Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న కుటుంబాలు.. అందుబాటులోకి వచ్చిన స్టార్ట్ఫోన్లు.. పెరిగిన ఒంటరితనం.. వీటి కారణంగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలతో ఆత్మవిశ్వాస లోపానికి గురవుతున్నారు నేటి తరం పిల్లలు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పెరుగుతున్న పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడానికి ఆటవిడుపుగా ఆడే ఆటలు, నేర్చుకునే కళలు ఎంతో ఉపకరిస్తాయి.
చదువుతో పాటు ఆట పాటలలో , లలితకళలు నేర్చుకోవడంతో పిల్లలని ప్రోత్సహించడం ద్వారా వారిలో పోటీతత్వంతో పాటు తమ మీద తమకి నమ్మకం పెరుగుతుంది. చిన్నచిన్న ఆందోళనకే ఆవేదన చెందకుండా తమ భవితని చక్కగా తీర్చిదిద్దుకోగలరు. సరదాగా ఆడే ఆటలు, నేర్చుకునే కళలు జీవితం పట్ల వారిలో ఉండే భయాలను తొలగించి వారిలో సృజనాత్మకతకు దోహదం చేస్తాయి. అయితే నేటి తల్లిదండ్రులు చదువుకు ఇచ్చిన ప్రాధాన్యత ఆటపాటలకు, కళలకు ఇవ్వడం లేదు. కేవలం తరగతి గదుల్లోనే కాదు ఆటమైదానాల్లోనూ , కళాప్రదర్శనతోనూ బంగారు భవితకు బాటలు చేయవచ్చని గుర్తించాలి. పిల్లలకు టైమ్ కేటాయించడం ద్వారా వారి అభిరుచులను తెలుసుకోవాలి.
పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానం అందించాల్సిన బాధ్యత ఇంట్లో పెద్దలదే. నటన, రచన, నృత్యం, సంగీతం లాంటి అభిరుచులను సెలవుల్లో నేర్పించవచ్చు. ఒకప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు కథలు, తాము ఎదుర్కొన్న అనుభవాలు చెప్పేవారు. దాంతో మంచి చెడు, లోకజ్ఞానం అబ్బేవి. పెద్దలున్నారన్న భరోసా, ఆత్మీయత పరోక్షంగా అందేవి. మరి ఈ కాలం పిల్లల పెంపకం తీరే వేరుగా ఉంది. ర్యాంకుల పరుగులో సృజనాత్మకతను కోల్పోతున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆందోళనలకు గురవుతున్నారు. ఒత్తిడి, ఆందోళనల నుంచి పిల్లలకు ఉపశమనం కావాలంటే తల్లిదండ్రులు కొద్దిగా సమయం కేటాయించాల్సిందే. సెలవురోజుల్లో వారికి నేర్పించే కళల ద్వారా వారికి కొత్తలోకాన్ని పరిచయం చేయవచ్చు.
సరిగమపదనిసలతో..
లయబద్దమైన సంగీతం పిల్లల మెదడుపై చక్కగా పనిచేస్తుంది వారు వేగంగా..చురుగ్గా స్పందించేలా శ్రావ్యమైన సంగీతం దోహదం చేస్తుందని అనేక అధ్యయనాలు ద్వారా రుజువైంది. సంగీతంలో ఓ శక్తివంతమైన లయ విన్యాసం ఉంటుంది. పిల్లల్లో దశలవారీగా పెరేగే నైపుణ్యాలను మెరుగుపరచాలంటే సంగీతం నేర్పించాలి. ఇది పిల్లల్లో మాట్లాడే సామర్థ్యాన్ని పెంచుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. లయబద్ధ సంగీతానికి పిల్లల మెదడు పాజిటివ్గా స్పందిస్తుంది. అందుకే అమ్మజోల పాటకు హాయిగా నిద్రపోయే చిన్నారులను చూస్తుంటాం. సంగీతం, సంగీత వాయిద్యాలు నేర్చుకునే పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానసిఒత్తిడిని వాళ్లు జయించగలుగుతారు.
పాత్రాభినయాలతో..
ఎవరినైనా అనుకరించే సృజనాత్మకత పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. తాతయ్య ఎలా మాట్లాడుతాడు.. అమ్మమ్మ ఎలా నడుస్తుంది.. అమ్మ వంట ఎలా చేస్తుంది ఇలాంటి వన్నీ గ్రహిస్తూ అనుకరిస్తుంటారు. వారితో చిన్నచిన్న నాటకాలు వేయించడం, ఏకపాత్రాభినయాలు చేయించడం ద్వారా వారిలో సృజనాత్మకత మరింత పెంచవచ్చు. అలా చేయడం వల్ల కేవలం నటననే కాకుండా ఎవరు ఏమిటో తెలుస్తుంది. ఎదుటివారిని, సమాజాన్ని అవగాహన చేసుకోవడానికీ ఉపయోగ పడుతుంది. వారిలో సమయస్ఫూర్తిని పెంచుతుంది.
సప్తవర్ణాలతో....
రంగురంగుల బొమ్మలను చిన్నారులకు కొనిస్తారు తల్లిదండ్రులు. వారితో కూర్చొని ఏ బొమ్మ రంగు ఎంటో చెప్పమనాలి. రంగులతో వారికి సహవాసం పెంచాలి. మరీ చిన్నారులైతే కొన్ని బొమ్మలను ఇచ్చి రంగులను వేయమని కూడా చెప్పాలి. అంతేకాదు వారికి రంగులను ఇచ్చి నచ్చిన బొమ్మలను వేయమనాలి. సప్తవర్ణాలతో వారి మనోవికాసం మరింత పెరుగుతుంది. ఏ బొమ్మ వేయాలన్నది వారి ఇష్టానికే వదిలేయండి. ఇవన్నీ వారిలో కొత్త ఆలోచనల్ని పుట్టిస్తాయి.
పుస్తకనేస్తాలతో..
పిల్లలు పుస్తకాలు ఇష్టంగా చదవాలంటే వాళ్ళకి ముందుగా కథలు చెప్పాలి. కథల పుస్తకాలు చదివించాలి. చిన్నగా ఉండి చదవగానే వినోదాన్ని కలిగించి, తరువాత విజ్ఞానాన్ని, వికాసాన్ని కలిగిస్తుంది. బాలల సాహిత్యం చాలా వుంది. అందులో కథలు, నాటికలు, ప్రముఖుల జీవిత చరిత్రలు అందుబాటులో ఉన్నాయి. పుస్తకం ఒక మంచి నేస్తం కావాలంటే మంచి పుస్తకాలు చదివించాలి. పుస్తక పఠనం మానసిక అలసట దూరం చేసి నూతనోత్తేజం కలిగిస్తుంది. తియ్యని అనుభూతులు పంచుతుంది. ఇతరులతో స్పందించే తీరు పుస్తక పఠనం వల్ల మెరుగవుతుంది. పుస్తకం ఊహాశక్తిని పెంచుతుంది. పదసంపదను పెంపొందిస్తుంది. ఆలోచనాశక్తిని పెంచి బుద్ధి వికసింపజేస్తుంది. ఇతరుల కష్టసుఖాలలో పాలుపంచుకోవడం, సంస్కారం, భావవ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతాయి. అనవసరమైన భయాలు, మూఢనమ్మకాలు దూరమవుతాయి. చదివిన విషయాలను చర్చించడం వలన జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తాయి.