా నీళ్ల విరేచనాలు, మీజిల్స్, మలేరియా వంటి సాధారణ జబ్బులతోనూ పిల్లలు మరణించే ముప్పు పెరుగుతుంది.
ఐరన్: దీని లోపంతో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోయి రక్తహీనత దాడి చేస్తుంది. ఫలితంగా త్వరగా అలసిపోవడం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనబడతాయి. గర్భిణులు రక్తహీనతకు చికిత్స తీసుకోకపోతే కాన్పు ముందు, తర్వాత తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయోడిన్: థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయడానికి అయోడిన్ అత్యవసరం. మన శరీరంలోని అన్ని హార్మోన్లను థైరాయిడ్ గ్రంథి నియంత్రిస్తుంది. అందువల్ల అయోడిన్ లోపిస్తే హార్మోన్ల పనితీరూ అస్తవ్యస్తమవుతుంది. పిల్లల్లో మెదడు ఎదుగుదల కుంటుపడుతుంది. అయోడిన్ కొద్దిగా లోపించినా ఐక్యూ మీద ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక దీని లోపం తీవ్రంగా ఉంటే బుద్ధి మాంద్యం, విషయ గ్రహణ సమస్యలూ దాడి చేస్తాయి.