Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సముద్ర, నదీ తీరాల్లో ఉండేవాళ్లకేమో గానీ... చెరువులపై ఎక్కువగా ఆధారపడే తెలంగాణలో చేపలంటే ఎండాకాలం. అలాంటి చేపలతో పులుసు, ఫ్రై వంటివి రొటీన్ వంటకాలు. ఈ ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ పిల్లలకు ఈ పులుసులు పెడితే... తినడానికి ఇష్టపడరు. అలాంటి ప్రత్యేక రుచులు... కట్లెట్, చిప్స్, పకోడీ, ఫింగర్స్, టిక్కా వంటివి తినాలంటే రెస్టారెంట్స్పై ఆధారపడతారు చాలామంది. అలాంటివారికోసమే ఈ ఫిష్ స్పెషల్స్. మీరూ ప్రయత్నించండి!
బటర్ ఫిష్ ఫ్రై
కావాల్సిన పదార్ధాలు : చేప ముక్కలు - అర కేజీ, కార్న్ఫ్లోర్ (మెక్కజొన్నపిండి) - ఒక స్పూన్, మైదా- ఒక స్పూన్, బేకింగ్ పౌడర్- అర స్పూన్, వెల్లుల్లి పేస్టూ - అర కప్పు,కొత్తిమీర తురుము - రెండు కప్పులు, నూనె- తగినంత, ఉప్పు - రుచికి సరిపడా,
తయారీ విధానం : ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వెల్లుల్లి పేస్టూ, ఉప్పు, మైదాపిండి, మెక్కజోన్నపిండి, బేకింగ్ పౌడర్ వేసి కొన్నీ నీళ్లు పొసి జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించి పదినిమిషాలు వరకు నాననివ్వాలి. ఇప్పుడు ఒక పెనం తిసుకొని అందులో తగినంత నూనె వేసి నానపెట్టుకున్నచేపలను ఒకొక్కటిగా వేసి ఇరువైపులా బాగా వేగించుకోవాలి. అన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకోని తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుమును చల్లుకోవాలి. అంతే మనముందు కరకరలాడే చేప ఫ్రై రెడీ.
ఫిష్ ఫింగర్స్
కావాల్సిన పదార్ధాలు : స్నేపర్ ఫిల్లెట్స్- 750 గ్రాములు (వైట్ ఫిష్వి), ఉడకబెట్టి మెత్తగా చేసిన ఆలుగడ్డలు-రెండు, పచ్చిమిరపకాయలు-రెండు, అల్లం-ఒక టీస్పూను, మిరియాలు- రుచికి సరిపడా, ఉప్పు-తగినంత, గుడ్లు-రెండు, బ్రెడ్ ముక్కలపొడి- అర కప్పు, నూనె- ఒక కప్పు.
తయారీ విధానం : ముందుగా పాన్ తీసుకుని అందులో చేప ముక్కల్ని వేసి నీళ్లు పోయాలి. తరువాత ఉప్పు వేసి కొద్దిగా ఉడకపెట్టాలి. అవి చల్లారాక చేప ముక్కల్లో ముల్లు లేకుండా జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టాలి. తర్వాత అల్లం, పచ్చిమిరపకాయల్ని మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. పాన్లో నూనె పోసి సన్నని మంటపై నూనెను వేడి చేయాలి. గిన్నె తీసుకుని అందులో చేప ముక్కల్ని, ఉడకబెట్టిన ఆలుగడ్డలను మెత్తగా చేసి వేయాలి. అందులోనే అల్లం, పచ్చిమిరపకాయ పేస్టు, కొత్తిమీర ఆకులు, కొద్దిగా మిరియాలపొడి వేసి బాగా కలపాలి. తరువాత ఉప్పు సరిపోనట్టు అనిపిస్తే కాస్త వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని వాటిని ఫింగర్ షేపులో చేసి గుడ్డు సొనలో ముంచి, బ్రెడ్ ముక్కల పొడిలో దొర్లించాలి. ఆ ముక్కల్ని వేడెక్కిన నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకూ వేగించాలి. ఫిష్ ఫింగర్స్ ఎక్కువ నూనెను పీల్చినట్టు అనిపిస్తే పేపర్ టవల్స్లో వేసి వాటికి పట్టిన అదనపు నూనెను డ్రై చేయొచ్చు. ఈ ఫిష్ ఫింగర్స్ను టమాట సాస్తో తింటే చాలా బాగుంటుంది.
ఫిష్ పకోడి
కావాల్సిన పదార్ధాలు : చేపలు - 2, కోడిగుడ్లు - 2, కార్న్ఫ్లోర్ - 2 స్పూన్స్, కారం - ఒక టీ స్పూన్, నిమ్మరసం - 2 స్పూన్స్, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు, నూనె - తగినంత
తయారీ విధానం : చేపలను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి ఒక గిన్నెలో కోడిగుడ్లను బాగా గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ముంచి వేయాలి. బంగారు వర్ణం వచ్చే వరకు వేయించి తీయాలి. ఏదైనా చట్నీతో లాగిస్తే మరింత ఉంటాయి ఫిష్ పకోడీలు!
ఫిష్ కట్లెట్
కావాల్సిన పదార్ధాలు : పెద్ద చేప లేదా చిన్న చేపలు - కిలో, అల్లం, వెల్లుల్లి ముద్ద -1 టీ స్పూన్, ఉప్పు - 2 టీ స్పూన్లు, గరమ్ మసాల పొడి - 2 టీ స్పూన్లు, కారం - 1 టీ స్పూన్, ఆలు - 2, పిచ్చి బఠానీ - 1 కప్పు, పచ్చిమిర్చి - 4, నూనె - 150 గ్రా, మైదాపిండి - 1 కప్పు, నీళ్ళు-1 కప్పు
తయారీ విధానం : ముల్లు తీసిన చేప ముక్కలను బాగా క్లీన్ చేసి కడిగి, కొంచెం నీళ్లు జల్లి ఉడికించి తీసి చల్లార్చాలి. పచ్చి బఠానీ, ఆలు కూర ఉడికించి పచ్చిమిర్చి తరుగు కూడా కలిపి ఉడికించి ఉండికించి, చల్లార్చాలి. చేపముక్కలు, ఆలు,బఠానీ, ఉప్పు, కారం, మసాల, అల్లం, వెల్లుల్లి ముద్ద కూడా వేసి కలపాలి. దీనిని కట్లెట్ షేప్లో చేసుకుని, మైదా, నీళ్లు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్ట్ను చేప కట్లెట్ రెండు వైపుల పూయాలి. పెనంపై నూనె వేసి వేడి చేసి.. కట్ లెట్స్ రెండు వేసి, రెండు వైపుల తిప్పుతు ఎర్రగా కాల్చాలి. టిష్యూ పేపర్ పై పెట్టి సర్వ్ చేయండి.
ఫిష్ టిక్కా
కావాల్సిన పదార్ధాలు : చేపల ముక్కలు - అర కేజీ, పెరుగు- ఒక కప్పు, ఆవాల పొడి - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్, కారం పొడి - ఒక టీ స్పూన్, మిరియాల పొడి- ఒక టీ స్పూన్, పసుపు పొడి - అర స్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్, నూనె- తగినంత, వెనిగర్ - అర స్పూన్
తయారీ విధానం : వెడల్పాటి పాత్రలో పెరుగు, ఆవాల పొడి, ఉప్పు, జీలకర్రపొడి, మిరియాల పొడి, పసుపు, వెనిగర్, అల్లం వెల్లుల్లి ముద్దను బాగా మిక్స్ చేయాలి. ఇందులో ముళ్లు లేని శుభ్రం చేసిన చేప ముక్కలకు పట్టించి.. అరగంట పాటు పక్కనబెట్టేయాలి. బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో మసాలా దట్టించిన చేప ముక్కలను స్క్యూవర్ కమ్మీలకు గుచ్చి.. ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఈ ముక్కలు ఉడికి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని గ్రీన్ చట్నీతో రుచి చూడాల్సిందే.
ఫిష్ చిప్స్
కావాల్సిన పదార్ధాలు : చేపలు - 5, కారం - 1చెంచా, బేకింగ్ పౌడర్ - 3/4 చెంచా, సోడా లేదా వైన్- 1 కప్పు, మైదా- 1 చెంచా, కార్న్ ఫ్లోర్ - 1 చెంచా, నూనె- సరిపడా
తయారీ విధానం : ముందుగా పిండిని తయారుచేసుకోవాలి. అందుకోసం మైదా, కారం, బేకింగ్ పౌడర్ ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత అందులో సోడా లేదా వైన్ వేసి మొత్తం మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం మిశ్రమం ఒక 20నిముషాలు చల్లగా అవ్వనివ్వాలి.
అందులో ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్, మైదాను ఒక ప్లేట్లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకొన్న చేప ముక్కల మీద మైదా కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని చిలకరించాలి. ఈ చేప ముక్కలను సోడా లేదా వైన్ మిశ్రమంలో డిప్ చేయాలి.
ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి, చేపముక్కలను కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ ఫిష్ ఫ్రై రిసిపి రెడీ. వీటిని వేడి వేడిగా స్పైసీ సాన్ మరియు చిప్స్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.