Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మంది పిల్లలు చిన్న చిన్న విషయాలకే నిరాశపడిపోతుంటారు. నాన్న బైక్ ఇవ్వకపోయినా, స్మార్ట్ ఫోన్ అడిగితే కొనివ్వకపోయినా, మార్కులు తక్కువ వచ్చినా... ఇలా ప్రతి విషయానికీ ఆందోళన చెందుతున్నారు. తమలో తామే కుమిలిపోతున్నారు. ఒంటరిననే భావనకు గురై ఆఖరికి ఆత్మహత్యల వరకూ వెళ్తున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అయితే ఇందుకు ముఖ్య కారణం తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉండే అనుబంధ లోపమేనని చెబుతున్నారు నిపుణులు.
- తల్లిదండ్రులతో పిల్లలకు ఉన్న అనుబంధాన్ని బట్టే పెద్దయ్యాక వాళ్ల ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం వంటివి ఉంటాయి. వీటితోపాటు తల్లిదండ్రులకు అన్నీ చెప్పుకోవచ్చనేది కూడా వారి మధ్య ఉండే అనుబంధం, ప్రేమాను రాగాల్ని బట్టి ఉంటుంది. దీని ప్రభావం ఎంతలా ఉంటుందంటే పసివాళ్లు ఏడుస్తున్నప్పుడు తల్లి వాళ్ల వద్దకి ఎంతసేపట్లో చేరుకుందనేది కూడా కీలకమే. దాన్నిబట్టే పిల్లల్లో భావోద్వేగాల మోతాదు ఉంటుంది. ఏడుస్తున్న పిల్లల్ని దగ్గరగా హత్తుకుంటే వాళ్లెంతో సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారు. దీనిమీద ఆధారపడే పిల్లలు పెద్దవాళ్లయ్యాక తమ కష్టసుఖాలను ఇతరులతో పంచుకునే అలవాటు ఉంటుంది.
- ప్రస్తుతకాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దానివల్ల పిల్లల్ని డేకేర్ సెంటర్లలో వదిలి పెడుతున్నారు. ఈ పరిస్థితి వల్ల పిల్లలతో అతి తక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఇక్కడినుంచే తల్లిదండ్రులతో పిల్లలకు ఉండాల్సిన ఎమోషనల్ అటాచ్మెంట్ తగ్గిపోవడం మొదలవుతుంది. అలాగే డేకేర్ సెంటర్లలో ఆయాలు రోజుకొకరు చొప్పున మారుతుంటే ఆ ప్రభావం కూడా పిల్లల మీద పడుతుంది.
- ఈ మధ్యకాలంలో పిల్లల్ని స్వతంత్రులుగా పెంచాలనే ఉద్దేశంతో వాళ్ల మీద మానసికంగా పెద్ద భారాన్నే వేస్తున్నారు. కాని అంతకంటే ముందు వాళ్లతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడటమనేది చాలా ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ బాండింగ్ ఉన్నప్పుడే తమ బాధను ఇంకొకరితో పంచుకోవచ్చనే ఆలోచనలు వాళ్లలో తలెత్తుతాయి. అలాకాని జరగలేదంటే డిప్రెషన్తో లోలోన కుమిలిపోతూ మానసికంగా కుంగిపోవడం ఖాయం.
మనసులో ఉన్న ఇబ్బందిని తల్లిదండ్రులతో, స్నేహితులతో పంచుకోవచ్చు అనే భావనను పిల్లల్లో పెంపొందించాలంటే వాళ్లతో కలిసి ఉండే సమయాన్ని పెంచాలి. ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తుండాలి. ఈ కమ్యూనికేషన్ నాన్ వెర్బల్ అయినా పర్వాలేదు. అంటే మాట్లాడడం వల్లే వాళ్లకు దగ్గరగా ఉన్నామన్న భావన కలిగించక్కర్లేదు. భోజనం చేస్తున్నప్పుడు దగ్గర ఉండడం. ఉదయం పూట ఆలస్యంగా నిద్రలేస్తే ఒంట్లో బాగాలేదా అని దగ్గరకి తీసుకోవడం వంటివి చేస్తుండాలి. ఇటువంటి చర్యలు వాళ్లకు భరోసాని ఇస్తాయి. అలా చేయాలనే ఉంటుంది.
- భార్యాభర్తలిద్దరి మధ్యా ఉండే మనస్పర్ధలు కూడా పిల్లల్లో సమస్యలకి కారణం అవుతున్నాయి. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలి. ఇలాకాని లేరంటే తల్లి దండ్రులదో ప్రపంచం, మాదో ప్రపంచం అని పిల్లలు అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పటి యువతరంలో ఎక్కువమంది తమ సంతోషాన్ని లేదా దుఃఖాన్ని పంచుకోక పోవడానికి ప్రధాన కారణం ఇదే.
- 'నువ్వంటే నాకిష్టం...' అని భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పుకోకపోయినా పర్వాలేదు. కాని పిల్లలకి మాత్రం 'మాకు మీరే ముఖ్యం' అనే భావనను కలిగించాలి. మంచి, చెడులను విశ్లేషించుకునే శక్తిని నేర్పించాలి. ఇది చాలా చాలా ముఖ్యం.
- అలాగే చదువునే ప్రామాణికంగా తీసు కుని తెలివితేటల్ని అంచనా వేయకూడదు. మన దగ్గర ఈ ట్రెండ్ చాలా ఎక్కువ. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం తగ్గి పోతుంది. దాంతో స్కూల్ వయసులోనే జీవితం వథా అనుకునే అవకాశం ఉంది. పిల్లలు బాగా చదవలేకపోవచ్చు. కాని వేరే విషయాల్లో వాళ్లకి ఎంతో నైపుణ్యం ఉండే అవకాశం ఉంది. అందుకని తల్లిదండ్రులు పిల్లల చదువుని ప్రామాణికంగా తీసుకోకూడదు. చదువు అవసరమే కాని జీవితంలో అదే అతిముఖ్యమైనది అన్నట్టు ఉండకూడదు. వాళ్లలోని టాలెంట్ గుర్తించి ప్రోత్సహించాలి. దాంతో తమ మనసుకి నచ్చింది చేస్తున్నామన్న ఆనందంతో చదువులో కూడా ముందుంటారు కదా.
పిల్లలు పెద్దవారికి నచ్చని పనులు చేసినపుడు గట్టిగా కేకలు వేయడం వల్ల వాళ్లు మారరు. చెప్పాల్సిన రీతిలో అర్థమయ్యేలా చెప్పాలి. కాదు కూడదు అంటే మీ పిల్లలు మొండిగా తయారవడం ఖాయం. వాళ్ల దష్టి మరల్చేందుకు మీరు రకరకాల పద్ధతులు అనుసరించి మార్చుకోవాలి. అంతేకాని దండనతో వారిలో మార్పు తీసుకురావాలనుకోవడం తప్పు.